Previous Page Next Page 
ప్రేమకు పెట్టుబడి కావాలి పేజి 36


    "ఆమెతో ఎవరు మాట్లాడారు?"

 

    "హౌ ఆర్యూ కళ్యాణి..... అనడం వినిపించింది. అంటే కళ్యాణి అనే వ్యక్తి దగ్గర్నుంచి.... హౌ ఆర్యు అని ఏకవచనంతో విష్ చేసింది కాబట్టి ఆ వ్యక్తి సన్నిహితంగా వుండే ఫ్రెండ్ కావచ్చు......" రోబోట్ టైపులో చెప్పాడు రవితేజ.

 

    "గుడ్ నైట్!" చెప్పేశాడు మధు.

 

                                          *    *    *

 

    ఉదయం ఏడుగంటలు.....

 

    అంబాసిడర్ కారు, అన్విత బెడ్ రూమ్ కి కుడివేపున కిటికీలవేపున్న గోడపక్కన ఆగింది.

 

    ఆ దారిలో ఎక్కువగా వెహికల్స్ రావు. రెండోవేపు ఓపెన్ ప్లేస్.

 

    ఎవరో పునాదులు వేసి వదిలేశారు.

 

    అక్కడ ఎంతసేపున్నా ఎవరూ అనుమానించరు. అక్కడ నుంచి చూస్తే తెరుచుకున్న కిటికీలోంచి అంతా కనిపిస్తుంది.

 

    కిటికీ మూసేసి వుంటే గోడెక్కి కూర్చుని చూడొచ్చు. దట్టంగా చెట్ల కొమ్మలుండడం వల్ల గోడమీద వాళ్లెవరూ బయటి వాళ్ళకి కనిపించరు.

 

    ఆ సమయంలో ఫోన్ లో మాట్లాడుతోంది అన్విత.

 

    మళ్ళీ మరో గంటకు ఫోన్...... అరగంటసేపు. మళ్ళీ పావుగంట తర్వాత....

.

    

                                           *    *    *

 

    పదిన్నరైంది.

 

    టీవీలో వరల్డ్ క్రికెట్ మ్యాచ్ చూస్తున్నాడు మధు.

 

    ఇండియా గెలుస్తుందా? లేదా? అన్నదానికంటే తన లవ్ గెలుస్తుందా లేదా అనే టెన్షన్ తో వున్నాడతను.

 

    డిటెక్టివ్ రవితేజను రంగంలోకి దింపాక గెలుస్తానన్న నమ్మకం అతనికి కలిగింది.

 

    టెలిఫోన్ మోగింది. వెంటనే ఫోన్ లిప్ట్ చేశాడు మధు.

 

    ఫోన్ లో అన్నపూర్ణమ్మ మాటలు వినిపిస్తున్నాయి.

 

    Man power is organized knowledge expressed expressed through intelligent efforts.

 

    మానవశక్తి మూలం విశేష జ్ఞానపదం, కార్యశీలత, ఒకప్పుడు విజ్ఞానశాస్త్రపు నీడలు, మానవ పరిణామ క్రమం మీదపడని కాలంలో పురుష శక్తి కన్నా స్త్రీ శక్తిని చాలా తక్కువగా చూసేవారు. స్త్రీ మానసిక, శారీరక చైతన్యానికి పురుషుడే మూలమనే భావనను ఆనాటి కారణాలేవైనా, వర్తమాన, సాంకేతిక యుగంలో స్త్రీ ఆధారిత కాదు. స్వయంశీలత గలిగిన స్వయంప్రేరిత. సమాజ శాసనకర్త.

 

    మన రాష్ట్రంలోని స్త్రీలకు జులై ఒకటి, 1999 గొప్ప ఆనందాన్ని ఆశని కలిగించిన రోజు. పెళ్ళయిన తర్వాత అత్తావారింట్లో ఉమ్మడి ఆస్తిలో కూడా కోడళ్ళకు సమాన భాగస్వామ్యపు హక్కులుండాలని చంద్రబాబు ప్రభుత్వం సంకల్పించటం, ఒక శుభ పరిణామం.

 

    ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ లో వారసత్వపు ఆస్తిలో మహిళలకు సమాన హక్కుల్ని తెలుగుదేశం ప్రభుత్వ ఎన్టీ ఆర్ హయంలో తీసుకురావడం జరిగింది.

 

    చాలా విషయాల్లో ఈరోజు మనరాష్ట్రం మిగతా రాష్ట్రాలకు మార్గదర్శి కావటం మన అదృష్టమే.

 

    1956 నుంచి 1999 వరకు మన రాష్ట్ర ప్రగతిని చూస్తే 32 ఏళ్ళు మన రాష్ట్రాన్ని పరిపాలించిన పార్టీ మనకెంత అన్యాయం చేసిందో ఇట్టే అర్థమైపోతుంది. ప్రజలకు మంచి చేయగలిగినా సంపూర్ణ అధికారాన్ని చేతిలో వుంచుకుని కూడా చీటికి మాటికి ఢిల్లీకి పరుగెత్తుతూ పదవుల కోసం ప్రాకులాడుతూ సంపాదన మత్తులో మునిగిపోయి మన బ్రతుకింతేనేమో...... ఇంతకంటే ఏ ప్రభుత్వం కూడా మనకేమీ చేయలేదేమో, అన్న నిరాశ నిస్ప్రహల్లో రాష్ట్ర ప్రజలు కూరుకుపోయేలా చేయడం దురదృష్టకరమైన విషయం.

 

    If you do things well do, them better, Be daring, Be first, Be different, Be just....

 

    అనే  సూక్తిని ప్రధానంగా నమ్మిన మన ముఖ్యమంత్రి చంద్రబాబు పొలిటికల్ ఇంటలెక్చువల్ వర్కింగ్ చీఫ్ మినిష్టర్ కావడానికి ఆయన ఇంకొక సూక్తే ప్రధాన కారణం అని నా నమ్మకం. My formula for success is to be found in three words. wrok-wrok- wrok.

 

    మంచి చేయకపోయినా ఫర్వాలేదు- చేసేవాడ్ని చెడగొట్టడం దుర్మార్గం..... అన్యాయం. ఇప్పుడు మన రాష్ట్రంలో ప్రతిపక్షాల్లో వున్న నాయకులు మంచిని, అభివృద్ధిని, ఇప్పుడున్న కళ్ళతో చూడలేకపోతున్నారనుకుంటా....

.

    తను ముఖ్యమంత్రిగా పదవీ స్వీకారం చేసిన  క్షణం నుంచీ చీఫ్ మినిష్టర్ చంద్రబాబు మొదట ఈ రాష్టాన్ని'కంప్యూటర్ మీడియా'కు కేంద్రంగా చేయదలిచాడు. అందుకు అనుగుణంగా 'హైటెక్ సిటీ' దగ్గర్నించి, కంప్యూటర్ కౌన్సిలింగ్ వరకూ తన పథకాల్ని అమలుచేశాడు.

 

    గతంలో ఏ ముఖ్యమంత్రి అయినా, ఏ జిల్లా కలెక్టర్ తో ఇంత విరివిగా ప్రతి చిన్న అంశం గురించి మాట్లాడే, విశ్లేషించే సందర్భం వుందా? ఏ  మారుమూల శ్రీకాకుళంలోనో, ఏ ఆదిలాబాద్ అడవుల్లోనో, ఏ అనంతపురం రోడ్డు మీదో జరిగే దారుణమైన సంఘటనకు వెంటనే స్పందించే ముఖ్యమంత్రి గతంలో ఎవరూ లేరన్నది నిర్వివాదాంశం.

 

    అలాగే రాజధాని హైదరాబాద్ దగ్గర్నించి రాష్ట్రంలో మిగతా ముఖ్య పట్టణాల్లోనే కాకుండా ప్రతి చిన్న కుగ్రామానికి ఈవేళ పక్కా రోడ్లు వున్నాయంటే, బస్సులు నడుస్తున్నాడయంటే, డంపింగ్ ఏరియాలు, మురికి ప్రాంతాలు, రకరకాల వృక్షాలతో శ్యామలంగా వున్నాయంటే, ఆయన చేపట్టిన పతకాల ఫలితాలే కారణం కాదా?

 

    రోడ్ల వెడల్పు కార్యక్రమం, ఫ్లైఓవర్లు, రిజిస్ట్రార్ ఆఫీసుల్లో కంప్యూటర్లు, ఆడపిల్లలకు అయిదువేలు, అదనంగా ఇంజనీరింగ్ కాలేజీలు, మెడికల్ కాలేజీలు, చెరువులు రక్షణ, ప్రభుత్వ స్థలాల రక్షణ, విద్యుదుత్పత్తిని పెంచటం, ఇరవై నాలుగు గంటలు తాగునీటి సరఫరా, వాననీటిని భూగర్భజలాలుగా మార్చటం, అధికార్ల అవినీతిపై డేగచూపు, తమ హక్కులకోసం ప్రభుత్వ సిబ్బందిని నిలదీసే హక్కు ప్రజలకు వుందని తెలియజెప్పటం, లంచాలడిగితే దేహశుద్ధి చేసే అధికారం మీకుందని, ప్రజల్ని చైతన్యవంతుల్ని చేయటం, నిరుద్యోగ యువతకోసం, కళాకారులకోసం, పేద మహిళల కోసం....ఎన్నో ఎన్నెన్నో పథకాలు అమలులోకొచ్చాయి.

 

    ఈ రాష్ట్రానికి నేను చీఫ్ సర్వెంట్ ని. నాకు మీరు సలహాలివ్వండి. తప్పులు చేస్తే నిలదీయండి...... ఇంకా ఏం చేస్తే మన రాష్ట్రం ప్రపంచానికి మార్గదర్శి అవుతుంది అని ప్రజల్ని అభ్యర్థించిన రాజకీయ వేత్తను మనం ఎప్పుడైనా..... ఎక్కడైనా చూశామా?

 

    'రొట్టి దొరికే వరకూ పిల్లులు మౌనంగా వుంటాయి. ఆ రొట్టె దొరికాక, ఆ రొట్టెను మాయం చెయ్యడానికి కొట్లాడుకుంటాయి' అనే  జపాన్ సామెతకు దగ్గరగా మిగతా వారి  పదవీ లాలసత్వం వుంటుందనేది ఈ రాష్ట్ర ప్రజలందరికీ తెలిసిన సత్యం.

 

    ఇప్పుడు కేకలేస్తూ, రంకెలేస్తూ మమ్మల్ని పదవిలోకి తీసుకురండి- మీకిది చేస్తాం...... మీకది చేస్తాం..... అంటున్న వాళ్ళు అంతకు ముందు ప్రజలు చేతికందించిన 32 సంవత్సరాల కాలాన్ని ఏ తుంగలో తొక్కేసారు....?

 

    నాలుగేళ్ళ క్రితం కుప్పం ఎలా వుంది? నందిగామ ఎలా వుంది? రాష్ట్రంలోని మిగతా ప్రాంతాలు ఎలా వున్నాయి? కనుక  ప్రజలకు పనిచేసే ముఖ్యమంత్రే కావాలి. పనిచేసే దేవినేని వెంకట రమణలాంటి ఎం.ఎల్.ఏలే కావాలి.

 

    పదవుల కోసం, అధికారం కోసం మాత్రమే ప్రతిక్షణం పోట్లాడుకునే నాయకులు ప్రజలకు అక్కర్లేదు. ఆ నాయకులున్న పార్టీలు కూడా అక్కర్లేదు. ఆ నాయకులున్న పార్టీలు కూడా అక్కర్లేదు.

 

    ఎన్.టి.రామారావు విగ్రహమూ, వాక్కు సినిమాల్లో దైవపాత్రలు ఆకర్షణ అయితే, చంద్రబాబుకు క్రియాశీలత జనాకర్షణ.

 

    ప్రజల చేతిలోని ఓటు వజ్రాయుధంతో సరిసమానమైనది.

 

    తమ కోసం ఎవరు కృషి చేస్తున్నారో వారి మనస్సులకు తెలుస్తుంది. 'ప్రజలే దేవుళ్ళు', సమాజమే దేవాలయం అన్న ఎన్టీఆర్ ప్రవచనాన్ని పథకాలుగా మార్చిన చంద్రబాబు పాలననే ప్రజలు ఇంకో పాతికేళ్ళకు పైగా కోరుకుంటున్నారన్న దానికి ఇటీవలి సభలే నిదర్శనం.

 

    ఏ ప్రభుత్వం అట్టడుగు ప్రజలు ఆర్ధికంగా నిలదొక్కుకోవడానికి కృషి చేస్తుందో ఆ ప్రభుత్వ సారధి మాత్రమే నిజమైన రాజకీయ నాయకుడు, ప్రజా నాయకుడు అవుతాడు.

 

    ఇల్లు కాలి ఒకడేస్తుంటే- చుట్టకు నిప్పడిగిన చందాన, ఒక పక్కన కార్గిల్ లో హోరాహోరీగా యుద్ధం జరుగుతుంటే, రాజ్యసభ సమావేశం కావాలని కోరుకోవటంలో ఔచిత్యం ఏమన్నా వుందా?

 

    ప్రభుత్వాలను పడగొట్టటం తప్ప, ప్రజలకేం చేద్దామన్న ఆలోచనలేని పార్టీలని ఇకనైనా దేశ ప్రజలు ఈసడించుకోకపొతే మనల్ని, మన దేశాన్ని సాక్షాత్తూ ఆ భగవంతుడే దిగి వచ్చినా కాపాడలేడు.

 

    రాజకీయాలైనా, పదవులైనా..... ప్రజల అభివృద్ధి కోసమే..... అని మనస్ఫూర్తిగా నమ్మిన నాయకుల్నే అధికారంలోకి ఆహ్వానించాలి.

 

    ఒకమంచి చేసే వ్యక్తిని అభినందిస్తే, మరో పదిమందికి మంచి పనులు చేసే అవకాశం వుంటుంది.

 

    ఇదంతా ఎందుకు చెప్పాల్సి వచ్చిందంటే-

 

    ఏ ప్రభుత్వం చేపట్టిన పథకమైనా స్త్రీ ఉనికి ఆలంబనగా రూపకల్పన జరగాలి. ఆర్థికంగా స్త్రీ  సాధించిన ప్రతిపత్తి ఆయా రంగాల్లో రేపటి తరానికి ఊపిరులు పోస్తుంది. కొత్త చైతన్యానికి  వారధిగా వెలిసి, సారధుల్ని తయారుచేస్తుంది.

 

    హక్కుల్ని తెల్సుకోవడం, హక్కుల కోసం పోరాడడం, హక్కులను సాధించడం.... వ్యక్తి అభివృద్ధికైనా సమాజ అభివృద్ధికైనా లక్ష్యంగా కావాలి' ఫోన్ లో మాటలు రావటం ఆగిపోయింది.

 

    "హాలో మిస్టర్ మధు..... ఎలా వుంది అన్నపూర్ణమ్మగారి ప్రసంగం" నవ్వుతూ అడిగాడు డిటెక్టివ్.

 

    "ఇదెక్కడి గొడవయ్యా బాబు..... అన్విత గురించి ఎంక్వయిరీ చేయమంటే ఈ ప్రసంగం ఏమిటి?"

 

    "వాళ్ళిద్దరి మధ్య నడిచే ప్రతి సంభాషణని విన్నప్పుడే మీరెలా ప్రొసీడ్ అవాలో తెలుస్తుంది. అన్నపూర్ణమ్మ గారికి పనిచేసే ప్రభుత్వమంటే ఇష్టమనే విషయం తెలిసిపోయింది గదా......"

 

     భవిష్యత్తులో మీరు అన్నపూర్ణమ్మగారి కలవాల్సిన సందర్భం వస్తే మీరు కూడా పనిచేసే తెలుగుదేశం  ప్రభుత్వాన్నే పొగడాలి. పొరపాటున 32 ఏళ్ళు అధికారం ఇచ్చినా, రాష్ట్రానికి కనీస వసతులు కల్పించలేక పొయినా కాంగ్రెస్ ని పొగిడితే నీ ప్రేమ సఫలం కాదు. నోట్ డౌన్ దిస్ పాయింట్.

 

    అన్విత ప్రేమను పొందాలంటే, ముందుగా మీకు అన్నపూర్ణమ్మగారి మోరల్ సపోర్ట్ కావాలి. అన్విత మీద అన్నపూర్ణమ్మగారి ప్రభావం బాగా వుంది.

 

    అన్విత, అన్నపూర్ణమ్మగారి అభిప్రాయాలకు చాలా విలువనిస్తుంది.

 

    విషయం అర్థమయిందనుకుంటాను....

 

    మీరు బాగా గుర్తుంచుకోవాల్సిన మరో విషయం వుంది.  

 Previous Page Next Page