"పోనీలే, అదృష్టవంతురాలివి. కుష్ఠురోగంతో బాధపడినదానివి, తిరిగి కుష్ఠురోగుల ఆసుపత్రికే నర్సుగా రావటం చెప్పుకోదగిన విషయమే. ప్రయాణం చేసి అలిసిపోయి వుంటావు. ఈ వేళంతా రెస్టు తీసుకుని రేపటి నుంచీ డ్యూటీలో జాయిన్ అవుదువుగాని" అని బెల్ నొక్కాడు.
"యస్ సార్" అంటూ ప్యూన్ లోపలికి వచ్చాడు.
"అమ్మగారికి క్వార్టర్స్ చూపించు. అవసరమైన సదుపాయాలు చూడు" అని, నమస్కారం చేసి, కదలబోతున్న భారతిని "మాట" అని వెనక్కి పిలిచి, "నిన్ను చూసి నాలుగయిదు సంవత్సరాలయి వుంటుంది. కాని చూసీ చూడగానే నిన్ను గుర్తు పట్టగలిగాను. నువ్వాశ్చర్య పడలేదా?" అని ప్రశ్నించాడు.
"పడ్డాను" అని సమాధానం చెప్పి అక్కడి నుంచి బయటపడి, ఆఫీస్ ప్యూన్ వెంట క్వార్టర్స్ వైపు నడిచింది భారతి.
* * *
విశాలమైన ఆవరణలో కట్టబడిన లెప్పర్స్ కాలనీ ఆ కాలనీలో ఎక్కడ చూసినా ఎత్తుగా పెరిగిన చెట్లు, రోగులు వుండటానికి వీలుగా చిన్న చిన్న పెంకుటిళ్ళు భారతికి ఇవ్వబడింది కూడా చిన్న పెంకుటిల్లే. అయితే అందులో సమస్త సదుపాయాలూ ఉన్నాయి.
ఆమె ఇల్లు ఏకాంత మందిరంలా వుంటుంది. చుట్టూ ,చిన్న కంచె, మధ్యలో గేటు, చుట్టు ప్రక్కల వందగజాల దూరంలో ఇంకేకట్టడమూ లేదు.
కాలనీలో వందమందికి పైగా రోగులు వున్నారు. స్త్రీలు మూడోవంతు వుంటారు. పిల్లలు, ప్రాయంలో వున్నవారు, వృద్ధులు__ఇలా అన్ని రకాలవారూ చేరిపోయా రక్కడ.
వాళ్ళందరికీ ఒకే డాక్టరు, ఒకే నర్సు, ముగ్గురు కాంపౌండర్లు వున్నారు. తోటీలూ, కాపలావాళ్లూ కలిసి ఇంకా ఏడెనిమిదిమంది వరకూ వుంటారు. ఇదీ అక్కడి స్టాఫ్.
నెలా రెండు నెలలుగా అక్కడ నర్సు ఎవరూ లేరు. భారతి రాకముందు పనిచేసిన ఆమె ఎప్పటినుంచో ట్రాన్స్ ఫర్ కోసం ప్రయత్నిస్తూ, ఎన్నాళ్ళకూ ఆ ప్రయత్నం ఫలించకపోయేసరికి చివరికి విసిగి: ఉద్యోగానికి రాజీనామా ఇచ్చి వెళ్ళిపోయింది.
వచ్చిన మూడు నాలుగు రోజులోనే భారతి రోగులందరి మధ్యా చనువుగా తిరిగి, వారితో సాన్నిహిత్యం పెంపొందింప చేసుకుంది. మామూలు ఆసుపత్రులలోలాగా ఒక వార్డులాంటిది కట్టి, రోగులందర్నీ అందులో కలిపి వుంచటం లేదక్కడ. లెప్రసీలో అనేక రకాలు వున్నాయి. కొన్ని అంటు సంబంధమైనవి, కొన్ని అంటు సంబంధం కానివి, కొన్ని భయంకరమైనవి, కొన్ని అంత భయంకరం కానివి.
భారతి నర్సింగ్ చదువుకునేటప్పుడు__వీటి గురించి స్థూలంగా చదువుకున్నా ఇంత నిశితంగా ఆ వ్యాధితో బాధ పడుతూన్న వాళ్ళని పరిశీలించటానికి అవకాశం రాలేదు. వ్యాధిలోని రకాన్ని బట్టి తరగతులుగా విభజించి వేరు వేరు ఇళ్ళలో రోగులని వుంచారు. ఒక్కో ఇంటిలో పదిమందికన్నా ఎక్కువ ఉంచలేదు.
భారతి వాళ్ళందరినీ పరిశీలనగా చూసింది. ఒక్కొక్కరుగా అందరినీ పలకరించి, ప్రతివారిలోకి తొంగిచూసింది.
వాళ్ళలో ఎక్కువ భాగం పేదరికంతో బాధపడేవాళ్ళే. అంటే ఎక్కువగా పేదసాదలే. ఈ వ్యాధికి గురి అవుతూ వుంటారా? కాకపోవచ్చు. తనెవరు? శ్రీమంతురాలు కాకపోయినా నిరుపేద కాదుగా, కాస్తో కూస్తో కలిగిన వారెవ్వరూ కాలనీలలో చేరరు. తనలాగే ఇళ్ళలోనే ఉండి ట్రీట్ మెంట్ తీసుకుంటారు. ఏ ఆధారం లేనివారు, తమ అంగవైకల్యాన్ని ముష్టేత్తుకుంటూ బయటకు ప్రదర్శించటానికి ఇచ్చగించని వారు_ఇలాంటి చోట్లకు వచ్చి చేరిపోతుంటారు.
కొందరికి కాళ్ళకూ, చేతులకూ వ్రేళ్ళు తినివేయబడి మొండిగా ఉన్నాయి. కొందరికి ముఖమంతా కాయలు కాయలుగా ఏర్పడి ,ముక్కులు లోపలకు పోయి....ఒళ్ళంతా పుళ్ళు, రసి కారుతూ....
కొందరికి వట్టి మచ్చలు....
భారతి వారందరితోనూ కలిసి తిరిగింది. వాళ్ళందరూ మందులు సరిగ్గా వేసుకుంటున్నారో లేదో శ్రద్దగా కనుక్కునేది. ఒక్కోసారి తనే స్వయంగా వారితో మందులు త్రాగించేది. వాళ్ళని ముట్టుకునేందుకు ఆమె ఏనాడూ సంకోచించలేదు. ఆమె నిర్భయంగా, నిస్సంకోచంగా, ఆప్యాయంగా వాళ్ళను తాకుతూ వుంటే వాళ్ళే భయపడి, సిగ్గుపడి దూరంగా తొలగిపోతూ ఉండేవారు.
ఆ కాంప్లెక్స్ వుండటం ఆమె కిష్టంలేదు. తనూ వారిలో ఒకరినని వాళ్ళకి నచ్చజెప్పాలని ఆమె పట్టుదల.
ఆ పట్టుదలతో ఆమె వారిలో కొందరితో మరీ స్నేహం చేసుకుంది. స్త్రీలలో తన ఈడువారు ముగ్గురు నలుగురు వున్నారు. తీరిక ఉన్నప్పుడల్లా వారితో కాలం గడిపేది. వారి జీవిత చరిత్రలను తెలుసుకునేది. వారెం చెప్పినా ఉత్కంఠగా వినేది.
అందులో ముగ్గురికి పెళ్ళయ్యాక ఈవ్యాధి వచ్చింది. మొగుళ్ళు వదిలేసి వేరే పెళ్ళిళ్ళు చేసుకున్నారు.
ఒకామెకు పెళ్ళికాలేదు. "మా వాళ్ళు పెళ్ళి చేద్దామనుకుంటూండగానే నాలో ఈ వ్యాధి పొడసూపింది. నాకు ఓ విధమైన విరక్తి కలిగింది జీవితమంటే. పెళ్ళి చేసుకుని మరొకరి ఉసురుకూడా పోసుకోవట మెందుకని అవివాహితగానే వుండిపోయాను" అని చెప్పింది.
ఆమె పేరు లక్ష్మి. మధ్యతరగతి కుటుంబంలోని స్త్రీయే. ఆమెకు నచ్చిన రోగమేమిటో నలుగురూ తెలుసుకుని, ఆఖరికి ఇంట్లో అన్నలూ, వదినెలు కూడా కాకుల్లా పొడుస్తూంటే వాళ్ళ బాధ భరించలేక అయినవారికి దూరంగా వుంటే మనశ్శాంతిగా వుంటుందని కాలనీలోకి వచ్చి చేరింది.
లక్ష్మి వున్నట్లుండి నవ్వుతుంది. ఆ నవ్వులో ఏవో లోకాలు కనబడుతాయి భారతికి. ముగ్ధురాలై పోతుంది. ఆమె అంటే చాలా ఇష్టం, గౌరవం ఏర్పడ్డాయి.
తనకు వ్యాధి పూర్తిగా నయమవుతుందని గట్టి నమ్మకం లేదు గాని, ఒకవేళ అలా కాని జరిగితే తనవారెవరూ లేరని ఏ దూరప్రాంతానికో వెళ్ళిపోయి, ఉద్యోగం చేసుకుని పొట్ట పోసుకుంటూ, మిగతా జీవితమంతా ఒంటరిగా గడిపేయాలని లక్ష్మి అభిలాష. అప్పటికప్పుడే అక్కడచేరి ఏడాది దాటింది. ఆమెలో చెప్పుకోదగ్గ అభివృద్ధి కూడా కనిపిస్తూంది.
మొగవారిలో కూడా ఎక్కువమంది పేదరికం అనుభవించేవారే అయినా, కొద్దిమంది చదువుకున్నవారూ, కాస్త కలిగినవారూ లేకపోలేదు. అందులో ఒకరిద్దరికి ఈ వ్యాధి మూలంగా చేసుకుంటూన్న ఉద్యోగాలు పోయాయి. ఒకరిద్దరు సమాజంలో అప్రతిష్ఠపాలయ్యారు. ఒకరికి వైవాహిక జీవితం విచ్చిత్తి అయింది. అతని భార్య అతనితో కాపురం చేయలేనని చెప్పి ఎవరితోనో లేచి పోయిందిట.
అతనికి భార్యమీద కోపంలేదు. "ఇందులో ఆమె తప్పేం లేదు" అంటాడు. తనమీద తనకి అసహ్యం. తన ఉనికి తనకి రోత ఆత్మహత్య చేసుకోలేని తన పిరికితనానికి కించబడతాడు.
అతనికి మందు ఇస్తూ భారతి రోజూ అతన్ని ఓదారుస్తూ వుంటుంది.
మందులు మింగుతూ, జీవితాన్ని తిట్టుకుంటూ, నిమిషాలు లెక్క పెట్టకుంటూ బ్రతకటమే వాళ్ళ పని? వాళ్ళు చేసేందుకు ఓ పని కల్పించటం, ఏదయినా పని నేర్చుకునేందుకు మార్గం చూపించటం, కాలక్షేపం ఇవేమీ లేవా? ఇవేమీ లేకుండా ఇది కాలనీ ఎలా అవుతుంది? ఇది ఏర్పరచటంలో ఓ ప్రయోజనం వుండాలికదా? ఎందుకని ఇవేమీ ఇక్కడ జరగటం లేదు?
ఓ సాయంత్రం ఈ విషయాన్నే ఆలోచిస్తూ, ఆమె చెట్లక్రింద నుండి నడిచి వస్తూంది.
ఎదురుగా డాక్టర్ గోవిందరావు వచ్చి, "హలో భారతీ?" అని పలకరించాడు.
ఆమె తల ఎత్తి చూసేసరికి తనవంక నవ్వుతూ తిలకిస్తూన్న డాక్టరుగారి దివ్య స్వరూపం పొడగట్టింది. నిజానికి తనని పేరు పెట్టి పిలవవలసిన పనిలేదు. "సిస్టర్?" ని పిలవాలి కాని, వచ్చిన రోజు నుంచీ అతను "భారతీ!" అనే పిలుస్తున్నాడు. తనపై అధికారి గనుక కోపాన్ని దిగమ్రింగి ఊరుకుంటూంది.
ప్రశ్నార్ధకంగా చూసి వూరుకుంది.
"నీ ఫ్రెండ్స్ ని పరామర్శచేసి ఇంటికి వెడుతున్నావా?"
"ఫ్రెండ్స్!" అనే మాట ఎత్తి పొడుపుగా వినిపించింది.