హర్యానా స్థానిక ఎన్నికలలో బీజేపీ కూటమికి ఘోర పరాభవం
posted on Dec 31, 2020 @ 9:41AM
కేంద్ర ప్రభుత్వం తెచ్చిన కొత్త వ్యవసాయ చట్టాలపై రైతులు ఆగ్రహం వ్యక్తం చేస్తూ 36 రోజులుగా దేశ రాజధాని ఢిల్లీ సరిహద్దులలో ఆందోళన చేస్తున్న సంగతి తెల్సిందే. తాజాగా రైతులు చేస్తున్న ఆందోళన ప్రభావంతో హర్యానాలో జరిగిన స్థానిక ఎన్నికల్లో అధికార బీజేపీ కూటమికి ప్రతికూల ఫలితాలు వచ్చాయి. రాష్ట్రంలోని ముఖ్య నగరాలైన సోనిపట్, అంబాలా మునిసిపల్ స్థానాలను బీజేపీ కోల్పోయింది. తాజాగా జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు వెలువడగా, హిస్సార్ జిల్లాలోని ఉకలానా, రేవారీ పరిధిలోని ధారూహెరాలను బీజేపీ కూటమి కోల్పోయింది. ఇప్పటివరకు ఈ రెండు స్థానాలూ డిప్యూటీ సీఎం దుష్యంత్ చౌతాలా కంచుకోటలుగా ఉన్న సంగతి తెలిసిందే.
ప్రస్తుతం హర్యానాలో బీజేపీ - జేజేపీ సంకీర్ణ కూటమి అధికారంలో ఉన్న సంగతి తెలిసిందే. దేశంలోని ఇతర రాష్ట్రాల నుంచి వచ్చిన వేలాది మంది రైతులు ఢిల్లీ, హర్యానా సరిహద్దుల్లో నిరసనలు చేస్తుండగా, వారికి స్థానిక రైతులు పూర్తి స్థాయిలో మద్దతు తెలుపుతున్నారు. దీని ప్రభావం స్థానిక ఎన్నికల్లో స్పష్టంగా కనిపించింది.
మరోపక్క రాష్ట్ర హోమ్ మంత్రి అనిల్ విజ్ సొంత నియోజకవర్గమైన అంబాలాలో కూడా బీజేపీ ఓటమి పాలవడం ఆ పార్టీకి గట్టి ఎదురు దెబ్బేనని రాజకీయ విశ్లేషకులు పేర్కొంటున్నారు. ఇది ఇలా ఉండగా ఎన్నికలలో బీజేపీ ఓటమి పాలైందని తెలిసి ధర్నాల్లో ఉన్నరైతులు మిఠాయిలు పంచుకుని, ఆనందంతో పాటలు పాడుతూ స్టెప్పులేశారు. హర్యానా జనచేతన పార్టీకి చెందిన శక్తి శర్మ అంబాలాలో మేయర్ కాబోతున్నారు. సోనేపట్ లో కాంగ్రెస్ కు చెందిన లలిత్ బాత్రా మేయర్ పదవిని చేపట్టబోతున్నారు. అయితే పంచకుల మేయర్ పదవి మాత్రం బీజేపీకే దక్కింది. ఇక్కడ కుల్ భూషణ్ గోయల్ విజయం సాధించారు. అంబాలాలో 20 సీట్లకు గాను అధికార బీజేపీ 8 స్థానాలను మాత్రమే గెలవడం ఇక్కడ గమనార్హం.