కళ్ళు తుడ్చుకుని నవ్వింది జ్యోతి.
"వదినా."
"ఏమిటమ్మా."
"ఏమీ లేదులే" సిగ్గుపడి వెనక్కు తిరిగింది జ్యోతి.
"నాతో చెప్పటానిక్ సిగ్గయితే ఎట్లా, అంత సిగ్గుపడితే ఇన్ని విషయాలెట్లా చెప్పావ్."
నిజమే ననుకుంది స్వాతి.
"బావంటే నాకు ఇష్టమే. కాని బావకు నేనంటే ఇష్టముందో లేదో నాకు బాగా తెలీదు వదినా. నా స్కూలు ఫైనలు తెలివితేటలతో, ఆనర్సు బావను అర్ధంచేసుకోగలనా అని నా అనుమానం."
స్వాతి నవ్వింది.
"మనస్సునీ, హృదయాన్నీ అర్ధంచేసుకునేందుకు డిగ్రీలు అక్కర్లేదు జ్యోతీ! మన మనస్సునీ, చేతలనీ మనం అర్ధంచేసుకుని ఆత్మవంచన చేసుకోకుండా ఉంటే ఇతరుల మనస్సుని పూర్తిగా అర్ధం చేసుకుంటాం" అన్నది.
జ్యోతికి అర్ధంకాలేదు.
"కాలేజీ చదువుల చదివినవాళ్ళే భర్త మనస్సు అర్ధం చేసుకోలే పుట్టింటికి వెళ్ళి ఉద్యోగం చేస్తున్నారు. అలాంటివారిని ఏమనాలి? మరి, వాళ్ళ కాలేజీ చదువుతో భర్త మనస్సును అర్ధంచేసుకోలేకపోయారే. మనస్సుకు మనస్సే సాక్షి అని తెల్సుకున్నప్పుడు అందరి మనస్సులూ అర్ధం చేసుకోవచ్చు. అందుకు మన ప్రవర్తన తగిన సాధన సంపత్తి." అన్నది. జ్యోతి ఎడంగా పోయి చూస్తూ కూర్చుంది. స్వాతి ముఖంలో చెప్పలేని మార్పుని చూసింది. ఈ మార్పుకు కారణం తెలీదు జ్యోతికి.
ఈ మాటలు జానకిరాం కు వినిపించినయ్. "అన్నయ్యా, వదినె చూశావా ఎంత సూటిగా మాట్లాడుతున్నదో. పుట్టింది ఎక్కడో అయినా మెట్టింది విద్వత్ కుటుంబంలో. ఎవరయితేనేం, స్వాతి వదినంటే నాకు ఎంతో గౌరవం. కాలాను గతంగా ఆచరణయోగ్యం కానీ సిద్దాంతాలతో ఆత్మవంచన చేసుకు నా మాదిరి బ్రతికేకన్న, మీరు నడిచిన త్రోవే ఎంతో చక్కగా ఉంది. కరుడుగట్టిన సాంప్రదాయాలతో కఠినాత్ములమై పోయాం మేము. ఆ వాతావరణంలో ఉంటంనుంచే నేనూ ఎందుకూ పనికిరానివాడినిగా తయారవు తున్నానేమో?" అన్నాడు జానకిరాం.
తమ్ముడి ముఖంలోకి చూస్తూ కూర్చున్నాడు కృష్ణమూర్తి. పది సంవత్సరాలుగా దూరంగా ఉన్న తమ్ముడు ఇప్పుడిప్పుడే తమ ఇంటికి రాకపోకలు సాగిస్తున్నాడు. అదయినా గౌతమి పుట్టింటికి వెళ్ళినప్పట్నుంచీ. ఎమ్మే పాసయిన తమ్ముడు ఉద్యోగం చెయ్యకపోయినా, మరదలు ఉద్యోగంలో చేరిందని తెల్సుకున్నందుకు సంతోషించినా, ఆ భార్యాభర్తల మధ్య ఏదో అంతుపట్టని అగాధమైన అడ్డు ఉన్నదని తెల్సుకున్నాడు కృష్ణమూర్తి. ఈ పరిస్థితుల పరిభ్రమణానికి తట్టుకోలేకనే జానకిరాం ఇక్కడికి వస్తున్నాడా? అయితే తమ్ముడి మనస్సు ఏవిధంగా సంతోషపెట్టాలి? తన పరిస్థితులకు తోడు తమ్ముని సంసార పరిస్థితులు కూడా తను చక్కబరచగలదా? కృష్ణమూర్తి ఇదొక కొత్త సమస్య అయింది.
"గౌతమి ఉద్యోగం చేస్తూ అక్కడే ఉండి పోతుందా జానకిరాం."
"ఆ విషయం నాకు తెలీదు. ఉద్యోగంలో చేరే ముందు నాకా విషయం తెలియపర్చలేదు. ఉద్యోగంలో చేరాకనే మా మామగారు గౌతమి ఉద్యోగంలో చేరినట్లు ఉత్తరం రాశారు. బహుశా గౌతమి ఉద్దేశ్యం తన సంపాదన మీద నన్ను కూడా ఆధారపడి ఉండమనేమో" అన్నాడు జానకిరాం.
ఈమాట చెళ్ళున తగిలింది కృష్ణమూర్తికి. తనూ స్వాతి సంపాదనమీద ఆధారపడి జీవిస్తున్న వాడేగా!
"ఆడదాని సంపాదనమీద ఆధారపడి ఉంటం మంచిది కాదంటావా జానకిరాం."
మెల్లిగానే అడిగాడు కృష్ణమూర్తి.
తనను ఎత్తిపొడుపుగా నేనంటున్నానని అన్నయ్య అనుకున్నాడు కామాలు అని మనస్సులో అనుకుని అభిమానపడ్డాడు జానకిరాం.
వాస్తవ ప్రపంచంలోనికి వచ్చినట్లయిందతని.
"మిమ్మల్ని దృష్టిలో పెట్టుకుని నేను మాట్లాట్టం లేదన్నయ్యా. నేన కర్మ సిద్దాంతాన్ని నమ్మినవాడ్ని.అందుకు కట్టుబడి ఉన్నవాడిని.
"ప్రగతే? క్రియా మాణాని గుణై ర్మాణి
సర్వశః
అహంకార విమూఢాత్మా కర్తా హ మితె మన్యతే"
అని కర్మయోగములో చెప్పినట్లుగా, సమస్త మైన కర్మలూ ప్రకృతి యొక్క గుణములచే చేయబడుచున్నవి. కాని అహంకార వశమున మోహమున చిక్కిన మనం, మనమే వీటి నన్నింటిని చేస్తున్నామని అనుకుంటున్నాం కాని, ఈ అహం కార మనేది మనస్తత్వం మీద కన్నా జరుగుబాటు మీద ఎక్కువగా ఆధారపడి ఉన్నది. ఈ జరుగుబాటు ఎక్కువైనకొద్దీ అహంకారమూ ఎక్కువవుతున్నది. గౌతమి మొదట్లో తన మనస్సుని తనే అర్ధంచేసుకోలేక వెళ్ళిపోయింది. ఇప్పుడు జరుగుబాటు ఎక్కువవటం నుంచి అహంకారమూ ఎక్కువైంది. లేకపోతే తన తండ్రిచేత నన్ను అక్కడికి వచ్చి తనతో కాపురం పెట్టమని ఉత్తరం రాయిస్తుందా, పోనీ ఆ ఉత్తరం తనే రాయకూడదా, ఆలోచించండి" అన్నాడు జానకిరాం.
"మరదలు పేరు వింటమే గాని నే నెన్నడూ చూడలేదు. ఆవిడ మనస్తత్వం నాకు తెలియదు. కాని, నీ మనస్తత్వం కూడా నేను సరిగ్గా అర్ధం చేసుకోలేక పోతున్నాను జానకిరాం. నువ్వేదయినా, నీ చదువుకు తగ్గ ఉద్యోగంలో చేరితే ఈ సమస్య సులభంగా తీరిపోతుందిదేమో" నవ్వుతూ అన్నాడు కృష్ణమూర్తి.
"నా మనస్సును నువ్వు అర్ధం చేసుకోలేక పోతున్నావు. నేను చదువుకున్నది ఉద్యోగం చెయ్యటానికి కాదు. కర్తవ్య నిర్వహణ కోసం, చదువు కునే వయస్సులో చదువుకోటం కోసమే. రెండవది విధి నిర్వహణ. విధివశంచేత నీవు మన ఇంటి గుమ్మం తొక్కే యోగ్యత లేకపోయింది. అమ్మా నాన్న వృద్దులైనారు. ఏకోదరులమైన మన ఇద్దరి విధి నిర్వహణా నే నొక్కడినే చెయ్యాలి. అందుచే వారిని కనిపెట్టుకుని ఉంటున్నాను. ఇవాళ ఉద్యోగం ఈ వూళ్ళో ఉండొచ్చు. రేపు ఇంకో వూరు బదిలీ చెయ్యొచ్చు. ఉద్యోగ ధర్మం కన్న వారి సేవధర్మమే నాకు గొప్పది. అదే నా ఉద్యోగధర్మం" అన్నాడు జానకిరాం.
జానకిరాం రెండు అరిచేతులల్లోనూ తన ముఖాన్ని దాచుకుని తన కన్నీళ్ళతో కడిగాడు కృష్ణమూర్తి.
స్వాతి, జ్యోతీ వచ్చారు. ఆ పరిస్థితి స్వాతికి కొంత అర్దమైనా జ్యోతికి అర్ధంకాలేదు.
"అదేమిటి పెద్దన్నయ్యా కన్నీరు పెట్టుకున్నా వెందుకు" అన్నది జ్యోతి.
"కన్నీరు కాదమ్మా, సంతోషం ఆనందంతో తన్మయత్వం చెందవలసిన రెండు ముక్కలు చెప్పాడు తమ్ముడు" అన్నాడు కృష్ణమూర్తి కళ్ళు తుడ్చుకుంటూ.
"సరేగాని, గౌతమి వదినతో నాకు పరిచయం చెయ్యవా చిన్నన్నయ్యా" అన్నది జ్యోతి.
'వీలయినప్పుడు తప్పక పరిచయం చేస్తాను. ఇప్పుడు పుట్టింటికి వెళ్ళింది. ఆ, సరేగాని, మా బాబాయి కూతురు జయలక్ష్మి వస్తుంది రెండు మూడు రోజుల్లో దాన్ని మాటల్లో వోడించావా, మీ బావను తప్పక పెళ్ళి చేసుకోగలుగుతావు. ఏం వదినా నిజమేనా" అన్నాడు జానకిరాం.
"జయలక్ష్మిని నే నెప్పుడూ చూడలేదు అమ్మాయిని చూడాలని నేనూ అనుకుంటున్నాను. అయితే ఈ వేసవికాలం కబుర్లతో హాయిగా గడుస్తుందన్నమాట" అన్నది స్వాతి.
కాసేపు కూర్చుని జ్యోతి వెళ్ళింది.
20
యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్ష లకు గౌతమి తయారవుతున్నది. ఈలోగా ఒక టెంపరరీ ఉద్యోగం నగేంద్రబాల ఆఫీసులోనే ఖాళీ వచ్చింది. ఆ ఖాళీ కూడా అభ్యర్ధుల్ని ఇంటర్వ్యూ కి పెట్టారు. గౌతమికి ఉద్యోగం వచ్చింది.
గౌతమి ఉద్యోగంలో చేరి ఇరవై రోజులయింది. ఆమె ఉద్యోగం చెయ్యడం తల్లిదండ్రులకు అంతగా ఇష్టంలేదు. అన్నగారు అంగీకరించాడు. ధాన్యలక్ష్మి కూడా తన ఆమోదాన్ని తెలిసింది. నగేంద్రబాల ప్రోద్భలం ఉండనే ఉంది.
మొదటి నాలుగయిదు రోజులూ గౌతమికి కొంచం బెరుకుగానే ఉంది. కాని, తనతోపాటుగా ఆఫీసులో అయిదారుగురు ఉన్నారు. వాళ్ళ పరిచయంతో కొంత తేరుకుంది.
ఇప్పుడు గౌతమి నగేంద్రబాల సలహా, సంప్రదింపులులేంది ఏమీ చెయ్యదు. ఆఖరికి ఆఫీసులో కాఫీ, టిఫిను తెప్పించుకుని తినాలన్నా నగేంద్రబాల చెబితేనే వింటుంది.
నగేంద్రబాల వైవాహిక జీవితంలో అనేక వడుదుడుకులకు తట్టుకుని, సహనం నశించి, ఆత్మనూ, వ్యక్తిత్వాన్నీ చంపుకోలేక, తనమీద భర్త నిరాదరణని వోర్సుతో కొంతకాలం సహించినా రానురాను పరిస్థితులు విషమించటంవల్ల గత్యంతరంలేక విడాకులకు వప్పుకున్నది. కోర్టులో ప్లీడరు ప్రశ్నలకూ, సాక్షుల అవకతవకపు సాక్ష్యా లకూ తలొగ్గి అన్ని అవమానాలకు అతీతురాలై చివరకు తన కాళ్ళమీద తాను నిలబడితేనే గాని, ఆమెకు స్వేచ్చగా వూపిరి తీసుకున్నట్లుగా లేదు. అప్పట్లో ఆ పరిస్థితులు అట్లాంటివి. అటువంటి అవాంతర పరిస్థితులూ ఏర్పడినయ్యి. భర్త మనస్సూ తనమీద ఏహ్యభావంతో కరుడుగట్టి పోయింది. కోర్టులో తీర్పు చెప్పిన రోజున తను స్వేచ్చగా నిట్టూర్పు విడిచినా అది తన స్త్రీత్వానికి గొడ్డలిపెట్టుగానే ఉంది. ఆరోజునుంచీ ఇంత వరకూ మళ్ళీ తామిద్దరూ ఎన్నడూ మాట్లాడుకోలేదు. తమ వైవాహికబంధం ఆ రీతిగా తెగిపోయింది. తను ఉద్యోగం చేస్తూ తల్లిని పోషిస్తూ కాలానుగుణంగా మానమర్యాదలు పోగొట్టుకో కుండా జీవిస్తున్నా ఆ జరిగిపోయిన సంఘటనలు శాశ్వతంగా హృదయఫలకం మీద మంచి చెరిగిపోవటంలేదు. తీరని అశాంతి మనస్సులో రగులు తున్నా నివురుగప్పిన నిప్పులా ఉంటమే తప్ప గత జీవితవిశేషాన్ని గురించి ఏ ఆలోచనకూ రావటానికి సావకాశంలేదు. అందుకు కారణం చట్టరీత్యా ఇచ్చిన కోర్టు తీర్పు.
తన జీవితం ఈ రకంగా వెళ్ళిపోతుంటే అనుకో కుండా గౌతమి జీవిత సమస్యల్లో తను జోక్యం కలుగజేసుకొంటున్నది. ఇది ఏ తీరుగా పరిణమిస్తుందో, తన జోక్యంవల్ల గౌతమి కాపురం కుదుటపడేకన్నా చెడిపోవటానికే క్కువ సావకాశం ఉందో తెలీటంలేదు.
ఆరోజు శలవురోజు కావటం నుంచి గౌతమి నగేంద్రబాల ఇంటికి వెళ్ళింది.
"నాగూ, ఆరోజున నీ చరిత్ర కొంతవరకే చెప్పావు. తతిమ్మా సంగతులు కూడా చెప్పవూ" అన్నది గౌతమి.
"నా చరిత్ర విన్నందువల్ల పుణ్యమూ, పురుషార్దమూ లేకపోగా నీ మనస్సు కూడా పాడుచేసుకోటం మినహా మరే ఉపకారమూ జరగదు. గతించిన నా జీవిత చరిత్ర కన్న, నీ జీవితాన్ని సుఖపదం చేసుకోటానికి మార్గం ఆలోచించు. మీవారికి ఉద్యోగంలో చేరినట్లుగా ఇంతవరకూ నీ చేతిమీదుగా ఉత్తరం రాయలేదుగా" అన్నది నగేంద్రబాల.
"లేదే నేను ఉత్తరం రాయలేదు. నాన్నగారే ఉత్తరం రాశారు, ఇక్కడికి రమ్మనమని. దానికి వారు ఇంతవరకూ జాబు రాయలేదు. కారణం నాకూ తెలీదు." అన్నది గౌతమి నిర్లిప్తతగా.
"వారికి ఉత్తరం రాయటంవల్ల నీకొచ్చిన గౌరవం పోతుందా, లేక నాలుగు డబ్బులు వారి కన్న నువ్వే సంపాదించగలుగుతున్నాపనే గర్వమూ."
నివ్వెరబోయింది గౌతమి.
"నాకా ఉద్దేశ్యం లేదే నాగూ నావల్ల తప్పున్నదనుకుందాం. పోనీ, వారయినా ఉత్తరం రాసి నే నెందుకు వచ్చేసిందీ ఇంతవరకూ తెల్సుకోలేదే. ఆమాత్రం బాధ్యత వారికి లేదంటావా?"
గౌతమి ముఖంలోకి సూటిగా చూస్తూ నవ్వింది నాగేంద్రబాల.
"ఎవరి బాధ్యతలు వారి కున్నయ్యి. ఇతరులతో కలహించినట్లుగా మీరూ భీష్మించుకు కూర్చుంటే ఎట్లా? కొంతమందిని నేను చూశాను. చుట్టాలు ఎదురైనప్పుడు బొత్తిగా ఉత్తరం ముక్కయినా రాయటంలేదే అంటారు. పోనీ వాళ్ళు రాసిన ఉత్తరాలకి వీళ్ళు సమాధానం రాయకపోతే ఆమాట మాట్లాడినా అర్ధముంది. వాళ్ళు రాయలేదని వీళ్ళూ, వీళ్ళు రాయలేదని వాళ్ళూ నేరారోపణ చేసుకుంటూ ఉంటే ఈ సమస్య ఎప్పటికి తేలేటట్లు."
మౌనం దాల్చింది గౌతమి.
"ఈ ఉద్యోగమూ, ఆఫీసుఫైళ్ళూ, ఆ కుర్చీలూ బల్లలూ ఆఫీసు బిల్డింగు, పట్టివేళ్ళ తడికెలూ, పంకాలూ నెలాఖరున వచ్చే జీతం డబ్బులు చూసి ఇదే ప్రపంచం, ఈ ప్రపంచంలో నేనూ ఒక మనిషిని, నా కాళ్ళమీద నేను నిలబడి, స్వశక్తి మీద జీవిస్తున్నానని భ్రమపడుతున్నావా."