"మీరెంతసేపూ అంతఖర్చు అని గొడవేగాని మా పెళ్లికొడుకుల సైడ్ కొంచెం కూడా ఆలోచించాలండీ! పెళ్ళయిన తర్వాత షుమారు సంవత్సరంపాటు భార్యను మేపి ఆ పెట్టుబడికి దమ్మిడీ రాబడి రాకుండానే అంతేసి కిరసనాయిలు పోసి కాల్చిచంపాలంటే ఎవరికయినా ఎంతకష్టం? పోనీ అలా అని జీవితాంతం దానిని కాల్చకుండా బయటకు తోలేద్దామా అంటే లేనిపోని కాంప్లికేషన్స్ వస్తాయి! అదీగాకుండా మొదటిభార్య కిరసనాయిలు పోసుకుని తగలెట్టుకున్నదని రుజువయితేగాని మరోపిల్ల నివ్వడానికి ఎవరూ ముందుకిరారు. అయినా భార్యలతో కట్నం వస్తోందన్నమాటేగాని పెద్దగా మాకు మిగిలిచచ్చేదెక్కడ? సంవత్సరంపాటు తిండి, ఆ తరువాత కాల్చిచంపడానికి కిరసనాయిలు, అగ్గిపెట్టెలు, దహనక్రియల ఖర్చులు దినవారాల ఖర్చులూ, అస్తికలు గంగలో కలపడాలు, ఇంట్లో పెద్దఫోటోలు ఫ్రేములు కట్టించి తగిలించడాలు- ఎంత ఖర్చో మీరేలెక్కవేసుకోండి. గోపాల్రావ్ గారు ఈ విషయంలొ ఎంతో అభ్యుదయ భావాలున్నవారు కాబట్టి అడగ్గానే ఠక్కున వప్పుకున్నారు" అన్నాడు పెళ్ళికొడుకు.
మళ్ళీ సీతారామయ్యగారు అందుకున్నారు.
"నన్నడిగితే భార్యలను కిరసనాయిలుతో చంపడం మానేయడం మంచిదంటాను! ఎందుకంటే రాన్రాను కిరసనాయిలు ధర తెగపెరిగిపోతోంది. వేరే ఇంకేమయినా చౌకరకం ఆయిల్ ప్రభుత్వం సప్లయ్ చేయాలి. లేదా అసలు ఆడదాన్ని చంపకుండా బానిసలుగా అమ్మిపారేసే పద్దతయినా బాగానే ఉంటుంది. ఇటువంటి పద్దతివల్ల అటు ఖర్చూ తప్పుతుంది. ఇటు కొంతరాబడీ వుంటుంది. మరోపక్క కొన్నవాడు గొడ్లకు బదులుగా స్త్రీలను ఉపయోగించుకుని లాభపడే అవకాశమూ ఉంటుంది. ఈ పద్దతి ఇప్పటికే కొన్ని దేశాల్లో అమలులో ఉంది-"
ఆ మాట పూర్తికాకుండానే ఆడళ్ళంతా ఏకమయి సీతారామయ్య మీద విరుచుకుపడ్డారు "అలా జరగడానికి వీల్లేదు. ఆడాళ్ళు పశువులు కాదు, అలా బానిసలుగా అమ్మి పారేయడానికి. భర్త చేతిలో కిరసనాయిలు చావు చావడం మా జన్మహక్కు ఇది మా భారతదేశ సాంప్రదాయం. మా నాగరికత ప్రపంచంలోకెల్లా గొప్పవయిన మన ఆచారాలు తొలగించడానికి మేము ససేమిరా వప్పుకోము" అంటూ ఆవేశంగా అరిచారు. పరిస్థితి విషమించేలా ఉందని శాయీరామ్ చిరునవ్వుతో మధ్యలోకొచ్చాడు.
"సోదరులారా, సోదరీమణులారా, మనలో మనకి గొడవెందుకు? మనం అటు గోపాల్రావ్ గారి భార్యవాదననూ కొట్టేయడానికి వీల్లేదు. ఇటు పెళ్ళికొడుకూ, అతని తండ్రి అండ్ కంపెనీవాళ్ళు అడిగేదానికి కాదనలేము. ఎందుకంటే మనందరికీ కూతుళ్ళతోపాటు కొడుకులూ వున్నారు మన కూతురు ఒకింటికి కోడలైనట్లే, ఒకింటి కూతురూ మనింటికి కోడలుగా రాక తప్పదు. మరి మనింటి కోడళ్ళను మనమే స్వయంగా కిర్సనాయిలు పోసి నిప్పంటించడమూ సహజమే. అంటే మరి మనకూ ఖర్చుపెరుగుతుంది కదా! కనుక మనమందరం ఓ కొత్త పద్దతి అవలంబిస్తే బావుంటుంది. అదేమిటంటే పెళ్ళికొడుక్కి ఒకేసారి ముగ్గురమ్మాయిలతో పెళ్ళిచేసి పారేస్తే అటు ముగ్గురికట్నం ఒకేసారి వస్తుంది. ఇటు వాళ్ళందరినీ ఇన్ స్టాల్ మెంట్స్ లో చంపే పద్దతి బదులు ఒకేసారి కట్టకట్టి కిరసనాయిలు పోసి అంటిస్తే ఖర్చు పూర్తిగా తగ్గిపోతుంది ఎందుకని? అందరినీ కామన్ గా దహనక్రియలు, కామన్ గా దినవారాలు, అందరి అస్థికలూ ఒకటేసారి గంగలో కలపడం ఆ తరువాత ఆ ఫోటోలకు జీవితాంతం జరిపే ఖర్చు కామన్- ఇలా ఎంత లాభమో చూడండి..."
ఓ క్షణం అంతా నిశ్శబ్దం అలుముకుంది. ఆ తరువాత ఎవరికి వాళ్ళు పక్కవాళ్ళతో తర్కించుకోవడం ప్రారంభమయింది.
"మీరు చెప్పింది చాలా బావుంది అన్నయ్యగారూ!" అంది రాజేశ్వరి ఆడాళ్ళతరపున.
"అవును-" అన్నారు మిగతావారు.
"మీరేమంటారండి" అంటూ బట్టతలనడిగాడు శాయీరామ్.
"గాడిదగుడ్డంటాను." మండిపడుతూ అన్నారాయన.
"అదేమిటి?"
"లేకపోతే ఏమిటయ్యా, నాక్కావలసింది మీ బోడి సంఘసంస్కరణలు కాదు. కిరసనాయిలు ఇప్పుడు ఇస్తారా, ఇవ్వరా, అంతే ఒక్కటే జవాబు కావాలి."
"ఇవ్వకపోతే ఏం జేస్తావ్?" అన్నాడు మా కాలనీ యువజన నాయకుడు సంగీతరావు.
"ఏం జేస్తానా?" 'థూ' అని ఊసి పెళ్ళి చేసుకోకుండా ఇక్కడ నుంచి వెళ్ళిపోతాం."
"వెళ్ళడానికి మీకు కాళ్ళులేవుగా."
"కాళ్ళు లేక పోవడమేమిటి? ఇవి కాళ్ళుకాదూ?"
"ఇప్పుడున్నాయండీ! 'థూ' అని ఊసి బయల్దేరాక ఇంకా అవెందుకుంచుతాం మేము? అన్నీ విరగ్గొట్టి ఇక్కడే ఓ మూల కుప్పపడేస్తాం."
"ఏంట్రా? నా కాళ్ళు విరగ్గొడతావా?" అంటూ అతని మీదకు దూకాడు బట్టతల. అంతే, ఆ తరువాత ఏం జరిగిందో తెలీదు. కుర్చీలు, బల్లలూ, స్టీలు చెంబులూ, గ్లాసులూ, అన్నీ తుఫాను గాలి కెగిరినట్లు గాలిలోకి ఎగిరిపడేవరకే నాకు గుర్తుంది. అందులో ఒకటి ఏదో ఎగిరివచ్చి బలంగా నా నెత్తికి కొట్టుకోవడం కూడా కొంచెం గుర్తుంది. తిరిగి కళ్ళు విప్పేపాటికి మా ఇంట్లో నా గదిలో మంచం కింద పడివున్నాను.
మా ఇంటి సభ్యులందరూ నా చుట్టూ మూగి విచిత్రంగా చూస్తున్నారు. పక్కనే పడివున్న ఇండియన్ ఎక్స్ ప్రెస్ పేపర్లో మొదటి పేజీలో "ఇంకో పెళ్ళికూతురిని తగలేసిన కేసు" అన్న హెడ్డింగ్ ఇంగ్లీషులో కనబడుతోంది. లోపల్నుంచి రేడియోలో- 'కాదుసుమా కలకాదుసుమా' అన్న పాట వినబడుతోంది.
ఈ కథ మీకు హాస్యం అందిస్తే అందించవచ్చు!
కానీ ఈ కథ మనదేశంలోని పరిస్థితి చూసి నవ్వాలో ఏడవాలో తెలీక రాసినకథ! సినిమాల్లో చూద్దామా తాగి తనను చితకతంతున్నా భర్త కాళ్ళు పట్టుకుని వదలని స్త్రీ పాత్రలు- భర్తను మరో స్త్రీకి మనం చూస్తుండగానే త్యాగం చేసి పారేసే పాత్రలు-
బయట చూద్దామా, కట్నంలాంఛనాలకోసం- అత్తమామలు, భర్తా పెట్టే బాధలు భరించలేక ఆత్మహత్యలు చేసుకోవడం- లేదా హత్యగావించబడటం-
ఇవన్నీ అలా వుంచి ఈ పరిస్థితిని రాన్రాను అందరూ చాలా మామూలు విషయాల్లా- కాజువల్ గా ట్రీట్ చేయడం- ఇది మరీ ప్రమాదకరమయిన పరిస్థితి.
"ఈ పరిస్థితి ఇలాగే కొనసాగితే- ఈ కథ త్వరలోనే నిజమైపోవడం ఖాయం! అప్పుడింక కన్నీళ్ళూ మిగలవ్! నవ్వూమిగలదు!
* * *