Previous Page Next Page 
ఇట్లు....నీ చిలక పేజి 16


    ఆ ఒక్కసారి మాత్రమే చిత్ర ఇంటికి వెళ్ళింది. మళ్ళీ ఆ అవసరం రాలేదు.

    ఇలా మీనమీషాలు లెక్కవేసుకుంటూవుంటే టైమ్ అయిపోతుందనిపించి ఇందుమతి బయల్దేరడానికి నిశ్చయించుకుంది.

    జడను ఓసారి దువ్వుకోవాలని అద్దంలో చూసుకుంటూవుంటే అనసూయమ్మ గమనించింది.

    "రాత్రిపూట అద్దంలో ముఖం చూసుకోకూడదే- అలా చూసుకుంటే దరిద్రం" అంది.

    "ఇప్పుడు దరిద్రంలోనే గదా మనం వున్నాం. ఇక మనకు కొత్తగా దరిద్రం ఏమిటి?" అంటూ దువ్వెనతో పైపైనే దువ్వుకుంది.

    పైటను కుడి ఎదమీద జాకెట్టులోకి చెక్కుకుంది.

    "పైట కొంగును అలా జాకెట్టులోకి చెక్కుకోవడం బావుంటుంది! ఇంత ఊర్లోనే అలా చెక్కుకోవడం నీకే చేతనవును" అని భరణి అప్పుడప్పుడూ తనని మెచ్చుకోవడం గుర్తొచ్చింది.

    బయటికి వచ్చింది.

    శతరూప ఇంటిముందున్న ఇసుక దిబ్బమీద కూర్చునుంది, దేవాలయం రిపేరు చేయడానికి అక్కడ గ్రామస్తులు ఇసుక తోలారు.

    వెన్నెల్లో ఇసుకలో కూర్చోవడం బావుంటుంది.

    చెప్పులేసుకుంటూ "అమ్మా! నేనలా సరస్వతి పిన్ని ఇంటికివెళ్ళొస్తా" అని నడుస్తోంది.

    "ఇప్పుడా!" శతరూప అడిగింది.

    "ఆఁ"

    "టీ.వీ. చూడడానికా?" అడిగిందామె.

    "ఆఁ"

    "వెళుదువుగానిలే - ఓ క్షణం ఇలావచ్చి కూర్చో"

    ఇందుమతి బుద్ధిగా తల్లి పక్కన కూర్చుంది.

    "ఎవరా అబ్బాయి?" శతరూప ఉపోద్ఘాతంలా ఆ ఒక్క ప్రశ్న వేసింది.

    "ఎవరు?" తన కంగారును వెన్నెల దాచదని తెలుసు. అయినా తన శక్తిమేర కంగారును అణుచుకుంటూ అడిగింది ఇందుమతి.

    "అతనెవరని రెట్టించి అడగను. నువ్వు ఓ అబ్బాయితో చాలా సన్నిహితంగా వుంటున్నావని తెలిసింది. అతనూ నువ్వూ కలిసి ఏ నిర్ణయాలు తీసుకున్నారో - మీ ఇద్దరి మధ్యావున్న సంబంధం ఎలాంటిదో కూడా నాకు తెలియదు. అది మంచో, చెడో కూడా నేను నిర్ణయించలేను. అందుకే నేను ఓ పని చేయాలనుకుంటున్నాను."

    అంటే తను ఓ అబ్బాయితో తిరుగుతున్నానని అమ్మకి తెలుసుగానీ అతనితో ఈ రాత్రికే లేచిపోతున్నట్లు తెలియదు, థాంక్ గాడ్.

    గుడ్డికంటే మెల్ల మేలు అంటారే ఇలాంటిదే కాబోలు. ఇంతకి ఏం జేస్తుంది?

    "ఏమిటమ్మా"

    "సాధారణంగా తల్లిదండ్రులు తమ పిల్లలకు ఆస్తుల్ని, అంతస్తుల్ని వారసత్వంగా ఇస్తారు. పొలాల్ని, వ్యాపారాల్ని, భవనాల్ని వాళ్ళ చేతుల్లో పెడతారు. నేను మాత్రం అలాంటివేవీ ఇవ్వలేని నిస్సహాయురాలిని. పేదరాలిని" చివరికొచ్చేసరికి శతరూప గొంతు బాధతో వంకర్లు పోయింది.

    ఇందుమతి ఏం మాట్లాడలేదు. వెన్నెల్లో శతరూప కళ్ళు రెండు నీటి కొలనులయ్యాయి. కనుపాపలు తెల్లతామరల్లాగా మెరుస్తున్నాయి.

    "పెద్దలు పిల్లలు ఏదైనా తప్పుచేస్తున్నప్పుడు "మా అనుభవంతో చెబుతున్నాం. నువ్వు ఆ పనిచేయొద్దు" అంటారే తప్ప ఆ అనుభవాలేమిటో చెప్పరు. చెప్పడానికి ఇబ్బందిగా ఫీలయి చెప్పరనుకుంటా. అందుకే పెద్దలంతా పిల్లలు వయసుకొచ్చేనాటికి తమ ఆత్మ కథల్ని రాసి అందజేస్తే బావుంటుంది. ఆ అనుభవాల్ని చదివి, వాటిని జీర్ణించుకుంటే పిల్లలకి అది మార్గదర్శకంగా ఉపయోగపడుతుందని నా నమ్మకం" శతరూప మళ్ళీ ఆగింది.

    ఇందుమతి తల్లి చెబుతున్నది శ్రద్ధగా వింటోంది.

    "కానీ ఏ తల్లీ తండ్రి తమ ఆత్మకథల్ని రాసి పిల్లలకివ్వరు. ఆస్తుల్ని కూడబెట్టి ఇస్తారు.

    చివరికి వాటి వివరాలున్న వీలునామాలని అందజేస్తారు. కానీ నేనలా కాదు. నీకు దరిద్రం తప్ప వారసత్వంగా ఇవ్వడానికి నాదగ్గర ఏమీలేదు. అందుకే నా జీవిత కథంతా నీకు చెబుతాను. ఒక తల్లిలా కాకుండా ఓ స్నేహితురాలిగా నేనుపడ్డ కష్టాలు, నా ఆనందాలు, నా అవమానాలు.... అన్నీ నీకు చెబుతాను. ఆస్తి వివరాలున్న వీలునామా ఇవ్వలేని నేను నీకివ్వగలిగింది అదే.

 Previous Page Next Page