Previous Page Next Page 
మోహిత పేజి 40


    "గుడ్ బై నిక్కీ!" అంటూ దానిని ముద్దాడి రాజేంద్రకుమార్ వేపు తిరిగి-

 

    "మిస్టర్ రాజేంద్రకుమార్! ఇప్పుడు నువ్వు నన్నేమీ చెయ్యలేవు. కానీ  నిన్ను నేను ఏమైనా చెయ్యగలను. మృత్యువు నీకు అతిసమీపంలో వుందని గుర్తుపెట్టుకో" అని చెప్పి ముందుకడుగేసింది.

 

    జలపాతం పక్కన కొండలమధ్యలోంచి వెళ్ళిపోతున్న పోలీసు బృందాల్ని, వాళ్ళ మధ్యనున్న మోహితను చూస్తూ  పళ్ళు పటపట కొరికాడు రాజేంద్రకుమార్.

 

    మూడు నిముషాలసేపు తోకాడిస్తూ, రాజేంద్రకుమార్ కాళ్ళని వాసన చూస్తూ గడిపిన 'నిక్కీ' నాలుగో నిమిషంలో బయటకు మోహిత వెళ్ళిన దిశగా పరుగులు తీసింది.

 

    "నిక్కీ! నిక్కీ" అరిచాడు రాజేంద్రకుమార్.

 

    కానీ లాభం లేకపోయింది.

 

    కొండలమాటున మాయమైంది 'నిక్కి.'

 

    పావుగంట తర్వాత అంతా సద్దుమణిగింది.

 

    పొదల్లోంచి బయటికొచ్చిన మైత్రేయ చెట్లమధ్యనుంచి నడుచుకుంటూ, దగ్థమయిపోయిన గిరిజన గ్రామంలోకొచ్చాడు. అక్కడనుంచి నడక సాగించాడు.

 

    
                                            *    *    *

 

    గెస్ట్ హౌస్ లో వరండామీద కూర్చుని దీర్ఘంగా ఆలోచిస్తున్నాడు రాజేంద్రకుమార్.

 

    అయిదుగురు అనుచరులు ఎదురుగా చేతులు కట్టుకుని నుంచున్నారు.

 

    "సిద్ధరామయ్య ఎక్కడ?" పీటర్ స్కాచ్ బాటిల్ ఎత్తి తాగుతూ అడిగాడు.

 

    "ఆ కుర్రాడ్ని వెంట తరుముతూ వెళ్ళాడు సార్...... ఇంకా రాలేదు."

 

    "వాడి శవం నాక్కావాలి...... శనమ్మీద నేను డాన్స్ చెయ్యాలి" అసహనంగా అరుస్తూ అన్నాడతను.

 

    కసిగా మోహితను సర్వనాశనం చేసి, చిత్రహింసలపాలు చేయాలనుకున్న తన ప్లాన్ ఫ్లాప్ కావడంతో, పోలీసులమీద కోపంగా వుందతనికి.

 

    ఎఫ్. ఐ. ఆర్. రాసి, రిమాండ్ లో వుంచి, ఇరవై నాలుగుగంటల లోపల పోలీసులు, మోహితను కోర్టులో  హాజరపరుస్తారు. ఈ ఇరవై నాలుగు గంటల్ లోపే ఆ మోహితను మర్డర్ చేసెయ్యాలి. తనమీద, తన ఫ్రెండ్స్ మీద, ఎందుకు మోహిత కక్ష పూనిందో బయట ప్రపంచానికి తెలియకూడదు.

 

    తెలిస్తే తన ఉనికికి ప్రమాదం. తన వ్యక్తిత్వానికి, తన బిజినెస్ కి ప్రమాదం.

 

    రకరకాలుగా ఆలోచిస్తున్నాడు రాజేంద్రకుమార్.

 

    తను ఒక సెల్ ఫోన్  చేస్తే, పోలీసు జీపు మైసూరు వెళ్ళదు. దారిలోనే  మాడి మసైపోతుంది. ఆ మసిలో, మసిగా మోహిత శవం కూడా వుంటుంది.

 

    కానీ-

 

    ఆ 'బిచ్' ను తన చేతుల్తో చంపాలి.

 

    ఎలా.....? ఎలా.....? ఎలా....?

 

    "ఒరే పాషా...." ఎదురుగా నుంచున్న ఒక అనుచరుడివేపు చూశాడు రాజేంద్రకుమార్?"

 

    "సార్....!"

 

    "రేపు పోలీస్ స్టేషన్ లోంచి మోహిత బయటకు రావాలి. ఎలా?" అడిగాడు.

 

    "పోలీసులందరూ మన ఫ్రెండ్సేకద సార్...." అన్నాడు పాషా.

 

    "ఇది మన కేసు..... బయట పడడం మనకంత మంచిదికాదు.... మన ప్రమేయం లేనట్టుగా అంతా జరగాలి" చెప్పాడు రాజేంద్రకుమార్.

 

    "అయితే ఒక పనిచేద్దాం సార్....." చెప్పాడు పాషా.

 

    ఆ ఐడియా రాజేంద్రకుమార్ కు బాగా నచ్చింది.

 

    "మనం తెల్లవారుజామున బయల్దేరి, మైసూరుకు వెళుతున్నాం. ఈ ఐడియా ప్రకారం, మన మనుషుల్ని ఏర్పాటు చేయి. రేపు సాయంత్రంలోపుగా మోహిత ప్రాణాలు, శాశ్వతంగా గాలిలో కలిసిపోవాలి....." మత్తుగొంతుతో అన్నాడు రాజేంద్రకుమార్.

 

    అప్పుడు సమయం రాత్రి రెండుగంటలు దాటింది.

 

    
                                             *    *    *

 

    మైసూరు.....

 

    పోలీస్ కంట్రోల్ రూమ్, పోలీసుల్తోనూ, పత్రికా విలేఖరులతోనూ కిటకిట లాడుతోంది.

 

    సిటీ పోలీస్  కమీషనర్, డి.సి.పి, ఎ.సి.పి.లతో అర్జంట్ మీటింగ్ ఎరేంజ్ చేశాడు.

 

    కాన్ఫరెన్స్ హాల్లో మీటింగ్  జరుగుతోంది.

 

    "మిష్టర్ ఎ.సిపి. రమేష్ బాబూ..... కంగ్రాచ్యులేషన్స్.... ఆ మోహితను రేపు కోర్టులో హాజరు పరచండి. కానీ ఎప్పుడు మనం  కోర్టుకు తీసికెళుతున్నామో ఎవరికీ తెలియకూడదు. ముఖ్యంగా ప్రెస్  రిపోర్టర్లకు అసలు తెలియకూడదు. మోహిత చేసినట్లుగా భావిస్తున్న హత్యలకు సంబంధించి హతులకు, హంతకురాలికి మధ్యనున్న రిలేషన్ గురించి గానీ, మిగతా విషయాలు గానీ ఎవరికీ తెలియడానికి వీల్లేదు. ఎందుకంటే చనిపోయిన జస్టిన్ ఆదిత్య, హోం మినిష్టర్ కు ఫ్రెండ్ కనుక. అలాగే ఈ హత్యల్లో నిందితురాలిగా భావిస్తున్న మొహితకు సహకరించిన మైత్రేయ విషయం ఏమయింది?" అడిగాడు సిటీ పోలీస్ కమీషనర్.

 

    "మైత్రేయ ఎక్కడున్నాడో తెలీదు సార్.... ఎలా వుంటాడో తెలీదు" చెప్పాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    "అతను ఎక్కడుంటాడో, ఏ వేషంలో వుండొచ్చో మొహితకు తెలుస్తుంది కదా.... ఆమెను ఇంటరాగేట్ చెయ్యండి.... కానీ థర్డ్ డిగ్రీ మాత్రం  ఉపయోగించకండి..... ఎందుకంటే..... ఈ మహిళా సంఘాలు ఉద్యమాలు చేస్తాయి. వాళ్లకి మనం ఏ విధమైన అవకాశం ఇవ్వకూడదు" చెప్పాడు సిటీ పోలీస్ కమీషనర్.

 

    "అసలు మోహిత ఇన్ని హత్యలు ఎందుకు చేసిందో, ఆమె భర్త రాజేంద్ర కుమార్ కు తెలుస్తుంది సార్. అతన్ని మనం ఎందుకు వదిలెయ్యాలి...." ఇంకో ఏ.సి.పి. ప్రశ్నించాడు.

 

    "మనలో మనమాటగా చెపుతున్నాను..... ఇలాంటి హత్యలు మనకు మామూలే..... ఇలాంటి కేసులూ మనకు మామూలే.... కానీ పవర్ పుల్ పొలిటీషియన్స్ తో లింకున్న వ్యక్తుల జోలికి మన చట్టం  వెళ్ళకూడదు. వాళ్ళకు మనం ఎంత దూరంలో వుంటే అంత మంచిది.

 

`    మోహిత చేసిన హత్యలు వెనక కారణం రాజేంద్రకుమార్ కి తెలీదా? అతనికి తెలుసని మనకు తెలుసు.... అడిగినా  అతను చెప్పడని, మనకు తెల్సు, చెప్పినా ప్రయోజనం లేదని  మనకు తెల్సు. సో.... మనకెందుకు రిస్క్? రేపు ఎలక్షన్స్ వస్తున్నాయి. పొలిటికల్ రీడర్స్ కి రాజేంద్రకుమార్ లాంటి వాళ్ల అవసరం ఎక్కువగా వుంటుంది కాబట్టి, మనంకూడా మనంకూడా రాజేంద్రకుమార్ ని సపోర్ట్ చెయ్యాలి. తప్పదు.... పొలిటికల్  నేతల్ని సమర్థించండి అని మన రాజ్యాంగంలో ఎక్కడా లేదు. బ్రిటీష్ రాజ్యాంగంలో వుంది. మనది ఇప్పటికీ బ్రిటిష్ లా..... బికేర్ పుల్...." చాలా గొప్ప విషయాన్ని తనదైన మాటల్లో చాలా సున్నితంగా చెప్పాడు అనుభవజ్ఞుడయిన సిటీ పోలీస్  కమీషనర్.

 

    "మైత్రేయని అరెస్ట్ చేస్తే, అతనిమీద  థర్డ్ డిగ్రీలైనా ఉపయోగించండి...... కానీ, నాకు గానీ,  మీకు గానీ నష్టం వుండకూడదు. దానివల్ల చట్టం రక్షింపబడుతోందని పత్రికల ద్వారా తెలుసుకుని, మామూలు ప్రజలు మనల్ని గౌరవించాలి..... అర్థమయిందా?" లేచి నిలబడ్డాడు సిటీ పోలీస్ కమీషనర్.

 

    పోలీస్  అధికారులందరూ సెల్యూట్ చేస్తూ బయటికి వచ్చేశారు.

 


                                           *    *    *

 

    పోలీస్ కంట్రోల్ రూమ్ లోని ఒక స్పెషల్ రూమ్.

 

    ఆ రూమ్ లో ఎ.సి.పి. రమేష్ బాబు  కర్రకుర్చీలో కూర్చున్నాడు. అతని ఎదురుగా మోహిత కూర్చుని వుంది.

 

    "చెప్పండి మిసెస్ మోహిత...... విజయవాడలోని మాజీ పోలీస్ ఆఫీసర్ మహేంద్రని మర్డర్ చేసింది మీరేనా?"

 

    రమేష్ బాబు కళ్ళల్లోకి సూటిగా చూస్తూ.....

 

    "మీ పోలీస్ దర్యాప్తులో నిందితురాలిని నేనని ఎవరూ ధృవీకరించలేదు....." అంది మోహిత.

 

    "శ్రీశైలంలో జయంత్ ని మీరే ప్లాన్డ్ గా మర్డర్ చేశారు..... అందుకు రుజువులున్నాయి. మిమ్మల్ని గుర్తుపట్టే వ్యక్తులున్నారు."

 

    "కోర్టులో దొంగసాక్ష్యాల్ని సృష్టించడం, మీ పోలీసులకు వెన్నతో పెట్టిన విద్య, దోషుల్ని నిర్దోషులుగా,  నిర్దోషుల్ని దోషులుగా చెయ్యగలిగే శక్తి మీ  పోలీసులకుంది. కాదంటారా.....? మీ ప్రశ్నకు సమాధానం అదే....."

 

    "అంటే.... మీరు హత్య చేయలేదా?"

 

    జవాబు చెప్పలేదు మోహిత.

 

    "గుంటూరులో జస్టిస్ ఆదిత్యను మీరే మర్డర్  చేశారా?"

 

    "ఎవరు చెప్పారు?"

 

    వెంటనే జవాబు చెప్పలేకపోయాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    "ఓ.కె..... ఓ.కె....ఓ.కె. మిసెస్  మోహితా...... నాకొక్క పాయింట్ కావాలి చెప్తారా?"

 

    "అడగండి?"

 

    "ఈ మర్డర్స్ చెయ్యడం వెనక మీ మోటివ్ ఏమిటి?"

 

    రెండు నిమిషాల నిశ్శబ్దం.

 

    "నేను మోటివ్ చెప్తే..... మీరేం చేస్తారు..... నన్ను రక్షిస్తారా?"

 

    "నేరస్తుల్ని ఎలా రక్షిస్తాం? శిక్షిస్తాం..... అన్నాడు రమేష్ బాబు.

 

    "అలాంటప్పుడు ఈ విలువ లేని ఇంటరాగేషన్ ఎందుకు....? నేను  చెప్పాల్సింది కోర్టులోనే చెప్తాను...... కోర్టుకు నన్ను ప్రొడ్యూస్ చేస్తే...."

 

    "కోర్టుకు మిమ్మల్ని  ప్రొడ్యూస్ చెయ్యనని మీరెందుకు అనుకుంటున్నారు?" ఆశ్చర్యంగా ప్రశ్నించాడు రమేష్ బాబు.

 

    "ఏమో..... చెయ్యలేకపోతారేమో..... అని నా సందేహం" అంది మోహిత.

 

    "అంటే మీరు తప్పించుకుందా మనుకుంటున్నారా?"

 

    "లేదు. అనుకోవడం లేదు. నేను తప్పించుకున్నా, తప్పించుకోలేకపొయినా ఇంకో మర్టర్ జరుగుతుందని నేననుకుంటున్నాను" నవ్వుతూ అంది ఆమె.

 

    "ఇంకో మర్డరా.....? ఆశ్చర్యంగా నోరు తెరుస్తూ అన్నాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    "ఏం .... అలా ఆశ్చర్యపోతున్నారు?" ప్రశ్నించిందామె.

 

    ఆమె మనస్తత్వాన్ని అంచనా వెయ్యడానికి ప్రయత్నిస్తున్నాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    "ఎవర్ని చేస్తారు?" అసహనంగా ప్రశ్నించాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    "మర్డర్ జరుగుతుందని అంటున్నాను...... కానీ నేను చేస్తానని అనడం లేదే...."

 

    "ఎవర్ని మర్డర్ చేస్తారు? ఎవరు మర్డర్ చేస్తారు? అయ్ వాంట్ టు నో...." సీట్లోంచి కోపంగా లేస్తూ అన్నాడు ఎ.సి.పి. రమేష్ బాబు.

 

    "వెయిట్..... అండ్ ..... సీ....." నెమ్మదిగా చెప్పింది మోహిత.

 

    ఇంటరాగేషన్ పూర్తయింది. ఆమె ధైర్యానికి ఆశ్చర్యపోయాడు ఎ.సి.పి. రమేష్ బాబు. ఆమెను రిమాండ్ లో వుంచాక, నేరుగా సిటీ పోలీస్ కమీషనర్ ఆఫీసుకు  వెళ్ళి ఇంటారాగేట్ వివరాలను కమీషనర్ తో చెప్పాడు.

 

    "రేపుమోహితను ఎన్నిగంటలకు కోర్టులో ప్రొడ్యూస్ చేస్తున్నావ్?" అడిగాడు సిటీ పోలీస్  కమీషనర్.

 

    "పదకొండు గంటలకు."

 Previous Page Next Page