అక్బరుద్దీన్ ఓవైసీపై కేసు నమోదు
posted on Nov 22, 2023 @ 3:21PM
మరో ఎనిమిది రోజుల్లో తెలంగాణలో ఎన్నికలు జరగనున్న నేపథ్యంలో అనూహ్యంగా బిఆర్ఎస్ మిత్ర పార్టీ అయిన మజ్లిస్ కు చుక్కెదురైంది. మజ్లిస్ పార్టీ ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఓవైసీపై బుధవారం పోలీస్ కేసు నమోదయింది. డ్యూటీలో ఉన్న పోలీస్ అధికారిని దూషించినందుకు గాను సంతోష్ నగర్ పోలీసులు ఆయనపై కేసు నమోదు చేశారు. ఐపీసీ 353 (విధులను అడ్డుకోవడం)తో పాటు పలు సెక్షన్ల కింద కేసును నమోదు చేసినట్లు డీసీపీ రోహిత్ రాజు తెలిపారు.
అక్బరుద్దీన్ ఓవైసీ మంగళవారం చాంద్రాయణగుట్ట అసెంబ్లీ నియోజకవర్గం పరిధిలోని లలితాబాగ్లో ప్రచారం నిర్వహిస్తున్న సమయంలో... సమయం అయిపోయిందని, ప్రచారం ముగించాలని అక్కడ విధులు నిర్వహిస్తున్న పోలీసు అధికారి వారించారు. తన వద్ద కూడా వాచీ ఉందని, ఇంకా ఐదు నిమిషాల సమయం ఉందని, తనను ఆపే వ్యక్తి ఈ భూమ్మీద పుట్టలేదని పోలీసు అధికారినతో పరుషంగా మాట్లాడారు. అవసరమైతే తాను ఇంకా మాట్లాడతానని, ఎలా అడ్డుకుంటారో చూస్తానని సవాల్ చేశారు. తాను కనుసైగ చేస్తే పరుగులు పెట్టాల్సి వస్తుందని హెచ్చరించారు. కత్తిపోట్లు, బుల్లెట్ గాయాలు అయినంత మాత్రాన తన పని అయిపోలేదన్నారు. తనలో అదే దమ్ము ఉందన్నారు. పోలీసులను బెదిరించిన నేపథ్యంలో ఆయనపై కేసు నమోదయింది. ప్రస్తుతం ఆపద్దర్మ ప్రభుత్వం కొనసాగుతుంది. ఎన్నికల కమిషన్ నేతృత్వంలో పోలీసులు పని చేస్తున్నారు.