ఆశ్చర్యం.....!
కళ్లు మిరుమిట్లు గొల్పుతూ వజ్ర వైడూర్యాలు కనిపిస్తాయనుకుంటే, బిలబిల్లాడుతూ వికృతాకారాలతో, పొరల్లాంటి కాళ్లతో ఇనుప తేళ్లు కనిపించేసరికి... .ఒక వెర్రికేక పెట్టి వెనక్కి పరుగెత్తాడు.
తలుపు తెరుచుకుని వున్నా ఇనుప తేళ్లు బయటకు రావడానికి ప్రయత్నించేలదు. అలజడిగా ఒకదానిమీద ఒకటి పోరాడుతూ బిలబిల్లాడుతున్నాయి.
వాటి మధ్య నల్ల నాగుపాము చుట్టలుగా చుట్టుకుని చుట్టమీద తల పెట్టుకుని నిశ్శభ్దంగా చూస్తోంది. తుపాన్ కి ముందు ప్రశాంతతలా వుంది దాని వైఖరి.
"సి. ఎం. సాబ్! ఎక్కడో ముదనష్టపు సొమ్ము తెచ్చి పెట్టుకున్నారు కదా ఇంట్లో... ఇది ధనలక్ష్మి కాదు- ధన పిశాచం! మిమ్మల్నీ, మీ ఇంటినీ సర్వనాశనం చేసిగానీ వదలదు. వంద పాములు ఒక్కసారి బుసకొట్టినట్లు ఆ శబ్దాలు చూడండి."
"ముందా ఐరన్ సేఫ్ తలుపు మూయండి లాల్ జీ!"
ఆయన తలుపు మూశాడు. తాళం చెవి కన్నంలో తిప్పి లాక్ చేశాడు.
"ఏమిటి విచిత్రం? నేను నా కళ్లతో చూశాను. వజ్ర వైఢూర్యాలతో కూడిన నగలను, మేలిమి బంగారపు కడ్డీలనూ, వాటిని నా మనుషులతో ఐరన్ సేప్ లోకి చేర్పిస్తుంటే, లైట్లు లేకుండాన, ధగధగలాడిపోయింది నవరత్నాల కాంతులతో, ఇంతలో అవి తేళ్లుగా, పాములుగా మారాయంటే ఆశ్చర్యంగా వుంది."
"అంత పెద్ద మొత్తంలో గుప్తనిధి దొరికినప్పుడు దానికి సరయిన శాంతి చేయాలి సి. ఎం సాబ్! నరబలి జరగాలి. అదేమీ లేకుండా దొరికింది కదాని లటుక్కున ఇంట్లోకి తెచ్చిపెట్టుకుంటే ఇలాగే జరుగుతుంది. ఇది మీకు దక్కే సొమ్ముకాదు. నా మాట విని దీన్ని తీసుకుపోయి బ్రిడ్జిమీద నిలబడి ఏ ఏట్లోకో విసిరేయండి. బ్రతికిపోతారు. లేకపోతే సర్వనాశనం తప్పదు మీకు..,....." సి. ఎం. ముఖ కవళికల్ని చూసి తన సలహా నచ్చలేదని గుర్తించాడు లాల్ జీ.
"సరే! మీకిష్టం లేదు. అయితే ఒక పని చేయండి.. .ఒక మంచి మంత్రగాడిని పట్టుకోండి. బలి గిలి ఇచ్చి దీనిమీదున్న పిశాచాల్ని వదిలిస్తాడు. మీకు అదృష్టం వుంటే మీకు ధనలక్ష్మి దక్కుతుంది. లేకపోతే ఇంతే సంగతులు."
"మీకెవరయినా మంచి మంత్రగాళ్లు తెలుసా?"
"నాకెవరూ తెలియదు. సి. ఎం. సాబ్! ఇది చూస్తే నాకు చిన్నప్పుడు విన్న ఒక సంగతి గుర్తుకొస్తోంది. ఒక కోమటికి దొడ్లో చెప్పు పాదుకోసం తవ్వుతుంటే లంకెబిందెలు దొరికాయట. ఆత్రంగా ఇంట్లోకి ఎత్తుకొచ్చి మూతతీసి చూస్తే ఇలాగే అందులో తేళ్లు, పాములూ కనిపించాయట. మన కోమటి భయపడకుండా ఆ తేళ్లనీ, పాములని తీసుకుపోయి తన కొట్లో టీపొడి పాకెట్లనీ, వక్కపొడి పాకెట్లనీ వ్రేలాడదీసినట్లు వ్రేలాడదీశాడట."
"అన్ని సరుకులతోపాటు తేళ్లనీ, పాములనీ కూడా అమ్ముతున్నావా శెట్టి?" ఇవి ఎవరు కొంటారు?"
సరుకుల కోసం వచ్చిన వాళ్ళంతా తేళ్లనీ, పాముల్నీ చూసి ఆశ్చర్యపోతున్నారు.
"అవి అమ్మడానికి కాదులే! నా షాపుకి ప్రత్యేక ఆకర్షణగా తగిలించాను."
కోమటి సమాధానం విని నవ్వుకోసాగారు కస్టమర్లు. అలా కొద్ది రోజులు గడిచాక పల్లీపట్టీలు కొనడానికి వచ్చిన ఓ కుర్రాడు -
"నాగరాలు, జడగంటలు, వడ్డాణం, చంద్రహారం, మాటీలునావంకీ..... అబ్బ... .ఇన్ని నగలు తగిలించి పెట్టావేం నారాయణ మామా...? ఎందుకిక్కడ తగిలించావు?" అంటూ బోల్డు ఆశ్చర్యపోయాడట.
"బాబ్బాబూ! ఒక్కసారి నీ చేత్తో తాకి నాకివ్వరా! నీకు బోలెడు పల్లీ పట్టీలు డబ్బులు లేకుండా యిస్తాను" అన్నాడు కోమటి.
ఆ కుర్రాడు వాటినన్నిటినీ తీసి కోమటి చేతిలో పోశాడట. అవి మళ్లీ తేళ్లు,పాములు కాకుండా మిగిలిపోయాయట. అలాంటి మిరకిల్ ఏదయినా మీ విషయంలో జరగాలి సి. ఎం. సాబ్! మీరు కోట్లకు పడగలెత్తుతారు"
నిజమే! అలాంటి మిరకిల్ ఏదయినా జరిగితే తను ప్రపంచంలోనే మొట్టమొదటి కోటీశ్వరుడై పోతాడేమో!
అవి నిజం తేళ్లు కావు, అవి కరువవు. గారడీ వాడు వేపాకు దూసిపోసి తేళ్లుగా మార్చడం తను చిన్నప్పుడు చూశాడు. తేళ్లుగా కనిపించేవే గానీ, తేళ్ళు కావు. కనికట్టు ప్రభావం తగ్గగానేే ్వి యధావిధిగా వేపాకులుగా కనిపించేవి.
అవును! మంత్రగాడిని పట్టుకుంటే?
సుబ్రహ్మణ్యస్వామిని మించిన మంత్రగాడెవరున్నారు?
కానీ అతడిని ఏ ముఖం పెట్టుకుని పిలుస్తాడు?
ప్రజలకోసం వినియోగించమని తెచ్చిన నిధిని తను స్వార్దంతో కైంకర్యం చేశాడని తెలిస్తే ఆగ్రహంతో తనకు చేతబడి చేసి చంపినా చంపుతాడు.
హఠాత్తుగా నాయుడి స్మృతిపథంలో కాషాయాంబరధారి, మెడలో రుద్రాక్షమాలలు, బవిరి గడ్డంతో ఒక వ్యక్తి మెదిలాడు.
అతడు అంబాజీ.
అతడి ఆశీస్సులు తీసుకోనిదే నాయుడు ఏ పనీ చేయడు. ఎలక్షన్స్ లో నిలబడి నామినేషన్ వేయాలన్నా, కొత్తగా ఏదైనా పని ప్రారంభించాలన్నా అతడిని దర్శించి ఆశీస్సులు తీసుకోవడం నాయుడికి అలవాటు. అంబాజీపట్ల అంత గురి ఎందుకేర్పడిందంటే ఒకసారి నాయుడి కొడుక్కి ఎన్ని మందులకీ తగ్గని జబ్బు అంబాజీ ఇచ్చిన తీర్దంతో తగ్గిపోయింది.
ఎలక్షన్ లో గెలుపుకోసం అంబాజీ తనచేత ఒకసారి హోమంకూడా చేయించాడు. అతడు మహా మంత్రవేత్త అనీ, నిధులు కనిపెట్టడంలో దిట్ట అని కూడా విన్నాడు.
చంకలో పిల్లాడిని పెట్టుకుని వూరంతా వెతికినట్లుగా మంత్రగాడెవరా అని ఇంతసేపు తల బద్దలుకొట్టుకున్నాడేమిటి?
* * * *
నగరం శివార్లలో విశాలమైన ఆవరణలో చక్కగా పెంచబడిన చెట్లతో, పూలమొక్కలతో అక్కడ అడుగుపెట్టినవాళ్లకి ఆహ్లాదాన్ని పంచుతుంది అంబాజీచేత నిర్మించబడిన 'ఆనందాశ్రమం'
పేరుకి ఆశ్రమమేగానీ లోపల అధునాతనమైన బిల్డింగులు చాలా కట్టబడ్డాయి. యోగా చికిత్స అని, మూలికా చికిత్స అని, భూత చికిత్స అని ఇలా ఏవేవో బోర్డులుంటాయి వాటికి.
ఆశ్రమంలో అడుగుపెడుతూనే కరపత్రాలు ఇచ్చేందుకు, స్వామీజీ జీవిత చరిత్ర ప్రచురించబడిన పుస్తకాలు అమ్మేందుకు ప్రత్యేకంగా ఒక శిష్యుడు టేబుల్ వేసుకుని ఎంట్రెన్సులో కూర్చునుంటాడు.
స్వామీజీ చిన్నప్పుడే హిమాలయాలలోకి వెళ్లి ఘోరతపస్సుచేసి, అతీంద్రియశక్తులు సంపాదించాడనీ, మహా మంత్రవేత్త అయిన స్వామి తురీయానంద దగ్గర శిష్యరికం చేసి అనితరసాధ్యమైన మంత్రవిద్యను హస్తగతం చేసుకున్నాడని, శాకినీ డాకినీలాంటి పిశాచాలను చూపు మంత్రంతో వదిలించగల సమర్దుడనీ, మూలికా వైద్యంలో సిద్దహస్తులనీ, ఆజన్మ బ్రహ్మచారి అని, కరపత్రాల్లోనూ, జీవిత చరిత్రలోనూ అతడి మహిమలు వర్ణింపబడి వుంటాయి. ఎక్కడా రామాపురం సంగతి వుండదు.
గురు, ఆదివారాల్లో అతడు చల్లే మంత్రజలం కోసం జనాలు పడి గాపులు పడుతుంటారు.
మంత్రజలం చల్లించుకోవాలంటే, వెయ్యిన్నూట పదహార్లు చెల్లించి టోకెన్ తీసుకోవాలి. అతడితో ఇంటర్వ్యూ కావాలంటే, నూట పదహార్లు చెల్లించి టోకెన్ తీసుకుని క్యూలో నిలబడాలి. వుండటానికి గది కావాలంటే రోజుకు రెండు వందలు కట్టాలి. తాయెత్తులూ, యంత్రాలు కూడా అమ్మబడతాయక్కడ.
పేరుకి ఆనందాశ్రమమేగానీ డబ్బు లేనిదే ఒక్క పని కూడా జరగదక్కడ.
అదంతా తెలుసు నాయుడికి.
"ఖద్దరుకంటే కాషాయమే లాభసాటిగా వున్నట్టుంది. ఈసారి పదవి పోతే కాషాయంలోకి మారిపోవడం బెటరు" తన వూహకి తనే నవ్వుకున్నాడు నాయుడు.
* * * *
కనకపు సింహాసనంలాంటి దానిమీద చక్రవర్తి ఠీవితో కూర్చున్నాడు అంబాజీ.
సంవత్సరాల తరబడి పెంచిన పొడువాటి గడ్డం, జులపాల చుట్టు.
అతడు కట్టుకున్న కాషాయపు దుస్తుల రంగు ప్రతిఫలిస్తున్నట్లుగా వున్నాయతడి కళ్ళు జేగురురంగులో. చేతిలో హుక్కా. అందులో గంజాయి దట్టించి వుంటుంది.
"నమస్కారం స్వామీజీ!"
నాయుడు చెప్పులు గది బయటే వదిలి వడివడిగా నడిచివచ్చి అంబాజీ ముందు వంగి అతడి పాదాలకి శిరసు తాకించి లేచాడు.
"ఎలక్షన్ల ముందు తరచూ కనిపించేవాడివి. పదవొచ్చాక ఒక్కసారి మాత్రం వచ్చావు" నిష్టూరంగా అన్నాడు అంబాజీ. "ఊరకరారు మహానుభావులన్నట్లు ఏదో పనిబడితేనే వచ్చి వుంటావు. అవునా?"
"సర్వజ్ఞులు. నా నోటితో చెప్పక్కర్లేకుండానే అన్నీ గ్రహించగల సమర్దులు."
"నువ్వెందుకొచ్చావో తెలుసుకోవాలంటే నా లోపలికి దృష్టి సారించాలి. దానికి కొంత శక్తి ఖర్చవుతుంది. అయినదానికీ, కానిదానికీ శక్తి ఖర్చు చేసుకుంటూపోతే చివరికి ఖాళీపాత్ర మిగులుతుందిగానీ ఎందుకొచ్చావో చెప్పు."
"మీరొకసారి మా ఇల్లు పావనం చేయాలి."
"దేనికోసమో చెప్పు నాయుడూ! నా పాదస్పర్సతో నీ ఇల్లు బంగారంగా మారిపోతుందా ఏమిటి?"
"మీరు తమాషాకి అన్నా అది నిజం స్వామీజీ! మీ అడుగులు నా ఇంటిలో పడితే నా ఇల్లు తప్పకుండా బంగారం అయిపోతుంది."
"నా పాదాలలో స్పర్శవేది వుందని ఇంతవరకూ నాకు తెలియదే?
"మీకంతా తెలుసు స్వామీజీ! లేకపోతే మీ నోటివెంట నా ఇల్లు బంగారం అవుతుందన్న మాట వచ్చేది కాదు. నిజంగా మీ ఆశీస్సులేవుంటే నా ఇల్లు బంగారమే అవుతుంది స్వామీజీ!" అతి వినయంతో అన్నాడు నాయుడు.