నవ్వుతూ మురహరి వైపు చూసింది.
"ఇంకా ఈ ఇరవయ్యో శతాబ్ధంలో అర్ధభాగం దాటినా మీ నాన్నలాంటి వాళ్ళు ఉన్నారన్నమాట" అన్నాడు మురహరి.
"ఎందుకుండరు మురహరీ. డబ్బు గడ్డి తినిపిస్తుంది. గడ్డి తింటే ఒకటేనూ, ఇలాంటివి జరిపించటం ఒకటేనా. సరే. ఒక్క విషయం పెళ్ళిలో జరిగింది నాకు ఇప్పటికే తల్చుకుంటే నవ్వొస్తుంది"
"ఏమిటి జయా అంత నవ్వొచ్చే సంఘటన"
"ఏమిటంటావా, మంగళ సూత్రం కట్టే వేళకు ఆ ముసలాయన నా ముందు నిల్చునే సరికి, తల పైకెత్తి ఆయన వైపుచూసి, చిటికెన వేలు చూపించాను కడుపుబ్బి" అంటూ నవ్వింది జయలక్ష్మి.
"అయితే ఆ ముసలాయన్ని మంగళసూత్రం కట్టకుండా ఆపుచేశావన్నమాట" అన్నాడు మురహరి తనూ ఆ సన్నివేశానికి నవ్వుతూ.
"నేను లేవబోతుంటే మా అమ్మ లేవనివ్వలేదు. ఆయన గబగబా మంగళసూత్రం కట్టి, ఇంక వెళ్ళిరా పిల్లా అని అన్నాడు. వెంటనే పీటలమీదినుంచి లేచాను. ఆ సంఘటనకు అంతా నవ్వుకున్నారు. నాకు ఇప్పటికీ నవ్వుగానే ఉంటుంది"
క్షణంలో సగమైనట్లుగా అంతలోనే జయలక్ష్మి ముఖం విచారంతో ఆవరించింది.
"నా భర్త వూరుకూడా ఆవూరే. నేను బళ్లోకి వెళ్ళి వస్తుంటే నన్ను పిలిచి నాకు రిబ్బన్లు గాజులు ఇచ్చేవారు. అమ్మ కేకలేస్తూ ఉండేది. భర్త అనే భావంతో కాకపోయినా గాజులూ, రిబ్బన్లకోసం నేను బళ్లోకి వెళ్ళి నప్పుడో, వచ్చేటప్పుడో వారింటికి వెళ్ళేదాన్ని. వారు ఒక్కరే వంట చేసుకుని భోజనం చేసే వారు. అప్పుడప్పుడూ అన్నం కలిపి నాకు నోట్లో పెట్టేవారు. చిన్నతనంతో నాకు సిగ్గు తెలిసేది కాదు. నా జీవితం వారిజీవితం తోనే శాశ్వతంగా ముడి పడిందని తెలిసేది కాదు'
"అడ్డొస్తున్నానని అనుకోకు జయా. అంత పెద్దవాడు-ఇంత చిన్న పిల్లను చేసుకోటం ఎందుకు? ఎప్పటికీ కాపురానికి రాను. పెద్ద పిల్లనెందుకు చేసుకోలేదో" అన్నాడు మురహరి.
"చూస్తూ చూస్తూ ఏ పెద్ద పిల్ల వప్పుకుంటుంది. అందుకని ఆయనా ఆలోచించాడు. అదీగాక మా నాన్న చెప్పింది ఆయనకు సంతాన యోగం ఏభై ఎనిమిదో ఏట. అందుకని ఎనిమిదేళ్ళ దాన్ని నన్ను చేసుకోక తప్పిందికాదు. సరే నా పెళ్ళయాక మా అమ్మ పూర్తిగా మంచం ఎక్కింది. అన్నీ మంచంలోనే. ఆ రీతిగా రెండు నెల్లు నరక మనుభవించి, ఇక శాశ్వతంగా కన్నుమూసింది. అమ్మ పోయిం తరువాత మా మేనత్త మా ఇంట్లోనే ఉంటూ వండి పెట్టేది. ఆవిడా చిన్నతనంలోనే నా స్థితికి వచ్చి అష్ట కష్టాలూ పడింది. ఇక నాకూ మా నాన్నకూ నా స్థితికి వచ్చి వండి పెట్టటానికి ఆవిడే శరణ్యమైంది. ఆవిడ పోలికే నాకూ వచ్చిందని తరువాత అంతా అంటూ ఉండేవారు. ఆ రోజుల్లోనే అమ్మ పోయిన దుఃఖం నన్నెంతో క్రుంగ దీసింది. కొన్నాళ్ళు ఒడికి వెళ్ళకుండా ఏడుస్తూ కూర్చునేదాన్ని. మా మేనత్త సముదాయించి ఏదయినా కొనుక్కోమని అణా ఇచ్చేది. దాంతో ఏడుపు మాని బళ్లోకి వెళ్ళేదాన్ని.
"ఇట్లా ఆర్నెల్లు గడిచింది. నాకు తొమ్మిదో ఏడు వచ్చింది. చెప్పటం మరిచాను. పెళ్ళిలోనే మా ముసలాయన నా పేర మూడెకరాలు రాసి రిజిష్టరు చేయించారుట. ఆ సంగతి తరువాత తెల్సింది. ఇట్లా ఉంటుండగా మా ముసలాయనకు జ్వరంతగిలింది. నాలుగు రోజులూ ఎవ్వరికీ నిద్ర ఆహారాలులేవు. రోజు రోజుకూ ఎగ శ్వాస. అంతా నా స్థితి తల్చుకుని జాలి పడేవాళ్ళు. చావుకు సిద్ధ మైన ముసలాయన్ను తిట్టిపోసేవాళ్ళు.
"అయిదోరోజు రాత్రినుంచీ స్మారకం లేదు. నన్నెవ్వరూ ఆయన్ను పడుకోబెట్టిన మరణ శయ్య వద్దకు పోనివ్వలేదు. మా మేనత్త నన్ను కనిపెట్టి ఉండి సాయంత్రం ఏడు గంటలు దాటంగానే అన్నంపెట్టి నిద్ర పుచ్చేది.
"నేను ఆదమరిచి నిద్ర పోతున్నాను. మా మేనత్త అమాంతం నన్ను లేవదీసి తన వళ్ళో కూర్చో పెట్టుకుని గుండెలకు అదుముకుని "నా తల్లీ నా పోలికే వచ్చిందే నీకు. అప్పుడే నిన్ను అన్యాయం చేశాడే దేవుడు" అంటూ రాగాలు పెట్టింది. ముసలాయన దాటిపోయారు. ఆయనతో నాకు ఏ సంబంధమూ లేకపోయినా సాంఘిక కట్టుబాట్ల ననుసరించి నా మంగళసూత్రం ఏదో రోజు పుటుక్కున తెంపారు. సామాన్యంగా కాపురం చేసే పెద్ద వాళ్ళయితే ఆ రోజున వారి బాధ, మానసిక వ్యధ ఎట్లా ఉండేదోకాని, నాకు మాత్రం ఏ దిగులూ అనుపించలేదు. చాకలివాడు నా సూత్రపు తాడును తెంచలేక చూస్తుంటే "ఏం రాఘవయ్యా ఈ తాడు కోసెయ్యటానికి బ్లేడు కావాలా, లేకపోతే మెళ్ళోనుంచి నేను తీసిస్తాను. నువ్వు కావాలిస్తే తీసుకెళ్ళు" అన్నానుట.
"ఆ రోజున నా పరిస్థితి అట్లా అయింది. మా ఇంట్లో ఇంత జరుగుతున్నా మా పెద నాన్న గోపాలశాస్త్రిగారింట్లో ఎవ్వరూ పెళ్ళికి గాని, చావుకుగాని రాలేదు. కారణం నా పెళ్ళికి వారం రోజులు ముందుగానే ఆయన కొడుకు కృష్ణమూర్తి హరిజన కులస్తురాలు స్వాతిని గుంటూరులో పెళ్ళి చేసుకున్నాడు. ఆ గొడవలతో ఎవ్వరూ రెండేళ్ళదాకా మా గుమ్మం తొక్కలేదు.
"ఇదీ నా వైవాహికపు జీవిత కథ. తరువాత కథ మరోసారి. ఇంక వెళదామా" అన్నది జయలక్ష్మి ఇసుక చేతులు దులుపుకుంటూ లేచి నిల్చుని.
బరు వెక్కిన హృదయాలతో మళ్ళీ ఈ ప్రపంచంలో కొచ్చినట్లయింది వారికి.
15
మార్చి నెలలో స్కూలు ఫైనల్ పరీక్షలయి నయ్యి. జ్యోతికి శలవులు. ఆరోజున ఆ సంఘటన జరిగి నప్పట్నుంచీ స్వాతిమీద ఎనలేని గౌరవమూ, సదభిప్రాయమూ ఏర్పడినయ్యి జ్యోతికి. పరీక్ష లయ్యాక జ్యోతికి ఏమీ తోచటంలేదు. తల్లితో ఏం కబుర్లు చెపుతుంది. తనకన్న చిన్న వాళ్ళతో ఏం ఆడుకుంటుంది. ఏమీ తోచని ఆమె మనస్సులో మురహరిని గురించిన ఆలోచనలు అప్పుడప్పుడూ సముద్రపు కెరటాల్లా వచ్చిపడేవి. బావను గురించి ఆలోచనలు కలిగినప్పుడల్లా ఏమిటో తెలియని ఆవేదనతో తనకు తానే సమాధానం చెప్పుకోలేక సతమతమయ్యేది. బావ మనస్సు తనకు అంతుచిక్కటం లేదు. అమ్మ మనస్సు తనకు బాగా తెలుసు. అర్ధంకాని అధికారదర్పంతో ఎప్పుడూ ధుమ ధుమలాడుతూ ఎవరినో ఒకరిని సాధిస్తూ ఉంటమే తప్ప ఆవిడకు మరొక వ్యాపకం లేదు.
కొన్ని కొన్ని ఇళ్ళల్లో కొంతమంది తల్లులుంటారు. వారికి తమ పిల్లల మనస్తత్వాలే అర్ధం కావు. పిల్లలు అర్ధమయ్యేటట్లు ప్రవర్తించినా వారు అర్ధం చేసుకోలేరు. అర్ధంకాని ఆవేశాలతో ఒక్క ముక్కకు పది అర్ధాలు తీస్తూ, సున్నిత హృదయాలను తమ మాటలతో గాయపరుస్తూ తల్లి అనే మాటకు ఏమాత్రం సమన్వయం లేకుండా ప్రవర్తిస్తారు వాళ్ళు నీతి సూత్రాలను పల్లె వెయ్యటానికి పనికివచ్చే పుస్తకాల్లోని తల్లులేగాని, కన్న తల్లుల కుండవలసిన కడుపుతీపి ఉండదు వారికి.
అలాంటి తల్లితో జ్యోతి మురహరి విషయం ఏం మాట్లాడుతుంది?
ఒకరోజున జ్యోతి స్వాతిని చూట్టానికి వాళ్ళింటికి వెళ్ళింది. ఎన్నడూరాని జ్యోతి వచ్చేసరికి అమితాశ్చర్య పడ్డది. తాహసిల్దారుగారి కూతురు తమబోటి వారింటికి రావటమా?
ఎంతో ఆదరణగా పలకరించి ఆప్యాయంగా చెయ్యి పట్టుకుని ఇంట్లోకి తీసుకొచ్చింది.
ఆ సమయంలో జానకిరాం కూడా అక్కడే ఉన్నాడు. అన్నదమ్ము లిద్దరూ మాట్లాడుకుంటున్నారు.
చాపవేసి పక్క గదిలో కూర్చోపెట్టింది జ్యోతిని. ముందు గదిలోకి వెళ్ళి మరదితో మెల్లిగా చెప్పింది.
"తాసిల్దారుగా రమ్మాయి వచ్చింది. రాక రాక వచ్చిన కన్నెపిల్లను వూరికే పంపించకూడదు. మంచి జాకెట్టు గుడ్డ, పళ్ళూ, పూలు తీసుకురండి" అని పది రూపాయల కాయితం జానకిరాం కు ఇచ్చింది.
అన్నగారివైపు నవ్వుతూ చూసి సంచీ తీసుకు బజారు వెళ్ళాడు జానకిరాం.
"జ్యోతితో మాట్లాడుతూ ఉంటాను. మీరే దయినా చదువుకుంటూ ఉండండి. ఒక చిన్నమాట. జ్యోతి అభమూ, సుభమూ తెలియని పిల్ల. మీరూ, మీ తమ్ముడుగారూ మాట్లాడుకునేటప్పుడు మన వంశ ప్రతిష్టల విషయం బయటికి రానీయ కండేం. జ్యోతివింటే బావుండదు" అన్నది మెల్లిగా భర్తతో.
నిర్లిప్తంగా చిరునవ్వు నవ్వాడు కృష్ణమూర్తి. స్వాతి జ్యోతి దగ్గర కొచ్చి కూర్చుంది.
"నిన్ను కూర్చోపెట్టి వెళ్ళి వారితో మాట్లాడుతున్నాను. ఆలస్యమైంది కదూ!....ఏమిటమ్మా సంగతులు. పరీక్షలు బాగా రాసినట్లేనా తరువాత ఆలోచన ఏమిటి" అన్నది స్వాతి.
తెలియకుండా వెన్నుమీద చరిచినట్లయింది జ్యోతికి. కుశల ప్రశ్నల రూపంలో అడిగిన మాటలు హృదయానికి సూటిగా తగిలాయి. తరువాత ఆలోచన ఏమిటి అన్న మాటలో అనేక అర్ధాలు, అనేక టీకా తాత్పర్యాలు. హృదయపు గిన్నెమీద మూత ఎత్తి చూచినట్లయింది.
"రిజల్టు తెలియాలి గా, పేపర్లో నంబరు చూసిం తరువాతనే ఆ పై సంగతి. నాకు మాత్రం చదువుకోవాలనే ఉంది. అమ్మా, నాన్న ఏమంటారో'
హృదయాంతరాళంలో ఉన్న ఆలోచనలు వేరు. ఇవి మాత్రం ఉబుసుపోని కబుర్లే.
"మీ బావ ఆనర్సు చదువుతున్నప్పుడు నువ్వు స్కూలు ఫైనలుతోనే మానేస్తే ఎట్లా. తప్పకుండా పి. యు. సి. లో చేరు" అన్నది స్వాతి.
స్వాతి మాటలు స్వాతి వానలాగే ఉన్నయ్యి జ్యోతి మనస్సుకు. ఈ వాన కురియటానికి ఎన్ని ఉరుములూ మెరుపులూ, పిడుగులూ పడాలో!
"ఆ రోజున మా ఇంట్లో పూజా మందిరం ముందు అట్లా తెలివితప్పి పడిపోయారేం టీచరు గారూ, స్వామి పూనకమా" మాటలు తప్పించే ఉద్దేశ్యంతో అన్నది జ్యోతి.
స్వాతి నవ్వింది.
"మీ బావను గురించి నే నడిగే మాటలు తప్పించటానికే ఈ ప్రస్తావన తెచ్చావా జ్యోతీ. ఏమిటో మైకం వచ్చినట్లయి స్వామి ముందు పడిపోయానని ఆ రోజునే చెప్పానుగా జ్యోతీ, నీకు గుర్తు లేదా?"
తన మనస్సును తానే సంబాళించుకుంది జ్యోతి. తన మనస్సు స్వాతికి తెలుసు. తను మనసిచ్చి మాట్లాడేది కూడా ఒక్క స్వాతితోనే, అలాంటప్పుడు స్వాతితో తను అబద్దం ఎందు కాడాలి.
"గుర్తొచ్చింది. ఏమిటో మర్చిపోయాను. మనం ఏమిటో పిచ్చాపాటి కబురు చెప్పుకుంటున్నాం. అన్నగారు ఏమనుకుంటున్నారో" సిగ్గు పడుతూ అన్నది జ్యోతి.
"మరేం ఫరవాలేదు మీ అన్నగారేగా. ఆయనేమీ అనుకోరులే. సరేగాని. మీ మురహరి బావ దగ్గర్నుంచీ ఉత్తరాలొస్తున్నాయ్యా."
సూటిగా వేసిన ప్రశ్న సూటిగానే తగిలింది హృదయానికి.
"ఉత్తరాలు రావటంలేదు. మా అత్తయ్య బ్రతికున్నప్పుడు ఆవిడకోసం రాసేవాడు. తల్లి పోయాక ఇంక ఎవరి కోసమని, ఎవరికీ ఉత్తరాలు రాయాలి."
తన మనస్సును ఎప్పుడూ తను వేసుకునే ప్రశ్నే స్వాతిని అడిగింది.
"పెళ్ళికాంది నీ పేర ఉత్తరాలు రాస్తే ఏం బావుంటుందని రాయటం లేదేమో మీ నాన్నగారికి రాస్తున్నాడేమో"
సమర్ధించింది స్వాతి. ఆ సమర్ధత ఎంతవరకూ సమర్ధనీయమైందో ఇద్దరికీ తెలీదు. దూరాన ఉన్న వార్ని గురించి దురభిప్రాయంతోనే ఉన్నారని అనుకోవాలని జ్యోతి ఉద్దేశ్యం.
"ఎక్కడో ఉన్న బావ మనస్తత్వాన్ని గురించి మనం చర్చించుకోటం ఎందుగ్గాని, అన్నగారి ఆరోగ్య ఎట్లా ఉంది. గుండె జబ్బని చెప్పారు కదా. డాక్టర్లు ఎన్నాళ్ళల్లో నయమవుతుందని చెప్పారు టీచరు గారూ" అన్నది జ్యోతి.
"గుండె జబ్బనేది త్వరలో తగ్గేదికాదు! జ్యోతీ ఆ జబ్బు గలవారికి విశ్రాంతి అవుసరం. మానసికంగా ఏ విధంగానూ బాధ పడకూడదు. కాని మానసికంగా ఎందుకో ఒకందుకు మధన పడనిమానవు లెవ్వరు జ్యోతీ? ప్రతివారికీ ఏదో ఒక మానసిక వ్యధే" అన్నది స్వాతి.
"మా వదినలాంటి భార్యను చేప్పటిన మా అన్నగారికి మానసిక వ్యధేమిటి? చక్కగా సంపాదిస్తున్నారు. కూటికీ, గుడ్డకీ లేనివారు మానసిక వ్యధకుగురవుతారు. జీవితంలో ఏదో ఒక దెబ్బ తిన్నవారు మానసికంగా కృంగిపోతారు. ఈ అందాల రాశి, సుగుణాల జని, మా వదినె ఉండగా ఆయన కేం తక్కువ" అంటూ కిలకిల నవ్వింది జ్యోతి.
ఈ మాటలతో స్వాతికి అత్యంత సన్నిహితురాలైనట్లుగా మనస్సులో తృప్తి పడింది. జ్యోతి ఇంక ఎప్పుడూ టీచరుగారూ అని పిలవాలని అనుకోలేదు.
"మిమ్మల్ని ఎప్పుడూ వదినా అనే పిలుస్తాను. అట్లాగే పిలవాలని ఉంది నాకు అన్నా వదినెల కొరత మీరే తీర్చాలి" అన్నది జ్యోతి ఆప్యాయతతో స్వాతివైపు చూస్తూ.
ఈ మాటలు వినంగానే మధన పడింది స్వాతి. నే నెవరిని? ఏ కులస్తురాల్ని? జ్యోతికి నేను వదినేగా ఉండగలవా? ఈ బాధ్యత ఈ పిల్ల నా నెత్తిన ఎందుకు పెట్టినట్లు? నామీద గౌరవం చేతనా, ఇష్టత చేతనా? చనువు చేతనా? 'వదినా' అని పిలిపించుకోవటంలోగల అధరాభిమానాలకు పాత్రురాలైనా వర్ణ వ్యవస్థతో సరిపోల్చి చూసినప్పుడు తన స్థానం ఏ పాటిది? వారికి భార్య కనుక ఆ రకంగానే 'వదిన' అనే మాటకు అర్ధం చెప్పుకోవాలా? తమ జీవితం బట్టబయలైనప్పుడు కూడా ఈ జ్యోతి తనను ఇప్పటి గౌరవ మర్యాదలతోనే చూసి, ఆదరించి, ఆప్యాయంగా 'వదినా' అని పిలుస్తుందా? ఈ లేనిపోని వరుసలతో తగిని పెద్దరికాన్ని 'వదినే' అనే పదంతో నెత్తిన వేసుకుని, అంత అంతస్థు నుంచీ ఒక్కసారిగా పాతాళంలోకి త్రోయించుకునే కన్న ఈ గౌరవాన్ని స్వీకరించకుండా ఉంటేనే నయమేమో?
* * *