ముందూ వెనుకా కాగడాలు పట్టుకుని నడచిన సైన్యం... ఆ తర్వాత తండ్రీ... తను.
"వృద్ధాప్యం పైబడినా, నీలో ఇంకా జ్ఞాపకశక్తి ఉందయ్యా. ఇంకా చెప్పు" ఉత్సాహంగా అన్నాడు కౌశిక భూపతి.
నిమిషాలు గడుస్తున్నాయి. కౌశికభూపతి ఆలోచనలో పడ్డాడు.
ఫూల్ బాగ్ ప్యాలెస్ కు వెళ్ళే రహస్య మార్గం గురించి ఆలోచిస్తూ ఉన్నాడు ఆయన. తను తండ్రి కాకుండా ఆ సమయంలో తమతోపాటు ఎవరో ఒక వ్యక్తి ఉండాలి. ఎవరు అతను?
ఆ వ్యక్తి కనుక ప్రస్తుతానికి బతికి ఉంటే ఆ వ్యక్తి ద్వారా తనకు చాలా విషయాలు తెలుస్తాయి. ఎవరా వ్యక్తి శతవిధాలా జ్ఞాపకం చేసుకోవడానికి ప్రయత్నిస్తున్నాడాయన. గంట... రెండు గంటలు... మూడు గంటలు కాలగతిలో కలిసిపోయి తెలతెలవారబోతోంది.
"ఇక వెళదామా ముత్యాలూ..." ముత్యాలు మాట్లాడలేదు. దర్బారు హాల్లో కౌశిక భూపతికి పాత విషయాలు జ్ఞాపకం వస్తాయనీ నిధి నిక్షేపాల విషయం తెలుస్తుందని ఆశపడ్డ ముత్యాలు... ఏమీ జ్ఞాపకం రాకపోవడంతో నిరాశకు లోనయ్యాడు.
"పదండి..." నీరసంగా అంటూ లేచాడు ముత్యాలు.
ఇద్దరూ రాజదర్బారు హాలులోంచి బయటకు వచ్చారు. తలుపులు మూసేసి తాళం వేశాడు ముత్యాలు. నివాస భవనం వైపుగా నడక ప్రారంభించాడు కౌశిక భూపతి, కొంచెం దూరంలో ముత్యాలనాయుడు.
కోట వెనుక ద్వారానికి ఎడమవైపున ఉన్న గంటల స్తంభం ప్రాకారం మీద బంగారు డాలులాగా సూర్యుడు మసగ్గా మెరుస్తున్నాడు. సూర్యునివైపు చూసి రెండు చేతులూ ఎత్తి నమస్కారం పెట్టి మనస్సులోనే ప్రార్ధన చేసుకొని రోజూ కూర్చునే తన కుర్చీలో కూర్చున్నారాయన.
"ఎందుకో... ప్రభాత కాలపు సూర్యుడిని చూసినప్పుడల్లా ఇందుమతి జ్ఞాపకం వస్తుందయ్యా... పాపం దానికి అన్యాయం జరిగిపోయింది. నేనా శక్తివిహీనుడిని, మా కులదైవం సూర్యభగవానుడు దానికి అన్యాయం చేశాడయ్యా" బాధగా అన్నాడాయన.
"ఎందుకంత నిరాశ... సూర్యవంశ రాజులకెపుడూ అన్యాయం జరగదు. సూర్యభగవానుడు ఎప్పుడూ అన్యాయం చేయడు. అపార నిధి నిక్షేపాలకు ఇందుమతి వారసురాలవుతుంది. నాకా నమ్మకం వుంది..." మెరిసే కళ్ళతో అన్నాడు ముత్యాలనాయుడు.
"పరీక్ష ఫీజుకు డబ్బులు లేక అదెంత బాధపడుతుందో? సుఖించటమే తప్ప దుఃఖించడం తెలీని పాప... ఈ కోట ఆవరణలో బంగారు పువ్వుల్లో పువ్వులలాగా పెరిగిందయ్యా... అన్నదమ్ముల స్వార్ధానికి బలైపోయింది. విధి విచిత్రం కదూ."
"మీరు బాధపడకండి కౌశికభూపతీ. ఆమెలో మీ తండ్రిగారి వర్చస్సూ... పట్టుదలా... ఠీవీ... ఉన్నాయి. ఆ ఠీవీ ఉన్న జాతకం మసిబొగ్గులాగా ఉండదు రాజావారూ. ఆ సూర్యభగవానుడు ఏదో ఒక మహాసంకల్ప సిద్ధికి ఆమెను ఆయత్తం పోయింది. విధి విచిత్రం కదూ"
"మీరు బాధపడకండి కౌశికభూపతీ. ఆమెలో మీ తండ్రిగారి వర్చస్సూ... పట్టుదలా... ఠీవీ... ఉన్నాయి. ఆ ఠీవీ ఉన్న జాతకం మసిబొగ్గులాగా ఉండదు రాజావారూ. ఆ సూర్యభగవానుడు ఏదో ఒక మహాసంకల్ప సిద్ధికి ఆమెను ఆయత్తం చేస్తాడు... నాకా నమ్మకం ఉంది."
"నమ్మకమే మనిషికి పునాది" తనలో తానే అనుకున్నాడు కౌశిక భూపతి ఒకింత బాధగా.
* * * *
కోట ముఖద్వారం దగ్గర ఎడ్లబండి గంటలు వినిపిస్తే కళ్ళు చిట్లించుకుని చూశాడు కౌశికభూపతి... ఆ సమయంలో ముత్యాలనాయుడు లోపల పనిలో ఉన్నాడు. ఆ ఎడ్లబండి పాడుబడిన ఉద్యానవనం వరకూ వచ్చి ఆగిపోయింది. అందులోంచి అకస్మాత్తుగా దిగిన- ఇందుమతిని చూసి ఆశ్చర్యపోయాడాయన.
ఎదురుగా వచ్చిన ఇందుమతి తండ్రి ముఖంవైపు తేరిపార చూసి వంగి కాళ్ళకి నమస్కరించింది.
"బాగున్నారా నాన్నగారూ..." ప్రేమగా అడిగింది.
"ఎడ్లబండి వచ్చేదికదా? పరీక్షలు అయిపోయాయా? డాక్టర్ వి అయిపోయావన్న మాట... నాకిక వేరే డాక్టర్ అక్కర్లేదు..." అన్నాడు మహదానందంతో కౌశికభూపతి.
ఆ మాటలకు జవాబు చెప్పలేదు ఇందుమతి. లోనికి వెళ్ళి పోయింది మౌనంగా.
వెనుక ఎడ్లబండివాడు సూట్ కేస్ ని వసారాలో పెట్టి, వినయంగా రాజావారికి దండం పెట్టి ఆపైన నేలమీదే దండం పెట్టుకుంటూ వెన్ను చూపకుండా వెనక్కి నడుస్తూ వెళ్ళిపోయాడు.
* * * *
మధ్యాహ్నం మూడున్నర గంటలు...
అకస్మాత్తుగా ఇందుమతి బెంగుళూరు నుంచి ఎందుకు వచ్చేసిందో, కారణం అడిగి మరీ బాధ పెట్టడం ఇష్టంలేక అంతవరకూ మౌనంగా ఉండిపోయాడు కౌశికభూపతి.
"అమ్మాయిగారితో నిధి నిక్షేపాల విషయం... కదిపితే బాగుంటుందయ్యా" తెచ్చి కాఫీగ్లాసును చేతికి అందిస్తూ అన్నాడు ముత్యాలు.
"అమ్మాయి ఎందుకు వచ్చేసిందో కనుక్కో ముందు... తర్వాత మిగిలిన విషయాలు" నిర్లిప్తంగా అన్నాడు ఆయన.
"ఎందుకు వచ్చేసిందో మనకు తెలీదా... మనల్ని మనం మరింతగా బాధపెట్టుకోవడం మంచిది కాదేమో. మీరుకానీ, అమ్మాయిగారు చదువు మానేసి ఉంటారు. ఇలాంటి సమయంలోనే పాపగారి ఆలోచనలను ప్రక్కకు మళ్ళించాలి... అందుకు సరి అయిన సమయం ఇది."
గత ఏడు దశాబ్దాలుగా ముత్యాలనాయుడి వ్యక్తిత్వం గురించీ, తమ కుటుంబం పట్ల అతనికి వున్న అవ్యాజ్యమైన మమకారం... తమ ప్రస్తుత స్థితిపట్ల అతడు పడే మదన... అంతా తెలుసు కౌశికభూపతికి. "నీ ఇష్టం ముత్యాలూ... అమ్మాయి నాకు ఎంతో నీకూ అంతేకదా" నిర్లిప్తంగా అన్నాడు ఆయన.
* * * *
ముత్యాలనాయుడు చెబుతుండగా మౌనంగా వింటోంది ఇందుమతీ దేవి.
ఎన్నెన్నో సంఘటనలు... తనకు జరిగినవి... బాల్యంలో జరిగినవి.
కథలూ, గాధలూ నెమ్మదిగా చెప్పుకు వచ్చాడు. ఆ తర్వాత ప్రాభవం పొంది చితికిపోయిన రాజవంశాల గురించి చెప్పుకుంటూ వెళ్ళాడు.
అన్నీ ఇప్పుడు పనికట్టుకుని ఎందుకు చెప్పుకుంటూ వస్తున్నాడో ఏమాత్రం అర్ధం కాలేదు ఇందుమతీదేవికి.
"రాజవంశాలు ఎలా ఏర్పడ్డాయి... మహారాజులు ఎలా ఏర్పడ్డారు... వారికి అపారమైన నిధినిక్షేపాలు ఎలా వచ్చాయి... దండయాత్రల్లో, యుద్ధాల్లో గెలిచి సంపాదించిందే కదా... విదేశీయులు మన దేశమ్మీదే ఎందుకంత కన్ను వేశారు. గజనీకానీ, ఘోరీకానీ ఎందుకు అన్నిసార్లు మన దేశమ్మీదకు దండెత్తి వచ్చారు? బ్రిటీషు దొరలు పూర్తిగా మనదేశాన్ని ఆక్రమించుకోవాలని ఎందుకు అనుకున్నారు? అపారమైన నిధి నిక్షేపాల కోసమే... మన పురాణాలను బాగా చదువుకున్న వారు మన దేశంలో స్వర్ణ పర్వతాలు వుండేవని చెబుతారు. వేదాల్లో కాళింజార్, థియోగర్ రాజ్యాల గురించి ఉంది. ఆ తర్వాత మన దేశ సంపదపై కన్నేసి తొమ్మిదవ శతాబ్దంలో ఛాన్ డెల్లా రాణులు పదహారవ శతాబ్దంలో మొగల రాజులు, చివరికి 18-19 శతాబ్దాల్లో బ్రిటీష్ వాళ్ళు మనదేశం మీదకు ఎందుకొచ్చారు? సంపద కోసమే.
కొన్ని కోట్ల సంవత్సరాల క్రితం... ఆదిమానవులకు బంగారం గురించి ఏం తెలిసుంటుందమ్మా... రాతికొండల మీద ఆడుకున్నట్లే బంగారు కొండల మీద ఆడుకొని వుంటారు. బంగారం విలువ తెలిసివచ్చాక కొండలు కరిగిపోయాయి. ఇప్పుడు బంగారం గురించి పాతాళంలో వెతుక్కోవల్సిన పరిస్థితి వచ్చింది. ఆ పరిస్థితిలోనే నవరత్నాలు బైటపడ్డాయి. వజ్రాలు బయటపడ్డాయి. అప్పటినుంచీ మనిషి విలువైన వాటికోసం అన్వేషణ ప్రారంభించాడు.
సంపద కోసం, ఆస్థికోసం, ఐశ్వర్యం కోసం నిరంతర యుద్ధాలు జరిగాయి. యుద్ధాల్లో గెలిచినవాడు తన సమూహంలో, తను సంపాదించుకున్నదాన్ని రక్షించుకోడానికి కోటలు కట్టుకున్నాడు... అందుకు అంగబలాన్ని ఏర్పాటు చేసుకున్నాడు. తన అధికారాన్ని ఖజానాని, రక్షించుకోవడానికి నిరంతరం అప్రమత్తంగా ఉండేవాడు. ప్రపంచంలో భారతదేశం ఒకప్పుడు రత్నగర్భంగా వుండేదని పెద్దలు అనేవారు. అలనాటి చరిత్రకు చెందిన ఏ కోటనైనా చూడు- పది కాలాలపాటు నిలిచే సంస్కృతికి సంపదలకి నిదర్శనం. అలాగే పాతతరం మహానుభావులు తర్వాత తరం రాసులకోసం దాచిపెట్టిన నిధినిక్షేపాలు ఇప్పటికీ భారతదేశంలో కోట్లలో ఉన్నాయి" చెప్పడం ఆపాడు ముత్యాలనాయుడు.
"ఇప్పటికీ నిధినిక్షేపాలు కోటల్లో ఉన్నాయా?" ఆశ్చర్యంతో పెదవి విప్పింది ఇందుమతి.
"ఎందుకు లేవమ్మా! కోహినూర్ వజ్రం ఎలా బయటపడిందమ్మా. పాత కట్టడాల నుంచి బంగారు నాణేల బిందెలు ఎలా బైటపడుతున్నాయి. హంపి విజయనగరం తవ్వకాలలో అపురూప నాణేలు ఎలా బయటపడ్డాయి. ఇవన్నీ నిధినిక్షేపాలలో భాగం కాదా తల్లీ."
"కోటల్ని గవర్నమెంటు హేండోవర్ చేసుకున్నాక, లభ్యమైన నిధులన్నింటినీ కూడా గవర్నమెంటు తీసేసుకుందికదా" ఆసక్తిగా అడిగింది ఇందుమతి.
"కన్పించిన నిధులను తీసేసుకుంది... కన్పించని వాటి సంగతేమిటి?"
"కన్పించని నిధులంటే..."
"కన్పించని విధంగా రహస్యంగా, గుప్తంగా దాచి పెట్టిన నిధులు..."
"అంటే ట్రెజర్ హంటింగ్... సినిమాల్లో లభించే నిధుల్లాంటి నిధులా..."
"అవునమ్మా... అలాంటి నిధులు ఇప్పటికీ వున్నాయి."
"ఉంటే గవర్నమెంట్ ఎందుకు ఊరుకుంటుంది. ఆ నిధులు ఉన్నాయని తెలిస్తే... ఆ నిధుల కోసం అన్వేషణ చేసేది కదా..."
"ప్రభుత్వం వేటాడితే ఆ నిధులు దొరకవమ్మా... వారసులు అన్వేషించితేనే ఆ నిధులు దొరుకుతాయని విన్నాను... లేకపోతే... బెడిసి కొడుతుందమ్మా..." సీరియస్ గా అన్నాడు ముత్యాలు నాయుడు.
"అందులో బెడిసికొట్టడం ఏముంది?"
"నాకు బాగా జ్ఞాపకం... ముప్పయ్ ఏళ్ళక్రితం కుస్తీ పోటీల కోసం నేను రాజస్థాన్ వెళ్ళాను... ఎడారిలో కట్టిన జైసాల్మర్ కోట గురించి వినే వుంటారు... అద్భుతమైన కోట... ఒకప్పుడు జైసాల్మర్ కు పర్షియా, ఆఫ్ఘనిస్తాన్ నుంచి వర్తకులు వచ్చేవారు... ఆ ప్రాంతం అప్పట్లో పెద్ద వ్యాపార కేంద్రం... విలువైన సంపద అక్కడ చేతులు మారేది... అప్పటి జైసాల్మర్ రాజు జైత్ సింగ్... ఆయన సంపద మీద ఢిల్లీ సుల్తాన్ అల్లా ఉద్దీన్ ఖిల్జీ కన్ను వేశాడు... ఎన్నో దాడులు జరిగాయి. ఎనిమిది సంవత్సరాల తరబడి దాడులు జరిగాయి. జైత్ సింగ్ తన సంపదనూ, తన కోటనూ రక్షించుకోవడం కోసం తన వంశాన్నే పణంగా పెట్టాడు. భయంకరమైన యుద్ధం జరిగింది. మొత్తానికి 1295లో యుద్ధం ఆగిపోయింది. కాని అప్పటికే లక్ష్మీకళ ఉట్టిపడే ఎడారి మీద నెత్తుటి చారికలు కట్టాయి.