"మాట్లాడరేం. వదినా, అంటే తప్పా. అన్న గారి భార్య వదినెకాక మరేమవుతుంది. మీరు వప్పుకున్నా, వప్పుకాకపోయినా వదినా అని పిలుస్తాను. కావాలంటే అన్నగారితో కూడా చెప్పి ఆయనగారి పర్మిషను కూడా తీసుకుందాం ఏం వదినా" అన్నది సంతోషంతో జ్యోతి.
ఫై పళ్ళతో క్రింది పెదవిని అదిమిపట్టి కళ్ళార్పకుండా జ్యోతివైపు చూడసాగింది స్వాతి. ఆ చూపునుంచి తప్పించుకోలేకపోయింది జ్యోతి.
స్వాతి అట్లా చూస్తుండగానే, జ్యోతి ఒక్క సారిగా దెబ్బతిన్న దానిలా ఖంగారుపడిపోయి, ఏమిటో తప్పు చేసిన దానిలా బాధపడి, స్వాతి మనస్సును కష్ట పెట్టానేమోనని బాధపడి, కడుపులో ఉన్న ప్రేమ పూరితమైన అనురాగ స్రవంతి కట్టలు తెంచుకుని పైకి పొంగగా, ఒక్కసారిగా స్వాతి కాళ్ళు పట్టుకుని "క్షమించు వదినా" అంటూ కన్నీటితో పాదాభిషేకం చేసింది. జ్యోతి మనస్సులో ఏ తరతమ భేదమూ లేదు. అలాంటి తరతమ భేదాల జ్యోతికి తెలియవు. ఆమెకు కావలసింది మన సిచ్చి మాట్లాడే వదినె. వస్తు తహ ఈ కోరిక ఈ జన్మలో తీరనిది. ఈ కోరిక తన మనస్సులో ఎప్పటినుంచో ఉన్నది. అది నేటికి ఈ రీతిగా తీర్చుకోవచ్చుననుకుంది. ఇందుకు స్వాతి ఏమీ అభ్యంతరం చెప్పదనుకుంది. కాని స్వాతి అభ్యంతరం ఎందుకు చెపుతుందో అర్ధం కాలేదు. అర్ధంకాని సమస్యగా తనకు తోచలేదు. "పిచ్చిపిల్లా లే. ఎందుకంత ఖంగారు" అంటూ జ్యోతిని లేవనెత్తి తల నిమిరింది.
జ్యోతి కన్నీటితో తడిసిన తన పాదాలను తన చీరె కొంగుతో తుడ్చుకుని, అతడి చెంగుతోనే తన కళ్ళు తుడ్చుకుంది స్వాతి.
"వదినె అనే బాంధవ్యాన్ని స్వీకరించటానికి నేను తగనేమో అనుకుంటున్నాను జ్యోతీ. ఇలాంటి బాంధవ్యాన్ని పదేళ్ళనాడు భగవంతుడు నాకు కల్పించినా ఈ రోజు వరకూ ఆ బాంధవ్యాన్ని అనుభవించి ఆచరణలో పెట్టలేకపోయాను. ఆనాటి కానాడు ఈ కోరిక నా జీవితంలో గగన కుసుమమే అయింది. ఇప్పటికైనా ఈ కోరికా, నీ చేరికతో కొంత వరకూ తీరినా, సంపూర్ణంగా ఏనాటికైనా తీరగల దనే నా ఆశ. ఇందుకు ఆ పరాత్పరుడు కూడా సాయపడతాడనే నా విశ్వాసం" అన్నది స్వాతి చెమర్చిన కళ్ళు తుడ్చుకుంటూ.
ఆమె భావనా వీధిలో శ్రీలక్ష్మి, రత్నమ్మ మెదిలారు. వాళ్ళన స్వాతి 'వదినా' అని పిలవటం గాని, వారిచేత వదినా అనిపిలించుకోవటంగాని ఈ నాటివరకూ జరగలేదు. ఆమె మానసిక వ్యధల్లో ఇది మొదటిది. జానకిరాం తనను 'వదినా' అని పిల్చినా తమ సపూర్ణమైన తృప్తి కలగలేదు. కారణం పాము చుట్టమూ, పడిగె పగా అన్నట్లుగా ఉన్నది అత్తవారితో తన సంబంధం బాంధవ్యాలు.
అవి కుదుటపడి ఒక దారికి వచ్చే తీరు లేకపోగా ఈ కొత్త బాధ్యతలను కూడా ఎక్కడ నెత్తిన వేసుకుని, ఇంకా ఎన్ని అవమానాలు పడాలా అనేదే ఆమె దిగులు.
జ్యోతి ఆంతర్యాన్ని అర్ధం చేసుకున్నాక తన అనుమానాలని వెనక్కు నెట్టవలసి వచ్చింది. వెనక్కు నెట్టింది.
"వదినా పళ్ళు తెచ్చాను" అంటూ జానకిరాం గుమ్మం అవతలనుంచే స్వాతిని పిల్చాడు.
ఆలోచనా లోకంనుంచి ఈ లోకంలోకి వచ్చిన స్వాతి.
"రా, జానకిరాం, మీ కొత్త చెల్లెల్ని చూద్దుగాని" అన్నది.
జానకిరాం గదిలోకిరాగానే జ్యోతి లేచి నిల్చుని నమస్కరించి, "వదినా పెద్దన్నయ్యకు కూడా ఈ చెల్లెల్ని పరిచయం చెయ్యవూ" అన్నది.
ఈ మాటలువిన్న కృష్ణమూర్తి తనే మెల్లిగా లేచి వచ్చాడు.
"మా తోబుట్టువులతో బాటు నువ్వూ ఒక చెల్లెలివి. వారికి మాయందు ఆదరాభిమానాలు లేకపోయినా, రాకపోకలు లేకపోయినా ఆ కొరత నువ్వయినా తీర్చు జ్యోతీ. ఈ కృష్ణమూర్తి అన్నయ్య ఎవ్వరికీ అక్కర్లేదు ఒక్క మీ వదినెకు మినహా. ఏక గర్భ జని తులంకాకపోయినా నువ్వు మా చెల్లెలివే. అప్పుడప్పుడూవచ్చి ఈ అన్నయ్య క్షేమ సమాచారాలు కనుక్కుంటూ ఉండమ్మా" అన్నాడు కృష్ణమూర్తి.
అతని మానసిక పధంలో శ్రీ లక్ష్మి ఒక్కసారి తొంగి చూసి వెళ్ళినట్లయింది.
ఆప్యాయంగా మాట్లాడే కృష్ణమూర్తి ని చూస్తుంటే జ్యోతి మనస్సు ఆనందంతో నిండి పోయింది. ఇలాంటి అన్నయ్యను ప్రసాదించి నందుకు ఆ భగవంతుని ధ్యానించుకుంది.
"చెల్లెల్ని నువ్వు పరామర్శించవేం జానకిరాం అన్నది స్వాతి.
"చెల్లమ్మకి పెద్దన్నయ్య వదినె అంటేనే గౌరవంగాని ఈ చిన్నన్నయ్యమీద అంత ఇష్టత లేదేమో" అన్నారు జానకిరాం నవ్వుతూ.
"నాకా తేడాలూ, బేధాలు ఏం లేవు. నా దృష్టి లో మీ రిద్దరూ పూజనీయులే. నాకు నిజంగా అన్నలు లేరు. సహృదయులయిన ఈ అన్నలను భగవంతుడు ఈనాడు నాకు ప్రసాదించాడు. మీ చెల్లెళ్ళలోనే నొకర్తెను" అన్నది జ్యోతి.
"మాకు చెల్లెలు శ్రీలక్ష్మి వక్కర్తే. పెద్ద తోబుట్టువు మీ అక్కయ్య మీ ఇద్దరికన్న పెద్దది. చెల్లెలయినా మా శ్రీలక్ష్మి ని చూస్తే మాకు భయం. ఇంత పెద్ద వాడినయినా శ్రీ లక్ష్మీ అంటే నేను చురుగ్గానే ఉంటాను. మాకు ఇంకో చెల్లెలు మా బాబాయి కూతురు జయలక్ష్మీ ఉన్నది. విశాఖపట్నంలో ఆనర్సు చదువుతోంది. ఎప్పుడయినా ఈ వూరొచ్చినప్పుడు జయలక్ష్మి మా అందరితోనూ సరదాగా మాట్లాడుతుంది" అన్నాడు జానకిరాం.
"చాలా సంతోషం. ఆవిడను నేనూ చూడాలి. ఆవిడ నాకన్న పెద్దదయితే అక్కా అనిపిల్చుకుంటాను. మా రెండో వదినగార్ని కూడా చూపించి ఆవిడనూ పరిచయం చెయ్యరా అన్నయ్యా" అన్నది జ్యోతి జానకిరాం వైపు చూస్తూ.
"తప్పకుండానమ్మా. ఆ రోజు వచ్చినప్పుడు తప్పక చూదువుగాని" అని అక్కడినుంచి వెళ్ళిముందు గదిలో కూర్చున్నాడు జానకిరాం.
తమ్ముడిని అనుసరించాడు కృష్ణమూర్తి.
బజారు నుంచీ జానకిరాం తెచ్చిన జాకెట్టు గుడ్డ, పళ్ళు జ్యోతికి బొట్టుపెట్టి ఇచ్చింది స్వాతి. జ్యోతి తీసుకోక "ఇవన్నీ ఎందుకు వదినా వద్దు. అమ్మ చూస్తే కేక లేస్తుంది" అన్నది.
"ఏమో చిట్టి మరదలుకు నా చిన్ని కానుక. ఇంక అత్తగారు వద్దంటారా, నే వచ్చినప్పుడు చెపుతానులే. కాకపోయినా కోడంటికమంటే ఎరుగని నాకు మీ అమ్మగారి ద్వారా ఆ కోరిక తీర్చుదువు గాని సరేనా" అన్నది స్వాతి నవ్వి.
పాంగారే సతోషంతో నిండిన మనస్సుతో ఆ జాకట్టు గుడ్డ పళ్ళు తీసుకుంది జ్యోతి.
అన్న లిద్దరి వద్దా, వదినగారివద్ద శలవు తీసుకుని వెళ్ళింది.
జ్యోతి వెళ్ళిన వైపే చూస్తూ నిల్చుంది స్వాతి. "అభమూ, సుభమూ తెలియని అమాయకురాలు. స్నేహానికి ప్రాణాన్నిచ్చే సహృదయురాలు. ఈ మరదలు పిల్లకు మంచి సంబంధం కుదిరేటట్లు చెయ్యి స్వామీ" అని మనస్సులో అనుకుని మళ్ళీ తన తప్పు తనే దిద్దుకుని,
"వాళ్ళ బావ మురహరితోనే వివాహ మయ్యే టట్లుగా ఆశీర్వదించు తండ్రీ" అని స్వామిని ప్రార్ధించుకుంటూ ఇంట్లోకి వచ్చింది.
"ఏం వదినా ఇవాళ కొత్త మరదలును భగవంతుడు నీకు ప్రసాదించాడు. ఆ సంతోషంతో మరిదిని మర్చిపోవుకద" అన్నాడు జానకిరాం.
"తెగిపోయిన బాంధవ్యాల్ని ఒక దారికి తీసుకు రావాలనే నా కోరికగాని, ఇంకా దూరం చేసుకోవాలనే కోరిక నాకు ఎప్పుడూ లేదు. జానకిరాం, ఆయతాజ్ఞులైన వారి కుటుంబంలో పాదం పెట్టి, అందర్నీ దూరం చేసి ఇంత పాపం ఒడికట్టు కోవటం చాలక ఇంకా ఆ నేరాన్నే చెయ్యమంటావా" అంటూ కృష్ణమూర్తి వైపు చూసి కళ్లుత్తుకుంది స్వాతి.
జానకిరాం కృష్ణమూర్తి వైపు చూసి ఏమీ మాట్లాడలేక పోయాడు.
16
"తొమ్మిదో ఏటనే నా జీవితం ఆ రీతిగా తెల్లవారింది. నా పసుపు కుంకుమ శాశ్వతంగా తుడిచి పెట్టుకుపోయింది. ఇదంతా నా కర్మా, జ్యోతిష శాస్త్రంలో మా నాన్నగారికున్న నమ్మకానికి ఇది నిదర్శనమా? అప్పట్లో నాకు ఏదీ బోధపడలేదు. వొచ్చిన బంధువులంతా వెళ్ళిపోయారు. మా మేనత్త నన్ను ఎక్కడికీ పోనిచ్చేది కాదు. బొట్టు పెట్టుకో నిచ్చేది కాదు. ఎప్పుడూ ఇంట్లోనే కూర్చుని ఏం చెయ్యాలి? ఎవరింటికీ ఎందుకని పోకూడదూ? ఎక్కడికీ పోకుండా ఎందుకని ఇంట్లో కూర్చోవాలి? నా తొమ్మిదేళ్ళ వయస్సుకూ, ఈ సమస్య లకు ఏమాత్రం అర్ధం తెలియలేదు.
మా మేనత్త చెప్పినట్లే ఒకటి రెండు నెల్లు మాత్రమే ఎక్కడికీ వెళ్ళలేదు. తిరిగే కాలూ, తిట్టే నోరూ వూరుకోదన్న సామెతగా ఈ కట్టడి భరించలేక ఒక రోజున మా నాన్నని అడిగాము అత్తయ్య నన్ను ఎక్కడికీ వెళ్ళద్దంటున్నది. నేనేం తప్పు చేశాను. అల్లరి చెయ్యకుండా చక్కగా ఆడ కు వస్తా నన్నాను. ఆయన నా వైపు చూసి కళ్ళు తుడ్చుకుని "నీ భర్త పోయారు కనక నువ్వు ఎక్కడికీ వెళ్ళకూడదమ్మా" అన్నారు. నాకూ తెలియని కోపం వచ్చింది. "ఆయనెవరో చచ్చి పోతే నాకేం. నేను చదువెందుకు మానుకోవాలి? ఆడుకోటానికి ఎక్కడికీ వెళ్ళకుండా ఎందుకుండాలి? బొట్టు ఎందుకు పెట్టుకోకూడదు" అంటూ అడిగాను. అయన ఏం చెప్పలేక నన్ను ఎత్తుకుని "తల్లీ, బళ్లోకి వెళ్ళి, ఆడుకోటానికి పో, బొట్టు పెట్టుకో, నువ్వన్నదీ నిజమే. ఆయన ఎవరో చచ్చిపోతే నీ కీ కట్టడీ అంతా ఎందుకు" అన్నారు. నా సంతోషానికి అవధలులేవు. ఇంత బొట్టు పెట్టుకున్నాను. పెట్టెతీసి కొత్త బట్టలు కట్టుకున్నాను. పుస్తకాలు తీసుకుని బళ్లోకి పోయాను ఆ రోజునే.
అంతా నా వైపు ఎగాదిగా చూశారు. కొందరు నవ్వుకున్నారు. కొందరు మాట్లాడలేదు. మేష్టరు మాత్రం కుశల ప్రశ్నలు వేసి సానుభూతి కనుబరిచారు. నా క్లాసులో పిల్లలు సైతం నాతో మాట్లాడలేదు.