Previous Page Next Page 
శతఘ్ని పేజి 35

 

    "అవునవును" అంటూ వంతలా అరిచారు విద్యార్ధుల్లా తలలూపుతున్న గుడి సెలవాసులంతా.
    
    "హయ్యోవిద్యార్ధుల్లారా" అన్నాడు నిస్త్రాణతో బ్రహ్మాజీ మెలితిరిగిపోతూ "పదండి..... నా సోదరవిద్యార్ధిని నేను పోయేలోగాచూసి తరించనివ్వండి"
    
    రిక్షా సాగుతుంటే వెనుక వందల సంఖ్యలో జనం అనుసరిస్తున్నారు.
    
    రాత్రిఎనిమిది గంటల సమయాన నగరం నినాదాల హోరులో ప్రతిధ్వనించిపోతోంది.
    
    గంటవ్యవధిలో ట్రాఫిక్ సిబ్బందివెడుతూ ఉస్మానియా చేరుకున్న బ్రహ్మాజీ అప్పటికే అక్కడ ఏర్పాటుచేయబడ్డ ముకుందం మనుషులమధ్యగా గుంపులు గుంపులుగా చేరిన విద్యార్ధుల నడుమనడిచి మైన్ గేటు దగ్గర ముందుకుతూలాడు నడిచేశక్తిలేనట్టు.
    
    ఆసరాయివ్వబోయిన అప్పారావుని విసిరికొట్టాడు కూడా.
    
    "ఇన్ని వందలమంది విద్యార్ధులకిప్పుడు ప్రభుత్వం ఏం జవాబు చెబుతుంది? మన కృష్ణ బ్రతకాలి! అవసరమైతే నా ప్రాణాలు తీసుకోండి. కాని కృష్ణకి ప్రాణంపోయండి." హాస్పిటల్ లోపలికి ప్రవేశించబోయిన బ్రహ్మాజీని పోలీసులు అడ్డుకున్నారు.
    
    "కృష్ణని నేను చూడాలి" అంటూ రంకెలు వేశాడు బ్రహ్మాజీ, అంతేకాదు కొందరు పోలీసాఫీసర్ల పైకలియబడ్డాడు కూడా.
    
    పత్రికావిలేఖర్ల కెమెరాలు క్లిక్ మన్నాయి. ఫ్లాష్ లైట్ల వెలుగుచూస్తుంటే మరింత ఉత్సాహాన్ని నింపుకున్న బ్రహ్మాజీ"ఈ ప్రభుత్వ దమననీతిని నేను నిరసిస్తున్నాను"
    
    అంటూ ఖండించి తనజనంతో అక్కడే బైటాయించాడు.
    
    కేకలు....... నినాదాలు...... హాస్పిటల్ ప్రశాంత వాతావరణం చిన్నాభిన్నమైపోయింది ...... మరింత పోలీస్ బలగం రంగంలోకి దిగి జనాన్ని తరమడం ప్రారంభించారు. కూలిడబ్బులకోసం చేరిన అప్పారావుబృందం యిలాంటి సమయంలో యింకా అక్కడ వుండడం అర్ధంలేనివిషయమన్నట్టు ఉడాయించారు.
    
    అప్పుడు వచ్చాడు త్యాగి......అంతసేపటి నుండి దూరం నుంచే యిది అంతా గమనిస్తున్న త్యాగి వస్తూనే అడిగాడు ఉద్వేగాన్ని అదిమిపెట్టుకుంటూ - "నిరాహారదీక్ష విరమించారా?"
    
    ముందు అర్ధంకాలేదు బ్రహ్మాజీకి అతడెవడన్నదీ కానీ యిలా అడిగేవాడు తప్పనిసరిగా ఓ పత్రికావిలేఖరి అయ్యుంటాడన్న నమ్మకంతో" అవును ప్రజలంతా అడ్డంపడ్డారు" అన్నాడు ఆవేశంగా.
    
    "ఏ ప్రజలు....."
    
    జవాబు చెప్పలేకపోయాడు బ్రహ్మాజీ, "భారతదేశ ప్రజా, తెలుగురాష్ట్ర ప్రజానీకమా, జంటనగరవాసులాలేక మీరందించేసారా పాకెట్ల ఉద్యమంలో చేరిన వాళ్ళా!" "ఎవర్నువ్వు?"
    
    "నేనెవరన్నదీ తర్వాత చెప్తాను. ముందు నా ప్రశ్నకి జవాబు చెప్పండి."
    
    "విద్యార్ధిలోకం ముందుకురికి వచ్చి మమ్మల్ని అనాధల్ని చేయకండి అంటే నేనేం చేయను?"
    
    "అసలిదినిజంగా ఆత్మాహుతాలేక చేయించినహత్యా?"
    
    ఉలిక్కిపడ్డాడు బ్రహ్మాజీ "అంత బాహాటంగా జరిగింది హత్యెలా అవుతుంది?"
    
    "లేనినాడు ఎప్పుడో మరణించిన సీతారామరాజు కోసం ఈ రోజు ఓ విద్యార్ధి ఆత్మాహుతి చేసుకోవాల్సినా అవసరమేమొచ్చింది?"
    
    "అదీ ఆ విద్యార్ధి లోకాన్ని అడుగు."
    
    "అనాధల్ని చేయకండీ అంటూ మీ దగ్గరికి వచ్చారన్నారుగా- మరి మీరెందుకు అడగలేదు?" అడగాలనిపించకా లేకఇలాంటి ఆత్మాహుతులు అవసరమని పించా ....... యస్ మిస్టర్ బ్రహ్మాజీ...... మీకు పదం కావాలి!! దానికి ఓ ఉద్యమం అవసరమనిపించింది!!
    
    ఉద్యమాల ప్రారంభానికి కాలేక కడుపులు కావాలి...... ఉద్యమాలు కొనసాగటానికి కాలుతున్న విద్యార్ధులు కావాలి అన్న సూత్రాన్ని అమలుచేస్తూ కోరి మీ యజ్ఞంలో ఓశలభాన్ని ఆహుతిచేశారు"
    
    "లేదు-అబద్దం."
    
    "కాదు నిజం."
    
    "అసలు అలా అనటానికి నువ్వెవరు?"
    
    "త్యాగి....." పక్కలో బాంబుపడ్డట్టు అదిరిపడ్డాడు బ్రహ్మాజీ......ఏ వ్యక్తి నిన్నగాక మొన్న తమ ఉద్యమం చప్పబడటానికి కారణమయ్యాడో ఏ వ్యక్తి పేరు చెబితే అసాధారణ రాజకీయ దురంధరుడైన పరమహంస సైతం కంగారు పడుతున్నాడో అలాంటి వ్యక్తితో తనింతసేపూ మాట్లాడననితెలిసిన బ్రహ్మాజీగావు కేకలా అన్నాడు "వెళ్ళి పో-అసలు నేనునీతో మాట్లాడను."
    
    నిభాయించుకోలేకపోయాడు త్యాగి......మంటలమధ్య ఆహుతవుతున్న కృష్ణ లేత ముఖమే మనసులో కదలిమెలిక పెట్టిందోలేక సంఘాన్ని అస్తవ్యస్తం చేసే కుహనారాజకీయ నాయకులపై ద్వేషం పెల్లుబికిందో ఓ హెచ్చరికలా అన్నాడు "అవసరంలేదు బ్రహ్మాజీ.....నువ్వు మాట్లాడాల్సిన పనిలేదు. మీ మూలంగా సిలువచేయబడుతున్న భారతం గురించి పత్రికద్వారా ప్రజలతో నేను మాట్లాడతాను.
    
    బ్రతుకు జే గంటల్ని పశువుల మెడలో చిరుగంటలుగా మార్చుకుని మీరు పేర్చుకోవాలనుకుంటున్న భస్మసింహాసనానికి అసలు నిర్వచనాన్ని......
    
    విధ్వంసచలిత
    భయంకరపతనాన్ని.....
    సంక్షుభితమనోద్దరణే
    లక్ష్యంగా చేసుకుని
    సరాగాలేమి జీవన    
    విధానాలుగా చేసుకుని,
    జ్వాలోజ్వనిత
    నిర్గగహన కుహర
    వదంతాకృత వికృత
    ధిద్దదగ్ధ గళోధారలే
    మీతంత్రీ భూతశబ్ద బద్ద
    అక్షరాలుగా చేసుకొని
    మనస్సాక్షిలోపించిన మీరు,
    వస్తినశ్వోద్దసంఘిరంలా
    మసీస్విత అక్షరాల్ని
    అంతఃస్వరలహరులుగా
    కూర్చిమీరంటేమిటో


    నేను ప్రజలకి ఛేదించే శతఘ్నిగా మారి మీ కధల్ని సీరియల్ గా ప్రపంచానికి చాటి చెబుతాను....... బి ప్రిపేర్డ్...... ఆవేశంగా వెనక్కి మరలాడు త్యాగి.
    
    అరగంటవ్యవధిలో యీ వార్త పరమహంసకి చేరింది.
    
    ఇంతపటిష్టంగా వేసిన పథకం త్యాగి ఎలా వూహించగలిగిందీ అర్ధంకాలేదు.
    
    ఒక కృష్ణ ఆత్మాహుతితో మళ్ళీ ఉద్యమంబడబానలమై ప్రభుత్వాన్ని కూలదీయాలని, అప్పటికే కొందరు యువకార్యకర్తల్ని, కాల క్షేపంకోసం చదువుకునే పదిమంది జూనియర్ కాలేజీ విద్యార్ధుల్ని ముందు కూర్చోబెట్టుకుని రేపు ప్రభుత్వ ఆస్తుల్ని ఎలా ధ్వసం చేయాల్సిందీ వివరిస్తున్న పరమహంస సాలోచనగా చూస్తూవుండిపోయాడు చాలాసేపటిదాకా ......    

 

    ఇంటర్మీడియట్ రెండుసార్లు తప్పి యిప్పుడు కార్యకర్తలుగా మారిన యువకులు, అవకాశం దొరికితే చాలు అర్జెంటుగా క్లాసులెగ్గొట్టి జులాయిగా తిరగాలనుకునే విద్యార్ధి ప్రతినిధులూ బీర్లు సేవిస్తున్నారు రేపు చేయాల్సిన పనుల్ని మననం చేసుకుంటూ......    

 

    "ఏమిటంత దీర్ఘంగా ఆలోచిస్తున్నారు "అడిగాడు ముకుందం-చెప్పలేదుపరమహంస..... కృష్ణ బ్రతక్కూడదు. అంతే అతడు కోరుకున్నది...... పరమహంస
    
    కోరికనెరవేరింది ఆ తెల్లవారుజామునే.....డాక్టర్లు ఎంత ప్రయత్నించినా కృష్ణని దక్కించుకోలేకపోయారు. తెల్లవారేదాకా మృత్యువుతో పెనుగులాడిన కృష్ణ సూర్యోదయానికల్లా ఈ ప్రపంచంతో శాశ్వతంగా బంధాన్ని తెంచుకున్నాడు.
    
                                                                   * * *
    
    నగరం అట్టుడికిపోయింది కృష్ణ మరణవార్త వినగానే.....పరమహంస సైతం వూహించలేదు అలాంటి పర్యవసానాన్ని అవసరార్ధం తను కొంతమంది విధ్యార్దుల్ని మందుతో, డబ్బుతో ఆ కట్టుకుని చేయాల్సిందేదోచెప్పి రెచ్చగొట్టాడు కాని వాళ్ళకంటే ముందు జూనియర్ కాలేజీల విధ్యార్ధుల క్లాసుల్ని బాయ్ కాట్ చేశారు.
    
    రోడ్లమీద నడుస్తున్న బస్సులటైర్లతో గాలినితీసేయడంతో బాటు కొన్ని బస్సుల్ని తగలబెట్టడమూ ప్రారంభించారు. రాష్ట్రస్థాయిలో మొదలయిన హింసాకాండ మధ్యాహ్నానికల్లా తారాస్థాయిని చేరుకుంది. ఎవరు విధ్యార్దులో ఎవరు గూండాలో తెలీనిస్థితిలో గుంపులుగా.
    
    ఆవరణలో ప్రవేశించిన ఆ వ్యక్తుల్ని చూసి డిగ్రీ కాలేజి విద్యార్ధులూ క్లాసులనుంచి బయటికి వచ్చేశారు. యూనివర్సిటీ సైతం మూతబడిపోయింది.
    
    ప్రతిపక్షాలు రంగంలోకి దిగి 'అమరజీవి కృష్ణ' పేర్న ఓ సంస్మరణ సంఘం ఏర్పాటు చేయడమేగాక నగరం మధ్య అబిడ్స్ కి 'కృష్ణ నగర్' అని పేరు మార్చాలని తీర్మానించేశారు.......రాష్ట్రం నలుమూలలనుంచి వినవస్తున్న వార్తలతో కలత చెందిన ముఖ్యమంత్రి తన మంత్రివర్గ సహవరులతోనూ సెక్రటరీలతో నూ ఓ అత్యవసర సమావేశం ఏర్పాటు చేశాడు.

 Previous Page Next Page