Previous Page Next Page 
అష్టదళం 2 పేజి 34


    "అంతా అబద్దం. కట్టుకధ. జయసూర్య ఎవరో మాకసలుతెలియనే తెలియదు."   

    "మీకూ, మాకూ మామా అల్లుళ్ల వరుస కలిసిందికదా. తీసుకెళ్లి మర్యాదచేస్తే  అసలు కథ బయటపడుతుంది. అరెస్టువారెంట్ తో వచ్చాను. హత్య చేశారనడానికి అన్ని ఆధారాలు దొరికాయి కనుకనే.  వచ్చినందుకు మీ మరొక కుట్రకూడా బయటపడింది. దానికి కూడా అదనపు మర్యాదలు స్వీకరించవచ్చు."

    "అతడిని మేం చంపామని ఏ ఆధారంతో అంటున్నారు?"

    "ఆధారాలు దొరికినందుకే అరెస్టు వారెంట్ తో వచ్చాను" చేతులు చరిచి బయటున్న ఎస్సైని పిలిచి అందరికీ బేడీలు తగిలించమన్నాడు రవికుమార్.

     "మమ్మల్ని మామూలు వీధి గూండాల్లా ట్రీట్ చేస్తున్నారు. మా లెవెల్ తెలియనట్టుంది. మీ తొందరపాటుకు ఇంతకు ఇంత అనుభవించాల్సి వస్తుంది." బెదిరించాడు భాషా.

     "హంతకులదంతా ఒకటే కేటగిరి. వాళ్లలో అంతస్తులూ, లెవెల్సూ వుండవు."

    "సంఘంలో గౌరవ ప్రతిష్టలున్న వ్యక్తులను మీరు అరెస్టు చేస్తున్నారు. కోర్టులో ఎలాగోలా మేం నిర్దోషులుగా బయటపడతాం. మీ తొందరపాటుకు మాత్రం మీరు పశ్చాత్తాపపడాల్సి వస్తుంది."

    "ఒక అమాయకుడిని చుట్టుముట్టి అతడిని కిరాతకంగా హత్య చేసి నప్పుడు ఆ గౌరవప్రతిష్టలు ఎక్కడ విడిచిపెట్టారు? అప్పుడవి  గుర్తుకు రాలేదా?  అప్పుడు మీకు అవి వుంటేకదా?  గుళ్లల్లో విగ్రహాలు ఎత్తుకుపోయి అమ్ముకునేవాళ్లకి, చిల్లర దొంగతనాలు చేసేవాళ్ళకి అవి ఏముంటాయి? దొడ్డిదారిన సంపాదించి ఇప్పుడు పెద్ద  మనుష్యులుగా చెలామణి అవుతున్నారు. "

    అతడు తన బయోడేటా అంతా తెలుసుకునే వచ్చాడని తెలిసాక వాళ్ల ధైర్యం దిగజారిపోయింది. ఇక లాభం లేదనుకున్నారు.
     నేను హత్య చేయలేదు ఎస్. పి. సాబ్! నా చేతిలో అప్పుడు కత్తి వుందేగానీ అతడిని పొడవలేదు. వీళ్ళంతా అప్పుడు కత్తులతో గాయపరచి నిధి రహస్యం చెప్పమని హింసిస్తుంటే, అతడు చస్తే  నిధి రహస్యం శాశ్వతంగా తెలీకుండా పోతుందని అతడిని పొడవద్దని నేను చెప్పాను. దయచేసి హంతకులలో నన్ను జమచేయకండి" అన్నాడు మారుతీరావు.

     "అసలు జయసూర్య చచ్చిందే మునిరాజు కత్తిపోటుకు. హంతకుడు అతడే."

    "ఆ మాటకి నేనుకూడా చిన్నగా గీరాను తప్ప అతడు చావాలని పొడవలేదండీ. కత్తితో పొడిచినట్టు బెదిరించాడేగానీ నిజంగా అతడిని హత్య చేయాలన్న ఉద్దేశ్యం నాకు లేదు" అన్నాడు మరొకడు.

     "నాకు కూడా అతడిని హత్య చేసే వుద్దేశ్యం లేదు. నా కత్తిపోటుకు అతడు చస్తాడని అనుకోలేదు పొరపాటున తగలరానిచోట  తగిలి  పోయాడు. నేనుమాత్రం హంతకుడిని ఎలా అవుతాను?" అన్నాడు  మునిరాజు బింకంగా.

     "అందరూ శ్రీవైష్ణవులే. గంప క్రింద కోడిపెట్ట మాత్రం మాయమై పోయిందట. స్టేషన్ కి పదండి. అన్నీ తేలుస్తాను."


        *    *    *    *    *    *

       
    భైరవుని కొండ.

     చుట్టూ పుచ్చపువ్వులా వెన్నెల.

     పైన తారలతో సయ్యాటలాడుతూ మేఘాలలో తేలిపోతున్న పున్నమి చంద్రుడు.

     భైరవుని కొండ దిగువన సి. ఎం. గారి డేరా.

     కొండచుట్టూ అప్రమత్తంగా చేతుల్లో గన్స్ తో కాపలాకాస్తున్న పోలీసులు. పర్యవేక్షణ చేస్తున్న పోలీస్ కమీషనర్ , పోలీస్ సూపరింటెండెంట్లు.

     అడవి జంతువులు రాకుండా నెగళ్లు వేసారు.

     డేరాకి వెనుకవైపు హెలీకాప్టర్, పోలీసు జీపులు ఆగి వున్నాయి.

     ముందు అనుకున్నట్టుగానే తానొక్కడే గుప్తనిధిని  స్వాధీనపరచుకోవడంలేదని, తనకి తోడుగా మరొకరు  వస్తున్నారని ముందుగానే చెప్పాడు స్వామి. తోడుగా వచ్చింది శ్రీచక్రే.

     గుప్తనిధిని నిక్షిప్తం చేసిన తనకి మాత్రమే ఆ నిధిని స్వాధీన పరుచుకునే శక్తి వుందని, నిధిని కదిలించడం స్వామి శక్తికి మించిందని చెప్పాడు శ్రీచక్ర. తనకి తోడుగా తీసుకువెళుతున్నట్లు చెప్పమన్నాడు.

     "మీరెవరూ మా వెంట రావద్దు. గుహలోకి మేం ఇద్దరమే వెడతాం. మేం పిలిచాకే రావాలి ఎవరైనా"  స్వామి చెప్పాడు.

     భైరవుని కొండ మీదకి ఇద్దరే బయలుదేరారు.

     అడవి అంతా నిశ్శబ్దంగా  వెన్నెలను త్రాగుతున్నట్లుగా వుంది.

     పైన ఆకాశయానం చేస్తున్న చంద్రుడినీ, అతడి చుట్టూ వయ్యారాలు పోతున్న తారలనూ చూస్తూ కాసేపు గుహ ముఖద్వారానికి అడ్డుగా వున్న పెద్ద గుండు దగ్గరే ఆగారు ఇధ్దరూ.

     సరిగ్గా ఆకాశ మధ్యానికి చంద్రుడు చేరుకోవడం చూసాక అప్పుడు చేత్తో తట్టాడు గుండును. శ్రీచక్ర ఏదో మంత్రం చదివాడు.

     అది కోయభాష.

     మీట నొక్కినట్లుగా అంత పెద్ద గుండూ ప్రక్కకి జరిగిపోయింది.

     ముందుగా శ్రీచక్ర  అడుగుపెట్టాడు గుహలోకి. అతడి వెనుక స్వామి.
 
     ఎదురుగా అయిదు శిరసుల నాగేంద్రుడు. అతడి ఒళ్లంతా బంగారంలా మెరిసిపోతోంది. అతడి పడగలమీద మణులు! కరెంట్ బల్బులు వెలుగుతున్నట్లుగా వున్నాయవి.

     గుహలోని చీకట్లను ఆ మణులనుండి వస్తున్న వెలుతురు తరుముతోంది.
 
     నాగేంద్రుడి పడగల కింద రెండు మందసాలు.

    వాటికి వేసిన తాళాలు!

    నాగేంద్రుడికి ఎదురుగా హోమగుండం.

    కొన్ని వందల సంవత్సరాలక్రితం తిమ్మడిగా తన మంత్రసిద్దితో వెలిగించిన నిప్పు ఆరిపోయి నివురు క్రమ్మివుంది తెల్లగా.

     "మీరు ఇక్కడ కూర్చోండి స్వామీ! ఇక్కడనుండి కదలవద్దు. మాట్లాడొద్దు" అంటూ అతడిని  ఒక ప్రక్కన  కూర్చోబెట్టి అతడిచుట్టూ వృత్తం గీసాడు.

     తరువాత గుహలో ఒక మూలకు భద్రపరచిన పులి చర్మం, రుద్రాక్ష మాల, మంత్రదండం చేతికి తీసుకున్నాడు. మాల మెళ్లో వేసుకుని పులి చర్మం హోమగుండం ముందు వేసుకుని కూర్చున్నాడు.

     పద్మాసనంలో  నిటారుగా కూర్చుని మంత్రపఠనం  ప్రారంభించాడు.

    అతడి పెదవులు నెమ్మదిగా కదులుతుంటే ఎవరో విసనకర్రతో విసిరినట్లుగా హోమగుండంలో నివురు తొలగి నిప్పు వెలిగింది. సమయం గడుస్తున్న కొద్దీ అందులోనుంచి మంటలు లేచాయి.

    స్వామి మౌన ప్రేక్షకుడే అయ్యాడు.

     శ్రీచక్ర చదువుతున్న మంత్రాలు సంస్కృత భాషకు సంబంధించినవి కావు. అవి కోయభాషకు చెందినవి. హోమగుండంలో జ్వలిస్తున్న  మంటలు శ్రీచక్ర  ముఖంమీద ప్రతిఫలిస్తున్నాయి ఎర్రగా.

     అతడి ముఖం శ్రీచక్రలా లేదు.

    అతడు మహా  తాంత్రికుడిలా వున్నాడు. మహా మంత్రవేత్తలా వున్నాడు.
 
     అతడి ముఖంలో పంచభూతాలను శాసించగల ధీర గంభీరత్వం.

     అతడి మంత్రోచ్చారణ తీవ్రతరం అవుతున్నకొద్దీ గుహలో 'బుస్... బుస్' మన్న శబ్దాలు రాసాగాయి. అంతకంతకూ బుస్సుబుస్సు మన్న శబ్దాలతో గుహ ప్రతిధ్వనించసాగింది.

     గడసర్పాలు రెండు ఎక్కడినుండి వచ్చాయో  తెలియదు. హోమ గుండాన్ని చుట్టుకుని పడగలని విప్పాయి. వాటి కళ్లల్లో ఎర్రటి మంటలు ప్రతిఫలిస్తుంటే నిప్పుముద్దల్లా కనిపిస్తాయవి. బుస్సుమన్నప్పుడల్లా  వాటి కోరలనిండా చీలికలైన  నాలుకలు బయటకి వస్తున్నాయి.

     మంత్రసిద్దుడైన స్వామి సైతం అ దృశ్యం చూసి స్తభ్దుడై పోయాడు.

    గుప్తనిధిని తాకడానికి తన శక్తి చాలదని ఎందుకన్నాడో ఇప్పుడు అర్దమవుతోంది.

     అతడి మంత్రపఠనం నిశ్చలంగా సాగిపోతూనే వుంది.

     పాములు రెండూ  మండుతున్న హోమగుండంలోకి ప్రవేశించి ఆత్మాహుతి చేసుకున్నాయి.

    మళ్లీ గుహలో శబ్దాలు.

     రుధిరానికి రుచి మరిగిన క్షుద్రశక్తుల కరాళనృత్యం మొదలైంది. వాటి నీడలు గుహ గోడలమీద పడుతున్నాయి. నక్కలు ఊళలు వేస్తున్నట్టుగా, గుడ్లగూబలు కూస్తున్నట్లుగా వికృతమైన శబ్దాలు వెలువడుతున్నాయి వాటినుండి.

     అతడి మంత్రోచ్చారణ సాగుతూనే వుంది.

     నీడలు చిన్న చిన్న బొమ్మలుగా మారి హోమగుండంలో ప్రవేశించాయి.

     పిడుగులు, వంద పిడుగులు పడ్డట్టుగా బ్రహ్మాండమైన శబ్దం. తరువాత అంతా నిశ్శబ్దం.
 
     శ్రీచక్ర మంత్రోచ్చారణ ముగిసింది.

     అతడి ముఖంలో ఒక వింత తేజం అలుముకుంది.

     "ఇక్కడ  నేను సృష్టించిన క్షుద్రశక్తులను నేనే అంతమొందించాను. నిధి మన హస్తగతం కావడానికి ఏ అఢ్డూ లేదిక!"

    "నిన్ను తిమ్మా అని పిలవాలో, జయసూర్య అని పిలవాలో, లేక శ్రీచక్ర అని పిలవాలో తెలియడంలేదు. కానీ మహాద్బుతమైన మంత్రవిద్య సాధించావు.ఎన్ని జన్మల కఠోర సాధనో ఇది."     

    "ఇదంతా గురుకృప. నా జన్మ పరంపర నాకు గుర్తుండేలా అనుగ్రహించారు. ఇంతకంటే ఇంకేమీ చెప్పలేను"

    గుహ బయటికి వచ్చారిద్దరూ.

     అప్పటికే తెల్లవారిపోయింది.

     గుడారం వద్ద ఉత్కంఠతో ఎదురుచూస్తున్న సిఎం బృందం.

 Previous Page Next Page