"బ్రతికివుండి బాధలు పడేవాళ్ళంతా చావంటే భయంతోనే బ్రతుకుతున్నారు అంటావా? నీవు ఎక్కడికీ వెళ్ళటానికి వీలులేదు. నిన్ను ఆశ్రమవాసిగా స్వీకరించబోయేముందు ఎంత సంక్షోభానికి గురి అయానో తెలుసా? ఆ సంక్షోభానికి విముక్తి నీ నిష్క్రమణ కాదు" విద్యాధరస్వామి ఆమె సమాధానం కోసం ఎదురుచూడకుండా పెద్ద పెద్ద అడుగులు వేసుకుంటూ అక్కడినుంచి వెళ్ళిపోయారు.
జగతి నిట్టూర్చి నిశ్చేష్టితయై చూస్తోంది.
* * *
"ఛీ ఛీ! ఇన్నాళ్ళు నేను పడిన ప్రయాసం, నా సాధన, తపస్సు, విజ్ఞానం అన్నీ వ్యర్ధం. అన్నీ తెలుసుకుని, అన్నీ పరిత్యజించి చివరకు ఓ సామాన్య మానవునిలా ప్రవర్తించాను. ఇంత ఆవేశం నాకెందుకు వచ్చింది? కోపతాపాలను జయించలేకపోయాను. నా శిష్యుడ్ని కొట్టాను. బాధించాను. తను నాలాగే సాటిమానవుడు. అతడ్ని హింసించే అధికారం నాకెవరిచ్చారు? అతను అపరాధము చేస్తే చేయవచ్చు. జ్ఞానబోధ చేసే హక్కు నాకుందికాని, దండించే అర్హత నాకులేదు. ఈ పాపానికి నేను శిక్షననుభవించాలి. ఈ గాఢ బలహీనతల శాపంనుండి నాకు నిష్కృతి లభించాలి.
ఆ సమయంలో ఆయన సల్పిన దారుణకాండ చూస్తే ఈ స్వామి ఉన్మత్తుడు, మతిభ్రష్టుడు అనుకుంటారు. శిష్యుడ్ని హింసించిన ఆయన దక్షిణహస్తం తలుపుసందులో పెట్టి నలగ్గొట్టుకున్నాడు. నేలకేసి బాదుకున్నాడు. చేతివ్రేళ్ళను దీపం మీదపెట్టి కాల్చుకున్నాడు. చెయ్యి నలిగి, గాయాలు రేగి రక్తసిక్తమై పోయింది. కాలి బొబ్బలెక్కిపోయింది. అయినా తృప్తి కలగలేదు. అర్దరాత్రి రెండుగంటలవేళ తనగదిలో అటూ యిటూ తిరుగుతూ తనమీద తను చికాకుపడుతున్నాడు.
భగవానుని విగ్రహం చుట్టూవున్న చిన్నదీపాల వెలుగులో వింత సౌందర్యాన్ని విరచిమ్ముతోంది. ఆకస్మికంగా స్వామి విగ్రహంముందు ఆగిపోయి, ఆ కాంతుల్లోకి తదేకంగా వీక్షించసాగారు. ఆయన మనసులోకి అజ్ఞాత నూతనశక్తి ప్రవేశించినట్లయింది. శరీరంలో విద్యుత్ర్పవాహం జరుగుతున్నట్టుగా వుంది. కనులు మూతపడుతున్నాయి. అప్రయత్నంగా నేలమీద ఆసీనుడై చేతులు జోడించాడు. పెదవులు మంత్రాలు ఉచ్ఛరించసాగాయి. తెలియని మైకంలో వున్నాడు.
తెల్లవారేవరకూ ఆ దశలో వుండిపోయాడు. వేళ అతిక్రమించిన సంగతి కూడా స్ఫురణ లేదు.
తెల్లవారి బయట పక్షుల కలకలారావాలు, శిష్యుల మాటలు, సందడీ వీనుల్లోకి సోకి, సమాధినుంచి కళ్ళువిప్పాడు. శరీరమంతా సుదేర్ఘ యాత్ర చేసినట్లు బడలికగా, మగతగా వుంది. 'అరెరే! చాలా వేళయిపోయిందే' అని ఆదుర్దాపడుతూ లేచి నిల్చుని యివతలకు వస్తున్నాడు.
అంతలో అతనికెదురుగా ఎవరో వచ్చి కాళ్ళమీద పడ్డారు. "మార్కండేయా!" అన్నాడాయన సంతోషంగా.
"నన్ను ఆశ్రమంనుంచి వెళ్ళగొట్టకండి. రాత్రి నేను ప్రదర్శించిన పశుత్వానికి పశ్చాత్తాపంతో కుమిలిపోతున్నాను. నన్ను క్షమించండి" అన్నాడతను పాదాలు వొదిలిపెట్టకుండా దుఃఖితస్వరంతో.
స్వామి హృదయం ఆర్థ్రపూరితమైపోయింది. "లే నాయనా! లేచి వెళ్లి పనులు చూసుకో" అన్నారు శాంతిస్వరాన.
16
మార్కండేయుడు నిజంగా పశ్చాత్తాపడలేదు. అహం, మదం తలకెక్కిన వాడెవడూ అంత త్వరగా పశ్చాత్తాపపడడు. పరాభావాగ్నితో అతని మనసు తగలబడిపోతోంది. జగతి పరిచయం అయినప్పట్నుంచీ స్వామిలో వచ్చిన మార్పు, ఆయన గురి అవుతూన్న సంక్షోభం అతను మొదటినుంచీ గుర్తించాడు. అయితే తన మనస్తత్వంతో, తన అంతస్తుతో ఆ సంఘర్షణను కొలిచాడు. అందుకని అతనికి స్వామి పతితుడై పోయినట్లూ, స్త్రీ వాంఛకు దాసుడైపోయినట్లూ భావించాడు. రానురానూ అతనికి స్వామి నిష్ఠా గరిష్ఠతలో, నిగ్రహశక్తుల్లో నమ్మకం నశించిపోసాగింది. దానికితోడు ఆనాడు పిచ్చెత్తినట్లు తనను కొట్టటంతో, ఆయన జగతితో కాలం గడపటానికే ఆ సమయంలో అక్కడకు వచ్చాడనీ, తనని చూసి అసూయపరుడై విషాన్ని వెలిగ్రక్కాడనీ నిర్ధారణ చేసుకున్నాడు. ఎలాగైనా పగ తీర్చుకోవాలన్న దుగ్ధతో తను దహించుకుపోతున్నాడు.
మొదట శిష్యులలో కలవరం లేపటానికి ప్రయత్నించాడు. ఆ గ్రామంలో స్త్రీలకు, అందులో పాపచరిత్ర కలదిగా అనుమానించబడుతూన్న స్త్రీకి ఆశ్రయం యివ్వటం అనేక అనర్ధాలకు దారి తీస్తూందని వాదించాడు. తామందరూ యిదివరకటిలా స్వేచ్చగా మెసలటానికి వీలు లేకపోతూందనీ, ప్రతి స్వల్పపు విషయానికీ బిడియపడవలసివస్తుందనీ, అందమైన స్త్రీని ఎదురుగాపెట్టి యవ్వనంలో వున్న శిష్యుల నిశ్చలబుద్ధిని సవాలుచేయటం క్రూరత్వమనీ ఆలోచించాడు. స్వామివారిలో యీ మధ్య చాలామార్పు వచ్చిందనీ, పూర్వపు మాదిరిగా ఆయన చిత్తశుద్ధితో, ప్రశాంతబుద్ధితో జీవించటం లేదనీ, ఆయన పైకి పెరగటానికి బదులు క్రిందకు దిగజారిపోతున్నాడనీ విమర్శించాడు. జగతికి ఆశ్రమంలో స్థానం యివ్వటంలో స్వామికి స్వార్ధం లేకపోలేదనీ, ఆయన కలవరపాటును సూక్ష్మదృష్టితో పరిశీలిస్తే యీ విషయం తేటతెల్లం కాకపోదనీ సూచించాడు. తను కళ్ళారా అనేక సంఘటనలు చూశాననీ, వాటిని సమయం వచ్చినప్పుడు బయటపెడతాననీ వ్యక్తం చేశాడు. "నువ్వు స్థిమితంగా వున్నావా? నువ్వు స్థిరంగా వున్నావా?" అని ఒక్కొక్కడినీ భుజాలు పట్టుకుని గ్రుచ్చిగ్రుచ్చి అడిగాడు.
ఆశ్రమ వాతావరణాన్ని అట్లా సవరించాక ఊరిమీద పడ్డాడు. ఊళ్ళో అతని చొరవచేత ప్రతి కుటుంబంలోని వ్యక్తితో పరిచయం వుంది. చాలామంది యిళ్ళలోకి, యింకా చెప్పాలంటే వంటిళ్ళలోకి సరాసరిపోయి కాఫీ, ఫలహారాలు అడిగి పెట్టించుకునే చనువు అతను సంపాదించాడు. అతని మలినపూరితమైన మనస్సు ఎవరూ గ్రహించకపోవటంచేత ఎట్టి అభ్యంతరం చెప్పకుండా హర్షిస్తూ ఊరుకునేవారు. ఇప్పుడా సంబంధాలు అతనికి అక్కరకు వచ్చాయి. అతనికి మంచి వాగ్ధాటి వుంది. నమ్మించేట్లు చెప్పగల నేర్పువుంది. రోజువారిగా క్రమక్రమంగా వాళ్ళని చకితుల్ని చేసే ఒక్కొక్క వార్తా చెబుతూ అలజడి లేవదీశాడు. అసలే ప్రజల్లో చాలామంది మూఢభక్తులు. ఎంత త్వరగా వారిభక్తి విశ్వాసాలు పెనవేసుకుంటాయో, అంతకంటే త్వరగా అవి దూదిపింజల్లా ఎగిరిపోతాయి. అందులో బహుళప్రచారంలో వున్న ప్రముఖుల్ని గురించి వంకరవార్తలు విశేషంగా ఉత్కంఠతను కలిగిస్తాయి. ఈ బలహీనతను అతను బాగా అర్ధంచేసుకుని, తన విచారాన్ని కూడా జోడిస్తూ విషబాణాలు మంత్రించి వొదిలిపెట్టేవాడు.
క్రమంగా గ్రామస్తుల్లో కలవరం బయలుదేరింది. ఏ యిద్దరు కలసినా ముచ్చటించుకునే ముఖ్యాంశంగా యిది పరిణమించింది. వృద్ధులు బాధపడ్డారు. స్త్రీలు బుగ్గలు నొక్కుకున్నారు. యువకులకు మంచి సరదాగా వుంది. గొప్ప కలవరం చెలరేగబోతున్నది.
ఆశ్రమానికి వచ్చే భక్తుల సంఖ్య తగ్గిపోయింది. నిధులకోసం పోయి అడిగితే ధనవంతులు ముఖాలు దాచేస్తున్నారు. పెద్ద ఉపద్రవం జరగబోయే వాతావరణం ఏర్పడింది.
విద్యాధరస్వామికి జరిగే గొడవ కొంతయినా తెలియకపోలేదు. కాని తనమీద తనకు విశ్వాసం పెరుగుతూన్నకొద్దీ ఆయన యితరుల వదంతుల్ని లెక్కచేసే స్థితిని దాటిపోయారు. ఇటీవల అసలాయన ప్రపంచాన్ని గురించి ఆలోచించటం లేదు. తన సంస్కారాన్ని, మనస్సులోని పడునునూ, తన పెరుగుదలనూ పరీక్షించుకుంటున్నారు. పూర్తిగా వ్యక్తిగతంగా తయారయ్యారు. పిచ్చివాడిక్రింద తనకు తను శిక్షలు విధించుకుంటున్నాడు. అనేక మానసిక ప్రయోగాలు అభ్యసిస్తున్నారు. వాటి గెలుపు ఓటముల మధ్య నలిగిపోతున్నారు.
"నేను పూర్తిగా క్షాళితం కావాలి. ఎవ్వరిచేతా ఉద్రిక్తత చెందకూడదు" యిదే ఆయన తపన.
ఈ తపనలో రాత్రుళ్ళు నిద్రపట్టటం మానేసింది. తీవ్రమైన మంట ఎప్పుడూ గుండెల్లో రగుల్తూవుండేది. రాత్రి సమయంలో గంటలకు గంటలు భగవానుడి ముందు మోకరిల్లి సమాధిలో వుండిపోయేవాడు. అది సాధ్యం కాకపోతే, గదినుండి బయటకు వచ్చి తోటలో ఏదో వెతుక్కుంటున్నట్లు తిరిగేవాడు.
ఒక చీకటిరాత్రి పెనుగాలి వీస్తూండగా, ఆయన వంటరిగా తోటలో పాదరక్షలైనా లేకుండా తిరుగుతున్నాడు.
"నాకు వెలుగు కావాలి- వెలుగు కావాలి" ఆయన మనస్సు ఘోష పెడుతోంది.
"నేను కావలసిన వ్యక్తిగా ఎలా అవుతాను? సామాన్యుడిలా మిగిలిపోనా? అలానే అంతరించిపోనా? అయితే నా జన్మ ఎందుకు? చరిత్ర సృష్టించే మహర్షిని నేను కలేనా? నాకంటే ప్రకృతి అంత బలమైనదా? నేనే మరో ప్రకృతిని."
"కాదు. నాకు యీ తపస్సు చాలదు. ఎప్పుడూ నేను నాగురించే ఆలోచిస్తున్నాను. మూలసిద్దాంతంలో యిది నిషిద్ధం. నేను ఎదగలేదు" మరుక్షణంలో నిస్పృహ ఆవరించింది.
"కాదు. నువ్వు ఎదిగావు" శ్రవణకుహరంలో ఎవరో ఊదినట్లయింది.
"ఉహుఁ. రవ్వంతకూడా ఎదగలేదు. హిమాలయాన్ని అధిరోహించాలనుకున్న నేను యింకా క్రిందివరసల్లోనే పొర్లాడుతున్నా, నాకు విముక్తిలేదు."
ఈయన కన్నులు సజలబాష్పపూరితాలయినాయి. అవి ఎడతెగకుండా ప్రవహిస్తున్నాయి.
"వత్సా" అని ఎవరో పిలిచినట్లయింది.
ఆయన ఓ చెట్టుక్రింద ఆగి, అప్రతిభుడై నిలబడ్డాడు. పెనుగాలి వీచింది.
"నువ్వు ఎందుకు దుఃఖిస్తావు? ఆర్తప్రజలను దుఃఖంనుంచి విముక్తి కలగజేయవలసినవాడివి- నీవే యిలా బేలవయితే ఎలా? నీలోని మాలిన్యం అంతరించింది. నీవిప్పుడు మచ్చలేని సన్యాసివి."
"ఎలా? నాకెలా తెలుస్తుంది? ఎలా ఊరట చెందను? ఇది ఓ మార్పేమో, ఆత్మవంచనేమో!"
ఇంతలో ఆయన మస్తిష్కంలో మెరుపులా ఓ ఆలోచన మెరిసింది. తప్పొప్పులు నిర్ణయించేస్థితిలో లేడాయన. కలిగిన ఆలోచన కూడా అంత బలవత్తరమైనది. వెనుదిరిగి పెద్దపెద్ద అడుగులు వేసుకుంటూ జగతి కుటీరం వైపు నడిచాడు.
అర్థరాత్రివేళ తలుపుమీద చప్పుడవుతూంటే జగతి ఉలిక్కిపడి లేచి కూర్చుంది. ఎవరో తలుపు తడుతున్నారు. ఈ సమయంలో తన కుటీరానికి వచ్చేదెవరు? "ఎవరు?" అంది తడబడుతూ.
"నేను" జవాబు విని, కంఠం గుర్తుపట్టి ఆమె చలించిపోయింది. ఆయన గొంతులో ఎక్కడా తొట్రుపాటులేదు.
లేచి నిల్చుని గుమ్మందగ్గరకు వెళ్ళి నిలబడి హృదయానికి చెయ్యివేసి నొక్కుకుంటూ "స్వామీ!" అన్నది కంపితస్వరంతో.