జీవితం కథ కాదు. మూడు చుక్కలతో మారిపోవటానికి.
శ్రీరామ్ ప్రామిస్ చేయడం అయితే చేశాడు కాని, అతడిలో మార్పు రావడానికి ఆరునెలలు పైగా పట్టింది. ఈ మధ్యకాలమ్లో భార్గవి చాలాసార్లు కోపం తెచ్చుకోవలసి వచ్చింది. అప్పుడప్పుడూ కన్నీటితో వేడుకొనేది. మరోసారి బెదిరించేది. మొత్తానికి అతడిలో చెప్పుకోదగ్గ మార్పు వచ్చిందని నమ్మకం కలిగాక అనూరాధకి ఉత్తరం రాసింది. ఆమె దిగులిప్పుడు రాధ గురించే.
శ్రీరామ్ లో మార్పుకి భారగావి ఎంత హర్షించిందో అతడి అక్క చెల్లెళ్ళు అంతగా గర్హించారు. మొదట వచ్చింది చిన్నాడపడుచు.
"అన్నయ్యా, మా మామగారు నిన్ను అడగమన్నారు" చెల్లెలు తల దించుకుని నెమ్మదిగా అంది.
శ్రీరామ్ అర్ధంకానట్లు చూశాడు.
"ఏమిటట?"
"ఈసారి ఏ విషయం తేల్చుకుని మరీ రమ్మన్నారు. లేకపోతే ఈ ఇంటిలో అడుగుపెట్టను".
"ఏ విషయం గురించి? అసలు సంగతేమిటో చెప్పు".
"అదే, నాన్న డబ్బు గురించి, ఇల్లు కట్టుకుందాం, ప్లాటు గురించి డబ్బు కావాలని అడగమన్నారు".
"నాన్న డబ్బేమిటి? ఆయన నాకు మిగిల్చిపోయిందేమీ లేదని మీకందరకూ తెలుసుగా".
"వాళ్ళకు నమ్మకంగా లేదు. చివరివరకూ ఆయనకు పెన్షన్ వస్తోంది, అదంతా ఏమయిందని నన్ను అడిగారు. నాకు తెలియదన్నాను".
"వాళ్ళు అడగడం సరే. చివరి రోజుల్లో ఆయన కోసం ఎంత ఖర్చు పెట్టవలసి వచ్చిందో నీకు తెలియదా? నువ్వే చెప్పవలసింది పోయి నాకు తెలియదని ఎందుకన్నావు?" కాస్త కోపంగానే అడిగాడతడు.
ఆమె అలాంటి జవాబు వూహించలేదు. దెబ్బ తిన్నట్లు చూసింది.
వింటున్న భార్గవికి కోపం, దుఃఖం రెండూ ముంచుకొచ్చాయి. తనకేమీ తెలియదని బుకాయించే ఆడపడుచుని చూస్తే కోపం, మామగారిని తలుచుకుని దుఃఖం కలిగాయి. చేతులు స్వాధీనంలో వుండగానే ఆయన అన్ని చెక్కులమీద సంతకాలు చేసి పెట్టాడు. ఆయన పెన్షన్ డబ్బులతో మందులు కొంటె తప్ప తృప్తిపడేవాడు కాడాయన. అలాంటి స్వాభిమాని కూతురా ఈమె?
"ఇదిగో మీ నాన్నగారిబుక్ ఆయన ఎకౌంట్ లో ఓ వెయ్యి రూపాయలు కూడా లేవు" తీసుకొచ్చి ఆమె చేతిలో పెట్టింది భార్గవి.
దాన్ని చూసి ఆమె శ్రీరామ్ వైపు తిరిగి, "అయితె ఇప్పుడేం చెయ్యమంటావు అన్నయ్యా! ఆయన ట్రీట్ మెంట్ కయిన ఖర్చంతా మీ అన్నయ్య బ్యాంకే భరిస్తుంది అని వాదిస్తారేమో!" అంది.
"నేను చెప్పనా యామినీ? నాన్నగారి డబ్బంటూ ఏమీ మిగలలేదు, నన్నేం చేయమంటారు? అని మీ వారికి ఓ ఉత్తరం రాసి పడెయ్యి" అంది భార్గవి.
"వాళ్ళు నమ్మరు. తేల్చుకునేవరకూ రావద్దని రాసి పడేస్తారు".
"మరీ మంచిది. నువ్వికవెళ్ళద్దు. వాళ్ళంతట వాళ్ళు వచ్చి బ్రతిమాలేవరకూ వెళ్ళకు".
ఇదేనా నీ నిర్ణయం అన్నట్లుగా యామిని శ్రీరామ్ వైపు చూసింది,
"వదిన చెప్పినట్లు ఓ ఉత్తరం రాసి పడెయ్యమ్మా చూద్దాం" అన్నాడు అతను కూడా.
యామిని వదల్లేదు. "భయంగా వుందన్నయ్యా, జీవితాంతం సాధిస్తారు".
"అందుకే వెళ్ళవద్దన్నాను. నీ పెళ్ళి కయిన ఖర్చు, ఆ తర్వాత ఈనాటివరకూ ఖర్చు విడిగా లెక్కలు రాసి వుంచాను. పెళ్ళయి ఇన్నేళ్ళయినా, ఇద్దరు పిల్లలు పుట్టినా యింకా కోడలు పుట్టింటినుంచి అదీ యిదీ తెమ్మని ఆశించే వాళ్ళకు తగిన గుణపాఠం చెప్పక తప్పదు" అంది భార్గవి గట్టిగానే.
"మరీ హర్టింగ్ గా మాట్లాడేవేమో భార్గవీ! యామిని మనసు కష్టపెట్టుకుందనుకుంటాను" అన్నాడు రాత్రి శ్రీరామ్.
"కావాలనే అన్నాను. అసలు వాళ్ళ సంగతేమోగాని, ఈమెకే డబ్బు తీసుకెళ్ళాలని ఎక్కువ ఆరాటంగా వున్నట్లుంది. వాళ్ళకు నిజంగా అవసరం అయితే ఇవ్వటానికి నాకేం అభ్యంతరం లేదు. కాని, యిలా మామగారి డబ్బుని అడగటం బాగాలేదు. వచ్చినప్పుడల్లా యింటిలో కొత్త వస్తువు కనిపిస్తే తీసుకెళ్ళిపోతుంది. కానీ, ఇలా ఎంతకాలం?"
"చిన్నతనం నుంచీ ఏదడిగినా కాదనకుండా యిచ్చి గారాబం చేశాను అది నా పొరపాటేనేమో?" భార్గవి మాట్లాడలేదు.
ఆ మర్నాడే దిగింది పెద్దాడబడుచు. ఆమెది మరో తరహా. తన పెళ్ళికి ఆడంబరంగా ఖర్చు పెట్టలేదని, చెల్లెలి పెళ్ళికయితే బాగా ఖర్చు పెట్టారని యిప్పటికీ సణుగుతూనే వుంటుంది. ఆమె భర్తగా బాగా మెత్తటి మనిషి. అక్కడంతా ఆమెదే రాజ్యం. అయినా ఆర్నెల్లకోసారి అలిగి వచ్చేస్తుంటుంది. ఆయన వచ్చి బ్రతిమాలి తీసుకెళుతూంటాడు.
"అన్నయ్య చాలా మారిపోయాడే అక్కయ్యా! వదిన ఎలా ఆడిస్తే అలా ఆడుతున్నాడిపుడు".
యామిని మాటలు భార్గవి చెవిన పడ్డాయి. ఊరుకోలేదు. వెళ్ళి నవ్వుతూనే అంది. "అదేమిటి యామిని? ఒకప్పుడు మా వదిన అపర సీత, భర్తమాట జవదాటదు అని మెచ్చుకున్నావే. అప్పుడు నేను అలా వుండటం నీకు సంతోషాన్ని కలిగించింది. ఈ రోజు మీ అన్నయ్య నా మాట వినడం తప్పుగా అనిపిస్తోంది. చూశావా, మన స్త్రీలలోనే మనమీద మనకే ఎంత చిన్న చూపో".
"వదిన మాటలు కూడా బాగా నేర్చింది".
"మార్పు సహజం కదా! రెండేళ్ళ క్రితం భావాలకు, యిప్పటి ఆలోచనలకూ తేడా వుంటుంది. పునరాలోచించుకుంటే 'అరే, అప్పుడంత ఆలోచన లేకుండా ఎలా ప్రవర్తించగలిగాను. అంత అర్ధరహితంగా ఎలా మాట్లాడగలిగాను' అనుకుంటాం. ఇప్పుడూ కొన్ని తప్పులు చేస్తాం. కొంచెం మెచ్యూరిటీ వచ్చాక కాని తెలియవు. ఇది సహజం" అని అక్కన్నుంచి వెళ్ళిపోయింది.
5
"అబ్బ ఎన్నాళ్ళకు వచ్చారు. రండి" ఆనందంగా స్వాగతం చెప్పింది తల్లి.
భార్గవి చిరునవ్వుతో ఇంటిలో అడుగు పెట్టింది. తనంతట తానుగా భర్తతో కలిసి నాలుగు రోజులుందామని రావడం అదే ప్రధమం.
వాళ్ళని చూడగానే తల్లిదండ్రుల మొహం సంతోషంతో వెలిగిపోయింది. కానీ ఎంత నవ్వుతున్నా వాళ్ళ ముఖాలలో ఏదో దిగులు కదలాడడం కనిపెట్టింది భార్గవి.
ఉదయం ఏడుగంటలయింది. తమ్ముడూ మరదలూ గదిలోంచి ఇంకా బయటకు రాలేదు. వాళ్ళకు పాపాయి పుట్టిందని తెలుసుగాని భార్గవి చూడలేదు. భార్గవి మొహం కడుక్కుని కాఫీ తాగుతుంటే వచ్చాడు తమ్ముడు. "హల్లో అక్కయ్యా! ఎప్పుడొచ్చారు?" అడుగుతూనే వంటింటి వైపు వెళ్ళి "అమ్మా! కొంచెం వేడినీళ్ళు పెట్టు పాపకి పాలు కలపాలి" అని తిరిగొచ్చాడు. "ఇప్పుడు చెప్పండి, కాశ్మీరు వెళ్ళారటగా మేమూ వెళ్ళాలనుకుంటున్నాం. రాణీ ఒకటే గొడవ పెడుతోంది".
వివరణ అవసరం లేకుండా భార్గవికి తల్లిదండ్రుల దిగులేమిటో అర్ధమయిపోయింది. 'మా ఆవిడ, పాపాయి, నేను' అన్న మాటలు తప్ప అమ్మా నాన్న గురించి ఏమీ మాట్లాడటం లేదసలు. అమ్మపాలు కలిపిస్తే పాపాయికి పట్టాడు. బట్టలు తడిపితే శుభ్రం చేసి వచ్చాడు.
ఎనిమిదింటికి నెమ్మదిగా బయటకొచ్చింది మరదలు. అత్తగారు కాఫీ అందిస్తే కూర్చుని కబుర్లు చెబుతూ తాగుతోంది.
భార్గావికి తమ్ముడిని చూస్తే మరింత ఆశ్చర్యంగా వుంది. ఇతడికి ఒకప్పుడు స్త్రీలంటే ఎంత చులకన భావం వుండేది! అటువంటివాడు ఇప్పుడు భార్యకు అడుగులకు మడుగులొత్తుతున్నాడు. పనంతా తల్లికి చెపుతున్నాడు.
మారే కూతురి మొహంలో భావాలు గమనిస్తూ- "మధ్యలో నేను నలిగిపోతున్నానమ్మా మీ నాన్నగారు డైరెక్టుగా వాళ్ళనేం అనలేరు. నన్ను మందలించమంటారు" అందావిడ.
"అమ్మా! తప్పు నీలోనూ వుంది. మొదటినుంచీ నాన్నగారి పొరపాటు ఎత్తి చూపకపోవడం నీ బలహీనత. నిన్నెన్ని రకాలుగా బాధ పెట్టినా లోపల్లోపల కుమిలేదానివి కాని పైకి అనేదానిని కావు. ఆ పాతివ్రత్యానికి ఆధునిక సమాజంలో ఇదే పారితోషికం-" మనసులోనే అనుకుంది భార్గవి.
* * *