Read more!

బిస్కెట్ వేస్తున్న రఘువీరా!

 

 

 

సీమాంధ్రలో కాంగ్రెస్ పార్టీ ఆరిపోయిన దీపంతో సమానం. ఆ ఆరిపోయిన దీపంలో నీళ్ళు పోసి వెలిగించడానికి ప్రయత్నిస్తున్న వ్యక్తి సీమాంధ్ర కాంగ్రెస్ అధ్యక్షుడు రఘువీరారెడ్డి. సీమాంధ్ర కాంగ్రెస్ పార్టీలో పోటీ చేయడానికి అభ్యర్థులే దొరకడం లేదు. పోటీ చేయడానికి అత్యుత్సాహంగా ఒకళ్ళిద్దరు ముందుకు వచ్చినా వాళ్ళందరూ గెలిచే సత్తా లేనివాళ్ళే. ఇలాంటి పరిస్థితుల్లో ఏం చేయాలో అర్థం కాని రఘువీరారెడ్డి సత్తా వున్న అభ్యర్థులకు బిస్కెట్ వేస్తున్నారు.

 

ఆ బిస్కెట్ సారాంశమేంటంటే, ఈ ఎన్నికలలో కాంగ్రెస్ పార్టీ తరఫున సీమాంధ్ర నుంచ పోటీ చేసి గెలిచిన వారికి 2019 ఎన్నికలలో కూడా సదరు టిక్కెట్ వాళ్ళకే కేటాయిస్తారట. రఘువీరా ఇచ్చిన ఈ ఆఫర్ చూసి సీమాంధ్రలో అందరూ పగలబడి నవ్వుకుంటున్నారు. పాపం ఫ్రస్టేషన్‌లో వున్న రఘువీరా ఇలాంటి తలాతోకా లేని ఆఫర్లు ఇస్తున్నారని అనుకుంటున్నారు. రఘువీరా ఎన్ని ఆఫర్లు ఇచ్చినా సత్తా సీమాంధ్రలో కాంగ్రెస్ తరఫున పోటీ చేసే సాహసం ఎవరూ చేయరు.



ఒకవేళ అలాంటి సాహసం చేసినవాళ్ళు పొరపాటున కూడా గెలవరు. ఒకవేళ గెలిచినా 2019లో మళ్ళీ టిక్కెట్ వస్తుందన్న గ్యారెంటీ ఏమీ లేదు.. ఎందుకంటే 2019లో టిక్కెట్ ఇస్తానని హామీ ఇస్తున్న రఘువీరారెడ్డి పీసీసీ అధ్యక్షుడిగా వుండకపోవచ్చు. ఆమాటకొస్తే కాంగ్రెస్ పార్టీలోనే వుండకపోవచ్చు. అంచేత ఇలాంటి తలాతోకా లేని ఆఫర్లు ఇవ్వడం రఘువీరా మానుకుంటే బాగుంటుందని రాజకీయ పరిశీలకులు అంటున్నారు.