"అమలకి అప్పుడే ఇరవై ఏళ్లు నిండాయి. దిక్కుమాలిన చదువు ఎవరిని ఉద్ధరించను? పెళ్ళి చేస్తే ఈ పాటికి పిల్లల తల్లయి కళకళలాడుతూ వుండేది" అంటుంది రాజేశ్వరమ్మ. ఆడపిల్లలకు పెళ్ళి, పిల్లలు, అనుకూల దాంపత్యం చాలని ఆమె అభిప్రాయం.
"అమ్మడు ఇష్టపడ్డప్పుడే పెళ్ళి పేరంటం. పెళ్ళిమాట నా ముందేత్తకు. దానిష్టమొచ్చినంత చదువుకోని" అంటారు పరంధామయ్య.
పెద్ద చదువులు చదవటం, గొప్ప పనులు చేయటం అమలకు ఇష్టం. ప్రస్తుతం బి.ఏ. చదువుతున్నది.
పక్కఊళ్ళోనే చుట్టాలింటిలో పెళ్ళి. వాళ్ళయినా చాలాదూరం చుట్టాలు. బీదవాళ్ళు, పెళ్లిరాత్రి ఒంటిగంటకి అందుకే సర్కార్ లో ఏడుగంటలకు బైలుదేరి తిరిగి ఉదయం సర్కార్ లో రావాలని అనుకున్నారు.
తెల్లవారితే పరీక్షలు. అందుకే పెళ్ళికి రానంది అమల.
పరంధామయ్య, రాజేశ్వరమ్మ ఎక్కిన రిక్షా బైలుదేరింది.
రిక్షా వీధి మలుపు తిరిగిందాకా చూచి ఇంటిలోకి వచ్చి తలుపు గడియ బిగించింది అమల.
పరంధామయ్య ఇల్లు పెద్దది అంటే, పన్నెండు పెద్ద గదులున్నది. మూడు గదులు చిన్న కాపురానికి అద్దెకిచ్చారు. ఆ వాటాలో వాళ్ళు యాత్రల నిమిత్తం పదిరోజుల క్రితం తమ వాటాకి తాళంవేసి వెళ్ళిపోయారు.
అమల సహజంగా ధైర్యం కలది కాబట్టే ధైర్యంగా తల్లి తండ్రులను పంపించి, ధైర్యంగా వుంది.
అమల భోజనం ఎనిమిది గంటలకే చేసింది. కాసేపు విశ్రాంతిగా మంచంమీద మేనువాల్చింది. తెల్లవారి బి.ఎ. పబ్లిక్ పరీక్షలు మొదలు. పుస్తకాలు ముందేసుకుని చదవసాగింది.
మళ్ళి అదే కీచు కంఠం. అమల చదువుతున్న పుస్తకం తెలియకుండానే చేతిలోంచి జారిపోయింది. గుండె దడదడలాడింది.
అమల భయం కప్పి పుచ్చుకుని, చటుక్కున తల ఎత్తింది కిటికీ వైపు.
కిటికీకి ఆనుకుని ఓ వికృతాకారుడు నుంచునివున్నాడు. అతని రెండు చేతులు కిటికీ ఊచలను పట్టుకుని వున్నాయి. అమల వణికిపోతూనే విసురుగా లేచి వేగంగా కిటికీ తలుపులు వేయబోయింది.