Previous Page Next Page 
ఎండమావులు పేజి 19


    ఆలోచిస్తూ కూర్చుంది గౌతమి. అప్పటికి ఉదయం ఎనిమిది గంటలు దాటింది. గౌతమి అన్నగారు గోపీనాద్ ఆఫీసుకు వెళ్ళాడు. తండ్రి వరండాలో ఎవరితోనో మాట్లాడుతున్నాడు. తల్లి వంట పనిలో నిమగ్నురాలై ఉన్నది. ధాన్యలక్ష్మి పిల్లవాడికి పాలు పెడుతున్నది. ఆ ఇంటికి పాలు పోసేవాళ్ళు ఇద్దరు. కాఫీ పాలు ఉదయం అయిదింటికల్లా ఒకరు తెచ్చి పోస్తారు. రెండో అతను ఎనిమిది గంటల దాకా పొరుగూరు నుంచి తీసుకువచ్చి పోస్తాడు. ఆ పాలు తోడు పెట్టుకోటానికి. వాకిట్లో పాల మనిషి అరుస్తున్నాడు. ఆలోచన లతో నిమగ్నురాలైవున్న గౌతమి ఆ కేక వినిపించుకోలేదు. ధాన్యలక్ష్మికి వినిపించినా, పిల్లవాడికి పాలు పెడుతూ ఉంటంనుంచి వీలు కాలేదు.
    "ఈ ఇంట్లో అంతా తిని కూర్చుని కబుర్లు చెప్పేవారే కాని దమ్మిడీ పనికి ఆస్కారం లేదు. ఎవరికీ తప్పినా నాకు తప్పదు కదా" అంటూ విసుక్కుంది ధాన్యలక్ష్మి. గౌతమికి వినబడే టట్లుగా.
    ఈ మాటలు విన్న గౌతమి లేచి వెళ్ళి గిన్నె తెచ్చే లోగానే, పాలు తాగే పిల్లవాడి నోట్లో నుంచి పాల సీసా విదిలించి లాగేసి, గిలగిల తన్నుకుని ఏడుస్తున్న పసివాడ్ని కిందకుదేసి కూర్చోబెట్టి మొహం కందగడ్డల్లే చేసుకుని విసవిస లాడుతూ వంటింట్లోకి వెళ్ళి అక్కడ బోర్లించి ఉన్న గిన్నె లన్నీ చప్పుడయ్యేటట్లుగా పాలు పోయించుకునే గిన్నె లాగి, వీధిలోకి వెళ్ళి పాలు పోయించుకుని కోపంతో ఇంట్లోంచి వచ్చింది. తన ముందుగా వెళుతున్న తల్లి కాళ్ళు చుట్టేసి తల్లిని కదల నియ్యలేదా పసివాడు.
    "ఉండరా వెధవా వస్తున్నాను" అంటూ వాడిని విదిలించుకోబోయేసరికి అప్పుడే వాడు పోసిన ఉచ్చలో కాలుజారి పడ్డది ధాన్యలక్ష్మి. పాలన్నీ నేల పాలయినయ్యి. నున్నటి గచ్చు నేలేమో కాలు జారింది. ధాన్యలక్ష్మి కి మడిమ నెప్పట్టింది. పిల్ల వాడి ఒళ్లంతా పాలతో స్నానం చేయించినట్లయింది. వాడూ గుక్కపట్టి ఒకటే ఏడుపు.
    గౌతమి ఇదంతా చూసి, నిర్విన్ను రాలైంది. తనమీద కోపం ఈ తీరుగా పరిణమించిందనుకుంది. అత్తగారు ధాన్యలక్ష్మి ని కేక లేసింది. కాస్త చూసి నడవకూడదా" అని.
    ధాన్యలక్ష్మి చిన్నబుచ్చుకుంది. నేల పాలైన పాలన్నిటినీ గుడ్డతో తుడిచి ఇల్లంతా కడిగింది పసివాడి వళ్ళంతా పాలతో స్నానం చేయించినట్లవటం చేత వాళ్ళకి మళ్ళీ తలంటి పోసింది. ఆ పూటల్లా వదినా మరదళ్ళు మాట్లాడుకోలేదు.
    మధ్యాహ్నం భోజనాలయాక గౌతమి వదినె గార్ని పలకరించింది.
    "వదినా పాలు నన్ను పోయించుకోమంటే నేను పోయించుకోనా. పసివాడి నోట్లో పాలసీసా లాగి వాణ్ణి ఏడిపించి పాలు పోయించుకోవాలా" అన్నది మెల్లిగా.
    ధాన్యలక్ష్మి అభిమానం దెబ్బ తిన్నట్టయింది.
    "ఎవర్ని పిలిస్తే ఎవరూరుకుంటారు వదినా ఎవరికీ తప్పినా ఎవరు తప్పించుకున్నా కోడల్ని కనక నాకు తప్పదు. ఇవాళ నా ఖర్మకాలి ఇట్లా అయింది. గాని, రోజూ ఇట్లా జరుగుతుందా ఒక వేళ జరిగినా వూరుకుంటారా" అంటూ సాగదీసుకుంది ధాన్యలక్ష్మి.
    గౌతమి మనస్సు చివుక్కుమన్నది. తను అత్తింటినుంచి పుట్టింటికి చేరి తమసొమ్ము తింటూ వుంటం నుంచే ధాన్యలక్ష్మి ఇట్టా సూటీ పోటీ మాటలు అంటున్నదని గ్రహించుకున్నది. నిజమే! తిని కూర్చోటం మినహా తను పుట్టింటికి చేరి చేస్తున్న ఘన కార్యం ఏముంది? కేవలంగా తన భర్త సంపాదనే కాకపోయినా తమడబ్బు కూడా కొంత కలవటంనుంచే ధాన్యలక్ష్మి ఆ తీరుగా మాట్లాడుతున్నదని అనుకుంది గౌతమి. సంపాయించే భర్త ఉన్నప్పుడు భార్య మాట్లాడే మాటలు ఆ తీరుగానే ఉంటయ్యి. ఆ మాటల్లో కార్పణ్యము, ధీమా, నిరసన భావమూ కనబడుతయ్యి. సంపాదనపరుడయిన భర్తను కట్టుకున్న భార్య మాటల్లో విలువ ఉన్నది. పలుకుబడి ఉన్నది. మాట చెలామణి చేసుకోగల స్తోమత ఉన్నది.
    మరి తనకో? భర్త సంపాదనపరుడు కానందువల్ల ఏ మాట మాట్లాడినా విలువ లేదు. ఆ మాటలను ఎవ్వరూ పట్టించుకోరు. హీనంగా, తక్కువగా చూస్తారు. తనకు తల్లోకి పూలు కావలసినా, తలకు నూనె కావలిసినా, జాకెట్టు గుడ్డ కావలసినా అత్తగార్ని అడగవలసిందే. అత్తగార్ని అడిగితే ఆవిడ శ్రీలక్ష్మికి చెపుతుంది. శ్రీలక్ష్మి తండ్రికి చెపుతుంది. ఆ ముసలాయన నాలుగు విసుక్కుని, తనను తాను తిట్టుకుని, కొడుకును నాలుగు తిట్టి దమ్మిడీ సంపాదిద్దామనే జ్ఞానమయినా లేదని పదిసార్లు విసుక్కుని ఏ రెండు మూడు రోజులకో ఆ వస్తువు పట్టు కొస్తారు. అంత వరకు నోరు మూసుకుని తను పడి ఉండవలసిందే. తను ఇంటరు ప్యాసయినా, తన భర్త ఎమ్మే ప్యాసయినా జీవితాలు అట్లా వెళ్ళవలసిందే. తామిద్ధర్ని ఆ భగవంతుడు కూర్చినందుకు చెప్పాలి, అనుకుని నిట్టూర్పు విడిచింది గౌతమి.
    ధాన్యలక్ష్మి అట్లా ఏవో మాట్లాడేసరికి మరేం సమాధానం చెప్పలేక వూరుకుంది గౌతమి.
    మర్నాడు ఆదివారం కావటంనుంచి నగేంద్ర బాల ఇంటికి వెళ్ళింది గౌతమి.
    గౌతమిని చూడగా నగేంద్రబాల ఆఫీసుకాయితాలు కట్టేసి కూర్చోమని కుర్చీ చూపించింది.
    "ఏం గౌతమీ, కులాసా." అన్నది పెన్ తీసి డ్రాయరులో పెడుతూ.
    "ఆఫీసులోనే కాక ఇంటివద్ద కూడా కాయితాలు రాయాలా నాగూ. అంత పని ఉంటుందా ఆఫీసులో" అన్నది గౌతమి.
    "ప్రస్తుతం పని ఎక్కువగానే ఉందే గౌతమీ! ఆదివారం నాడు కూడా ఆఫీసుకు ఎక్కడ పోవని ఆ కాయితాలు యిక్కడికే తెచ్చుకుని రాసుకుంటాను."
    "అయితే మీ శ్రీవారి గుణాల్లో కొన్ని అబ్బినయ్యన్నమాట" అన్నది గౌతమి నవ్వుతూ.
    "ఆ ఆర్నెల్లు సహవాసం చేస్తే వారు వీరవుతారని సామెత ఉండనే ఉన్నదిగా. సరేదాని కేంగాని మీ శ్రీవారు ఉత్తరమేమయినా రాసారా"
    "ఉత్తరమూ లేదు పత్తరమూ లేదు" అన్నది గౌతమి నిర్లిప్తతగా.
    "పోనీ నువ్వయినా రాయక పోయావా"
    "నేనూ రాయలేదు. ఆపేక్ష అంతఃకరణ అనేది భార్యా భర్తలిద్దరిలోనూ ఉంటేనే ఆ కాపురం రాణిస్తుంది. ఒక వేళ వారు నన్ను ప్రేమిస్తున్నా నేను తిరిగి తమ వద్దకు రావాలని వారు అనుకున్నా, ఏదో సామెత చెప్పినట్లుగా ఈ రోజుల్లో మతి లేక పోయినా బ్రతకొచ్చు గాని డబ్బు లేక పోతే ఎంతుకూ పనికి రాము. చెప్పు కుంటే సిగ్గు చేటు. వారి చేతి మీదగా ఒక్కటీ కోని పెట్టలేదు. కనీసం ఒక్క జాకెట్టు కూడా కుట్టించలేదు. ఏం చేస్తారు. ఉద్యోగం చెయ్యరు! ఏం మాట్లాడినా వైరాగ్యం. ఎంతసేపూ పురాణాలు వింటూ పురాణ గ్రంథాలు చదువుతూ, స్నానాలు జపాలు చేస్తూ కూర్చుంటారు. పోనీలే గౌతమి వెళ్ళితే వెళ్ళింది. కాస్త ఖర్చయినా తప్పుతుంది అనుకునుంటారు అంతా."
    పేలవంగా నవ్వింది నగేంద్రబాల.
    "అయితే ఇంక వారి వద్దకు వెళ్ళదల్చుకోలేదా గౌతమీ. అసలు ఏ పరిస్థితుల్లో ఇక్కడికి వచ్చేశానంటావ్"
    "ప్రత్యేక పరిస్థితులేమీ లేవే నాగూ వారి ప్రకృతి వేరు. సామాన్యంగా అర్ధం కావటం కష్టమే. వారు నన్ను ఎంతో ఇదిగా ప్రేమిస్తారు. ఆపేక్షగా ఉంటారు. ఏమిటి లాభం? నేను నిన్ను ప్రేమిస్తున్నానని నా ఎదురుగా వారూ వారికి ఎదురుగా నేను కూర్చుంటే పొట్ట గడుస్తుందా? జీవితాలు గడుస్తయ్యా, అదీగాక వారు ఉద్యోగం చేసినా నేను వారి చదువుకూ, హోదాకూ తగనట. ఒకరోజున నాతో అన్నారు, గౌతమీ నేను ఏ ఉద్యోగం చెయ్యాలని ఉంది నీకు? అని. లెక్చరరుగా చేరి ప్రిన్సిపాలుగా రిటైరవాలని నా కోరిక అన్నాను. వారి హోదాకు నేను తగనట. అంతా నన్ను చూసి మందమతి అంటారట. ప్రిన్సిపాల్ గారి భార్య ఇంత మంద మతేమిటా అని అనుకుంటారుట. ఇంక చెప్పు నాగూ వారి మనస్తత్వం ఎటువంటిదో. ఇంటరు ప్యాసయినా నాకు ఇంగిత జ్ఞానం లేదుట. ఇట్లాగే మాట మీద మాటొచ్చి మనస్సులో బాధ పడి ఉండలేక వచ్చేశాను. ఆ రోజు అటువంటిది అన్నది గౌతమి కళ్ళొత్తుకుని.
    నాగేంద్రబాల మనస్సు అగాధమైనది. అంతుచిక్కనిది. ఆమె భావాలు అప్పుడప్పుడు ఊయల ఊపులా ఉంటయ్యి. స్థబ్దత అనేది ఆమెలో ఎన్నడూ లేదు. తనతో పరిచయ మున్న ప్రతి వ్యక్తి మనస్తత్వమూ కాచి వడపోస్తేనేకాని వారి విషయంలో తను ఏ నిర్ణయానికీ రాలేదు. కారణం తన జీవిత గమనాన్ని ఈ మలుపుకు తనే తిప్పుకుంది. జీవిత గమనాన్ని ఈ రకంగా తిప్పుకున్న జీవితం ఆ వైపుకే తిరగటానికి వెనకాడుతోంది.
    "గౌతమీ నువ్వు పొరపాటు చేశావని నా అభిప్రాయం. ఆపేక్ష అంతః కరణలకు ఉద్యోగం చేత డబ్బులు తేవటమే ధ్యేయం కాదు. లక్ష్మీదేవి ఈ నాడు మీ దంపతులకు దూరమైనా జీవితాంతమూ దూరంకాదు. నీ భర్త సరస్వతీ పుత్రుడు లక్ష్మీదేవి కూడా వార్ని ఎప్పుడో ఒకప్పుడు పలకరిస్తుంది. ఈ చిన్న కారణం చేతనే కాపురం పాడు చేసుకో దల్చుకోవటం వివేకమైన పనికాదు. చేతులు కాల్చుకున్న తరువాత ఆకులు పట్టుకుని లాభం లేదు. నువ్వేదో చిన్న సంఘటనకు బాధ పడి వచ్చేశానే తప్ప మరేమీ లేదు. నీ భర్త దేవుడు" అన్నది నగేంద్రబాల.
    ఆశ్చర్యంతో చూసింది గౌతమి. నగేంద్రబాల అంతరాంతర కల్లోలంతో కళ్ళు మూసుకుంది. ఆమె మనస్సులో అనేక సంఘటనలు సుళ్ళు తిరుగుతున్నాయ్. అన్నీ గతించిన సంఘటనలే. కొన్ని మర్చిపోవాలిసినవి. కొన్ని మర్చి పోలేనివి.
    కళ్ళు తెరచింది నగేంద్రబాల. రెప్పలు ఆర్పకుండా గౌతమి ముఖంలోకి చూస్తూ.
    "భర్తను విడిచి పెట్టినదాన్ని. కోర్టు ద్వారా భవబంధాలు తెంపుకున్నదాన్ని. భర్త అనురాగాన్ని చవి చూడని దాన్ని. నా సలహాలు నీ జీవితాన్ని తీర్చి దిద్దటానికి పనికి రావేమో గౌతమి" అన్నది.
    ఆమె మాటల్లో గాంభీర్యం, నిరాశ, కటువు స్పష్టంగా చూసింది గౌతమి. ఏమీ సమాధానం చెప్పలేక పోయింది.
    "అయితే నేను కూడా విడాకులు పుచ్చుకునే ఉద్దేశ్యంతో నీ సలహా అడుగుతున్నా ననుకున్నావా నాగూ" అన్నది గౌతమి ఆశ్చర్యపడుతూ
    నగేంద్రబాల దెబ్బ తిన్నదానిలా విచలితురాలైంది. గౌతమి తనను ఎత్తి పొడుపు మాటలతో ఇంకా క్రుంగదీయాలని చూస్తున్నదా అని అనుకున్నది. ఆమె మనస్సులో తన భర్త, కోర్టు ప్లీడర్లు, జడ్జి, ప్లీడర్ల సవాళ్లు అన్నీ సినిమా రీళ్లలా గిరగిర తిరిగాయి. ఆ జీవితమంతా ఒక కలలా కరిగి పోయింది. జీవిత సమస్యల్ని పరిష్కరించుకోలేక ఈ స్థితికి వచ్చిన తన్ను గౌతమి సంసార క్షోభ వినటం కూడా అనవసరమేమో ననుకుంది. ఒక వేళ విన్నా తన సలహాకు విలువ ఉంటుందా. తన కాపురాన్ని దిద్దుకోలేనిది గౌతమికి ఏం సలహా ఇవ్వగలదు? "నా మాదిరే నీ జీవితాన్ని కూడా పాడుచేసుకోమని చెప్పటం లేదు గౌతమి. నేనేమీ నీకు సలహా చెప్పే స్థితిలో లేను,' అని కణతలు నొక్కుకుంటూ తలొంచుకుంది నగేంద్రబాల,
    'నాగూ నన్ను పొరబాటుగా అర్ధం చేసుకున్నావ్. నా ఆలోచన నువ్వు సావధానంగా అర్ధం చేసుకోలేదు. అప్పుడే కంగారు పడకు. నేనుకూడా ఉద్యోగంలో చేరాలనుకుంటున్నాను. నాకూ ఉద్యోగం చెయ్యాలనే పట్టుదల ఏర్పడింది. నేను సంపాదించినా, మా భార్యా భర్తల జీవితం సౌఖ్యంగా గడుస్తుందేమోనని నా ఆశ. నిన్ననే పేపర్లో యూనియన్ పబ్లిక్ సర్వీస్ కమీషన్ పరీక్షల విషయం చూశాను. పరీక్షలకు నన్ను తరిఫీదు చేసి ఉద్యోగం వచ్చేటట్లు చెయ్యగల రేమోనని నా ఆశ." అన్నది గౌతమి.
    నగేంద్రబాల కళ్ళు తుడ్చుకుని గౌతమినికౌగిలించుకుని ఆమె భుజాలు తడిపింది.

                                  *    *    *

 Previous Page Next Page