రాజకీయ నేతల్లో కరోనా ‘బేబీ’ డాల్ కలకలం
posted on Mar 21, 2020 @ 10:12AM
బాలీవుడ్ సింగర్ కనికా కపూర్ కు కరోనా పాజిటివ్ గా తేలడంతో రాజకీయ నాయకుల్లో కరోనా ప్రకంపనలు మొదలయ్యాయి. కనిక ప్రకంపనలు పార్లమెంట్, రాష్ట్రపతి భవన్ దాకా చేరాయి. పలువురు ఎంపీలు, నేతలు స్వీయ నిర్బంధంలోకి వెళ్లిపోయారు. 250-300 మందిని ఆమె కలుసుకొన్నట్టు కనిక తండ్రి రాజీవ్ కపూర్ చెబుతున్నారు.
రాజస్థాన్ మాజీ సీఎం వసుంధర రాజే, ఆమె కుమారుడు, ఎంపీ దుష్యంత్ సింగ్ స్వీయ నిర్బంధంలోకి వెళ్లారు. దుష్యంత్ను కలిసిన తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్, బీజేపీ ఎంపీ వరుణ్ గాంధీ, అప్నాదళ్ ఎంపీ అనుప్రియా పటేల్.. క్వారంటైన్లోకి వెళ్తున్నట్టు ప్రకటించారు. ఎంపీ దుష్యంత్ ఇటీవల పార్లమెంట్ సమావేశాలకు హాజరయ్యారు. ఈ సందర్భంగా ఎంపీ వరుణ్గాంధీతో సన్నిహితంగా మెలిగారు. ఈ నెల 18న జరిగిన పార్లమెంట్ స్థాయి సంఘం సమావేశంలో ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ రెండు గంటలపాటు దుష్యంత్ పక్కనే కూర్చున్నారు. గురువారం దుష్యంత్ హాజరైన ఓ దావత్లో అనుప్రియా పటేల్ పాల్గొన్నారు.
రాష్ట్రపతి కోవింద్ ఈ నెల 18న ఉత్తరప్రదేశ్, రాజస్థాన్ ఎంపీలకు అల్పాహార విందు ఇచ్చారు. ఈ విందుకు ఎంపీ దుష్యంత్ కూడా హాజరయ్యారు. అయితే ‘బేబీ డాల్ వరుసగా ఎంత మందికి అంటించిందో భవిష్యత్లో తేలనుంది.