స్వరూపానంద చొరవ.. వారణాసి నుంచి స్వస్ధలాలకు 44 మంది తెలుగు వారు..
posted on Apr 16, 2020 @ 3:11PM
తెలుగు రాష్ట్రాల నుంచి తీర్ధ యాత్రల కోసం ఉత్తర్ ప్రదేశ్ లోని కాశీ వెళ్లిన 44 మంది తెలుగు యాత్రికులు కరోనా వైరస్ లాక్ డౌన్ కారణంగా అక్కడే చిక్కుకుపోయారు. వీరి పరిస్ధితిని గమనించిన వారణాసిలోని శ్రీరామ తారక ఆంధ్ర ఆశ్రమం నిర్వాహకులు వీరీకి ఆశ్రయం కల్పించారు. అంతటితో ఆగకుండా వీరిని స్వస్ధలాలకు పంపేందుకు తెలుగు రాష్ట్రాల ప్రభుత్వాలతో సంప్రదింపులు ప్రారంభించారు. విశాఖ శారదా పీఠాధిపతులు స్వరూపానందేంద్ర, స్వాత్మానందేంద్ర లతో మాట్లాడిన ఆశ్రమ నిర్వాహకులు సుందరశాస్త్రి.. వారి సాయం కోరారు. అసలే లాక్ డౌన్, వలస కూలీలను సైతం అనుమతించలేని పరిస్ధితి. అయినా వెనక్కి తగ్గలేదు.
వారణాసిలోని ఆంధ్ర ఆశ్రమంతో పాటు శారదాపీఠం వారణాసి శాఖ సంయుక్తంగా చేసిన ప్రయత్నాలు చివరికి ఫలించాయి. మూడు వారాల ఇబ్బందుల తర్వాత వారిని స్వస్ధలాలకు పంపేందుకు ప్రభుత్వాలు అంగీకరించాయి. అయితే దారి పొడవునా ఇబ్బందులు, ఆహారం సమస్యలు ఉంటాయి. కాబట్టి ఆశ్రయ నిర్వాహకులే వీరికి మార్గమధ్యంలో ఆహార కొరత లేకుండా భోజన ప్యాకెట్లను తయారు చేసి యాత్రికులకు అందించారు. యూపీ ప్రభుత్వం తరఫున పోలీసులు ప్రత్యేక బస్సు ఏర్పాటు చేశారు. దీంతో వీరు అక్కడి నుంచి స్వస్ధలాలకు బయలుదేరారు. ఇతర రాష్ట్రాల్లో చిక్కుకున్న తెలుగు యాత్రికులను స్వస్ధలాలకు చేర్చేందుకు శారదాపీఠాధిపతులు చూపిన చొరవపై ఇప్పుడు ప్రసంశల జల్లు కురుస్తోంది.