ప్రసూన అభిమానం గయాపడింది. ఆ తరువాత్ ఎన్నడూ ఏ విషయంలోను కలిగించుకోలేదు __ తెలుసుకోవాలన్న కుతూహలమూ కలగలేదు.
ఒక్కసారి కూలి పేట కెళ్ళి తల్లి బంధువులను _ అదే తన _ బంధువులను కలుసుకోవాలి __ వాళ్ళద్వారా ఏవైనా విషయాలు తెలుస్తాయేమో!
ప్రసూన కూలిపేటకు వెళ్ళేసరికి అక్కడున్న ఒకే ఒక్క కొళాయి చుట్టూ, చేరి ఆడవాళ్ళు గోలగా అరుచుకుంటున్నారు. ఒక నడివయసు మనిషి పన్నెండేళ్ళు చిన్న పిల్లని పట్టుకుని బాదుతోంది. చుట్టూపక్కల వాళ్ళు చోద్యం చూస్తున్నారేకాని కల్పించుకోవటంలేదు.
ప్రసూన కల్పించుకుంది.
పపాపం ! ఆ చిన్నపిల్ల నెందుకు కొడుతున్నావ్?"
ఒక పెద్దింట మనిషి తమ మధ్యకు రావటం, తమ విషయాల్లో కల్పించుకుని మాట్లాడటం అందరికి చిత్రంగా తోచింది. ఒక క్షణం అందరూ బొమ్మల్లా నిలబడిపోయారు. చిన్నపిల్లని కొడుతున్న నడివయసు మనిషి కొట్టడం ఆపింది.
"చూడండి , నా నీల్లల్లో చెయ్యేట్టింది."
ఆ చిన్నపిల్ల నల్లా కింద బిందెపేట్టి వెళ్ళిపోయింది. నీళ్ళు బిందెనిండి కారిపోతున్నాయి. నాకు స్కూల్ టైమవుతొంది _ ఆ బిందె పక్కన పేట్టి నా బిందె పట్టుకున్నాను ."
చదువుకుంటున్న౦దువల్ల కాబోలు ఆ పిల్ల మాటలో యాసగాలేదు.
"ఓ లబ్బో, మా సదువు సదివేస్తుండాది! రాణి, మహారాని, అందుకే తెగ నీలుగు . దాని నీలుగుమండ! ఒక చణం అగలేవే! బిందె ముట్టుకుంటావు. ముదనష్టపుదానా!"
"ఆ చిన్న పిల్ల మాట్లాడలేక ఏడుస్తోంది. ప్రసూనకంతా చిత్రంగా ఉంది.
"ఆ బిందె పక్కకు పెట్టినంత మాత్రాన నీకేం నష్టం ?"
ఆ ప్రశ్నకి అక్కడున్న అందరు ఉలిక్కిపడ్డారు. _ ప్రసూనను చిత్రంగా చూశారు. ఆ చూపులలో నిరసన కూడా ఉంది.
"మాలది .... నా బిందెట్టా ముట్టుగుంటాదండీ!"
నాగమ్మ సంజాయిషీ అడుగుతున్నాట్టే అడిగింది. "ఇంకా ఈ రోజుల్లోకూడా కులం పుట్టింపులా?" "ఏంటండోయ్ ! కావాలంటే ఆ మాలకూడు మీరు తినండి .... కూటికి పెదయితే కూలానికి పేదోళ్ళ౦ కాము ....."
మూతీ ముక్కూ విరిచింది నాగమ్మ .... వెనకనుండి పకాలున నవ్వు వినిపిస్తే వెనక్కు తిరిగింది ప్రసూన ......
చిరంజీవి గట్టిగా నవ్వుతున్నాడు ......"చిరంజీవి! నువ్వు ఇక్కడ ......"
ఆశ్చర్యంగా అడిగింది ప్రసూన ........
"ఇదే ప్రశ్న నేను మిమ్మల్ని అడగవచ్చు ..... ఆశ్చర్యపోయే హక్కు మీకంటే నాకే ఎక్కువ వుంది .... ఇక్కడి వాళ్ళు ఎంతగొప్ప వాళ్ళో చూడాలనివచ్చారా? తెలిసిందా? ఇంకా గొప్ప గొప్పవాళ్ళున్నారు. చూపించనా?"
"అందుకుకాదు __ ఇక్కడ నా ... నా బంధువులున్నారు. అందుకని ......."
"మీ బంధువులా? ....."
తెల్లబోయి చూశాడు చిరంజీవి "నిజంగా ఆశ్చర్యపోతున్నాను." అన్నాడు నవ్వుతూ ......
"రత్తమ్మ అని ......"
ప్రసూన మాట పూర్తీచేసేలోపలే కొళాయిదగ్గిర వేడుక చూడటానికి వచ్చిన రత్తమ్మ ప్రసూనను గుర్తించింది
"ఏటమ్మా! నువ్వీడ కెందుకొచ్చినావే?" అంది గాభరా పడిపోతూ .....
"నీ కోసమే .....?
"అయ్యో ..... అయ్యో .... కాకితో కబురంపితే వచ్చి వాలకపోదునేటి ? నువ్వే వచ్చినావు ......"
యెవరే అప్పా?" అంటూ మరో ఇద్దరు రత్తమ్మ పక్క చేరారు ......
"రాధమ్మ కూతురు ......" గర్వంగా చెప్పింది రత్తమ్మ ........
"మన రాధమ్మకూతురే !"
ఒక నడివయసు మనిషి వింతగా అడిగింది .... మిగిలిన వాళ్ళు ప్రసూనాను కూతుహలంగా చూశారు .....
తమ లోకానికి సంబందించని మరోలోకంనుండి డిగి వచ్చిన ఈ దేవత తమ మనిషే! తమలో ఒక వ్యక్తే .... సంభవమేనా?
"నెత్తిన పిడకలెట్టుకుని ఇల్లిల్లూ తిరిగి అమ్మేది. అదృష్టం "
ఈసుగా అంది మరొక మనిషి .....
"రా అమ్మా" మనిల్లు సూద్దుగాని .... నీలాంటోరు కూకనే ఇల్లుకాదు కాని ....."
రత్తమ్మ ప్రసూన చెయ్యిపట్టుకుని తీసికెళ్ళింది ..... పూరి పాకలో ఉన్న తాటాకుల చాప దులిపి పరిచింది. ప్రసూన కూచుంది. ఎన్నో అడగాలనుకుని వచ్చింది ..... కానీ ఆ వాతావరణంలో గొంతు తడారిపోతున్నట్టు అనిపించింది ......
"ఏటమ్మా ? ఇట్టా వచ్చావ్?" నొచ్చుకుంటున్నట్టుగా అడిగింది రత్తమ్మ .....
ప్రసూన తల వంచుకుని అడిగింది .....
"మా అమ్మ ...... మీ మధ్యలో ఉన్న మనిషి అయితే .... ఎలా ......" ఆగిపోయింది ఎలా దగాలో తెలియక.
"మాకు సరిగా తెలవదమ్మా! ఏడనుండోచ్చిందో మీ అయ్య వచ్చిండు . పిల్లనియ్యమన్నాడు. అల్లిచ్చిన్రు. ఆడు డబ్బున్నాడు కావాల! ఏటో మరి ....."
"మా నాన్నగారికి డబ్బు లేదు _ సాంబశివం గారు సహాయం చేస్తున్నారు. ఆయనకీ మా నాన్నగారికీ స్నేహంట ....."
ఆశ్చర్యంగా వింది రత్తమ్మ.
"ఆడి జిమ్మడ, ఆడి కందరితోను సేయితాలే" తెల్లబోయిన ప్రసూనను చూసి సర్దుకొంటునట్లు "మీ అయ్య సంగతి కాదులే అమ్మా, ఆ సాంబయ్య సంగతి ....." అంది.
"అయన మీకు తెలుసా?"
"ఆడిని తెలవని దేవరికి ? మిద్దింటోల్ల రామనాధయ్య యేలచ్చన్లో నిలబడితే ఈడు ఎనకే తిరిగి అయిన్ని గెలిపించాడు. ఇద్దరి చక్రాలు తిరిగినయ్యి. కొండలెక్కి కూసున్నారు. ఇద్దరి చక్రాలు తిరిగినయ్యి. కొండలెక్కి కూసున్నారు. పచ్చి పోరంబోకు సచ్చినోడు మీ అయ్యకీ అడికీ మద్దెనే వుందోమరి ......."