ఆయన వెళ్ళింది అక్కడికేనా?
posted on Oct 26, 2013 @ 2:56PM
రాష్ట్ర విభజన అంశం మీద ఢిల్లీకి వెళ్ళిన గవర్నర్ నరసింహన్ ప్రభుత్వంలో వున్న ముఖ్య నాయకులని, అధికారులని కలిశారు. రాష్ట్రానికి సబంధించిన పూర్తి సమాచారాన్ని అందించారు. అధికార ప్రముఖులతోపాటు దిగ్విజయ్సింగ్ లాంటి అనధికార ప్రముఖుడిని కూడా ఆయన ఇంటికి వెళ్ళి మరీ కలిసి తన స్నేహశీలతను చాటుకున్నారు. అయితే గవర్నర్ గారు యువరాజు రాహుల్ గాంధీని కూడా కలసి వచ్చారని తెలుస్తోంది. ఈ విషయం తాజాగా బయటకి పొక్కింది.
యువరాజుని కలసిన గవర్నర్ ఆయనకి రాష్ట్ర విభజన వల్ల జరిగే లాభ నష్టాలను కూలంకషంగా వివరించినట్టు తెలుస్తోంది. అయితే అధికార కార్యక్రమాలతో, అధికార గణం మధ్యలో వున్న గవర్నర్ రాహుల్ బాబుని ఎప్పుడు, ఎక్కడ కలిశారా అన్న సందేహాలు చాలామందికి వస్తున్నాయి. అయితే, గురువారం రాత్రి పదకొండు గంటలు దాటాక గవర్నర్ తనతో పాటు సెక్యూరిటీ సిబ్బందిని కూడా వెంట తీసుకు వెళ్ళకుండా ఒక్కరే కారులో బయటకి వెళ్ళారన్న వార్తలు వచ్చాయి. ఆ వెళ్ళింది రాహుల్గాంధీ దగ్గరకే అయి వుంటుందని పరిశీలకులు భావిస్తున్నారు.
అయినా గవర్నర్ గారు రాహుల్ గాంధీ గారిని కలవాలంటే అంత సీక్రెట్గా వెళ్ళాల్సిన అవసరం ఏముంది? ప్రొటోకాల్ని పక్కన పెట్టి దిగ్విజయ్సింగ్ని ఇంటికి వెళ్ళి మరీ కలిస్తే ఎవరైనా ఏమైనా అన్నారా? ఒకవేళ ఎవరైనా ఏమైనా అన్నా ఏలినవారు పట్టించుకున్నారా? ఈ తరహాలోనే రాహుల్ గాంధీని కూడా పబ్లిగ్గా కలిస్తే నష్టమేంటి?