అత్తగారింటికి కాపురాన్ని మార్చిన ఈ మూడేళ్ళూ రొటీన్ గా సాగిపోతున్న జీవితంలో ఒక్క కుదుపు సంభవించినట్లుంది ఆమెకు. ఇంత కాలం ముళ్ళబాటలో సాగుతున్న బతుకు ఒక్కసారిగా పూలతోటలోకి మలుపు తిరిగినట్లుంది. ఆ తోటలో ఏవేవో సువాసనలతో తనను అభిషేకిస్తున్న గాలి తనకోసమే వికసించినట్లు తలలూపుతున్న పూలూ, శృంగార గీతాలను ఒప్పజెబుతున్నట్లు అటూ ఇటూ తిరుగుతున్న తుమ్మెదలూ ఇలాంటి చిత్ర విచిత్రాలన్నీ కనుపాపలను సాగదీస్తున్నాయి.
"మాట్లాడవేం?" మామూలుగానే అయితే విసుక్కునే వాడుగానీ, ఇప్పుడు మాత్రం చాలా అనునయంగా అడిగాడు చలపతి. తనకు అదృష్టం తెచ్చే దేవతలా కనిపిస్తోంది భార్య. అంతేగాక గోపాలకృష్ణ కోరుకోవడంతో లహరి నిజంగా అందగత్తేమోనన్న అనుమానం మొదటిసారి కలిగింది అతనికి.
ఆమె ఇప్పుడూ ఏమీ మాట్లాడలేకపోయింది. ఏవేవో మధుర ప్రకంపనలు శరీరాన్ని వీణలా మీటుతున్నాయి.
వక్షస్థలానికి కప్పుకున్న అరవై ఐదు సెంటీమీటర్ల పాలిస్టర్ జాకెట్టే బరువుగా తోస్తోంది. విశాలమైన కళ్ళకు పెట్టుకున్న కాతుకే చక్కలిగింతలు పెడుతున్నట్లుంది. కనురెప్పలు శృంగార కావ్యాలు రాయడానికి వంపులు తిరిగిన పాళీల్లా వున్నాయి. నుదుటున వున్న తిలకంబొట్టు తనలోని కోరిక జ్వలిస్తున్నట్లుంది. నడుము వయ్యారాల నది అమ్చులా అనిపిస్తోంది. దాని మధ్య వున్న బొడ్డు ముందు ముందు సుడిగుండాలున్నాయని హెచ్చరిస్తున్న సంకేతంలా వుంది.
ఆమెకు కళ్ళు మూతలు పడటంలేదు. పక్కన భర్త వున్నాడన్న ధ్యాసైనా కలగడం లేదు.
తాను జీవితంలో ఎవరికీ చెప్పని సంఘటన గురించి ఆమె ఆలోచిస్తోంది.
మదనకామరాజు వంశానికి చెందిన పురుషుడితో సంభోగించే ముందు ఆడపిల్ల తను ఇంతవరకు ఎవరికీ చెప్పని సంఘటన గురించి చెప్పాలి. ఆచారంలో ఇదీ ఒక భాగమే.
దీన్ని తలచుకోవడంతోనే ఆమెకు మహాభారతంలోని ఓ చిన్న బిట్ గుర్తొచ్చింది.
పాండవులు. శ్రీకృష్ణుడు ఓసారి అడవిలో పోతుంటే ఓ మామిడిచెట్టు నుంచి కాయ రాలి కిందపడుతుంది. దాన్ని తిరిగి కొమ్మకు అతికించాలంటే అందరూ తమ మనసులోని మాటను చెప్పమంటాడు శ్రీకృష్ణుడు. ఒక్కొక్కరు తమ మనసులోని మాటను చెబుతుంటే మామిడికాయ కొద్ది కొద్దిగా పైకి లేచి కొమ్మకు అతుక్కుంటుంది.
ఇదంతా ఆమె కళ్ళముందు మెదిలింది. తనూ ఇంతవరకూ ఎవరికీ చెప్పని స్మఘటన గురించి చెప్పాలి.
మనసులో ఎలాంటి కల్మషం లేకుండా చేయడానికి, అంతే కాకుండా తమ మధ్య సాన్నిహిత్యం పెరగడానికి ఈ పద్ధతి పెట్టి వుంటారనిపించింది. సంభోగంలా నిజమైన ఆనందం కలగాలంటే ఎలాంటి ఇన్హేబిషన్స్ వుండకూడదని ఆలోచించి ఈ నియమం పెట్టి వుంటారని కూడా తోచింది.
అంతలో చలపతి ఆమెను మోచేతితో సుతారంగా పొడిచాడు.
ఆమె ఉలిక్కిపడి అంతలోనే సర్దుకుంది.
"ఏమిటి ఆలోచిస్తున్నావ్?"
"ఏమీలేదు. ఊరకనే కళ్ళు మూతలు పడుతున్నాయి."
"బాగా నిద్రపో. ఇక ఈ రాత్రికి పూర్తిగా నిద్ర వుండదు కదా."
చలపతి బయటికి వెళ్ళిపోయాడు.
తను ఇంతవరకూ ఎవరికీ చెప్పుకోని సంఘటన గురించి తలచు కుంటూంటే నవ్వు ఆగడం లేదామెకు. ఇది విని గోపాలకృష్ణ ఎలా ఫీలవుతాడో ఊహిస్తుంటే చాలా సరదాగా ఉంది.
సాయంకాలం నాలుగుగంటల ప్రాంతాన అత్త అనసూయమ్మ వచ్చేవరకూ ఆమె అలా పడుకునే వుంది.
"ఇక రామ్మా! స్నానం చేసి తయారవుదువు" అని ఆమె ఎంతో గౌరవంతో పిలిచింది.
లహరి పడకమీద నుంచి లేచి ఆమె వెనకే నడిచింది.
గది బయటే ఇద్దరు తోడికోడళ్ళూ వున్నారు.
ముగ్గురూ కలిసి ఆమెను స్నానాలగదిలోకి తీసుకెళ్ళారు.
తలస్నానం చేయించారు. అనసూయమ్మ పట్టుచీర తెచ్చి ఇస్తే వద్దని బాగా గంజిపెట్టిన గ్రీన్ కలర్ సౌత్ కాటన్ చీర కట్టుకుంది. పూలజడ వేసుకొమ్మని పద్మ, చిత్ర బలవంతం చేసినా సుతారంగా వారించి అలానే వెంట్రుకలను వదిలేసి మొదట్లో రబ్బర్ బ్యాండ్ వేసుకుంది. లైట్ గా శరీరమంతా పౌడర్ అద్దుకుని, నుదుటున కాస్తంత పెద్దదిగా తిలకం బొట్టు పెట్టుకుంది.
ఆమెకు ముప్ఫై ఏళ్ళయినా ఇంకా పిల్లలు లేకపోవడంతో బింకంగా వుంటోంది. శరీరంమీద చాలా ధ్యాస వుండడంతో స్లిమ్ గా వుండడానికి అన్ని జాగ్రత్తలూ తీసుకుంటుంది. అందుకే ఆమెకు పాతికేళ్ళంటే కూడా ఎవరూ నమ్మరు.
అలంకరణ పూర్తయ్యేసరికి ఆరయింది.
రాత్రి భోజనాలకోసం గారెలు, పాయసం చేశారు.
ఎనిమిదిగంటల ప్రాంతాన నరుడు క్యారియర్ కోసం వచ్చాడు. అతనికి క్యారియర్ ఇచ్చి మాటల్లో పడ్డారు స్త్రీలు. మగవాళ్ళు అరుగుమీద కూర్చుని కబుర్లాడుకుంటున్నారు.
అందరికంటే ఎక్కువగా చలపతి మాట్లాడుతున్నాడు. మామూలుగా అయితే అతను చాలా నెమ్మదస్తుడు. ప్రశాంతంగా వుంటాడు. అయితే అతనికి రెండు బలహీనతలున్నాయి. ఒకటి లాటరీల పిచ్చి అయితే అతనికి రెండు బలహీనతలున్నాయి. ఒకటి లాటరీలు పిచ్చి అయితే, రెండోది పండరి భజన పిచ్చి. ఈ రెండు విషయాల్లో మాత్రం అతను చాలా యాక్టివ్ గా వుంటాడు. తమ వదినకు వచ్చిన అవకాశం తమ భార్యలకు రాలేదని మధనపడి పోతుండటంతో అతని తుమ్ముళ్ళు మౌనంగా వుంటున్నారే తప్ప మాట్లాడడం లేదు. పరమానందం మాత్రం అప్పుడప్పుడూ తన పెద్ద కొడుకువేపు గర్వంగా చూస్తున్నాడు.
వీధినవెళ్ళే స్త్రీలూ, పురుషులూ తమ ఇంటివైపు ఈర్ష్యగా చూడడం గమనిస్తూనే వున్నారు వాళ్ళు.
ఒంటరిగా కూర్హున్న లహరికి మాత్రం ఎందుకనో తత్తరపాటుగా వుంది. మొదటిసారి కన్నెరికం జరుపుకోబోతున్నట్లు కొంత ఆనందం, మరికొంత బెరుకు కలగాపులగంగా కలిసిపోతున్నాయి. ఉండుండి కిటికీలోంచి బయటికి చూస్తోంది.
వెన్నెల తెల్లతెల్లగా చిక్కబడుతోంది.
తొమ్మిదిగంటలప్పుడు అనసూయమ్మ వచ్చి కోడల్ని బయటికి తీసుకొచ్చింది.
సిగ్గు ప్రతి అవయవంలోనూ కూరుకుపోయినట్లు బరువుగా తోస్తోంది లహరికి. మనసు మాత్రం అతి చలాకీగా ఏవో సుందర లోకాల్లో తిరుగుతోంది.
ఆమె వీధిలోకి వచ్చింది. మగవాళ్ళు అరుగు దిగి వెళ్ళి రమ్మన్నట్లు సన్నగా నవ్వుతూ చేతులు వూపారు.
వెళ్ళొస్తానన్నట్లు ఆమె అత్తకూ, తోటికోడళ్ళకూ చెప్పి నడక సాగించింది.
ఊరు దాటింది.