ఆ రాత్రి తెల్లవార్లూ ఇట్లాగే ఆలోచిస్తూ పడుకుంది. కంటిమీద కునుకులేదు. మురహరి మంచంపక్కనే చాపవేసుకుని పక్కబట్టలయినా లేకుండా పడుకుంది.
మురహరి కదుల్తాడేమో, అతనికి పాలుగాని, కాఫీగని కావాలేమో, తీరా తను నిద్రపోతే అతను తనని నిద్రలేపటానికి ఇష్టపడక అట్లాగే ఉంటే ధారకంలేక శోషవస్తుందేమోనని, కొంత ఆలోచించి నిద్రపోలేదు.
రాత్రి రెండు దాటింది. అప్పటికి మురహరికి మెళకువ వచ్చింది. మెల్లిగా పక్కమీద లేచి కూర్చున్నాడు. అతని కదలికచూసి జయలక్ష్మి కూడా చాపమీద లేచికూర్చునుంది.
"పలుగని, పళ్ళరసంకాని కావాలా మురహరీ" అన్నది జయలక్ష్మి.
"వద్దు జయా, ఏమీవద్దు, నువ్వు ఇంకా నిద్రపోలేదా"
"లేదు మురహరీ, ఏమిటో ఆలోచిస్తూ పడుకున్నాను. నిద్ర రావటంలేదు"
"నాకోసమని నువ్వు నిద్రమేలుకుంటే జబ్బు చేస్తుంది జయా నా పరిస్థితి తల్చుకుంటే నాకే ఆశ్చర్యంగా ఉంది."
"ఏమిటది"
"నాయందు నీకుగల అభిమానానికి నా కృతజ్ఞత ఎట్లా తెల్సుకోవాలో నాకు తెలీకుండా ఉన్నది. ఉపచారం చెయ్యటంలో మా అమ్మను మరిపిస్తున్నావు జయా, ఆవిడా ఇట్లాగే కళ్ళల్లో వత్తులేసుకుని కూర్చునేది నాకు జ్వరం వచ్చినప్పుడు. మళ్ళా అలాంటి మాతృప్రేమనే ఇప్పుడు చూస్తున్నాను."
జయలక్ష్మి మనస్సు గతుక్కుమన్నది. తనకూ కన్న తల్లికీ పోలికా? ఆమెతో తనను పోల్చట మేమిటి? ఇంతకన్న అతని మనస్సుకు ఇంకేరకమైన అనుభూతి తట్టలేదా? కట్టుకున్న ఇల్లాలు మాత్రం ఇలాంటి పరిస్థితుల్లో పరిచర్యలూ, ఉపచారమూ చెయ్యదూ? అలాంటి అనుభూతి అతనికి ఎందుకు కలగలేదో?
ఈ ఆలోచన వచ్చేసరికి ఆమె గుండె ఝల్లు మన్నది. మనస్సులో తెలియని ఆందోళన బయల్దేరింది. నేనెందుకిట్లా అనుకోవాలి? ఇందాకటి నుంచీ ఆలోచించేదేమిటి? ఇప్పుడు అనుకున్న దేమిటి? నాకు తెలియకుండానే అంతా అనుకునే ప్రేమను అతనిమీద చూపుతున్నావా? నా జీవితాన్ని అతనికి అంకితం చేద్దామనే ఉద్దేశ్యంతోనే నేనతనికి పరిచర్యలు చేస్తున్నానా? అయితే నా ఆలోచనల్లో నాకు తెలియని స్వార్ధం రెక్కలు చాచుకోని బయటికి వచ్చిందా?
కన్నతల్లి చేసే పరిచర్యల్లో బిడ్డమీద ఆర్ద్రతతో కూడిన, స్వార్ధరహితమైన మెత్తని మనస్సు ఉంటుంది భార్య చేసే పరిచర్యల్లో, ప్రియురాలు చేసే పరిచర్యలో స్వార్ధపూరితమైన మెత్తని మనస్సు ఉంటుంది. దేహజనితమైన కాంక్షతో, తృప్తి కోసమని ప్రియురాలు సేవచేస్తుంది. మనస్సులో ఏ ఊహలూ లేకుండా, కన్నకడుపుతీపిని, హృదయం లో నిలుపుకుని పరిచర్యలు చేస్తుంది కన్నతల్లి. కాని నా పరిచర్యల్లో నాకు తెలియని భావం ఏదో దోబూచులాడుతున్నదా? నామనస్సులో నాకు తెలియకుండానే ఆ భావం అంకురించిందా?
జయలక్ష్మి మురహరిని చూస్తూ కూర్చుంది. ఆమె కళ్ళార్పలేదు. ఆ సమయంలో ఆమెమనో వీధిలో ఆమెపోయిన భర్త లీలగా కనిపించాడు. పక్కమీద కూర్చోలేక మెల్లిగా మళ్ళా నడుం వాల్చాడు మురహరి. ఆమెతో ఏమీ మాట్లాడలేక పోయాడు.
అతను కళ్ళు మూసుకుని పడుకున్నా జయలక్ష్మి అట్లాగే కూర్చున్నది అతనివైపే చూస్తూ.
తెల్లవారింది. మురహరికి మెళుకువవచ్చి కళ్ళు తెర్చి చూసేసరికి తన రెండు పాదాలమీద తలవాల్చి నిద్రపోతున్నది జయలక్ష్మి.
మెల్లిగా పాదాలను వెనక్కు తీసుకుని పక్క మీద లేచికూర్చున్నాడు మురహరి. కళ్ళుమూసుకుని ఆమె నిద్రపోతున్నా ఆమె ముఖంలో కన్నీటి చారికల స్పష్టంగా చూడగలిగాడు మురహరి.
19
జ్యోతి ఏదో పుస్తకం చదువుకుంటూ కూర్చుంది. ఇంట్లో తల్లి, తండ్రి ఘర్షణ పడుతున్నారు. పర్యవసానం మురహరి పరీక్షలయి ఎల్లుండే వస్తున్నాడనీ రాగానే అతని అభిప్రాయంకూడా తెల్సుకుని జ్యోతితో పెళ్ళి నిశ్చయిదా మనీ తండ్రి వాదన. తల్లీ, తండ్రిలేని ఏకాకిగా నాకూతుర్ని ఇచ్చి చెయ్యటానికి ఇష్టపడనని తల్లి వాదన. వారి మాటలను ఆదుర్దాగా వినటంతప్ప జ్యోతి చెయ్యగలిగిందేమీ లేదు కన్నతల్లి మనస్సు తనకు తెల్సు. ఆమెకు తను ఎంత ప్రయత్నించినా నచ్చ చెప్పలేదు. బిడ్డల మనస్తత్వం తెల్సుకోలేని, తెల్సుకో టానికి మాత్రం ప్రయత్నించని కన్నతల్లి ఆమె. తన మనస్సు తెలిసినవాడు తండ్రి. కాని ఆ ఇంట్లో ఆయనమాట ఎంతవరకు సాగుతుందో ఆయనకే అనుమానం. ఆయన తాలూకాకే తాసిల్దారు గాని ఇంట్లోకాదు. ఇదంతా జ్యోతికి తెల్సు. పరిస్థితులు ఏ తీరుగా వస్తయ్యో వేచిచూట్టం కన్నా తను చేయకలిగిందేమీలేదు మనస్సులో బావమీద మమతలు తనకు తెలియకుండా పెంపొందుతున్నా అవి ఒకదారికి రావాలంటే ఎంత ఘర్షణపడాలో తల్చుకుంటే ఆమె హృదయం ఆందోళనతో నిండిపోయింది,
ప్రస్తుతంలో తన మనస్సు విప్పి చెప్పుకోటానికి స్వాతి తప్ప ఎవరు లేరు. తన భావాలతో ఏకీభవించి తగిన సలహాలివ్వగల సహృదయురాలు స్వాతి.
ఆ సాయంత్రంమే జ్యోతి స్వాతివద్దకు వెళ్ళింది. అక్కడ జానకిరాం కూడా ఉన్నాడు.
"అన్నలిద్దరికీ నమస్కారం." అంటూ అక్కడే చాపమీద స్వాతి పక్కనేకూర్చుంది జ్యోతి.
"ఏమమ్మా కులాసా. మీబావ వద్దనుంచి ఉత్తరాలొస్తున్నయ్యా. మీ అమ్మగారేమంటున్నారు" అన్నది స్వాతి చిన్నగా నవ్వుతూ.
జ్యోతి ముఖం ముకుళించుకు పోయింది.
"వదినా, నన్ను చూడంగానే మా బావ ప్రసక్తి తేవాలనిపిస్తుందా నీకు"
"కాదా మరి, మా చిట్టి మరదలికి ఎవరిమీద ఇష్టతో నాకు తెలుసుకదా మనిషంతదాన్ని పట్టుకుని ఏం జ్యోతి కులాసా అవి అడిగేదానికన్నా, ఏం జ్యోతి బావ కులాసా అని అడిగితే, నువ్వెంత కులాసాగా కబుర్లు చెపుతావో నాకు తెలీదూ"
పకపకా నవ్వారు అనదమ్ములిద్దరూ.
"స్వాతీ, మా చిట్టి చెల్లెల్ని చూస్తే ఎగతాళి చెయ్యాలనిపిస్తుందా నీకు. ఇదిగో జ్యోతి మీబావ ప్రస్తావన తెచ్చినప్పుడల్లా నువ్వు సూటిగా సమాధానం చెప్పెయ్యి." అన్నాడు కృష్ణమూర్తి.
"ఏమని చెప్పమంటారో అదికూడా చెప్పండి మీ జ్యోతి ఇకనుంచీ ఆ మాటలే పల్లెవేస్తూ కూర్చుంటుంది" అన్నది స్వాతి.
"ఏమాటలా. మా బావకేం! నిక్షేపంలా ఉన్నాడు, దర్జాగా ఉన్నాడు. చక్కగా ఆనర్సు పరీక్ష రాశాడు. రేపో మాపో వస్తాడు. పరీక్ష పాసవుతాడు. నన్ను పెళ్ళిచేసుకుంటాడు. అప్పుడు మా భార్యా భర్తలం మీ ఇంట్లో నెలరోజులు మకాం. అని చెప్పు జ్యోతీ తెల్సిందా" అన్నాడు కృష్ణమూర్తి.
జ్యోతి ముఖంలో సిగ్గు తెరలు కమ్ముకున్నాయి. "పోండి మీరంతా నన్ను ఆట పట్టి స్తున్నారు." అంటూ రెండు చేతుల్తో ముఖాన్ని దాచుకుని స్వాతి వళ్ళోకి తలవంచి కూర్చుంది.
ఆ పరిస్థితి చూసేసరికి జ్యోతికి కోపం వచ్చిందేమోనని, ఇంక ఆ మాటలు మాట్లాడవద్ధన్నట్లుగా కళ్ళతోటే కృష్ణమూర్తిని హెచ్చరించింది స్వాతి అన్నదమ్ములిద్దరూ నవ్వుకుని వూరుకున్నారు.
జ్యోతిని మెల్లిగా వీపు నిమిరి లేవదీసింది. స్వాతి. జ్యోతి ముఖం కందగడ్డలా ఎర్రబారింది. ముక్కుళ్ళు ఎగబాలుస్తూ కళ్ళు తుడ్చుకుని అవతల గదిలోకి వెళ్ళింది.
అందరి మనస్సూ చివుక్కుమంది. స్వాతికి చాలా కష్టం కలిగింది.
"చూడండీ జ్యోతి చిన్నపిల్ల కాదు. వయసొచ్చిన పిల్ల. మనమంతా మరీ అంతగా ఆటపట్టిస్తే మనస్సు కష్టపెట్టుకుంటుంది. ఇంకెప్పుడూ అలా అనకండి. నేను వెళ్ళి మాట్లాడుతూ కూచుంటాను. మీ అన్నదమ్ము లిద్దరూ మాట్లాడుకోండి. వదినా మరదళ్ళం బాతాఖానీ వేస్తాము" అని జ్యోతి వద్దకు వెళ్ళింది స్వాతి. "జ్యోతీ ఏదో సరదాకి మీ అన్నయ్య అన్నారుగాని నీ మనస్సు కష్టపెట్టాలని కాదు. చదువుకున్న దానివి. నువ్వూ ఇట్లా క్రీస్తుపూర్వం దానిలా ఉంటే ఎట్లా. ఏమీ బాధపడకు" అన్నది జ్యోతి కళ్ళు తుడుస్తూ.
జ్యోతి కూడా సంబాళించుకుంది. ఆమె మనస్సులో వ్యధ పెట్టే విషయం వేరు. వాళ్ళ మాటలకి చిన్నబుచ్చుకుని బాధపడుతుందేమోనని వాళ్ళనుకున్నారు. ఒకరి పరిభాష మరొకరికి తెలీలేదు. ఒకరి మనస్సు మరొకరికి అర్ధం కాలేదు.
"వదినా, మీరంతా నన్ను ఎగతాళి చేస్తున్నారని కాదు. నన్ను ఎగతాళి చేసినా, కవ్వించి నవ్వించినా మీకన్న నాకు ఆప్తులెవ్వరున్నారు. పదహారేళ్ళు పైబట్టి అమ్మని చూస్తే నాకు భయం. ఆమె మనస్తత్వం తల్చుకుంటే నాకు దిగులు. ఆమె మాటలు వింటే మానవత్వమనేది, జీవితాభిరుచులనేవి ఆమె మానసిక సంపుటంలో లేవేమో ననిపిస్తుంది. ఇవ్వాళ మళ్ళీ పెళ్ళి ప్రసక్తి వచ్చింది. తల్లీ తండ్రీ లేని గతిలేని వాడి కిచ్చి చెయ్యటానికి అమ్మ వప్పుకోదుట. బావ ఏకాకిట. గతిలేని వాడయినా, ఏకాకి అయినా బావ నాన్నకు మేనల్లుడు. ఇష్టమైన మేనరికం కాదంటుంది అమ్మ. అదే నా మనోవ్యధ. బావ ఎల్లుండి వస్తున్నాడు. శలవుల్లో కొన్నాళ్ళు ఇక్కడే ఉంటాడేమో. అమ్మ బావను ఏం తూలనాడు తుందోనని భయంగా ఉంది. నాన్న అమ్మ అభీష్టాలకు వ్యతిరేకంగా పోలేడు. నా జీవితం ఎట్లా తెల్లవారుతుందో నాకే అయోమయంగా ఉంది." అన్నది జ్యోతి. స్వాతి భుజం మీద తల వాల్చి.
స్వాతి అమ్మయ్యో అనుకుంది. జ్యోతి మనోవేదన తమ మాటలవల్ల కాదన్నమాట.
"జ్యోతీ, ఇంతమాత్రానికే బెంబేలుపడిపోతే ఎట్లాగమ్మా. మీ బావను రానియ్యి. మా ఇంటికి రమ్మని ఆహ్వానిస్తాను. నువ్వు నాకు మరదలు వైనప్పుడు అతను నాకు తమ్ముడు. అతనితో మాట్లాడినా తప్పులేదు. తల్లిదండ్రులు కొంత మంది, బిడ్డల మనస్తత్వాలు అర్ధంచేసుకోలేని మాట వాస్తవమే. మన మనస్సు వారికి అర్ధమయ్యే రీతుల్లో ప్రవర్తించటం మన విధి" అన్నది స్వాతి.