కేటీఆర్ సీఎం అయితే అణుబాంబు పేలనుందా!
posted on Jan 23, 2021 @ 1:18PM
తెలంగాణ రాజకీయాలన్ని ప్రస్తుతం కేటీఆర్ చుట్టే తిరుగుతున్నాయి. ముఖ్యమంత్రిగా కేటీఆర్ ను నియమించడానికి కేసీఆర్ ఏర్పాట్లు చేస్తున్నారనే ప్రచారం జరుగుతోంది. అయితే తెలంగాణ సీఎం మార్పు అంశంపై మరోసారి సంచలన ప్రకటన చేశారు తెలంగాణ బీజేపీ చీఫ్ బండి సంజయ్. ముఖ్యమంత్రిగా తాను దిగిపోయే సాహసం కేసీఆర్ ఇప్పుడు చేయబోరని చెప్పారు. ఒకవేళ కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేస్తే.. ఆ వెంటనే టీఆర్ఎస్ లో అణుబాంబు పేలుతుందని చెప్పారు. కేటీఆర్ సీఎం కావడాన్ని టీఆర్ఎస్ కు చెందిన చాలా మంది మంత్రులు, ఎమ్మెల్యేలు వ్యతిరేకిస్తున్నారని చెప్పారు. తన కుమారుడు కేటీఆర్ ను ముఖ్యమంత్రిని చేసేందుకు కేసీఆర్ పూజలు చేసి, పూజ సామగ్రిని కాళేశ్వరం వద్ద ఉన్న గోదావరిలో కలిపారని బండి సంజయ్ ఆరోపించారు.
కేటీఆర్ ను సీఎం చేస్తున్నట్టు ఢిల్లీకి వెళ్లి బీజేపీ పెద్దలకు కూడా చెప్పొచ్చానని, బీజేపీతో స్నేహం ఉంటుందంటూ తనకు అనుకూలమైన వ్యక్తుల చేత కేసీఆర్ చెప్పిస్తున్నాడని బండి సంజయ్ విమర్శించారు. ఏ పార్టీ కూడా కేసీఆర్ తో కాని, టీఆర్ఎస్ తో కాని పొత్తు పెట్టుకునే పరిస్థితి ఇప్పుడు లేదన్నారు. బీజేపీ, టీఆర్ఎస్ రెండూ ఒకటే అని మంత్రులు, ఎమ్మెల్యేలకు కేసీఆర్ చెపుతున్నారని... ఇదంతా అబద్ధమని అన్నారు. ఇద్దరం కలిసి ఢిల్లీకి వెళ్లి మోడీ, అమిత్ షా, నడ్డాలను కలుద్దామని... ఆ దమ్ము నీకుందా? అని కేసీఆర్ కు సవాల్ విసిరారు సంజయ్. టీఆర్ఎస్, కాంగ్రెస్ రెండూ ఒకటేనని చెప్పారు.