హమ్మయ్య,, రంజన్ దొరికాడు!
posted on Aug 19, 2022 @ 5:06PM
ఫలానా ఆయన కాశ్మీరు వెళ్లారు, ఫలానా ఆయన మౌంట్ అబూ వెళ్లారని చెప్పుకుంటూ వారి యాత్రా కథనాలు వినడానికి స్నేహితులు, బంధువులు ఎదురుచూస్తుంటారు. కానీ, బీహార్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ కోసం ఎవరు ఎదురు చూడలేదు.. పోలీసులు తప్ప! అవును. చాలాకాలం క్రితం ఏకంగా పోలీసులు మీదనే కాల్పులు జరిపి పారిపోయాడీ ఘనుడు. అలా వెళ్లినవాడు నిన్ననే భారత్-నేపాల్ సరిహద్దు వద్ద పట్టుబడ్డాడు.
పోలీసులు తివారీ కోసం 1988 నుంచి వేటాడుతూనే ఉన్నారు. అడిగో, ఇడిగో అంటున్నారే గాని ఎక్కడా దొర క్కుండా తప్పించుకుని తన యాత్ర మాత్రం కొనసాగించేడు తివారి. బీహార్ తూర్పు చంపారన్ జిల్లా గోవింద్గంజ్ మాజీ ఎమ్మెల్యే రంజన్ తివారీ గోరక్పూర్లో పోలీసులపై కాల్పులు జరిపారు. పట్టు బడకుండా తప్పించుకు పారిపోయాడు. కానీ వెంబడించేవారు ఆయన స్నేహితులు కారు.. పోలీసులు. ఏ మాత్రం విసిగెత్తకుండా రెండు దశాబ్దాలుగా వేటాడేరు. ఎవరికి కనిపించినా పట్టివ్వండి అని ఏకంగా రూ.25 వేలు బహుమానంగానూ ప్రకటించారు. ఉత్తరప్రదేశ్, బీహార్ పోలీసులు కలిసి రంజన్ వేట కొన సాగించారు.
మొత్తానికి ఇరవయ్యేళ్ల ప్రయత్నాలు ఫలించాయి. ఉత్తరప్రదేశ్ పోలీసులపై కాల్పులు జరిపిన కేసులో రంజన్ తివారీ తాజాగా భారత్-నేపాల్ సరిహద్దులో పట్టుబడినట్టు చెప్పారు. ప్రాథమిక లాంఛనాలు పూర్తి చేసిన అనంతరం ఆయనను యూపీ పోలీసులకు అప్పగించినట్టు చెప్పారు. రంజన్ తివారీ రక్సౌల్ మీదుగా ఖట్మండ్ పారిపోవాలని ప్లాన్ చేశారని రక్సౌల్ ఎస్పీ చంద్ర ప్రకాశ్ తెలిపారు.