Previous Page Next Page 
ఎండమావులు పేజి 17

                                 

 

    మురహరి కళ్ళకు ఇంకా జయలక్ష్మి సినిమాలో హీరోయిన్ లాగే కనిపిస్తున్నది. మనస్సు సంతోషంతో ఉరకలు వేసినా జరిగిన సంఘటనలు జయలక్ష్మితో సన్నిహితంగా మాట్లాడటానికి ధైర్యాన్ని నివ్వలేక పోతున్నయ్యి.
    "సినీతార కుమారి జయలక్ష్మి గారికి సుస్వాగతం. చిన్నతనంలో పెద్ద నాటకాల్లో నటించి మీ నానా కౌశలం చేత మా హృదయ వీణను మ్రోగించారు. అనతి కాలంలోనే అగ్రశ్రేణి సినిమా తారగా సూరి మా హృదయాల్లో శాశ్వతస్థానం ఏర్పర్చుకున్నారు......."
    "ఏమిటి మురహారీ ఏదైనా సన్మానపత్రం చదువుతున్నావా" కిలకిలా నవ్వుతూ అన్నది జయ లక్ష్మి. గలగలమంటూ తను నవ్వాడు మురహరి. అతని హృదయం ఎందుకో గిలగిల లాడసాగింది.
    "ఏం జయా చూస్తుండగానే అవ్వాయి చువ్వాయిలా రివ్వున తారాపధానికి వెళ్ళిపోతున్నావు. నన్ను ప్రేక్షకుడుగా చూస్తావో, నాయకుడుగా చూస్తావో మరి" అన్నాడు మురహరి ముభావంగా.
    "నీ మాటలకేం గాని ముందు ముఖం కడుక్కో తరువాత నామీద విసుర్లు విసురుదువుగాని" అన్నది ఏదో నవల అక్కడున్నది తీసి చదువు కుంటూ.
    అరగంటలో అవశేష్టాలన్నీ తీర్చుకుని చక్కగా బట్టలు వేసుకుని 'యస్. అయామ్ రెడీ. ఇంక చెప్పండి కుమారి జయలక్ష్మి గారూ" అంటూ తనో కుర్చీలో కూర్చున్నాడు మురహరి.
    నిన్నటి హంగామా అంతా చూసి నేను ఎంత సంతోషపడ్డా ఆ సమయంలో నాతో సావకాశంగా మాట్లాట్టానికి వీలు పడనందుకు చాలా బాధ పడ్డాను మురహరీ. నువ్వు నన్ను అపార్ధం చేసుకుంటావని నాకు తెలుసు. జయలక్ష్మి ఇంక నాతో మాట్లాడదేమో. ఇంక అమ్మాయికి గర్వమూ, అతిశయమూ వచ్చినయ్ అని నన్ను గురించి అనుకున్నావుకదూ" అన్నది జయలక్ష్మి.
    మురహరి తత్వం తెలిసిన జయలక్ష్మి మనస్సులో బాధపడుతూ ఈ మాటలు అన్నది.
    "నిజమే. నీకు సన్మానం జరుగుతున్నందుకూ, అంతా ఎంతో నిన్ను మెచ్చుకుంటున్నందుకూ నా మనస్సు పొంగిపోయినా, నువ్వు నాకు ఎందుకో దూరమై పోతున్నట్లనిపించింది. కారణ మేమిటో నేనూ చెప్పలేక పోతున్నాను. నువ్వు సంఘంలో పేరు ప్రతిష్ఠలు తెచ్చుకోవాలనీ, అగ్రశ్రేణి తారగా తారాపధానికి వెళ్ళాలనీ, అందరితో పాటు నాకూ అనిపించినా నా మనస్సులో ఏదో వెలితి కనిపిస్తుంది" అన్నాడు తన మనస్సులోని భావాలను ఇంకా స్పష్టంగా చెప్పలేక అతని ముఖం లోని ఆవేదనానుభూతులు లీలగా చూసింది జయలక్ష్మి.
    "చూడు మురహరీ, నీకు ఇష్టంలేని పని, నీ మనస్సుకు బాధ కలిగించే పని నే నెప్పుడూ చెయ్యను. నాటకంలో నీ అనుమతితోనే నటించాను. ఈ నాటకాల గొడవల్తో నిన్ను మర్చిపోతున్నాననీ, ప్రతాప్ కి సన్నిహితురాలవుతున్నావనీ నువ్వు కల్లో నైనా అనుకోవద్దు. తనతో మాట్లాడే ప్రతి మగవాడినీ ఎ స్త్రీ ప్రేమించదు, వాంఛించదు. మానవులుగా ఈ ప్రపంచంలో పుట్టి, సంఘంలో నలుగురిలోనూ తిరుగుతున్నందుకు అందరి ఆదరాభిమానాలనూ పొందుతూ, గౌరవప్రదంగా జీవించటానికి నలుగురిలోనూ మాట్లాడినందువల్ల తప్పు లేదు. ఇలాంటి అవకాశాలను అన్యధా భావించి ఉపయోగించదల్చుకునే అవకాశవాదులు అనేకులు. వారి మనస్తత్వం వారికే బుద్ధి చెప్తుంది. దానికి మనం కర్తలం కాదు కదా" అన్నది.
    మురహరి ఏమీ మాట్లాడలేదు. తన మాటల వల్ల జయలక్ష్మి మనస్సు బాధ పడిందని గ్రహించాడు. అతని మనస్సులో ఏ మూలనో ఇరుక్కుని ఉన్న కొన్ని రకాల భావాలు వెలికివచ్చి అంతలోనే అంతరించినయ్. ఆ ఖాళీలో కొత్త భావాలు వాటంతట అవే ప్రవేశించినయ్యి. జయలక్ష్మి పెదవులమీద స్మిత రేఖలు కనిపించాయి. ఇంత సూటిగా తన మనస్సులోని భావాలను ఎట్లా అర్ధం చేసుకుందా అని ఆశ్చర్యపోయాడు. తనమీద ఆదరాభిమానాలు, ఇష్టం, ఆప్యాయత లేకపోతే ఈ నిర్జన గ్రహమైన తన గదికొచ్చి ఒంటరిగా కూర్చొని ఎందుకు మాట్లాడుతుందనుకున్నాడు. జయ లక్ష్మికి మంచి చెడ్డలూ, సామాజిక విధానాలు తనతో మాట్లాడే అందరి హృదయాలనూ అర్ధంచేసుకో గలగటమూ బాగా తెలుసుననే నమ్మకం అతనికి కలిగింది.  మణి మాణిక్యాలు మట్టిలో పారేసినా వాటి కాంతి వీసమైనా తగ్గదు. ఆ మట్టిలో అవి ఉన్నంతసేపూ ఆ ధూళి కణాలు అంటుకునే ఉంటయ్యి. అంతమాత్రం చేత వాటి కాంతి లేశమైనా తగ్గదు.
    రాత్రి కలలో, సినిమా షూటింగు కళ్ళకు కట్టినట్లుగా కనిపించింది మురహరికి. అతని కళ్ళకు జయలక్ష్మి అతిలోక సౌందర్యరాశిగా కనిపించింది. ఈ సౌందర్యరాశి తన అంతర్యాన్ని చెప్పింది. ఆమె ఆంతర్యంలో తనే తిష్ఠ వేసుకుని ఉన్నట్లుగా భావించాడతను. ఆమె హృదయకవాటం తెరుచుకుని లోపలికి వెళ్ళి తన స్థానం పటిష్టం చేసుకోవాలి. కాని తను వెళ్ళలేకపోయాడు. కన్నార్పకుండా ఆమెను చూస్తూ కూర్చున్నాడు. నూతనత్వం ఉట్టిపడేటట్లుగా హృదయంలోని భావాలను ఆమె ముందు ఒలకపోసే తీరుగా మాట్లాడాలనుకున్నాడు. మనస్సు కళ్ళెంలేని గుర్రంలా పరుగెత్తుతున్నది. వూహలు మేఘాలులా పాకిపోతున్నాయి. హృదయంలోని ఉద్వేగం అంచులు కట్టి వొరుచుకుంటూ ప్రవహిస్తున్నది. కళ్ళల్లో నాది అనే భావంతో కూడిన తృప్తి కనిపిస్తున్నది. పెన వేసుకు పోయేటంత లాలిత్యంతో పెదవుల మీద దరహాసం చిందులాడగా, ఉచ్వాస నిశ్వాసాల ఉరకలతో వూపిరి తీస్తూ, వణికే కంఠంతో "జయా నిన్ను ప్రేమిస్తున్నాను నీకు మనస్ఫూర్తిగా ఇష్టమైతే భార్యగా స్వీకరిస్తాను" అన్నాడు.
    అదిరిపడ్డది జయలక్ష్మి. ఆమె ఆశ్చర్యపడలేదు. సంబర పడలేదు. నిట్టూర్పు విడవలేదు. స్తబ్దురాలుగానూ కూర్చోలేదు. ముఖంలో ఉద్వేగం కనపడలేదు. కంపిత హస్తాలతో ఆమె చెయ్యి పట్టుకున్నాడు మురహరి. ఆమె వదిలించుకోలేదు. ఈ సంఘటనతో వారిద్దరికీ ఏదో నూతన పరిచయం ఏర్పడినట్లయింది. తెలియని కొత్త ఎరుక కలిగింది. ఆమె ముఖంలో సద్భావమైన శాంతం కనిపించింది. ఆమె సౌందర్యం చూస్తూ కళ్ళార్పలేదు మురహరి. ఆమె కళ్ళల్లోకి సూటిగా చూశాడు. ఆ క్షణమే అతని కండ్లు మిరుమిట్లు గొలిపాయి. అతనిలో నవ చైతన్యం పొంగలెత్తింది. కాని అతను ఏ రకంగానూ ధైర్యంచేసి మరి మాట్లాడలేదు. ఆమెలోని అపార సౌందర్యాన్ని, ముఖ కవళికల్లోని స్వచ్చతనూ చూస్తూ కూర్చున్నాడు. తన చేతిని వెనక్కు తీసుకున్నాడు. మంత్రముగ్ధుని వలె తన వైపే కళ్ళార్పకుండా చూస్తున్నా, అతన్ని చూస్తూంటే, ఆమెకు ఆశ్చర్యం తో కూడిన అభిమానం కలిగింది. ఆమె నోట మాట రాలేదు. ఎక్కడినుంచో నురుగులు కక్కే కెరటాలతో కూడిన ఆనంద ప్రవాహం తనను ముంచివేసి నట్లుగా భావించింది. కొద్ది క్షణాల్లోనే ఆమె ముఖం వెలవెల బోయింది. వ్యధిత హృదయురా లయింది. మనస్సు సంతాపంతో నిండిపోయింది. ఆమె హృదయాంతరాళంతోనుంచి వచ్చిన నిట్టూర్పు అతనిలో నిండి ఉన్న అపార సంతోషాతిశయాలను పటాపంచలు చేసింది. ఆమె హృదయంలో మండిపోతున్న జ్వాల ఆ శుభ సమయపు ఆనందాన్ని దహించినట్లయింది. ఇంతటి స్థితిలోనూ ఆమెకు తలవని తలంపుగా ఒక్కసారి ఫక్కున నవ్వు వచ్చింది. కాని ఆ నవ్వు నిర్జీవమైనది, నిర్లిప్త మైనది. హృదయ విదారకమైన భావాలు, అనుభూతులు, ఆలోచనలూ కలగాపులగంగా కళ్ళముందు నాట్యం చెయ్యగా ఆకారణంగా నవ్వొచ్చింది. అతన్ని తన హృదయానికి దగ్గిరగా రప్పించుకో గలిగినా అతనితో కలిసి జీవించ గలిగే ధైర్యం ఆమెలో లేకపోయింది.

 

                
    కూర్చున్నదల్లా ఒక్కసారిగా లేచి నిల్చుని ముత్యాలవంటి కన్నీటి బిందువులు కను కొలుకుల్లోనుంచి జారగా రుద్ధ కంఠంతో పెగిలివచ్చే దుఃఖాన్ని ఆపుకుంటూ అభిమానంతో గుండెలు దడదడ లాడగా, కంపించే శరీరంతో "నేను......... నేను......గంగా భాగీరధీ సమానురాల్ని..........కుమారి జయలక్ష్మిని కాదు" అంటూనే తలుపు తీసుకుని వెనక్కు తిరిగి చూడకుండా వెళ్ళిపోయింది.
    కాలి, చల్లారినట్లు ఉంది మురహరి మనస్సు. గుమ్మంవైపే చూస్తూ కూర్చోలేక మంచంమీద వాలి కళ్ళు మూసుకున్నాడు.
    గాలికి తలుపులు దడదడ కొట్టుకోసాగాయి. కిటికీ తలుపులు మూసుకున్నాయి.

                                   12

    తాసిల్దారుగారింటికి స్వాతి పిల్లలకు ప్రైవేటు చెప్పటానికి వెళ్ళింది. స్వాతి ప్రైవేటు చెప్పినంత సేపూ జ్యోతి కూడా అక్కడే తన పుస్తకాలు చదువుకుంటూ కూర్చునేది. ప్రైవేటు పూర్తయి వెళ్ళబోయేముందు జ్యోతి స్వాతితో ఏదో కాలక్షేపణకు ఇష్టాగోష్టిగా మాట్లాడుతూ ఉండేది. ఆ ఇష్టాగోష్టి కబుర్లలో స్వంత విషయాలు ఎవరూ మాట్లాడుకునేవారు కాదు. ఆడపిల్లల ఎలిమెంటరీ స్కూలులో పనిచేసే టీచరుగా, తమ ఇంట్లో పిల్లలకు ప్రైవేటు చెప్పే ప్రైవేటు టీచరుగా మాత్రమే స్వాతిని ఎరుగున్నది జ్యోతి. స్వాతి నివా హితయని జ్యోతికి తెల్సుకాని భర్త ఏం చేస్తుంటారో తెలీదు.
    స్వాతి సౌందర్యాన్ని బట్టే, ఆమె మాట్లాడే తీరునిబట్టీ, ఒద్దికగా మాట్లాడే పద్దతి ని బట్టీ ఆమె తమ కులస్తులేమో ననుకుంది జ్యోతి. కాని ఆ ప్రస్తావన ఎప్పుడూ రాలేదు. కొద్దినెల్ల క్రితం జ్యోతి పుట్టినరోజు వేడుకకి స్వాతిని తమ ఇంట్లో భోజనానికి పిలిస్తే ఏదో పనుందనే సాకుతో, వంట్లో బాగుండలేదనే నెపంతో ఆమె భోజనానికి రాలేదు. నిజమేననుకుని జ్యోతి మళ్ళీ ఆ విషయమే ప్రస్తావనకు తీసుక రాలేదు.
    ఆ ఆరోజున తాసిల్దారు గారూ, భార్యా, చిన్న పిల్ల లిద్దరూ పెళ్ళికి వెళ్ళారు. జ్యోతి మాత్రం పరీక్షలముందు చదువుకోవాలని పెళ్ళికి వెళ్ళలేదు. పదేళ్ళ పిల్లాడు తమ్ముడు హరనాధ్, జ్యోతి ఇద్దరే ఉన్నారు. హరనాద్ ఫస్టు ఫారం చదువుతున్నాడు. వాడిక్కూడా ప్రైవేటు చెపుతుంది స్వాతి.
    రోజూలాగే ఆ రోజున కూడా ఇంటివద్ద వంట చేసుకుని ఏడున్నరకు స్వాతి వచ్చింది, ప్రైవేటు చెప్పటానికి హరనాద్ కు ప్రైవేట్ చెప్పటం పూర్తయ్యాక ఆ పూట సరదాగా భోజనం చేసి పొమ్మని జ్యోతి, హరనాద్ ఇద్దరూ స్వాతిని బలవంతం చేశారు. మామూలుగానే స్వాతి ఏవో సాకులు చెప్పింది. కాని అక్కా, తమ్ముడూ ఆమెను వదల్లేదు. ఎంతో బలవంతంమీద స్వాతి భోజనం చెయ్యటానికి వప్పుకున్నది. వంటింట్లో కాకుండా మద్య హాలులో ముగ్గురూ భోజనం చేసేటట్లు ఇట్లా స్వాతి ఎందుకంటుందో వాళ్ళకు తెలిలేదు. ఎట్లాగయితేనేం స్వాతి భోజనం చెయ్యటానికి వప్పుకున్నందుకు వాళ్ళిద్దరూ సంతోషించారు.

 Previous Page Next Page