అనారోగ్యంతో వైసీపీ ఎమ్మెల్యే మృతి
posted on Mar 28, 2021 9:06AM
కడప జిల్లా వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే డాక్టర్ వెంకట సుబ్బయ్య మృతి చెందారు. కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన ఇటీవల హైదరాబాద్లో చికిత్స పొంది కడపలోని తన నివాసానికి చేరుకున్నారు. ఆ తర్వాత జరిగిన మున్సిపల్ ఎన్నికల్లోనూ పాల్గొన్నారు. మళ్లీ అనారోగ్యం బారిన పడిన ఎమ్మెల్యే కడపలోని అరుణాచలం ఆస్పత్రిలో చికిత్స పొందుతూ తుదిశ్వాస విడిచారు. ఈయనకు భార్య, ఇంటర్ చదువుతున్న కుమారుడు, ఎంబీబీఎస్ నాలుగో ఏడాది చదువుతున్న కుమార్తె ఉన్నారు.గత అసెంబ్లీ ఎన్నికల్లో డాక్టర్ వెంకట సుబ్బయ్య కడప జిల్లా బద్వేల్ నియోజకవర్గం నుంచి వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎమ్మెల్యేగా గెలుపొందారు.
ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య స్వస్థలం బద్వేలు పురపాలక సంఘం పరిధిలోని మల్లెలవారిపల్లి. 1960లో జన్మించిన వెంకట సుబ్బయ్య ఆర్థోపెడిక్ సర్జన్గా ప్రజలకు సేవలందించారు. వైద్య వృత్తిని చేపట్టాలని కర్నూలు మెడికల్ కళాశాలలో ఎంబీబీఎస్ చేశారు. అనంతరం కామినేని, అపోలో ఆస్పత్రుల్లో కొంతకాలం పని చేశారు. ఈయన భార్య కూడా వైద్యురాలిగా ఉన్నారు. 2016లో ఆయన బద్వేల్ వైఎస్సార్సీపీ కో-ఆర్డినేటర్గా పనిచేశారు. 2019లో తొలిసారిగా డాక్టర్ వెంకట సుబ్బయ్య ఎమ్మెల్యేగా గెలుపొందారు. టీడీపీ అభ్యర్థి డాక్టర్ ఓబులాపురం రాజశేఖర్పై 44 వేల పైచిలుకు ఓట్ల మెజారిటీతో విజయం సాధించారు.
బద్వేలు ఎమ్మెల్యే వెంకట సుబ్బయ్య మృతి పట్ల వైఎస్సార్సీపీ నేతలు, అభిమానులు సంతాపం తెలిపారు. సీఎం జగన్మోహన్ రెడ్డి వెంకట సుబ్బయ్య కుటుంబ సభ్యులతో పోన్ లో మాట్లాడారు. వారికి సంతాపం తెలిపారు, వైద్యుడిగా, ఎమ్మెల్యేగా వెంకట సుబ్బయ్య సేవలు చిరస్మరణీయమని ప్రభుత్వ చీఫ్ విప్ గడికోట శ్రీకాంత్రెడ్డి గుర్తు చేసుకున్నారు. ఎమ్మెల్యే కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేశారు. నియోజకవర్గ ప్రజల సందర్శనార్థం ఎమ్మెల్యే భౌతిక కాయాన్ని బద్వేలుకు తరలించారు.