"అమ్మగారా? అమ్మగారు ఈ మూడు రోజుల్నుంచీ మన ప్రపంచంలో లేరు పడుకొని లేవనన్నారు. పచ్చి మంచినీళ్ళయినా....."
"ఎక్కడ వున్నారు?" ప్రకాశరావు లేచి అడిగాడు.
"ఆ గదిలో......." అంటూ రంగయ్య హాలుకు తిన్నగా అవతల వైపు వున్న గదిని చూపించాడు. అది రామారావు సాధారణంగా గడిపే గది. ఏ కొంచెమో తటపటాయించినా ప్రకాశరావు ధైర్యంగా లోపలికి వెళ్ళాడు. గది గుమ్మందాటి లోపలికి పోబోతూ ఆ హృదయ విదారకమైన దృశ్యాన్ని చూసి ఆగిపోయాడు. ఆమె శకుంతల! చలన రహితంగా మంచంమీద ఒక ప్రక్కకి పడుకొని వుంది. హఠాత్తుగా చూసినవాడు ఆమె దేహంలో జీవం వున్నదని అనుకోడు. అతను మెల్లగా అడుగులు వేస్తూ ముందుకు పోసాగాడు. ఆమె ముఖమంతా పాళీపోయివుంది. చెక్కిళ్ళు పీక్కుపోయి వున్నాయి. కళ్ళనుండి చెక్కిళ్ళ మీదుగా కంఠం వరకూ కన్నీటి చారలు. అతని హృదయం చిన్నాభిన్నమైంది. ఆ క్షణంలో కలిగిన విపరీతమైన ఆవేశంతో చేతితో మెల్లగా ఆమె కన్నీరు తుడుస్తూ "శకుంతలా!" అని పిలిచాడు.
ఆమె కళ్ళు తెరవలేదు. కాని కొద్దిగా చలించింది. చురుకైన ఆమె పెదాలు చిన్నగా వణకసాగాయి.
అతను మరి కొంచెం గట్టిగా పిలిచాడు. ఈసారి ఆమె నెమ్మదిగా కళ్ళువిప్పి చూసింది. ఎదురుగా అతను. వింతగా ముందు పరికించింది. తర్వాత తొందరగా ఆమె నేత్రద్వయంలో గోచరించిన ఆశ్చర్యం హరించిపోసాగింది. అతనివంక దీనంగా చూస్తూ బిగ్గరగా వెక్కి వెక్కి ఏడవసాగింది.
అతనికి ఆకస్మికంగా ఎలా ఓదార్చాలో తెలియలేదు. సానుభూతిగా ఏది వచించినా ఆమె దుఃఖం మరింత అధికం అవుతుందేమోనని ఆందోళన పడసాగాడు.
"చూడండి నాకంతా రంగయ్య చెప్పాడు విచారించకుండా వుండలేకపోవటం మానవ నైజంకాని ఇలా చేసి, మీరు మరీ ఇదయిపోతే మీ ఆరోగ్యం చెడిపోదా?"
శకుంతల రెండు చేతుల్తో ముఖాన్ని ఆచ్చాదనం చేసుకొని ఇంకా విలపించసాగింది.
"మీరు మరీ దుర్బలులౌతున్నారు. ఇలా చేసి ఏమిటి లాభం?"
"నా కెవరూ- నాకెవరూ లేరు" అని ఆమె గొణుగుతూండగానే దుఃఖంతో ఆమె గొంతు పూడిపోయింది.
ప్రకాశరావు చొరవచేసి మంచంమీద కూర్చొని ఆమె చేతులు ముఖంనుండి బలవంతంగా విడదీస్తూ "నేను వచ్చాను! మీ కేమీ భయం లేదు" అన్నాడు.
ఆమె అతనివంక దిగులుపడి చూడసాగింది. కాని "నాన్న...... నాన్న..... ఆయన పోయారు!"
మీరిలా విచారిస్తే ఏమిటి ప్రయోజనం. ఆయన ఆత్మకు ఏమయినా శాంతి కలుగుతుందా?" ప్రకాశరావు నిర్వేదంగా అన్నాడు.
"కాని...... ఎలా బ్రతికేది? ఆయన లేకుండా నేను?"
ప్రకాశరావు ప్రేమగా ఆమె చేతుల్ని తన చేతుల్లోకి తీసుకుంటూ "సుఖంగా వున్నప్పుడు బ్రతగగలిగి, దుఃఖం వచ్చినప్పుడు బ్రతకలేక పోతే మానవుడు జన్మించటం ఎందుకు?" అన్నాడు.
ఆమె ఆశ్చర్యంగా అతడి కళ్ళలోకి చూడసాగింది. అతనన్న మాటలు కొద్ది. ఆ చెప్పటంలో ఏదో నూతనత్వం, మార్దవం కనబడి ఆమెను చకితురాల్ని చేశాయి. అప్పుడు అతనో వేదాంతిలా, విజ్ఞానిలా గోచరించాడు. అతన్ని చూస్తూ కొద్దిసేపటిలో ఆశ్చర్యాన్ని మరిచిపోయింది.
ఒకరివంక ఒకరు అలా భావశూన్యంగా చూసుకొంటూ చాలాసేపు గడిపేశారు, ఆమె హృదయంలో అగ్ని జ్వాలలు రేగి, ఆమె తుకతుకలాడిపోతోందని అతనికి తెలుసు. ఇప్పుడు చేయవలసిన కర్తవ్యం ఏమిటా అని అతనింకా ఆలోచనలో వుండగానే ఆమె గద్గాదికంగా---
"మీరలా వెళ్ళారు - ఆ రాత్రే జరిగింది...."
ప్రకాశరావు మధ్యలోనే ఆపి, "మీరేం చెప్పవద్దు. నా కంతా తెలుసు" అన్నాడు. వాస్తవానికి మూడు రోజుల క్రితం ఆయన మరణించడంకంటే మిగతా వివరాలేం అతనికి తెలీవు. తర్వాత మెల్లిగా రంగయ్య నడిగి తెలుసుకోవచ్చని అతని భావం.
ఆమె నయనాలనుండి నీరు యింకా స్రవిస్తూ ఉండటం చూసి "ఇకనుంచి మీరిలా పడుకుంటే కుదరదు లేవాలి" అన్నాడు.
"లేచి...... నాకింకా ఈ యింట్లో పనేముంది?"
"ఉన్నా లేకపోయినా మీ రలా పడుకుని వుంటే నేను చూచి సహించలేను. రండి" అన్నాడు.
చాలా సేపు మాట్లాడకుండా ఊరుకుని "మీరు వెళ్ళండి. నేను వస్తాను" అంది.
అతను లేచిపోతూ ఒకసారి అద్దంముందు నిల్చుని మీ ముఖం చూసుకోండి. ఈ మూడు రోజుల్లో మీ రూపం ఎంత మారిపోయిందో తెలుస్తుంది. ఒక అరగంటలో మళ్ళీ ఈ గదిలోకి వస్తాను. ముఖం కడుక్కుని మీరు శుభ్రంగా కనపడాలి. బాధ పడకండి" అని బయటకు వచ్చాడు. రంగయ్య యింకా అక్కడే నిలబడి వున్నాడు.
జేబులోంచి డబ్బుతీసి వాడికి యిస్తూ "ఫ్లాస్కు తీసుకుపోయి కాఫీ తీసుకురా" అని వాడిని పంపించి, గది తాళం తీసి లోపలకు వెళ్ళాడు.
అంతా యధావిధిగా కనిపించింది. ఈ అయిదు రోజుల్లోనూ గది తలుపులు ఎవరూ తీసినట్లులేదు. కుర్చీలో కూర్చున్నాడు. కొద్దిరోజుల క్రితం ఇక్కడ విడిచి పెట్టి వెళ్ళిన రామారావుగారు తను వచ్చేసరికి ప్రపంచం వీడి వెళ్ళిపోయినారంటే నమ్మశక్యం కాకుండా వుంది. ధారాళమైన వాగ్ధాటితో ఆయనింకా తనముందు తిరుగుతూ, పలకరిస్తూ, మాట్లాడుతున్నట్లుగా వుంది. హఠాత్తుగా ఆయన మరణవార్త విని నమ్మలేకుండా వున్న ప్రకాశరావు తను యిక్కడనుంచి వెళ్ళిపోయాక యేం జరిగి వుంటుందో శక్తి కొద్ది ఊహించుకోసాగాడు. ఆయన జబ్బులోవుండి అన్న మాటలు గుర్తుకు వచ్చాయి. శకుంతల విషయం తప్ప ఇంకెందులోనూ దిగులులేని మనిషి. అతను అత్యాశ్చర్యంలో మునిగిపోయి, కంపించటం ప్రారంభించింది ఎప్పుడంటే - కొన్ని నెలల క్రిందట యీ యింట్లోని ఒక గదిలోకి వచ్చేటప్పుడు, యీ ఇంటి యజమాని తను యింకా యిక్కడ వుండగానే పరలోకానికి ప్రయాణమై వెళ్ళిపోతాడు గదా అని తనకు తెలియదు కదా అన్న విషయం మదిలో మెరిసినప్పుడు, హఠాత్తుగా శకుంతల మనసులో మెదిలింది.
ఆమెను చూస్తూంటే అన్ని విధాల అతనికి జాలి, కరుణ, ప్రేమ వుద్భవించాయి. ఈ చిన్న వయసులో ఆ అమ్మాయికి తల్లీలేదు, తండ్రి లేడు. ఇంకా పెళ్ళికాలేదు. తండ్రి దేహం చాలించేటప్పుడు, ఈ విషయమే ఆయనకు అమితంగా అశాంతిని కలిగించి వుంటుంది. ఒక సంగతి ప్రకాశరావుకు మరీ వింత గొలిపింది. శకుంతల తన కళ్ళముందు వివిధ తత్వాలలోకి దిగజారింది. కొన్నాళ్ళు తనని ఏడిపించే కొంటెపిల్లగా భావించాడు. కొన్నాళ్లు చీకూ చింతా లేని అమాయకురాలిగా భావించాడు. ఇప్పుడు చీకూ చింతా తప్ప ప్రపంచంలో అన్యమెరుగని అభాగ్యురాలిగా భావించసాగాడు. భావించడమేకాదు. ఇన్ని రకాలుగానూ ఆమె అతనికి గోచరించింది. ఆమె భవిష్యత్ ఏ విధంగా వుండబోతుందో అతను తలుచుకునేసరికి భయ కంపితుడయ్యాడు. మిగిలినదంతా విషాదమేనని అతని అనుమానం యెన్నటికీ కాదు. కాని "నా కెవ్వరూ లేరు. నా కెవరూ లేరు" అనే ఆమె వాక్కులు అతని వీనుల్లో మళ్ళీ మళ్లీ ధ్వనించినప్పుడు అతనికి తెలియని యేవో ఊహలు అతన్ని ఆవరించి ఉక్కిరి బిక్కిరి చేసేవి.
రామారావుగారి అంతిమ సమయంలో తను ఇక్కడ లేకపోయానే అని తోచినప్పుడు అతనికి దుఃఖం వచ్చేది. ఆ విషయం గురించి ఆయన ఏమనుకున్నాడో, మిగతావాళ్ళు ఏమి విసుక్కున్నారో అతనికేం తెలియవు. తన కళ్ళకు తనే ఏదో కృతఘ్నుడిలా కనిపించసాగాడు.
ఇంతలో బయట అడుగుల చప్పుడు వినిపించింది. రంగయ్య గదిలోకి తొంగిచూసి "తెచ్చాను బాబూ" అన్నాడు.
"అక్కడి బల్లమీద పెట్టివెళ్ళు."
వాడు అలాగే చేసి వెళ్ళిపోతూన్న సవ్వడి వినిపించింది. "చూడు రంగయ్యా" అని పిలిచాడు.
వాడు లోపలకువచ్చి "ఏమిటి బాబూ" అన్నాడు.
కొంచెం తటపటాయించి "నేను వెళ్ళాక ఇక్కడ యేం జరిగిందో కాస్త చెప్పు" అన్నాడు.
వాడు తల గోక్కుంటూ "ఏముంటుంది బాబూ, చెప్పేందుకు? ఆయనకు ఆయుర్దాయం తీరి వెళ్ళిపోయారు" అన్నాడు.
"అదికాదు. పోయేముందు నా గురించి యేమయినా అన్నారా?"
"అనేదాకా యెక్కడుంది? మీరు వెళ్ళిపోయిన్నాటి రాత్రే అయ్యగారికి తెలివిపోయింది. ప్రాణం పోయేదాకా మళ్ళీ తెలివి రానేలేదు. ఉహు."
"అయితే డాక్టర్ గారు రాలేదూ?"
"ఎందుకు రాలేదు? నేనే లగెత్తు కెళ్ళి పిల్చుకొచ్చాను బాబూ! ఆ దృశ్యం చూసి తీరాల్సిందేగాని చెప్పటానికి వీల్లేదు. ఆ డాక్టర్ గారి కళ్ళమీదపడి అమ్మగారు ఒకటే ఏడుపు. ఎలాగయినా తండ్రి ప్రాణాలు కాపాడాలంటుంది. కావలసినంత డబ్బిస్తానంటుంది. ఆయనకూడా వుండిపోయారులెండి. ఆ రెండు రాత్రులూ ఇక్కడే పడుకున్నారు కూడాను." అని "ఏం చేస్తాం? ఫలితం లేకపోయే" అన్నాడు విచారంగా.
ప్రకాశం హృదయం బరువుతో నిండిపోయింది. "అయితే బంధువు లెవరూ రాలేదా?" అనడిగాడు.
"ఏం బంధువులు బాబూ! ఆళ్ళంతా ఎక్కడెక్కడున్నారో అయ్యగారికే సరిగ్గా తెలవదు. ఈ వార్త యెట్లా చేరుతుంది?"
"సరే నువ్వుపోయి ఒక గ్లాసు తీసుకురా" అని ప్రకాశరావు వాడి వెనుకనే గదినుంచి బయటకు వచ్చాడు. గ్లాసు తీసుకువచ్చాక ప్లాస్కులోని కాఫీ అందులోపోసి "తీసుకువెళ్ళి ఇచ్చిరా" అన్నాడు.
సరే అని ప్రకాశరావు తానే తీసుకొని శకుంతల ఉన్న గదిలోకి పోయాడు. ఆమె ముఖమైతే కడుక్కునివచ్చింది గాని, దానివల్ల ఏమీ ఫలితం వున్నట్లు లేదు. వాడిపోయి ఇందాకటిలాగే ఇంచుమించు వుంది.
"చూడండి? మీ రిట్లా అయితే.........." అంటూ ప్రకాశరావు "ఈ కాఫీ తీసుకోండి" అని ఆమెకు ఇవ్వబోయాడు.
"నాకు వద్దు. మీరు ఎందుకు శ్రమపడతారు?" అంది శకుంతల.
"అలా అంటే వీల్లేదు, తీసుకోకపోతే నామీద ఒట్టే."
ఆమె భావయుక్తంగా అతనివంక చూసి, చేతిలోంచి కాఫీ అందుకుంది. "కాఫీ త్రాగాక మీరు బయటకువచ్చి రంగయ్య తెచ్చిన పేపరు చూస్తూ కూర్చున్నాడు. కాని అతని దృష్టి పత్రిక మీద నిమగ్నం కాలేదు. తనమీద ఏదో బరువు వున్నదని భావించసాగాడు. ఇదివరకటి మాదిరి స్వేచ్ఛగా సంచరించరాదనీ, ఇతరుల యోగక్షేమాలు కనుక్కోవడం నేర్చుకోవాలనీ, ఇతరుల బాగోగులుకూడా చూడాలనీ అనిపించింది. ఆనాడు రామారావుగారు అన్నమాటలు గుర్తుకు వచ్చేసరికి అతని మనస్సు మరీ విచలితమైంది. తను మనస్ఫూర్తిగా శకుంతలపట్ల శ్రద్ధవహిస్తానని ఆయనకు మాట ఇచ్చాడు. తనమీద రామారావుగారు సంపూర్ణ విశ్వాసం వుంచారనికూడా అతను గ్రహించాడు.
ఆ పూట ప్రకాశరావు బలవంతంమీదే శకుంతల కొంచెం ఎంగిలిపడింది. మొదట ఆమె ఎంతసేపటికీ ఒప్పుకోకపోయేసరికి "నామీద ఒట్టే" అన్నాడు. ఆమె విధిలేక అంగీకరించాల్సి వచ్చింది. అతను దగ్గరే కూర్చుని తినిపించాడు.
ఆ మధ్యాహ్నం శకుంతల మధ్య హాల్లో యోగినిలా కూర్చుంది. ప్రకాశరావు కనుబొమలు ముడివైచి తన గదిలో అటూ ఇటూ తిరుగుతూ ఏదో ఆలోచిస్తున్నాడు. కొంతసేపు అలా గడిచాక అతను బయటకు వచ్చి చూస్తూ--