"ఎవరి సంబంధం?" అన్నాడు కేశవరావు చిరాగ్గా.
"గరికపాటి వాళ్ళ సంబంధమోయ్, భగవాన్లూ! కుర్రాడు డాక్టరు, వాళ్ళ పల్లెటూళ్ళోనే ప్రాక్టీసు పెట్టాడు. ముగ్గురు అక్కచెల్లెళ్ళు, లక్ష్మీదేవి లాంటి తల్లి! మంచి భూవసతి! కావిళ్ళతో పాలూ పెరుగూనూ!"
"నీకు ఒళ్ళు పెరుగుతున్న కొద్దీ బుర్ర తరుగుతూంది! లేకపోతే ఏమిట్రా! వాళ్ళ పాలూ పెరుగూ, వాళ్ళ బర్రెలూ వాటి పేడా చూసి మన అమ్మాయిని ఇస్తామా? పట్నవాసంలో పెరిగిన పిల్లని పల్లెటూరి బైతుకి - వాడు డాక్టరే కానివ్వు - ఎలా దానితో రమణయ్య చప్పబడిపోయాడు.
దానితో రమణయ్య చప్పబడిపోయాడు.
కేశవరావు లేని పౌరుషం తెచ్చుకుని అన్నాడు. "ఒరే రమణయ్యా! ఇన్నాళ్ళూ దీన్ని అపురూపంగా పెంచింది ఏ అనామకుడి చేతిలోనో పెట్టెయ్యడానికా? మా అమ్మాయిని చేసుకోవాలంటే పిల్లాడు లక్షణంగా ఉండాలి. ఆస్తిపరుడై ఉండాలి. అత్తా ఆడబిడ్డల పోరు ఉండకూడదు. కుర్రాడు ఏ అమెరికాలోనో పని చేస్తూ అమెరికలాంటి వాడయి ఉండాలి. తెలిసిందా? దానికి తగిన సబంధం దొరక్కపోతే అది ఆజన్మాంతం నా దగ్గరే లక్షణంగా ఉండిపోతుంది కానీ, ఏదో కక్కుర్తి సంబంధం చేసుకోదు గాక చేసుకోదు!"
పక్క గదిలోనుంచీ ఈ మాటలు వింటున్న ప్రతిమకి తృప్తిగా అనిపించింది. తన భవిష్యత్తు మీద ఎంత శ్రద్ద నాన్నగారికి!
ఆయన కోరుకున్నట్లే అన్ని విధాలా తగినవాడు తనని కోరి మరీ పెళ్ళి చేసుకోబోతున్నాడని తెలిస్తే, 'వెదకబోయిన తీగె కాలికే తగిలింది' అనుకుని సంతోషిస్తారేమో!
కానీ శృతి వచ్చి ఆ సంగతి చెప్పగానే ఆయన ముళ్ళతీగె పంచెకు పట్టుకుని తట్టుకు పడ్డట్లు ఫీలవుతాడని గ్రహించలేకపోయింది ప్రతిమ. ఆయన అవస్థ వర్ణనాతీతం! చల్లగా, బరువుగా ఉన్న మంచుదిమ్మ నెత్తిన పడ్డట్లు దిమ్మెత్తిపోయింది అయన మనసు. కొద్ది క్షణాలసేపు నోటెంబడి మాట రాలేదు.
తనకు పిన్ని కొడుకైన శ్రీరాం ప్రతిమని చేసుకోవడానికి ఇష్టపడుతున్నాడనీ, వాళ్ళమ్మగారు కూడా అందుకు సుముఖంగానే ఉన్నారనీ, ఎంతైనా ఆడపిల్ల తండ్రి కాబట్టి కేశవరావు ఒకసారి లాంఛనంగా మాట్లాడితే బాగుంటుందనీ చెప్పింది శృతి.
"అసలు దానికి ఇష్టమో కాదో కనుక్కోవద్దూ?" అన్నాడాయన. ఆయన మొహం అప్రసన్నంగా ఉంది.
"ఆ ఛాప్టర్సు అన్నీ ముగిశాయి. ప్రతిమకి ఇష్టమే!" అంది శృతి నవ్వుతూ.
హతాశుడై పోయాడు కేశవరావు. ఆయనకి బక్క కోపం లాంటిది వచ్చింది.
"మరి అంతా అయిపోయాక నేనొచ్చి అఘోరించేదేముంది? మోడరన్ గా వాళ్ళంతట వారే నిశ్చయం చేసుకున్నప్పుడు, ఇక ఈ పాతకాలం పద్దతులూ, ఆడపెళ్ళివారే వచ్చి మాట్లాడాలి పట్టింపులూ ఇవన్నీ ఎందుకమ్మా? మీ పిన్నే వచ్చి అడగొచ్చుగా?" అన్నాడు.
శృతి ఆయన్ని విచిత్రంగా చూసింది.
"మీరు వెళ్ళి మాట్లాడటమే మర్యాద" అంది మెల్లిగా.
"మర్యాద! మర్యాదల గురించి నాకా అమ్మా చెప్పేది? మర్యాదల కోసం సంపాదించినదంతా తగలేసి దమ్మిడీ వెనకెయ్యని వెధవని నేను. నాకా మర్యాదలు నేర్పించేది?" అన్నాడు పరుషంగా.
శృతి మాట్లాడలేదు.
"అసలేం చేస్తుంటారు వీళ్ళు?" అన్నాడు కేశవరావు.
"శ్రీరాం వాళ్ళ నాన్నగారు స్థలాలు కొని అమ్ముతూ రియల్ ఎస్టేట్ బిజినెస్ లో బాగా సంపాదించారు. ఆయన పోయి నాలుగేళ్ళయింది. శ్రీరాంకి ఒక టీవీ కంపెనీ డిస్ట్రిబ్యూషనూ, కొన్ని ఎలెక్ట్రానిక్ కంపెనీల ఏజెన్సీలూ ఉన్నాయి."
"వ్యాపారస్థులా? బాగుంది! వీళ్ళ తాత?"
ఆయన మొహంలోకి సూటిగా చూసింది శృతి.
"చెప్పమ్మా! ఏం చేసేవాళ్ళు వీళ్ళ తాత ముత్తాతలు? ఏడడుగుల సంబంధం కలుపుకోవాలంటే ఏడు తరాల మంచి చెడ్డలు విచారించుకోవాలి."
"వీళ్ళ తాతగారు యాయవారాలు చేసేవారు" అంది శృతి నెమ్మదిగా.
"యాయవారమా? అంటే అడుక్కుతినేవాళ్ళన్నమాట! మా తాత ఏం చేసేవాడో తెలుసా? లేవగానే సద్భ్రాహ్మడు కనపడాలని, ఇంటికెదురుగా ఉన్న అయిదొందల గజాల స్థలం శ్రీనివాసాచారికి దానంగా ఇచ్చేశాడు. మా ముత్తాత ఏం చేసేవాడో తెలుసా? ఇంటికి వచ్చి, ఒళ్ళు పట్టి, తలంటి పోసే మంగలికి అయిదెకరాల మెట్ట పొలం ఇనాంగా రాసిచ్చాడు. ఇదంతా ఎప్పుడూ? మీ శ్రీరాం తాతలు దానాలు పడుతున్నప్పుడు? అలాంటి మా వంశం ఇలా అయిపోయింది. అడుక్కుతినే వాళ్ళూ, గుడిసెల్లో ఉండేవాళ్ళూనేమో మేడలు కట్టేస్తున్నారు! కలికాలం!"
అసందర్భంగా ఉన్న ఆయన మాటలు వినేసి, కాసేపు మౌనంగా ఉండిపోయింది శృతి. తరవాత "రేపు మీరు ఆఫీసు నుంచి ఒకసారి అటు వస్తారా?" అంది తటపటాయిస్తూ.
"చూద్దాంలే! వీలు హ్కోసుకుని రేపో, ఎల్లుండో వస్తాను."
శ్రీరాం సంగతి వినగానే నాన్నగారు బ్రహ్మానందభరితులవుతారని ఆశించిన ప్రతిమకి కొంచెం నిరుత్సాహం కలిగింది.
శృతి కేశవరావు దగ్గర సెలవు తీసుకుని ప్రతిమ దగ్గరికి వచ్చింది. బియ్యం కడిగి స్టౌ మీద పెడుతూంది ప్రతిమ.
"ఏమిటలా మాట్లాడతారు మీ నాన్నగారూ?" అంది శృతి గొంతు తగ్గించి.
ప్రతిమ జవాబు చెప్పకుండా, చిరునవ్వు నవ్వింది.
"నీ పెళ్ళి చెయ్యడం అసలు ఆయనకి ఇష్టం ఉందా?" అంది శృతి నిర్మహమాటంగా.
"ఛీ! మరీ అలా అనెయ్యకు!"
"ఏమో! ఆయన ధోరణి చూస్తే చాలా పెడసరంగా ఉంది."
"నాకు చాలా మంచి సంబంధం తేవాలని కోరిక నాన్నగారికి. అందుకే ఇందాక రమణయ్యగారు ఏదో సంబంధం చెప్పినా వద్దనేశారు."
"ఎవరి సంబంధం?" అంది శృతి అనుమానంగా.
"ఎవరో పల్లెటూరి వాళ్ళుట! అతనూ డాక్టరే కాని ఆ పల్లెటూళ్ళోనే ప్రాక్టీసు చేస్తున్నాట్ట."
"దానికేం అభ్యంతరం చెప్పారు?"
"చెబుతున్నా కదా! పల్లెటూరి వాళ్ళని వద్దనేశారు."
"మరి శ్రీరాం వాళ్ళ సంబంధానికేం రోగం?" అంది శృతి. తను తలుచుకుంటే చాలా కటువుగా మాట్లాడగలదు.
శృతి కోపం చూసి ప్రతిమ నవ్వింది.
* * * * *