కులాసాగా కబుర్లు చెప్పుకుంటూ భోజనాలు పూర్తి చేశారు. స్వాతి తన విస్తరి ఎత్తుతున్నది. జ్యోతి ఒక్కసారిగా లేచివచ్చి ఆమె చేతిలో విస్తరి లాక్కుని తను పారేస్తా నన్నది. అతిధులు తమ విస్తరి తాము తియ్యరాదన్నది జ్యోతి. ఖిన్నురాలై స్వాతి విస్తరి వదిలింది. సంతోషంతో నవ్వుతూ విస్తరి పారేసింది జ్యోతి.
భోజనాలయాక తాంబూలం ఇచ్చింది జ్యోతి. అన్య మనస్కురాలైన స్వాతి తాంబూలమైనా తీసుకో లేదు. "ఏం టీచరుగారూ, తాంబూలం తీసుకో లేదేం. అలవాటూ లేదా" అన్నది స్వాతి. తనే స్వంతంగా ఆకులకు, సున్నంరాచి, ఈనెలుతీసి, వక్కపొడితో కిళ్ళీ కట్టి స్వాతి చేతి కిచ్చింది.
స్వాతి ముఖంలో విచార రేఖలు పొడచూపాయి. ఆమెలేని నవ్వు తెచ్చి పెట్టుకుని "వస్తా నమ్మా జ్యోతీ. అనవసరంగా మీకు శ్రమ కలిగించాను. వంటచేసి పెట్టి వచ్చాను. మీ అన్న గారు ఎదురు చూస్తూ ఉంటారు!!" అన్నది స్వాతి.
ఈ ప్రశ్న స్వాతికి రుచించకపోయినా జవాబు చెప్పక తప్పలేదు.
"అన్నగారేం చేస్తుంటారు" అన్నది జ్యోతి.
"చాలాకాలం వారూ స్కూలు మాస్టరుగానే పని చేశారు. ఇటీవల వారికి గుండె జబ్బు ప్రారంభమైంది. మనస్సు బాగుండక ఉద్యోగం మానేసి ఆర్నెల్లయింది. వూరికినే ఉంటున్నారు. నా జీతం తోనే మా భుక్తి గడవాలి" అన్నది స్వాతి.
జ్యోతి ఆశ్చర్యపడింది. ఆడదాని సంపాదన మీద మగవాడు ఆధారపడి ఉండటం జ్యోతి జీవితంలో ఇదే మొదటగా విన్నది. జ్యోతికి ఆశ్చర్యం కలిగింది. స్వాతి సెకండరీ గ్రేడు టీచరయినప్పుడు భర్త ఏ బి. ఇ. డి. మాస్టరో, హెడ్ మాస్టరో అనుకుంది.
"అన్నగారు బి.ఇ.డి. టీచర చేశారా. ఏ స్కూల్లో" అన్నది జ్యోతి.
"కాదమ్మా సెకండరీ గ్రేడు టీచరేను" అన్నది స్వాతి ముభావంగా.
"అదేమిటండీ ఇద్దరూ సెకండరీ గ్రేడు టీచర్లేనా ష్! ష్! చాలా బావుంది" అన్నది జ్యోతి ఆశ్చర్యంగా.
స్వాతి మాట్లాడలేదు. ఆమె ముఖంలో మామూలుగా ఉన్నప్పుడు వుండే సంతోషంగాని, కలుపు గోలు తనంగా మాట్లాడుకుంటున్నామనే సరదా గాని, తన యోగ క్షేమాలు అడుగుతున్నారు కదా అనే ఉత్సాహంగాని. ఏ మాత్రమూ కనబడలేదు. ఈ ముభావంగా కూర్చోట మనేదీ. సంతోషంగా మాట్లాడుకోవాల్సిన సమయంలో మాట్లాడకుండా కూర్చోట మనేదీ, జ్యోతి స్వభావానికీ విరుద్ధమైనది. మాటకు మాట సమాధానం చెప్పి, ఏ అరమరికలూ లేకుండా మనసిచ్చి మాట్లాడే వాళ్ళంటే జ్యోతికి సరదా. వాళ్ళతో అన్నీ ఆహారాలు మాని కబుర్లు చెపుతూ కూర్చుంటుంది. జ్యోతిది పిలిస్తే పలికే హృదయం. రోజూ పాఠాలు చెప్పటాని కొచ్చినప్పుడు ఎంతో కళ కళ్ళాడుతూవచ్చే స్వాతి, ఈనాడు భోజనాని ఉండవని బలవంతం చేసినప్పట్నుంచీ ఇట్లా అంటే ఏమీ పట్టనట్లుగా ఎందుకు మాట్లాడుతున్నదో జ్యోతికి, అర్ధం కాలేదు.
"మీ బావ దగ్గర్నుంచి ఉత్తరా లొస్తున్నాయా? అన్నది స్వాతి ప్రస్తావన మార్చే ధోరణిలో.
"ఆ అప్పడప్పుడూ రాస్తూనే ఉంటాడు మా నాన్నగారికి" అన్నది జ్యోతి. మురహరి అసలు ఉత్తరాలే రాయటం లేదు. ఉత్తరాలు రాయటం లేదని స్వాతికి తెలిస్తే ఏమనుకుంటుందోనని జ్యోతి అట్లా చెప్పింది.
స్వాతి నవ్వుతూ 'ఉత్తరాలు మీ నాన్నగారికి కాకుండా ఇప్పట్నుంచీ నీక్కూడా రాస్తుంటే ఎట్లా జ్యోతీ. చదువు సాగాలా" అన్నది.
"అంత చదువు సాగనంత ఇష్టతగా ఏంలేడు మాబావ" అనుకుంది జ్యోతి మనస్సులో.
ఇంతలో హరనాద్ వచ్చి, "టీచరుగారూ, టీచరుగారూ మీకు ఏ దేవుడంటే ఇష్టం" అన్నాడు ఈ ప్రశ్నకు ఆశ్చర్యపడ్డది స్వాతి.
'దేవుళ్ళల్లో కూడా తేడాలూ, రకాలు ఉన్నాయా బాబూ. రాముడన్నా, కృష్ణుడన్నా, కాశీ విశ్వేశ్వరుడన్నా, రామేశ్వర రామలింగేశ్వరుడన్నా, ఎవరు ఎన్నెన్ని పేర్లతో పిల్చినా ఈ సర్వాంత ర్యామి ఒక్కడే. దేవుడు ఒక్కడే అనే సంగతి అందరికీ తెలుసు. కాని అపుడే అనేక రూపాంత రాలలో అనేక అవతారాలలో తల్చుకుని, ధ్యానించు కుంటాము. ఎవ్వరెన్ని తీరులుగా ధ్యానించినా లక్ష్యం ఒక్కటే. అన్నీ ఆ పరమాత్ముడికే చెందుతయ్యి" అన్నది స్వాతి.
"మరి ఇన్ని పేర్లతో, ఇన్ని నామాంతరాలతో, మా దేవుడు ఎక్కువంటే, మా దేవుడు గొప్పని వాదిస్తూ ఉంటారు. ఎందుకని టీచరుగారూ" అన్నాడు హరనాద్.
"మనకు ఆకలి వేస్తుంది. భోజనం చేస్తాము. భోజనమంటే అన్న మొక్కటే ఇంత తినంకదా. దాంట్లోకి కూర, చారు, పచ్చడి, పులుసు, మజ్జిగ, నెయ్యి, మాంసాహారులయితే మాంసమూ, చేపలూ ఇలాంటి ఆధరువులతో మిళితం చేసి ప్రధాన ఆహారమైన అన్నం తింటాము, అట్లాగే దేవుడనే వాడు ఒక్కడే. ఆయన్ని ధ్యానించి ముక్తి మార్గం సంపాదించుకోవాలంటే దేవుడు, దేవుడు, దేవుడు" అంటూ ధ్యానించరు. "రామా అనో, కృష్ణా అనో, శివా అనో, ఓం నమశ్శివాయ" అనో ఇట్లా అనేక పేర్లనే నామాంతరాలతో ఎవరి ఇష్ట దైవాన్ని వారు ప్రార్ధిస్తారు. ఆ పేరుతో ధ్యానిస్తేనే వారి మనస్సుకు తృప్తి, ఆ పేరుతో ధ్యానిస్తేనే ఆ పరమాత్మునయందు వారికి భక్తి శ్రద్దలు ఏర్పడతవి. ఆ పేరుతో ధ్యానించి, పూజి స్తేనే వారు తరిస్తారని వారి భావం. దేవత్వాన్ని గురించీ, నామాంతరాలుగల ఆ పరంధాముని గురించీ తెల్సుకోవాలంటే మనకున్న లౌకిక జ్ఞానం చాలదు. పోనీ ఈ తర్కం మన కెందుకు గాని, నీకు ఏ దేవుడంటే ఇష్టం హరనాద్" అన్నది స్వాతి.
"వాడికాండి. వేంకటేశ్వరస్వామి అంటే ఎంతో ఇష్టం ఎంతో భక్తి శ్రద్ధలు ఏ దేవుడియందూ వాడికి అంతనమ్మకం లేదు" అన్నది జ్యోతి. హరనాద్ వైపు చూసి నవ్వుతూ.
"వెరీగుడ్! మంచిదే. మన దేశంలోకల్లా గొప్ప దేవుడు. ఆ స్వామిని ధ్యానించి పూజించటం చాలా మంచిది. భక్తుల హృదయాలను శ్రద్దగా పరిశీలించి వారి కోరికలను ఈడేర్చే చిద్విలాసుడైన శ్రీనివాసుడు. నాకూ ఆ దేవుడంటేనే భక్తి శ్రద్దలు ఎక్కువ" అన్నది స్వాతి నవ్వుతూ.
హరనాద్ ముఖం సంతోషంతో నిండిపోయింది. స్వాతి చెయ్యి పట్టుకుని "టీచరుగారూ మొన్నీ మధ్య తిరుపతి వెళ్ళినప్పుడు మాంచి పఠం తెచ్చానండీ. మా వంటింట్లో పూజా మందిరంలో ఉంచి పూజిస్తున్నాము. చూద్దురుగాని" అన్నాడు.
స్వాతికి వచ్చి వెలక్కాయ గొంతున పడ్డ ట్లయింది. "మంచిదే బాబూ చూడవలసిందే. ఆ చిద్విలాసుని మనస్సులోనే ఎప్పుడూ సంస్మరించుకుంటాను. వంటింట్లోకి ఇప్పుడెందుకులే. తరువాత వెళ్ళవచ్చు" అంటూ ఇంటికి వెళ్ళటానికి లేచింది స్వాతి.
"కాదు టీచరుగారూ, మా దేవుడ్ని వచ్చి చూడక పోతే మీకు ఆయనంటే ఇష్టం లేనట్లే. శ్రీ వెంకటేశ్వరస్వామి యందు మీకు భక్తి శ్రద్ధలుంటే పూజా మందిరంలోకి వచ్చి నమస్కరించి వెళ్ళండి. లేకపోతే ఆయనంటే మీకు ఏ మాత్రమూ నమ్మకం లేనట్లే లెక్క. దేవుడి మందిరం చూడమంటే ఇంత బ్రతిమాలించుకుంటారా? అన్నది జ్యోతి.
స్వాతి కలవర పడింది. ఇంత మాట తను వినకూడదు. ఈ నింద తను సహించకూడదు. ఇన్ని సంవత్సరాలుగా ఆ స్వామి నీడన బ్రతుకుతున్న తను ఈనాడు బయట పడకూడదు. తనకు వెంకటేశ్వర స్వామి యందు భక్తి శ్రద్ధలు లేవని, నమ్మకం లేదనీ అనిపించుకొ కూడదు. ఏమైనా సరే వెళ్ళి తీరాలి. వంటింట్లోకి పూజా మందిరంలోని ఆ స్వామిని దర్శించాలి. కావాలని తమ వంటింట్లోకి వెళ్ళటం లేదు. వాళ్ళను న్యూనత పర్చాలని వెళ్ళడం లేదు. ఆ స్వామిని చూసి, దర్శించి క్షమాపణ వేడుకోవాలి.
స్వాతి 'సరే' నన్నది. ముగ్గురూ వంటింట్లోని పూజామందిరం వద్దకు వెళ్ళారు. జ్యోతి, హరనాద్ కళ్ళు మూసుకుని మనసార ధ్యానించారు.
స్వాతి కళ్ళుమూసుకుంది. ముకుళిత హస్తాలతో ముందుకు వంగి, మనస్సులో స్వామిని ధ్యానించింది.
"స్వామీ నేను మహా పాపిని. తల్లి బిడ్డలనువేరు చేశాను. వార్ని నా భర్తగా స్వీకరించాను. వార్ని వర్ణ సంకర వివాహం చేసుకున్న వారినిగా చేసి, నలుగురిలో తలెత్తుకు తిరక్కుండా చేశాను. ఇది నా స్వార్ధమో, జీవిత పరమార్ధమో నువ్వే నిర్ణయించాలి. మళ్ళీ ఇక్కడ నాకీ అగ్ని పరీక్ష ఎదురైంది. నా స్వామి గర్భాలయంలో ఉన్నా, ఏడు కొండల నడుమవున్నా, వంటింట్లోని పూజా మందిరంలో ఉన్నా నాకు ఒక్కటే. నీ యందే నా మనస్సు నిలిపాను. నిన్నే చూశాను. నీవే నాకు శరణ్యమని నమ్మాను. ఈ పిల్లలు సంఘపు కట్టుబాట్లు తెల్సుకోలేనివారు. వర్ణాశ్రమ ధర్మాలు తెలియని వారు. వారిని మన్నించు. అన్నీ తెల్సి నేను చేసిన ఈ రెండో నేరం క్షమార్హతలేనిదే. కాని ఈ పిల్లల మనశ్శాంతి కోసం నీమీద భక్తి శ్రద్ధలు వెల్లడించుకోటంకోసం ఈ వంట ఇంట్లోకి వచ్చాను. నన్ను శిక్షించినా నాకు ఇష్టమే. శలవు స్వామీ" అనుకున్నది స్వాతి మనస్సులో స్వామి అనుగ్రహించాడో మరి ఆగ్రహించాడో? స్వాతి వెక్కి వెక్కి ఏడుస్తూ కళ్ళు మూసుకుని అక్కడే పడిపోయింది ఆ పూజా మందిరం ముందరనే.
13
ఆరోజున నగేంద్రబాల జీవిత చరిత్ర కొంత వరకు విన్నాక, గౌతమి మనస్సు పరిపరి విధాలుగా పోయింది. తన భర్త జానకిరాం కి, నగేంద్రబాల భర్త నాగరాజుకీ పోలికే లేదు. ఉద్యోగం కోసమే జీవిస్తున్నా వంటాడు నాగరాజు. జీవితాన్ని ఉద్యోగానికే అంకిత మివ్వాలనే స్వాభావికుడు ఆయన. జీవించటానికి ఉద్యోగమే కావాలా, ఉద్యోగమే శరణ్యమా అంటాడు తన భర్త జానకిరాం. ఉద్యోగంలో మునిగి తేలటంలో కట్టుకున్న భార్యనే మర్చిపోయి, భార్య అనే సహధర్మచారిణి తన మీద ఆధార పడి ఉన్నదనే ఆలోచన కూడా లేకుండా ఆ ఉద్యోగ మనే మహా సముద్రంలోనే మునిగి తేలతానంటాడు నాగరాజు ప్రతివాడూ ఉద్యోగమే చెయ్యాలా, చదువు విజ్ఞానం కోసం గాని ఉద్యోగంకోసం కాదంటాడు జానకిరాం.
ఇద్దరి మనస్తత్వాలకీ ఎంతో తేడా ఉన్నది. ఇందులో ఇద్దరూ యుక్తా యుక్త విచక్షణా జ్ఞానం కలవారేనా? లేక ఇద్దరూ మూర్ఖులా? ముఫ్ఫై ఏళ్ళు పైబడి, భార్య కాపురానికొచ్చి అయిదేళ్ళు దాటినా ఇంకా సంపాదన ధోరణిలేక, ఉద్యోగం సంపాదించి చెయ్యటం చేతకాక, స్వశక్తితో తన కాళ్ళమీద తను నిలబడే స్తోమత ఏర్పర్చుకోలేక, వృద్ధాప్యంలో తండ్రికి చేయూతగాసాయం చేసేది లేకపోగా, కట్టుకున్న ఇల్లాలితో సహా తండ్రి పంచన ఉండి వారి మోచేతి నీళ్ళు తాగుతూ తిట్లూ, తిరస్కారాలతో వేళకు ఇంత భోజనం చేస్తూ, ఏమీ చేతకాని వానిలా కూర్చునే తన భర్త జానకిరాం చరితార్ధుడా? పూజనీయుడా? ఆదర్శ పురుషుడా? ఇంజనీరింగ్ చదివి ఉద్యోగం చేస్తూ, ఇంజనీరుగా పేరు తెచ్చుకుని బయట పదిమందిలో పేరు ప్రతిష్టలు గడించి, నెలకు రెండు మూడు వందలు జీతం తెచ్చుకుంటూ, సేవా ధర్మంలో వృత్తి ధర్మంలో ప్రసిద్ధికెక్కి, నిత్య జీవితంలో, గృహ జీవితంలో భార్యను కూడా మర్చిపోయి, ఇంట్లో బంధించి, చివరికి కోర్టు ద్వారా విడాకులు ఇచ్చిన నగేంద్రబాల భర్త నాగరాజు గణనీయుడా? ఎవరి మనస్తత్వాన్ని ఏ విధంగా అర్ధం చేసుకోవాలి?