Previous Page Next Page 
420 మెగా సిటీ పేజి 37


                                                 భారత్ మహాన్ హై
    మా కాలనీ వాళ్ళందరికీ దేశభక్తి తెగ ఎక్కువ.
    ఇళ్ళ తలుపుల మీదా, మోపెడ్ ల మీదా ఎక్కడ చూసినా 'భారత్ మహాన్ హై' 'బి ఇండియన్' 'అయ్ లవ్ ఇండియా' లాంటి స్టిక్కర్లు అంటించబడి వుంటాయ్.
    దీనంతటికీ కారణం మన దూరదర్శన్ కార్యక్రమాలే అని చాలామంది అభిప్రాయం. అందుకే అడపా దడపా భారతదేశం గొప్పతనం గురించి మా కాలనీలో లెక్చర్లివ్వడానికి నగరంలోని ప్రముఖులను ఆహ్వానిస్తుంటుంది మా కాలనీ కమిటీ.
    మన భారతదేశం రాజ్యాంగం గొప్పతనం గురించి కాలనీలో ప్రతి ఒక్కరికి తెలియజేయాలని మా కాలనీ కమిటీ ప్రెసిడెంటు గోపాల్రావ్ కి ఎప్పటినుంచో కోరిక. గోపాల్రావ్ 'ఈ క్షణం' దినపత్రిక జర్నలిస్ట్ గా పనిచేస్తున్న విషయం మీకు తెలిసిందే.
    అతని బాధపడలేక చివరకు ఓ రోజు అతని లెక్చర్ కాలనీలో ఏర్పాటు చేశాం. ఆ మీటింగ్ కి జనం వస్తారో రారోనని టీ.వీ.లో పరమ భయంకరమైన కార్యక్రమాలున్న రోజున మావాడి లెక్చర్ పెట్టాడు శాయిరామ్.
    దాంతో రాజ్యాంగం లెక్చర్ అంటే బెదిరిపోయిన మా కాలనీ వాళ్ళు ఇళ్ళలోకి వెళ్ళి తలుపులేసుకున్నా లోపల దూరదర్శన్ కార్యక్రమాలకు తట్టుకోలేక ప్రాణాలు అరచేతిలో పెట్టుకుని మళ్ళీ మీటింగ్ కొచ్చేశారు.
    అంతమంది జనాన్ని చూసేసరికి గోపాల్రావ్ కి ఎక్కడలేని ఉత్సాహం పుట్టుకొచ్చింది. పూనకం వచ్చినట్టు మైక్ అందుకున్నాడు.
    "సోదర సోదరీమణులారా! మన భారత రాజ్యాంగం ప్రపంచంలోని రాజ్యాంగాలన్నిట్లోనూ ఎంతో గొప్పదని మీకు తెలియజేయటానికి ఎంతో గర్వపడుతున్నాను" అన్నాడతను.
    జనంలో దేశభక్తి ఎక్కువ కాబట్టి వెంటనే తప్పట్లు కొట్టి వివాదాలు చేశారు.
    "భారత్ - జిందాబాద్! ఇండియా జిందాబాద్" గోపాల్రావ్ కి మరింత ఉద్రేకం వచ్చేసింది.
    "మన రాజ్యాంగం మనకిచ్చిన వరం 'వాక్ స్వాతంత్ర్యం! మనమేదనుకుంటే అది పబ్లిగ్గా మాట్లాడవచ్చు. ఏం రాయాలనుకుంటే అది పత్రికలవాళ్ళు రాయవచ్చు. దీనికి ఉదాహరణ మన కాలనీ వాళ్ళే! మనవాళ్ళు నడిరోడ్డు మీద నిలబడి భారత్ మహాన్ హై అని అరవవచ్చు, భారత్ జిందాబాద్ అని అరవవచ్చు. అయినాగానీ ఎవరూ అందుకు అభ్యంతరం చెప్పరు - ఇంత గొప్పవరం ప్రపంచంలోని చాలా దేశాల్లో లేదని నేను ఇంకా బోలెడు గర్వంగా చెప్తున్నాను. మళ్ళీ తప్పట్లు మార్మోగిపోయినాయ్.
    "వన్ డౌట్ ప్లీజ్" అన్న గొంతు జనంలో ఓ మూల నుంచి వినిపించేసరికి అందరూ ఆశ్చర్యంగా అటువేపు చూశారు. మా కాలనీ డిటెక్టివ్ రచయిత్రి రాజేశ్వరి కళ్ళజోడు సర్దుకుంటూ నిలబడి వుంది.
    "ఎస్! అడగండి" అన్నాడు గోపాల్రావ్.
    "మనకు రాజ్యాంగం ఫ్రీడం ఆఫ్ ఎక్స్ ప్రెషన్ ఇచ్చిందన్నారు. గానీ ఎప్పటికప్పుడు రాష్ట్ర ప్రభుత్వాలు, కేంద్ర ప్రభుత్వం మన పత్రికలనూ, సంపాదకులనూ, విలేఖరులనూ నానా బాధలూ పెట్టడం, అరెస్ట్ చేయడం, జైల్లోకి తోయడం చేస్తున్నారు కదా! దీనికేమంటారూ?" అడిగిందామె.
    గోపాల్రావ్ గతుక్కుమన్నాడు. అర్జంటుగా మొఖానికి పట్టిన చెమటను తుడుచుకున్నాడు.
    "అఫ్ కోర్స్! మీరు తమిళనాడులో జయలలిత పత్రికల వారి మీద జరుపుతున్న దౌర్జన్యాలను దృష్టిలో పెట్టుకుని మాట్లాడుతున్నారనుకుంటాను. ఈ విషయంలో న్యాయస్థానం మాట చెల్లాలా లేక లేజిస్లేచర్ మాట చెల్లాలా అనే వివరణ మన రాజ్యాంగం సరిగ్గా ఇవ్వకపోవడం వల్ల ఈ సమస్య పదేపదే తలెత్తుతోంది! దీనికి మనమేం చేయలేం" అన్నాడు తడబడుతూ.
    "అంటే ఆ విషయంలో మన రాజ్యాంగంలో లోపం వున్నట్లే కదా?" దబాయించిందామె. "అవును!" వప్పుకున్నాడతను. రాజేశ్వరి శాంతించి విజయగర్వంతో కూర్చుంది. "సోదర సోదరీమణులారా మన రాజ్యాంగం మనకు ఓటు హక్కుని ఇస్తోంది. ప్రతి భారత పౌరుడు తన ఓటు హక్కుని యధేచ్చగా వినియోగించుకోవచ్చు- ప్రపంచంలో చాలా దేశాలలో లేని ఈ అద్భుత సౌకర్యం కేవలం మనకేవుంది. మనదే సిసలయిన ప్రజాస్వామ్యం అని నేను గర్వంగా చెప్తున్నాను.
    "ఒక డౌటు సార్" అంటూ మళ్ళీ లేచి నిలబడింది రాజేశ్వరి.
    "ఎస్! ఏమిటది?"
    ప్రతి ఎలక్షన్ లోనూ కొన్ని కోట్లమందిని ఓటు హక్కు వినియోగించుకోనీకుండా అన్ని రాజకీయ పార్టీలు అడ్డుపడడం ఊళ్ళనూ, మనుషులనూ తగలబెట్టడం, డబ్బుతో ఓట్లు కొనడం రిగ్గింగ్, దొంగ ఓట్లు వేయడం పబ్లిగ్గా జరుగుతోంది కదా! మరోపక్క చీఫ్ ఎలక్షన్ కమీషనర్స్ వాళ్ళిష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తున్నారు.
    మరి దీనికి రాజ్యాంగం-
    గోపాల్రావ్ మళ్ళీ చెమటలు తుడుచుకున్నాడు.
    "అఫ్ కోర్స్! ఈ ఒక్క విషయంలో మన రాజ్యాంగంలో కొంచెం లోపం వుంది!" రాజేశ్వరి మళ్ళీ అందరివేపూ ఓసారి గర్వంగా చూసి కూర్చుంది.
    "సోదర సోదరీమణులారా! ప్రపంచంలోకెల్లా గొప్పదయిన మన రాజ్యాంగంలో ప్రతి పౌరుడికీ మతస్వేచ్చ వుంది. గవర్నమెంట్ సెక్యులర్ గవర్నమెంట్ అన్నమాట! ఎవరు ఏ గుడిక్కావాలంటే అక్కడికెళ్ళి ప్రార్థనలు చేసుకోవచ్చు"
    "ప్రభుత్వం ఎలాగూ ప్రజలకోసం ఏమీ చేసి చావదు కదా! ఇంక ప్రజలకు ప్రార్థనలే దిక్కులే!" అరచాడు స్టూడెంట్ వెనుకవేపు నుంచి. అందరూ ఘోల్లుమన్నారు.
    "ఓ చిన్న డౌట్!" మళ్ళీ నిలబడింది రాజేశ్వరి.
    "ఏమిటది?" చిరాకుగా అడిగాడు గోపాల్రావ్.
    "ప్రభుత్వం సర్వ మతాలను ప్రోత్సహించడం వల్లే దేశంలో మతకల్లోలాలు పెరిగిపోయి ఏటా వేలమంది ప్రాణాలు పోగొట్టుకుంటున్నారు కదా! అందుకే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం వినాయకచవితి మీద బాన్ పెట్టి మళ్ళీ రద్దు చేసింది కూడా!" గోపాల్రావ్ తలగొక్కున్నాడు.
    "అఫ్ కోర్స్ - ఈ విషయంలో రాజ్యాంగంలో కొన్ని మార్పులు చేయాల్సి వుంది."
    "అంటే రాజ్యాంగంలో ఆ విషయంలో కూడా ఏదో లోపం వుందన్నమాటే కదా!"
    "అవును!"
    రాజేశ్వరి ఆనందంగా కూర్చుంది.
    "సోదర సోదరీమణులారా! మనది ప్రపంచంలోకెల్లా గొప్ప ప్రజాస్వామ్యం అవటానికి కారణం మన రాజ్యాంగం! మన రాష్ట్రపతులు, గవర్నర్లు అద్భుతంగా రాజ్యాంగం ప్రకారం ప్రభుత్వాలను ఏర్పాటుచేస్తూ క్లిష్ట పరిస్థితులను ఎదుర్కోగలుగుతున్నారు-" అని గోపాల్రావ్ కే డౌట్ వచ్చి రాజేశ్వరివైపు చూశాడు.
    రాజేశ్వరి చిరునవ్వుతో లేచి నిలబడింది. "పార్లమెంట్ నీ, అసెంబ్లీలనూ ఏయే పరిస్థితుల్లో రద్దు చేయాల్సిందీ, ఎప్పుడు ఎవరిని ప్రభుత్వం ఏర్పాటుచేసేందుకు ఆహ్వానించాల్సింది- ఈ విషయాల్లో రాజ్యాంగం అగమ్యగోచరంగా వుండబట్టే కదా తమ మనసుకి నచ్చిన విధంగా వ్యవహరించి ఆనాటి రాష్ట్రపతి సంజీవరెడ్డీ, గవర్నర్ రామ్ లాల్ లు వివాదాలపాలయిందీ?" అడిగిందామె. గోపాల్రావ్ మొఖం వాడిపోయింది.  
    "అఫ్ కోర్స్! ఆ విషయంలో మన రాజ్యాంగంలో కొన్ని లోపాలున్నమాట నిజమే! అయినా మన రాజ్యాంగమే ప్రపంచంలోకెల్లా ఉత్తమమయిన రాజ్యాంగమని నేను సగర్వంగా చెపుతున్నాను-" ఆవేశంగా అన్నాడతను.
    దేశభక్తిగల మా కాలనీ వాళ్ళందరం తప్పట్లు కొట్టి నినాదాలు ప్రారంభించాం.
    భారతదేశం - జిందాబాద్.
    భారత రాజ్యాంగం - జిందాబాద్.
    రాజేశ్వరి - డౌన్ డౌన్.
    రాజేశ్వరి - ముర్ధాబాద్.
                          *    *    *

 Previous Page Next Page