Previous Page Next Page 
జన్మభూమి పేజి 42

    "అమ్మయ్య ఈ యేడాదిలో నేను అనుకున్నది సాధించాను. బడి, గుడి, ఆస్పత్రి, రోడ్లు, బోర్లు, సహకార సేద్యం, పిల్లలకి పెద్దలకి చదువు, ఆడవాళ్ళకి స్వయం ఉపాధి"
    "చాలు చాలు లిస్టు. దిష్టి కొట్టగలదు-" రాజేశ్వరి నవ్వింది.
    "అన్నింటినీ ఒక తాటిమీదకి తెచ్చాను. అన్నింటినీ మెయిన్ రోడ్డు మీదకి ఎక్కించడంలో మూడొంతుల బాధ్యత తీరింది. ఆ సూత్రాలు అన్నీ యిటు అటు పక్కదారులు పట్టకుండా..."
    "సూత్రధారుల్లా వుండాలి... నిజంగా ఈపాటికి కిందటి సంవత్సరం మనం ఇంకా యింటికి రానేలేదు. ఒక్క యేడాదిలో ఇన్ని చేశాం అంటే నాకు నమ్మశక్యంగా లేదు."
    ముఖ్యమంత్రికి మాటిచ్చాను. ఒక్క సంవత్సరం గడువు ఇవ్వండి మోడల్ విలేజ్ అంటే ఎలా వుండాలో చేసి చూపిస్తాను అని చెప్పాను. ఇప్పుడు యిక గర్వంగా ఆయన్ని పిలిచి చూపించుతాను. ఒక ఏడాదిలో అనుకున్నవి అన్నీ పూర్తిచేసేవరకు ఆయన్ని ఇక్కడికి రావద్దన్నాను. ఇప్పుడు ఆయన్ని ఆహ్వానించే టైము వచ్చింది.
    "న్యూయర్ నాడు గృహప్రవేశం, దత్తత జరిగింది. మళ్ళీ ఈ కొత్త సంవత్సరంనాడే ఆయన్ని పిలవండి. జనవరి ఒకటిన ఆయన్ని రమ్మనండి. నిజంగా చూసి చాలా సంతోషిస్తారు. తన కలలు నిజం చేసి చూపిన మిమ్మల్ని అభినందిస్తారు. జనవరి ఫస్ట్ కి మీటింగు పెట్టండి. ఆయన్ని ఆహ్వానించండి."
    "గుడ్ ఐడియా. ఈరోజే మాట్లాడి రాగలరో లేదో అడిగి ప్రోగ్రాం ఫిక్స్ చేస్తాను. ఆయనకి బ్రహ్మాండమైన స్వాగతం ఇవ్వాలి ఈ వూరు" ఉద్వేగంగా అన్నాడు కేశవరావు. రాజేశ్వరి తల వూపింది.  
    జనవరి ఒకటవ తేది. వూరు వూరంతా ముస్తాబయింది ముఖ్యమంత్రికి స్వాగతం పలకడానికి. ఒక నెలరోజులు శలవుపెట్టి న్యూయర్ ఇక్కడ సెలబ్రేట్ చేసుకునేటట్టు ప్లాన్ చేసుకుని రమ్మని కూతురికి, కొడుక్కి ఫోను చేశాడు, విక్రమ్, వినతి క్రిస్మస్ హాలడేస్ కి ఇండియా వెళ్ళి తల్లితండ్రిని చూసి తండ్రి గ్రామం, ఆయన అక్కడ చేసిన పనులు చూడాలని నిర్ణయించుకున్నారు. జనవరి ఒకటవతేదీకి వారం ముందే వచ్చారు.
    అక్కడికి వచ్చి ఇల్లు వాకిలి, తోటలు, పొలాలు, తల్లితండ్రి చేసిన పనులు చూశాక నిజంగా అభినందించకుండా వుండలేకపోయారు పిల్లలు నలుగురూ. అయితే తోటలు, కాలువలు, పొలాలు చూసి ఆటపాటలతో మైమరిచిపోయారు. తండ్రి ఆస్పత్రిలో సవ్యసాచిలా అన్ని పనులు చక్కపెట్టడం చూసి విక్రమ్ ఆశ్చర్యపోయాడు.
    వారం రోజులూ గ్రామం అంతా ముస్తాబు చేశారు. రంగు కాగితాలు, మామిడి తోరణాలు, కటౌట్లు, ఆర్చీలు అన్నీ కట్టారు. వూరి మధ్య స్కూలు బిల్డింగు ఆవరణలో పెద్ద సభ ఏర్పాటు అయింది. వూర్లో పెద్దలనే కాక పక్క రెండు మూడు ఊర్లలో జనానికి, డిస్ట్రిక్ కలక్టరు, డి.ఎస్.పి., ఎమ్మెల్యేలు అందరికీ ఆహ్వానాలు అందాయి.
    అసలే శుభ్రపడిన ఊరు కాగితం ముక్క కనపడనంతగా వీధులన్నీ శుభ్రం చేశారు కుర్రకారంతా. సాయంత్రం నాలుగు గంటలకి సభ - ముఖ్యమంత్రిని ఆహ్వానించడానికి సన్నాయి మేళంతో ఊరిపొలిమేరలో కేశవరావుగారితోపాటు, ఊరి పెద్దలు ఆఫీసర్లు అంతా వేచి వున్నారు. పావు తక్కువ నాలుగుకల్లా మంది మార్బలం వెంటరాగా అరడజను కార్లు వచ్చి ఆగాయి. సన్నాయి మోగింది. కారులోంచి దిగిన ముఖ్యమంత్రి బొకే యిచ్చి ఆహ్వానించారు కేశవరావు. సన్నాయి మోగుతుండగా ఆయనతోపాటు ఫర్లాంగు దూరం నడిచి వచ్చారు. అంతా సభాస్థలికీ. డాక్టరుగారూ, మీరేం చెప్పక్కరలేకుండానే రోడ్లు ఈ స్కూలు బిల్డింగ్ చెప్పాయి నాకు" చుట్టూ చూస్తూ నవ్వుతూ అన్నారు ఆయన.
    సభ ప్రారంభించేముందు ముఖ్యమంత్రిని వెంటబెట్టుకుని కేశవరావు వూరంతా ఓసారి తిప్పిచూపారు. ఆస్పత్రి, పొలాలు, వ్యవసాయ పరికరాలు, రైసు మిల్లు, తాము సాధించినది, వయోజన విద్య, స్త్రీల స్వయం ఉపాధి గురించి అంతా పావుగంట వూరు చూపుతూ వివరించారు.
    "డాక్టర్! మీరీవూరు రావాలన్న నిర్ణయం ఈ వూరి ప్రజలకి వరం అయింది" ముఖ్యమంత్రి మొహం ఆనందంతో వెలిగింది.
    సభ ప్రారంభమయింది. స్కూలు పిల్లలంతా కలిసి "వందేమాతరం" పాడారు. వెనక దేశ పటం, మధ్య భరతమాత నిలబడి ఉండగా పిల్లలచేత భారతదేశంలో కల భాషలకి ప్రతీకగా ఒక్కొక్కరిచేత ఒక్కో పాత్ర వేషం వేయించారు. పంజాబు, ద్రావిడ, సింధు,గుజరాత్ అన్ని రాష్ట్రాలని కవర్ చేస్తూ- శ్యామల, సుగుణ, రేణు ఆ భారం తీసుకున్నారు.
    ప్రార్థన అయ్యాక సభ ఎమ్మెల్యే అంజిరెడ్డి ప్రారంభించి ఈ ఏడాదిలో డాక్టర్ కేశవరావు చేసిన మంచి పనులు గురించి చెప్పాడు. కేశవరావుగారు ఈ వూరు దత్తత తీసుకోవడం ఈ వూరి అదృష్టం అని, యిలా యింకా అనేకమంది ఈ బాటలో నడవాలని కోరాడు. తరువాత కేశవరావు ఈ ఏడాదిలో తాను చేపట్టిన పనులు గురించి చెప్పడం మొదలుపెట్టారు.
    "గౌరవనీయులయిన ముఖ్యమంత్రిగార్కి, పెద్దలకు, నా వూరి ప్రజలకు నమస్కారాలు. ఈనాడు ఈ వూరిలో మీముందు నేను నిలబడి మాట్లాడుతున్నాను అంటే దానికి కారణం మన ముఖ్యమంత్రిగారు. ఆయన రాష్ట్రం కోసం, రాష్ట్ర ప్రగతి కోసం అహర్నిశలు కష్టపడడం - మాతృభూమి రుణం తీర్చుకోడానికి రమ్మని పిలుపు ఇవ్వడం, 'డిగ్నిటీ ఆఫ్ లేబర్' ప్రజలకి అర్ధమయి భాగస్వాములను చెయ్యమని శ్రమధానం పనులు చేపట్టడం, ప్రభుత్వాధికారులలో నిర్లిప్తత, నిర్లక్ష్య వైఖరిని నిర్మూలించడానికి 'ఆకస్మిక తనిఖీలు' చేపట్టడం, 'జన్మభూమి' కార్యక్రమాలు చేపట్టి మనపని మనం చేసుకోవడంలో దొరికే తృప్తి, ఆనందం తెలియచెప్పటం కాక, ఎవరో వస్తారని ఏదో చేస్తారని ఎదురుచూడకుండా మనపని మనం వీలయినంతవరకు చేసుకునేందుకు, జనంలో స్ఫూర్తిని తేవడానికి 'జన్మభూమి' పనులు చేపట్టడం, అట్టడుగు వర్గానికి న్యాయం అందుబాటులో వుండదు కనక 'ప్రజలవద్దకు పాలన' లాంటివి ఏర్పాటుచేసి వారి ఆక్రందనలు వినడం లాంటి ప్రజాహిత కార్యక్రమాలు ఆయన చేపట్టటం చూసి నేను ఆకర్షితుడనయ్యాను.  
    ఇన్నాళ్ళకి, ఇన్నేళ్ళకి రాష్ట్రం కోసం, రాస్త్ర ప్రజలకి ఏదో చెయ్యాలన్న ఆరాటం, తపన ఉన్న యువ ముఖ్యమంత్రిని ఆయనలో చూశాను. ఇదంతా ఓట్ల కోసం, పదవి కోసం కాక నిజాయితీగా రాష్ట్రాభివృద్ధికోసం పడుతున్న శ్రమ అన్నది నేను నమ్మాను.
    ప్రవాస భారతీయులు, ఆర్ధిక బలం వున్నవారు తమకి జన్మయిచ్చిన భూమి రుణం తీర్చుకోవాలని, అలాంటివారు తమ తమ గ్రామాలను దత్తత తీసుకుని గ్రామాభివృద్ధికి పాటుపడాలన్న ఆయన మాటలు నన్ను ప్రభావితుడ్ని చేశాయి.
    అమెరికాలో డాక్టరుగా పేరుప్రఖ్యాతులు, డబ్బు సంపాదించుకున్నాను. ఏమిటో తరువాత డబ్బుకు విలువ కనపడడం మానేస్తుంది. అన్ని సుఖాలు, భోగాలు అలవరర్చుకున్నాక ఇంకా ఇంకా సంపాదించి ఏం చెయ్యాలి అన్న ఆలోచన నాలో తలెత్తింది. బతికినందుకు జీవితానికి సార్ధకత ఏర్పరచుకోవాలనిపించింది. ఏదన్నా మంచిపని చేసి నలుగురికి సాయపడగలిగితే బ్రతుకుకి అర్ధం, పరమార్ధం వుంటుందనిపించింది. ఇహంలో చెయ్యాల్సిన బరువు బాధ్యతలు తీరాయి. యిహ పరలోక చింతన వైపు దృష్టి మళ్ళించాలనిపించింది.

 Previous Page Next Page