డాక్టర్ మనోహర్ చాలా అలసిపోయాడు. అందులో డాక్టర్ అశోక్ దగ్గర పని చెయ్యటమంటే మాటలుకాదు. ఉరుకులు పరుగులమీద చెయ్యాల్సినట్లుగా వుంటుంది. ఒక్కక్షణం రిలాక్స్ కానివ్వదు.
"కమాన్ క్విక్! క్విక్!" అంటూ రన్నింగ్ రేసు చేయిస్తాడు.
"సార్!" అన్నాడు కొంచెం భయంగానే.
"ఏమిటి?"
"మీరు చాలా టైర్ అయినట్లు కనబడుతోంది."
"లేదే."
"మూడుగంటలకి మీకు మీటింగ్ కూడా వుంది."
"మూడంటే యింకో గంట టైముంది. గంటసేపట్లో మనం ఎన్ని పనులైనా చేయవచ్చు. ఉయ్ కెన్ డూ వండర్స్ ఇంకా ఎన్ని కేసులున్నాయి?"
"ఒకటే సార్! ఆ పాపది-రెటినోబ్లాస్టోమా."
"ఓస్! అంతేనా? కమాన్ కేసు టేబిల్ మీదకు తీసుకురండి. క్విక్! క్విక్!"
డాక్టర్ మనోహర్ ఏమీ అనలేక గబగబా ఏర్పాట్లు చేస్తున్నాడు.
డాక్టర్ అశోక్ కు హాండ్స్ వాష్ చేసుకుంటుంటే ఎందుకో కొంచెం తల తిరిగినట్లయింది. ఒక్కక్షణం అంతా శూన్యమనిపించి తిరిగి వెంటనే సర్దుకుంది.
"హైపో గ్లైనమియా" అని నవ్వుకున్నాడు.
'పోనీ ఆపరేషన్ వాయిదా వేద్దామా' అన్న ఆలోచన క్షణంపాటు మనసులో మెదిలింది.
"నో! ఎంత! ఐ కెన్ ఫినిషిట్ వితిన్ ఫిఫ్టీన్ మినిట్స్. అయినా నాకు అలుపేమిటి?" అని వెంటనే సమర్ధించుకున్నాడు.
* * *
రాధ ఆపరేషన్ టేబిల్ మీదకు తీసుకురాబడింది.
ప్రిమెడికేషన్ ఇవ్వబట్టి - మగతలో వుంది.
ఎనస్థటిస్ట్ కేసు ప్రిపేర్ చేస్తున్నాడు. ఆపరేషన్ ముందు లిస్ట్ లో వున్న కేసు వివరాలన్నీ అతను చూసుకోవాలి. అలాగే చూసుకుని, జనరల్ ఎనస్థిషియా స్టార్ట్ చేశాడు.
డాక్టర్ అశోక్ హాండ్స్ వాష్ చేసుకోవటానికి ముందే లిస్టులోని వివరాలన్నీ చకచకా చూసుకున్నాడు.
బాయిల్స్ ఆపరేషన్ పనిచెయ్యటం మొదలుపెట్టింది.
డాక్టర్ అశోక్ ఆపరేషన్ చెయ్యటం మొదలుపెట్టాడు. కొన్నివందల, వేల కంటి ఆపరేషన్లు చేసివున్న వ్రేళ్ళు, అనుభవ గర్వంతో, ఆత్మవిశ్వాసంతో చకచక పనిచెయ్యటం మొదలుపెట్టాయి.
మొదలు....
లింబస్ దగ్గర కన్ జక్టయిన రిఫ్లెక్ట్ చెయ్యబడింది.
తర్వాత...
ఎక్స్ ట్రా ఆక్యులార్ మజిల్స్ ఐబాల్ నుంచి డిటాచ్ చెయ్యబడినాయి.
ఎన్యూల్దియేషన్ ఆఫ్ ది ఐబాల్.
ఆఫ్టిక్ నర్వ్ కట్ చెయ్యబడింది.
ఐ బాల్ తీసెయ్యబడింది.
ఆపరేషన్ పూర్తయిపోయింది.
* * *
ఆపరేషన్ థియేటర్ నుంచి కవరీరూంకి తీసుకెళ్ళి రాధను అక్కడ కొంతసేపు పడుకోబెట్టారు.
క్రమంగా రాధకు తెలివొచ్చింది.
అక్కడ్నించి స్ట్రెచర్ మీద ఆమెకు కేటాయించిన రూంకి తీసుకువెళ్ళారు.
వరండాలో హనుమంతరావుగారు, పెద్దకూతుళ్ళిద్దరూ నిరీక్షిస్తున్నారు. ప్రదీప్ కూడా అక్కడే వున్నాడు.
స్ట్రెచర్ వెనకే వాళ్ళంతా రూంలోకి వెళ్ళారు.
రాధ బెడ్ మీద పడుకోబెట్టబడింది.
ప్రదీప్ ముందుకు కదుల్తోంటే, హనుమంతరావుగారు కూడా అనుసరించారు.
"ఇదేమిటి?"
ప్రదీప్ త్రుళ్ళిపడ్డాడు.
హనుమంతరావుగారుకూడా నిలువంతా వణికి నిర్ఘాంతపోయి చూస్తున్నారు.
తమకుకూడా అర్ధమై అక్కచెల్లెళ్ళిద్దరూ స్థాణువులైపోయి నిలబడ్డారు.
రాధ ఎడమకంటికి బదులు కుడికంటికి బ్యాండేజ్ చెయ్యబడివుంది.
ఏం జరిగింది?"
రెటీనోబ్లాస్టోమా వచ్చింది ఎడమకంటికి.
కుడికన్ను ఆరోగ్యంగా వుందన్నారు. అందులో కన్ జక్టివైటిస్ తప్ప ఏ వ్యాధీ లేదన్నారు.
మరి....?
ఆ కనుగుడ్డు తీసివేయబడింది.
ఎడమకంటికి బదులు కుడికంటికి ఆపరేషన్ జరిగింది.
క్షణాలమీద యీ వార్త హాస్పిటలంతా దావానలంలా వ్యాపించింది.
డాక్టర్ అశోక్ అప్పుడే డ్రెస్ చేంజ్ చేసుకుని మీటింగుకు బయల్దేరబోతున్నాడు.
జూనియర్ డాక్టర్ వగరుస్తూ వచ్చి తడబడుతూ, అసంపూర్తి వాక్యాలతో యీ వార్త అతని చెవిన వేశాడు.
డాక్టర్ అశోక్ ప్రక్కలోబాంబు ప్రేలినట్లుగా త్రుళ్ళిపడ్డాడు.
9
'అంకుశం' ఎడిటర్ పరాంకుశం రెండుచేతుల్లో తల పెట్టుకుని కుర్చీలో దిగులుగా కూర్చున్నాడు. ఈ మధ్య పత్రిక సర్క్యులేషన్ పూర్తిగా పడిపోయింది. ఎంత ప్రయత్నించినా యీ మధ్య ప్రజలని వెర్రెత్తించే న్యూసేమీ కనబడటం లేదు. రాజకీయంగా ఆ మధ్య అనేక సంక్షోభాలు, కల్లోలాలు చెలరేగినప్పుడు ఆ అవకాశాలన్నీ నిర్ధాక్షిణ్యంగా వినియోగించుకున్నాడు. ఆ తర్వాత అడపాదడపా సంఘంలో పలుకుబడి వున్నవాళ్ళ, ధనికుల గుట్టుమట్టులన్నీ ఫోటోలతో సహా ఏకరువు పెట్టేశాడు. దాంతో సర్క్యులేషన్ బాగా పెరిగింది. కాని వున్నట్టుండి అంకుశానికి పోటీగా త్రిశూలం అని ఇంకో పత్రిక వెలిసింది. ఆ పత్రిక ఎడిటర్ రహస్య సమాచారాలు సేకరించటంలో మరీ డాషింగ్ గా ముందుకెళ్ళాడు. అంకుశం ప్రచురించే లోపల ఆ వార్తలని ప్రచురించి మార్కెట్ లో ఒకటి రెండురోజులు ముందుగా రిలీజ్ చేస్తున్నాడు. అంతేకాదు. ఆ వార్తలలోని నిజానికి అభూతకల్పన జోడించి, మసాలా, సస్పెన్స్ చేర్చి జనరంజకంగా తీర్చిదిద్దేసరికి త్రిశూలానికి బాగా గిరాకీ పెరిగింది. పరాంకుశం ఎంత ప్రయత్నించినా ఆ పత్రిక పోటీకి తట్టుకోలేకపోతున్నాడు.
అతనికున్న ఒకేఒక్క సాధికార విలేఖరి రామలింగం. పాతికేళ్ళ యువకుడు జీవితంలో ఏ ఉద్యోగమూ దొరక్క ఈ జర్నలిజంలోకి వచ్చాడు. పరాంకుశమే మొదటగా అతనికి ఉద్యోగమిచ్చి ఆదరించాడు. మొదటి పదిరోజులూ ఎలా సేకరించాలో, వున్న నిజానికి అతిశయోక్తులు జోడించి, బాణాలెక్కుపెట్టినట్లు ఎలా సంధించాలో అన్నీ వివరించాడు. ప్రముఖుల, పారిశ్రామికుల, రాజకీయ వేత్తల వ్యక్తిగత జీవితాలపై యెక్కువ దృష్టి కేంద్రీకరించటం నేర్పాడు. గురువుకు తగ్గ శిష్యుడిలా రామలింగం అల్లుకుపోయాడు. విసుగూ, విరామం లేకుండా యెక్కడెక్కడి నిగూఢ విషయాలూ సేకరించేవాడు.
అలాంటివాడు-ఈ మధ్య త్రిశూలంపోటీకి రామలింగంకూడా చప్పబడి పోయాడు. తాను ఎంత గొప్ప వార్త తీసుకువచ్చినా అది అంతకంటే వివరంగా, ప్రముఖంగా త్రిశూలంలో ముందే అచ్చయిపోతుంది. దాంతో రామలింగాన్ని పరాంకుశం ఎడాపెడా చివాట్లు పెట్టసాగాడు.