అమృత్ పాల్ సింగ్.. లొంగిపోయాడా.. అరెస్ట్ చేశారా..?
posted on Apr 24, 2023 @ 11:29PM
ఖలిస్తానీ వేర్పాటువాద నేత అమృత్ పాల్ సింగ్ ను మోగా జిల్లాలో పంజాబ్ పోలీసులు అరెస్ట్ చేశారు. మార్చి 18 నుంచి అమృత్ పాల్ సింగ్ సుమారు 37 రోజులుగా తప్పించుకు తిరుగుతన్న సంగతి తెలిసిందే. అతని కోసం పంజాబ్ పోలీసులు విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టారు. ఎట్టకేలకు మోగా పోలీసులు అరెస్ట్ చేసినట్లు తెలిపారు. పోలీసులు అతన్ని అస్సాంలోని డిబ్రూగఢ్ జైలుకు తరలించారు. ప్రస్తుతం అదే జైల్లో అతడి అనుచరులు కూడా ఉన్నారు.
అయితే అమృత్ పాల్ అరెస్టుపై భిన్న వాదనలు వినిపిస్తున్నాయి. అమృత్ పాల్ స్వయంగా పోలీసులకు లొంగిపోయినట్టు కథనాలు వెలువడుతున్నాయి. ఈ కథనాలను పంజాబ్ పోలీసులు ఖండించారు. మార్చి 18న పోలీసులకు చిక్కినట్టే చిక్కి తప్పించుకున్నప్పటి నుంచి పోలీసులు అతని కోసం గాలిస్తున్నారని పంజాబ్ ఐజీ చెప్పారు. పంజాబ్ పోలీసుశాఖలోని అన్ని విభాగాలు సమన్వయంతో అతడి కోసం గాలించాయని, ప్రతి కదలికను ట్రాక్ చేశాయని చెప్పారు. దీంతో రోడ్ గ్రామంలో అమత్ పాల్ ఉన్నట్లు నిర్దిష్ట సమాచారం అందింది. పోలీసులు, పంజాబ్ ఇంటెలిజెన్స్ విభాగాల సంయుక్త బృందం గ్రామాన్ని చుట్టిముట్టింది. భారీగా భద్రతా బలగాలను మోహరించారు. అతను గురుద్వారా లోపల ఉన్నందున మోహరించారించాల్సి వచ్చింది.
అతను గురుద్వారా లోపల ఉన్నందున.. స్థలం పవిత్రత దష్ట్యా పోలీసులు లోపలికి ప్రవేశించలేదు. దీంతో తప్పించుకునేందుకు అవకాశం లేకపోవడంతో అమత్పాల్ సింగ్ గురుద్వారా నుండి బయటికి వచ్చిన వెంటనే పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే.. రోడెవాల్ గురుద్వారాలోని జ్ఞానీ జస్బీర్ సింగ్ మాత్రం భిన్నంగా చెబుతున్నారు. శనివారం రాత్రి అమృత్పాల్ గురుద్వారాకు వచ్చాడని, తాను ఎక్కడ ఉన్నదీ పోలీసులుకు అతడే స్వయంగా ఫోన్ చేసి సమాచారం ఇచ్చాడని అన్నారు.
ఆదివారం గురుద్వారాలో ప్రార్థనల అనంతరం ఉదయం లొంగిపోనున్నట్టు వెల్లడించారన్నారు. ఉదయం సమయంలో ఇంటెలిజెన్స్ ఐజీ నేతత్వంలోని పోలీసులు అక్కడకు చేరుకొని అరెస్టు చేసి తీసుకెళ్లినట్లు తెలిపారు.ఇంతకి అమృత్ పాల్ సింగ్ ను అరెస్టు చేశారా..అతనే పోలీసులకు లొంగిపోయాడా..? అనే దానిపై మాత్రం.. క్లారిటీ లేదు.