మంగమ్మ!!
పిడుగు పడ్డది వీరభద్రం మీద.
"ఏమిటీ వెధవ పని? వెర్రి పని? ఎందుకు చస్తావ్? ఏమొచ్చింది నీకు?" కేకపెట్టాడు వీరభద్రం. అతనిలో కోపం పొంగుతుంది. అమాంబాపతు వణుకుతున్నాడు.
"చావనియ్యి , బతకలేను. నీకు ముఖం చూపించలేను. అన్నయ్యా పుణ్యం కట్టుకో. నన్ను వదులు ఎందుకొచ్చినవిట్ల?" అని గింజుకుంటుంది మంగమ్మ ,ఏడుస్తుంది. ఎంతసేపటి నుంచి ఏడుస్తుందో గొంతు పగిలింది. ధ్వని మారింది.
"అగు, గింజుకోకు. నిన్ను చావనియ్యను. నువ్వు జగ్గయ్య భార్యవు. నామీద బాధ్యత ఉంది. చెప్పు ఎందుకు చస్తావో?' ఉరిమాడు వీరభద్రం.
"చెప్ప, చస్త, నువ్వెవరు నన్నడిగెతంద్కి?' గట్టిగా అడిగింది. ఒక్క ఊపులో చేయి విదిలించుకుంది. అడుగు ముందుకు వేసింది బావి వైపు. దబ్బున గంతువేసి పట్టుకున్నాడు వీరభద్రం.
"చస్త మందికి ముఖం చూపలేను. నువ్వెవరు నన్నాపెటాంద్కు? ఇడువు" ఉద్రేకంగా అన్నది మంగమ్మ. చందికలా ఉంది మంగమ్మ, మళ్ళీ ఒక ఊపు ఊపింది. కాని విదిపించుకో'లేకపోయింది.
వీరభద్రానికి ఏమీ తోచలేదు. మంగమ్మ అవతారం ఉగ్రంగా ఉంది. "నువ్వెవరు నన్నాపెటంద్కు " అనే మాటలు మెదడులో గిరగిరా తిరిగాయి. ఏం చేయాలో తోచలేదు. తికమక పడ్డాడు. లాగి చెంప మీద ఒక్కటి వేశాడు. "నేనేవ్వరా? జగ్గయ్య తమ్ముణ్ణి . నిన్ను చావనియ్యను. ఎట్లా చస్తావో చూస్త" అని గొరగోరా లాక్కుపోయాడు. గదిలో వేసి గొళ్ళెం పెట్టాడు.
మంగమ్మ మంచంలో పడిపోయింది. ఎక్కెక్కి పడి ఏడుస్తుంది - వీరభద్రం క్షణం తర్వాత వస్తే బాగుండుననుకుంది. ఆమె కన్నీరు కాలవై పారసాగింది. గుండెలోని మంటలు కృంగదీస్తున్నాయి.
బయట వీరభద్రం స్థితి అయోమయంగా ఉంది. ఏమైంది మంగమ్మకు? ఎందుకు చస్తుంది? ఎవరో ఆమెకు అన్యాయం చేసినట్లున్నారు . ఎవడు వాడు? ఏ పాపాత్ముడు? వాణ్ణి నరికిపారేయాలనుకున్నాడు. తాను మంగమ్మను కొట్టాడు. తనను ఎవరో కొట్టినట్లు ఉలిక్కిపడ్డాడు. ఎంతపని చేశాడు? మంగమ్మనే కొట్టాడు! పరిస్థితులు అలా వచ్చాయి. తానెం చేయగలదు? కొట్టాడు ఎవరిని? మంగమ్మను! జగ్గయ్య భార్యను!
దుఖం ముంచుకొని వచ్చింది.
కన్నీరు కాలవలు కట్టింది.
తరువాత ఇంకిపోయింది.
గుండె తపిస్తుంది. అగ్గి అరదం లేదు.
అసలు జరిగిందేమిటి/ ఎందుకు చావాలనుకుంటుంది?
జరిగిన వైపరీత్యం ఏమి? మంగమ్మనే అడగాలనుకున్నాడు. తలుపు తీసి గదిలో అడుగు పెట్టాడు. మంగమ్మ బావురుమని వీరభద్రం కాళ్ళ మీద పడ్డది. "అన్నా నన్ను చావనియ్యి. నా కడుపుల పాపం పెరుగుతున్నది."
మండిపోయాడు వీరభద్రం.
"మంగమ్మా ! చెప్పు ఆ దుర్మర్గుడేవరో చీల్చి చెండాడుతా' అన్నాడు.
"ఎవరినంటే ఏం లాభం. ఈ పాపం పెరగనీయను నన్ను చావనియ్యి."
"చావు చావు చావు చచ్చి ఏం సాధిస్తావు? పిరికివాళ్ళు చస్తారు. ధైర్యంగా ఎదిరించాలి. ఏం జరిగిందో చెప్పు . చస్తానంటావు బాగుంది. కాని పుట్టబోయే పాపను చంపే హక్కు నీ కెక్కడిది? నువ్వు పాపం చేశావు. మరెవడో పాపం చేశాడు కాని నీ డొక్కలో పెరిగే పాప చేసిన పాపం ఏమిటి? మీ పాపానికి ఆ పాప బాధ్యత ఏమి? ఏ పాపమూ ఎరుగని ఆ పాపనేందుకు చంపుతావు? పుట్టబోయే పాపకోసం నీవు బ్రతకాలి. చెప్పు ఎవరో ఆ దుర్మార్గుడు?"
మంగమ్మ దుఖం ఇగిరిపోయింది. ఆమెలో ఆలోచన తలెత్తింది. తన పాపానికి పుట్టబోయే పాపాదెం బాధ్యత? ఆ పాపను చంపే హక్కు తనకేక్కడిది? అది నిజమే. అ పాప ఎవరి బిడ్డ/ ఎవడు దానికి తండ్రి? ఎలా పెరుగుతాడు? సంఘం తనను బ్రతకనిస్తుందా? అసలు మాట చెపితే వీరభద్రం క్షమిస్తాడా? చెప్పడం తప్పదు. చెప్పాల్సిందే. ఆ నిర్ణయంతో ఆమెకు మళ్ళీ దుఖం పొంగింది. కన్నీరు జలజల రాలింది. కధంతా సంక్షిప్తంగా చెప్పేసింది. చెప్పడం అయిపోవడంతో కూలబడి వీరభద్రాన్ని చూడసాగింది.
కధంతా విన్న వీరభద్రం మంచంలో కూలబడ్డాడు. తల చేతులతో పట్టుకున్నాడు. సాణువులా ఉన్నాడు. ఊపిరి ఆడకుంటే రాతిబొమ్మ అనుకోవచ్చు.
మంగమ్మ రెప్ప వాల్చకుండా వీరభద్రాన్ని చూస్తుంది.
వీరభద్రం నేలను చూస్తున్నాడు.
భయంకర అయిన మౌనం.
ఎవరూ పలకడం లేదు.
ఇద్దరిలోనూ కదలిక లేదు.
రెండు గుండెల్లోనూ అగ్గికొండలు మండుతున్నాయి. రెండు గుండెల్లో తుఫానులూ చెలరేగుతున్నాయి. దావాగ్ని మండుతుంది.
"మంగమ్మ !" మౌనాన్ని భగ్నం చేశాడు వీరభద్రం. గుండెను చీల్సుకుని వచ్చిన పదం అది, "మంగమ్మా! చాలా తప్పుపని చేశాడు రాముడు రక్షసుడుగా మారాడు. అమృతవాణి ఉంటె విషం పుచ్చుకునేది. ఎంత ఉత్తమురాలు ఆ తల్లి! ఎలాంటి బిడ్డను కన్నది!! రాముణ్ణి ఎలా నమ్మావు నువ్వు?
జవాబుగా జన్నీరు జలజల రాలింది మంగమ్మకు.
"ఇప్పుడు ఏడ్చి ఏం ప్రయోజనం? మరెవడైనా అవుతే దండించి ఒప్పించే వాణ్ణి . కాకుంటే కాళ్ళు పట్టుకొని బ్రతిమిలాడేవాణ్ణి. రాముని విషయంలో రెండూ చేయలేను "
మంగమ్మ అమాయకంగా చూసింది.
కరిగిపోయాడు వీరభద్రం. "ఈ అమాయకత్వాన్నే వాడుకుంటున్నారు వాళ్ళు. దోచుకుంటున్నారు. ఎక్కడ కాటువేయ్యాలో వాళ్ళకు తెలుసు. అన్ని తెలిసి మనం గోతిలో పడుతున్నాం - అయినా ప్రయత్నిస్తాను. నీకోసం వాడి ఇంటికి వెళ్తాను. దేహి అంటాను. ఏమైనా నువ్వు చావడానికి వీల్లేదు. నీ పాప బ్రతకాలి " అని చివాలున లేచి సాగిపోయాడు వీరభద్రం.
మంగమ్మ అతణ్ణి అడ్డగించలేకపోయింది. చూస్తూ నుంచుంది. ఆమెకు తెలుసు రానున్న పరిణామం. అందుకే బేలగా చూచింది. అబలగా చూచింది. ఆరాటంగా చూచింది. ఆవిడలో అగ్నిపర్వతం బ్రద్దలైంది. లావా ప్రవహించింది. నోట్లో కొంగు కుక్కుకొని మంచంలో పడిపోయింది.
మంగమ్మలోని మధనకు అంతులేదు. అది వర్ణించడానికి అక్షరాలు లేవు. ఆ బాధ అక్షరం అయింది. ఆమెలో సముద్రాలు పొంగాయి. తుఫానులు రేగాయి. అగ్గి కొండలు బద్దలైనాయి.
అనంతమైన ఆలోచనలు అల్లుకున్నాయి. తాను ఆశించిందేమిటి? అయిందేమిటి? వాస్తవంగా తానేమైన ఆశించిందా? స్మృతి పదానికి అందినంతవరకు చూచింది. వాస్తవంగా తానేమీ ఆశించలేదు. అయితే ఈ పరిణామాలేమిటి? తాను రాముడికి లొంగింది. అది నిజం. తనలో ఏ లోపం ఉంది? ఎందుకు లొంగింది? తనలో ఏదో కోరిక రగిలింది. కాదు రగిలించాడు రాముడు. అది సామాన్యమైంది. సహజమైంది. సర్వ ప్రాణు;లకూ కలిగేదే. అన్నం ఎవడు పెట్టినా తినవచ్చు. నీరు త్రాగవచ్చు. ఆశ్రయం ఇచ్చినవాని అండన ఉండవచ్చు. కాని ఈ కోరిక అందరివల్ల తీర్చుకోరాదు. తీర్చుకుంటే పాపం. సమాజం దాని ఏహ్యంగా భావిస్తుంది. నీచంగా చూస్తుంది. ఇందుకు కారణం ఏమిటి? ఎవరు ఇందుకు కారకులు? ఒక్క క్షణంలో కలిగిన ఇంద్రియ దౌర్భాల్యానికి ఇంత శిక్ష అనుభావించాలా? అసలు రానున్న పాప ఎవరు? అది ఎందుకు రావాలి? తాను పిలిచిందా? పిలవనిది ఎందుకు రావడం! ఈ అనాధ బిడ్డగా ఏం బాగుకుంటుంది! తననే ఈసడించుకొనే లోకం తన బిడ్డను సహిస్తుందా! వీల్లేదు. అది రారాదు. పుట్టని బిడ్డ మీద ఆమెకు కోపం పెల్లుబికింది. అమాంతంగా లేచి కూచుంది - "రావద్దు నువ్వు రావద్దు 'అని అరుస్తూ పొట్ట గుద్దుకో సాగింది. ఆమె మనసులో ఏదో కేక వినిపించింది. అది 'అమ్మ' అన్నది. అమ్మ కరిగిపోయింది. ఆమెలో అనురాగం పొంగింది. మాతృత్వం పొర్లింది. అవి రానున్న పరిణామాలను మరిపించాయి. అసలు ఆమె ఎన్నడూ వాటిని గురించి ఆలోచించినట్లే తోచలేదు. "బిడ్డా" అని ఏడ్చింది మంగమ్మ. తాను చేసిన చేయబోయిన పనికి పశ్చాత్తాపంతో కుమిలిపోయింది, కుంగిపోయింది. కూర్చున్నది కుర్చున్నట్లే మోకాళ్ళ మీద తలపెట్టుకుని వలవలా ఏడ్చింది. చంటి బిడ్డలా ఏడ్చింది. బిడ్డ అప్పటికే పోయిందేమో అన్నట్లు ఏడ్చింది. ఏడ్చి ఏడ్చి అలసిపోయింది. కన్నీటితో కడుపు చెరువైంది. ఆ చెరువులో మునగసాగింది తేలసాగింది.
వీపుకు కళ్ళు లేవు. వెన్ను దేనిని చూడలేదు. అందుకే మంగమ్మ ఘోష చూడలేకపోయాడు వీరభద్రం. అతనిలో వున్న తపన వేరు. మంగమ్మ కాలు జారింది. ఆమెను బయటకు లాగాలి. అతనిలో రాముడి మీద కోపం పెల్లుబుకుతుంది. దాన్ని అణుచుకోవడానికి శతధా ప్రయత్నిస్తున్నాడు. అతని ఆలోచన గాలి లేని దీప శిఖలా వెలుగుతుంది - నిశ్చలంగా అయినా అతడు సాగిపోతూనే వున్నాడు. ధ్యాస ఎక్కడో వుంది. మస్తాన్ పిలుపు వినలేదు. మస్తాన్ ఉరికి వచ్చి అడ్డుగా నుంచున్నాడు. వీరభద్రం ముందుకు వెయ్యబోయి నిలదొక్కుకున్నాడు.