Previous Page Next Page 
మధుమాసవేళలో ... పేజి 8


    
    "మగవాసన......మగవాసన....." హెచ్చరించింది త్రిలోకసుందరి.
    
    ఇద్దరూ పెదవులు కట్టేసుకున్నారు.
    
    మదన్ గోపాల్ అగ్గిపెట్టె తిరిగి యిచ్చేస్తూ "మూడగ్గిపుల్లలు మాత్రమే ఖర్చయాయి. అగ్గిపెట్టె తేగానే యిచ్చేస్తాను" అన్నాడు వైజయంతితో.
    
    వైజయంతి మాట్లాడలేదు.
    
    "భలేవారే అగ్గిపెట్టె అంతా వాడుకున్నట్లు తిరిగి యిచ్చేస్తానంటున్నారే. మూడు పుల్లలేగా?" అంది త్రిలోకసుందరి.
    
    వైజయంతి చేతిని త్రిలోకసుందరి వీపు వెనుకగా పోనిచ్చి గట్టిగా గిచ్చింది.
    
    కందిరీగ కుట్టినట్లు బాధపడుతూ "కేవ్" మంది త్రిలోక సుందరి.
    
    "ఏమయింది....ఏమయింది?" అన్నాడు మదన్ గోపాల్.
    
    "అప్పుడప్పుడు దీనికి కందిరీగలు, తేళ్ళు కుడుతుంటాయిలెండి" తేలిగ్గా అంది వైజయంతి.
    
    "అవునవును కందిరీగ కుట్టింది" అంది త్రిలోకసుందరి వీపుమీద చురచుర మండుతుంటే.
    
    "ఎక్కడ కుట్టిందండి?" అన్నాడు మదన్ గోపాల్.
    
    "వీపుమీద ఏం మీరేమయినా మంత్రం వేస్తారా?" అంది వైజయంతి.
    
    "ఆపిల్ల దానికి కుడితే ఈపిల్లది జవాబిస్తుందేమిటి? ఆపిల్ల వీపుమీద కందిరీగ కుట్టినట్లు ఈపిల్ల కెలా తెలుసు? ఇదంతా నాటకం. వీళ్ళు ఆడపిల్లలు కాదు. ఆడపిడుగులు" అని గ్రహించినవాడయి "ఈ యింటినిండా కందిరీగలేనండీ, నే వచ్చి నప్పటినుంచీ చూస్తూనే వున్నాగా తెగకుట్టి చంపేస్తున్నాయి. కుట్టటం వాటి నైజం భరించటం మన నైజం. వస్తానండి" అంటూ మదన్ గోపాల్ తిరిగి చూడకుండా వెళ్ళిపోయాడు.
    
    "చూశావా! చూశావా!" అంది వైజయంతి పళ్ళు కొరుకుతూ.
    
    "ఏమిటి చూసేది, నా బొంద. వీపు మండిపోతున్నది. ఇలా రక్కటం గిల్లటం చేశావంటే నిన్ను కట్టుకున్నవాడు మూడురోజులుకూడా కాపురం చేయకుండా పరారవుతాడు."
    
    "ఫిడాపోయిరి, అయినా అంత తొందరెందుకే నీకు, అతగాడు అగ్గిపుల్లలిస్తానంటే వద్దంటూ మర్యాద చూపిస్తా వెందుకు?"
    
    "మూడంటే మూడేకదే వెధవగ్గిపుల్లలు!"
    
    "ఇక్కడ మనం గమనించాల్సింది ఎన్ని అగ్గిపుల్లలు అనికాదు. అతనేలాంటివాడూ అని...మా యింట్లో కందిరీగ లున్నాయట. ఈ వారంలోనే గమనించాడుట. తెగకుట్టి చంపుతున్నాయట. ఎంత తెలివిగా మాట్లాడాడో చూడు. అమాయకుడంటుంటివే!"
    
    "అవుననుకో. మనమో మాటనబట్టేకదా అతనలా అంది."
    
    "ఊ... అయితే?"
    
    "అయితే గియితే ఏముంది మనమేమీ అనకపోతే అతనూ ఏమనడు."
    
    "అంటే మనమేదయినా మాటంటే అతను తిరిగి అనగల సమర్దుడనేగా నీ అభిప్రాయం?"
    
    "ఎస్సూ!"
    
    "అలా దారికిరా నేముందే చెప్పానా! మాటకి మాట అంటిస్తాడు. నోట్లో నాలుకలేని వాడేంకాదు. అరంగుళం చోటిస్తే అడుగు ముందుకువేసే రకం" అంటూ ఆగింది వైజయంతి.    

    త్రిలోకసుందరేమీ మాట్లాడలేదు.
    
    "మదనా మదనా...పాట పాడటం మానేసి "రాదే నమ్మ చెలీ రాదేనమ్మా మగవారి మాటలు నమ్మరాదే చెలీ!" పాటపడుకో. మదనా పాడావంటే ఈతఫా పరుగెత్తుకొస్తాడు జాగ్రత్త."
    
    "పాడనుగాని, అంతకంటే అంతకోపం దేనికే వైజయంతీ!"
    
    "అతనేకాదు అతని ఈడువాళ్ళు ఎవర్ని చూసినా నాకు ఇమ్మంటే మర్యాద లేకుండ చూపు తిప్పుకోకుండా అదే పనిగా చూస్తుంటారు."

 Previous Page Next Page