"సుదీరా! పొలం వాళ్ళ పేరు మీద వుంది. వ్యవసాయం చేస్తోంది వాళ్ళు. వాళ్ళ సాయం లేకుంటే ఏ పని జరగదు కానీ, ఫలసాయం మాత్రం పూర్తిగా తింటోంది మనం. వాళ్ళకి న్యాయంగా రావాల్సిన భాగం ఇవ్వకపోవడం అన్యాయం సుదీర! డబ్బు ఎలా ఖర్చు పెట్ట్టుకోవాలో వాళ్ళకి తెలియదంటే నేను నమ్మను. ఆ మాట కొస్తే వృధా ఖర్చులు మనమూ చేస్తాం. అలాగని మనకి రాకపోతే ఊరుకుంటామా?"
"డబ్బు ఎప్పుడూ కూడా మనీ మేనేజ్ మెంట్ తెలిసిన వాళ్ళ దగ్గరే ఉండాలి భరత్. ఉంటుంది కూడా. అలగాజనానికి డబ్బు ఇచ్చినా, విలువ తెలియక తగలేస్తారు."
సుదీర ఇచ్చిన చెక్కుని భారతి తగల బెట్టేయ్యడం గుర్తు వచ్చింది భరత్ కి. అదే ఎత్తి పోడుస్తోందా సుదీరా? ఆమె మొహంలోకి పరీక్షగా చూశాడు.
"భరత్! ఒక బిలినియర్ అయిన ధనవంతుడిని ఎవరో అడిగారు. ఈ ప్రపంచంలో ఉన్న సంపదని అందరికి సమంగా పంచి పెట్టేస్తే ఎంత బాగుంటుంది! అని. అతను వెంటనే అన్నాడు. 'సరే! మీరన్నట్లే ఇప్పుడు ప్రపంచంలో వున్న మొత్తం సంపదని జనాభా అందరికి పంచేశామనుకుందాం. అప్పుడు ఏం జరుగుతుందో తెలుసా?
కొంతమంది జనం తమకి వచ్చిన వాటాతో తిని, తాగి తందానాలాడతారు. కొంతమంది వ్యభిచారం చేస్తారు. కొంతమంది ఉత్త వాజమ్మల్లా ప్రవర్తించి , మోసపోయి డబ్బు పోగొట్టుకుంటారు.
మరి కొంతమంది అతి తెలివిగా పక్కవాళ్ళని మోసగించి, డబ్బులు గుంజేసుకుంటారు. ఇంకొంతమంది దౌర్జన్యంగా ఎదుటివాడి వాటాను కూడా తమ సొంతం చేసేసుకుంటారు.
అతి కొద్ది మాత్రం తమ వాటాని చాకచక్యంగా ఎ వ్యాపరంలోనో, మరి దేనిలోనో పెట్టి, దాన్ని వందరెట్లు చేసుకుంటారు.
మొత్తం మీద ఒక సంవత్సరం తిరిగేసరికి , సంపద అంతా మళ్ళీ దాదాపు ఇప్పుడున్న పద్దతిలోనే కొద్దిమంది తెలివైన వాళ్ళ చేతుల్లో ఇరుక్కుపోతుంది. అది సృష్టి న్యాయం కూడా. స్ట్రగుల్ ఫర్ ఎగ్జిస్టేన్స్ అండ్ సర్వైవల్ ఆఫ్ ది ఫిట్టేస్ట్! సృష్టిలో ప్రతి ప్రాణి బతకడం కోసం ఆరాటపడుతూ, శామిస్తూ వుంటుంది. కానీ పరిసరాలకు అనుగుణంగా తాము మారుతూ, పరిసరాలని తమకు అనుగుణ్యంగా మార్చుకోగలిగేవి మాత్రమే నిలబడతాయి. అవునా? భూతం అంత బలం వున్న డినోజార్లు అనే రాక్షస బల్లులు భూతలం మీద నుంచి మాయమయి పోయాయని, డోడో అనే పక్షి నామరూపాల్లేకుండా గాల్లో కలిసి పోయిందని, మనిషి భూమికి అంతా యజమాని అయ్యాడని ఎవరైనా గింజుకున్నా ప్రయోజనం ఉండదు.
అలాగే ఈ బతుకు కూడా ఒక పరుగు పందెం లాంటిది భరత్! అయితే పరుగుపందెంలో పొడుగాటి గీతలు గీసి వుండవు. ప్రతివాడు ఆ హద్దులలోనే పరుగెత్తాలని, పక్కకి వెళ్ళిపోయి మిగతా వాళ్ళకి ఆడ్డు రాకుడదని రూలు లేదు. ఇది ఫ్రీ ఫర్ అల్ అంటారే అలాంటిది! ఎవరికి దమ్ములుంటే వాళ్ళు నెట్టుకుంటూ, తోసుకుంటూ ముందుకు పరిగెత్తుకు పోవడమే! బలం లేక, తెలివి లేక, కాళ్ళ కిందపడి నలిగిపోయే వాళ్ళని చూసి జాలి పడుతూ నిలుచుంటే, ఈలోగా మనవి కూడా కిందకు తోసేసి, తొక్కేసి ముందుకు వెళ్ళిపోతాడు మరొకడు."
మౌనంగా విన్నాడు భరత్. ఆమె చెబుతున్నది డబ్బున్న వాళ్ళు తమని తాము సమర్ధించుకోవడానికి చెప్పే అతి తెలివి ఆర్గుమెంటు అని తోచింది అతనికి. వాదనతో నందిని పంది చెయ్యవచ్చు. పందిని నంది చెయ్యవచ్చు.
దూరంగా పెద్ద మేఘంలా ఎర్రటి దుమ్ము లేచింది. ఉరుముతున్నట్లు శబ్దం. క్రమంగా దగ్గరయింది అది. వెర్రి కోపంలో పరిగెత్తి వస్తున్న ఖడ్గమృగంలా దుసుకోస్తోంది ఒక జీపు.
కళ్ళు చిట్లించి చూసింది సుదీర. 'అరె! మన జీపే అది! డాడీ డిల్లి వెళ్ళలేదా? ఇక్కడి కెందుకొస్తున్నట్లు?"
సడెన్ బ్రేకుతో ఆగింది జీపు. దానిలోంచి కిందికి దూకాడు రత్నాకరరావు.
"రేయ్ దశరద్ గజగజలాడుతూ పరిగెత్తుకొచ్చాడు. "నమస్తే దొరా!"
"నీ యవ్వ! దొంగ నమస్కారాలతో మస్కా కొడతా వెందుకురా నీ బతుగ్గాల! మా కొలువులో వుంటూ మాకే ఎసరుపెడతావుట్రా?"
"ఏమయింది దొరా?" అన్నాడు ధశరద్, నోరు తడారిపోతుండగా.
అతని భార్య బాలమ్మా, కూతురు నాగమ్మ, కొడుకు యదయ్యా కూడా తినడం మానేసి పరుగెత్తుకు వచ్చారు.
"దొంగ..........! ఎవర్రా బాంకు వాళ్ళ మీద ఫిర్యాదు రాసి పంపింది?"
కుదుటపడ్డాడు దశరధ్. అదా దొరా! నన్ను బెవకూఫ్ ని చేసిండ్రయ్యా వాళ్ళు! ఐదువేలు అప్పు ఇచ్చినట్లు కాయితం రాయించుకుని పదిహేనువందలే ఇచ్చిండ్రయ్యా! అందుకని అర్జి పెట్టిన!"
"ఎవర్రా నీకు అప్పు ఇప్పిచ్చింది?"
"మన దత్తాత్రేయ సాబ్ దొరా!"
"మరి దత్తాత్రేయ ఎవడురా? నా మనషిరా వాడు! వాడు సిఫారస్ చెయ్యబట్టే నీకు పదిహేను వందలన్నా వచ్చాయి. లేకపోతే నీ మొహం చూసి అప్పు ఎవడిస్తాడురా హౌలే! ఏముందని నీతాని?"
తను మధ్యవర్తిగా వుండి ఐదువేలు ఇప్పించి, పదిహేను వందలు మాత్రమే దశరద్ కు ముట్టచేప్పాడు. దత్త్రాత్రేయ. మిగతా దానిలో సగం తను వుంచుకుని సగం రత్నాకరరావు ఖాతాలో జమ చేశాడు.
"పొలం వుంది గద దొరా! అది తనఖా పెట్టి కూతురి లగ్నం చేస్తే మనుకుంటిమి. పదిహేను వందలే వస్తే లగ్నం చేయ్యనికి చాలా పరేషాన్ అయింది దొరా!" అంది బాలమ్మ కలగజేసుకుంటూ.
"ఏమిటే కూస్తున్నావ్......! పొలం నీ బాబుగాడిదనుకున్నావా? దీన్ని తనఖా పెట్టి కూతురి పెళ్ళి చేద్దామనుకున్నావా? ఏం బలిసిందే నీకు. గుడిసెల్లో దూరే మీకు పెళ్ళిళ్ళు ఎందుకే?.........."
పక్కనే నిలబడి వున్న దశరద్ కొడుకు యాదయ్య కళ్ళు ఎర్రబడ్డాయి. అతను పక్క ఊరి స్కూల్లో ఏడో క్లాసు దాకా చదువు కున్నాడు. ఉడుకు రక్తం.
"బూతులు తిడత వెందుకు దొరా! మాములుగా చెపితే మాకు సమాజవదా?" అన్నాడు దుఃఖంతో అతని గొంతు బొంగురుపోయింది.
"ఏందిబే" అన్నాడు రాత్నాకరావు ఆశ్చర్యంగా. "ఏందిరా నా కొడకా? బూతులు మాట్లాడకుడదని నాకు నీతులు చెప్పేటంతటి వాడివైనావురా! బురదలో పుట్టి బురదలో పొర్లే మీకు మర్యాదలు కావలిట్రా?"
"మర్యాదలక్కర్లేదు దొరా! అవమానం చెయ్యకుంటే అదే చాలు!"
"అవమానమా> మీకా? అని పెద్దగా నవ్వాడు రత్నాకరరావు.
"మనమే లేని వెధవలకి అవమానం ఏమిట్రా? నీ పులుసు దించుతా....."
మధ్యాహ్నపు సూర్యుడిలా తీక్షణంగా అయింది యాదయ్య మొహం. అది చూసి మరి తిక్కరేగింది రత్నాకరరావుకి.
"రేయ్ ఎర్రిగా, బక్కోడా, కర్రోడా, ఈ నాకొడుకుల్ని బట్టలుడదీసి చెట్టుకి కట్టెయ్యండిరా" అన్నాడు పెద్దగా.
అయిదారు మనది మనుషులు పరిగెత్తుకుంటూ వచ్చారు. వాళ్ళతో బాటు కుంటుకుంటూ వచ్చాడు ఇంకొకడు. అతనికి ఒక పాదం మడమ దాకా నరికేసినట్లుంది. రత్నాకరరావుకి కట్టు బానిస లాంటి వాడయిన అతను ఒకసారి వెట్టి చాకిరి తప్పించుకు పారిపోబోవడానికి ప్రయత్నించి దొరికిపోయాడు. తన పని వాళ్ళలో మళ్ళీ ఇంకెవరూ, ఇంకేపుడు అలాంటి ప్రయత్నం చెయ్యకుండా ఉండడానికి గానూ అతని పాదాన్ని గొడ్డలితో నరికేయించాడు రత్నాకరరావు.
పనివాళ్ళందరూ కలిసి దశరధ్ ని, అతని భార్య బాలమ్మని, క్రితం నెలే పెళ్ళి అయి కాళ్ళకు పారాణి అన్నా పూర్తిగా అరని కూతురు నాగమ్మని, కొడుకు యదయ్యని వివస్త్రులను చేసి ఒకే మర్రిచెట్టుకి తాడుతో కట్టేశారు.
నగ్నంగా ఒకళ్ళని ఒకళ్ళు తాకుతూ నిలబడవలసి వచ్చిన ఆ తల్లి కొడుకు, అన్నా చెల్లెలూ , తండ్రి కూతురు దుర్భరమైన అవమానంతో తలలు దించుకుని ఉన్నారు. వాళ్ళ మొహాలు జేవురించి ఉన్నాయి.
"రేయ్! ఆ కారం తెండిరా" అన్నాడు రత్నాకరరావు.
అతని మనుషులు పరిగెత్తుకెళ్ళి అప్పటిదాకా దశరద్ కుటుంబం రొట్టెలతో నంచుకు తింటున్న కొరివి కారం తీసుకొచ్చాడు.
"చూస్తారేరా దున్న పోతుల్లారా పెట్టండి."
అతని మనుషులు ఆ కారాన్ని వాళ్ళ కల్లల్లోను, మర్మాంగాల్లోనూ కురారు.
వెను వెంటనే హృదయ విదారకంగా అరుపులు, కేకలు, పెడబొబ్బలు , ఏడుపులు.
రత్నాకరరావు నిర్దయగా కసిగా నవ్వాడు.
నిశ్చేష్టుడయి చూస్తున్న భరత్ కళ్ళవెంబడి నీళ్ళు ధారాపాతంగా కారిపోతున్నాయి. అది గాలిలో కలిసిన కారపు పొడి ఘాటు వల్ల కాదు. బాధ భరించలేక ఏడుస్తూ, దశరద్ వాళ్ళు నేలని కాళ్ళతో తన్నుతూ ఉంటే రేగిన దుమ్ము వల్ల కాదు.
మానవత్వం మంట గాలిసిపోవడం కళ్ళారా చూడడం వలన అతని కళ్ళు వర్షించడం మొదలు పెట్టాయి. ఇది ఇరవయ్యో శతాబ్దపు చివరి అంచు!
ఈ లోకంలో ఇప్పటికి ఒక బుద్దుడు పుట్టాడు, ఒక మహామ్మదు ప్రవక్త పుట్టాడు. ఒక గాంధీ పుట్టాడు. అయినా మనిషి ఇంకా మారలేదు!
"నా ఉళ్ళో ఉంటూ నాకే ఎదురు తిరుగుతార్రా? రేయ్! ఎండు కట్టెలు ఎరుకు రండ్రా" అన్నాడు రత్నాకరరావు.
అతని నమ్మిన బంట్లు క్షణాల్లో ఎండుపుల్లలు, ఆకులూ ఎరుకు వచ్చి దశరద్ వాళ్ళ చుట్టుతా చితికి పేర్చారు.
"అంటించండి" అన్నాడు రత్నాకరరావు.
"ఆగండి" అన్నాడు భరత్ అప్రయత్నంగా. అంటూనే పరిగెత్తి చెట్టు దగ్గరి కెళ్ళి అడ్డంగా నిలబడ్డాడు.
నౌకర్లు ఆగిపోయి, సందేహంగా భరత్ ని, రత్నాకరరావుని మర్చి మార్చి చూశారు.
"అల్లుడూ!" అన్నాడు రత్నాకరరావు.
భరత్ అతణ్ణి లక్ష్యపెట్టకుండా కట్టెలు, ఆకులూ కాళ్ళతో చిందరవందర చేసేసి దశరద్ కట్లు విప్పాడు.
అప్పటికి సూర్యుడు నడినెత్తి కెక్కాడు. ఆ సూర్యబింబంలా తిక్షణంగా అయింది రత్నాకరరావు మొహం.
------------
ఆ గది సుదీర ఎక్సేర్ సైజ్ చెయ్యడం కోసం ప్రత్యేకంగా కట్టినది. రకరకాల గాడ్గేట్స్ ఉన్నాయి అందులో. ఒకచోట రబ్బరు పట్టాలాంటిది ఉంది! అది నిజానికి ఒక బెల్టు. మెకానికల్ గా వెనక్కి జరిగిపోతోంది. దాని మీద పరిగెడుతోంది సుదీర ఎంత పరిగెత్తినా తను ఉన్నచోటే ఉంటుందన్నమాట. అమెది బిజీ లైఫ్. ఒక వైపు ఎక్సేర్ సైజ్ చేస్తూనే, మరొకవైపు సారధి చెబుతున్న షేర్ మార్కెట్ వివరాలు వింటోంది సుదీర.
"ఈస్టర్న్ ఇండియా హోటల్స్ పది రూపాయల షేరు బాంబేలో మొన్న ముప్పయ్ రెండు రూపాయల యాబై పైసలు నిన్న ముప్పయ్ మూడు రూపాయలు. అదే షేరు కలకత్తా మార్కెట్ లో ముప్పయ్ మూడు రూపాయల అరవై రెండు పైసలు మాత్రమే పలుకుతోంది. ఈస్టర్న్ ఇండియా హోటల్స్ లో మీరు కొన్న షేర్లు బాంబే లో అమ్మేస్తే షేరుకి ఇరవై రూపాయల చొప్పున లాభం వస్తుంది."
కొద్ది క్షణాలు ఆలోచించి, "నో! ఇంకొన్నాళ్ళు ఆగుతాం!" అంది సుదీర.
"బెనారస్ హోటల్సు పదిరూపాయల చొప్పున షేరు పదకొండున్నర అంతే! అది అమ్మేసి వేరే షేర్లు ఏవైనా కొనడం బెటర్!"
"ఏవి?"
"రిలయన్స్ టెక్స్ టైల్స్!"
"ఒకే!"
టెలిఫోన్ అందుకుని బాంబేకి డైరెక్టు దయలింగ్ చేసి స్టాక్ బ్రోకర్ కి ఇన్ స్ట్రక్షన్స్ ఇచ్చాడు సారధి. బెనారస్ హోటల్సు షేర్లు అమ్మేసి ఆ డబ్బుతో ఎన్ని వస్తే ఆన్ని రిలయన్స్ టెక్స్ టైల్స్ షేర్లు కొనమని. ఆ 'విమల్' బట్టల కంపెని షేరు ధర బంగారాన్ని మించి పెరిగింది రెండేళ్ళలో.
"ఫ్యూచర్ లో బాగా ఫేచ్ చేసే షేర్లు ఇంకా ఏమున్నాయ్!" అంది సుదీర.
"అటో మొబైల్స్ కార్స్, స్కుటర్స్, త్రీ వీలర్స్ మంచి ఫ్యూచర్ వున్న ఇండస్ట్రి అది. బజాజ్ అటో వందరుపాయల షేరు ధర ఎనిమిది వందల ముప్పయి ఆరు! లోహియా మెషిన్స్ పది రూపాయల షేరు అరవై రెండు! మహారాష్ట్ర స్కుటర్స్ నలబై తొమ్మిది రూపాయల యాబై పైసలు!"
చటుక్కున స్పురించింది సుదీరకి. తన హొటల్ బిజినెస్ తో పాటు ఒక కార్ల ఫ్యాక్టరి కూడా ఉంటే? అవును! ఎందుకు వుండకూడదు?
ఆమె మొహంలోని భావాలు గమనించాడు సారధి. "ఒక జపనీస్ కంపెని మైక్రో కారు తయారు చేసింది. ముందు ముందు పెద్ద మోడల్ కార్లకి గిరాకి ఉండదు. ముర్చరోగి మంచినీళ్ళు తాగినట్లు పెట్రోలు తాగేసే పెద్ద కార్లని భరించలేరు జనం. పైగా, పెరిగిపోయే ట్రాఫిక్ లో దెయ్యాల్లాంటి కార్లు డ్రయివ్ చేయడం కష్టం! ఫ్యూచర్ లో మైక్రో కార్లదే భవిష్యత్తు అంతా! విపరీతమైన డిమాండు వుంటుంది."
సుదీర పరిగెడుతుంటే, రొప్పుతో ఆమె రొమ్ములు ఎగసి పడుతున్నాయి. పొడుగ్గా బలంగా వున్న తోడలలో మృదువైన కండలు చేపపిల్లల్లా చలిస్తున్నాయి.