తురంగరావు లేచి కృతజ్ఞత చెప్పుకుంటూ తనకు జరిగిన సత్కారానికి చలించిపోయానని చెప్పాడు. కంఠంకూడా చలించేటట్లు చేశాడు. ముకుందరావు లేచి మైకుదగ్గరకొచ్చి, చేతులూపుకుంటూ గ్రంథంలోని ప్రాశస్త్యాన్ని గురించి గంటా యిరవై నిముషాలు మాట్లాడాడు. సభ ముగిసింది.
11
జగతి డైరీ!
"కొద్దిరోజుల్లోనే యింత ప్రచండమైన మార్పు నాలో కలుగుతుందని స్వప్నంలోకూడా తలపోయలేదు. నిస్సంగత్యం అలవడుతోంది. నా అందం నన్ను బడబాగ్నిలా దహిస్తోంది. ఇప్పుడే జన్మించినట్లుగా అనుభూతి- ఈ భూమ్మీద యిప్పుడే ఎక్కడినుంచన్నా ఎగిరివచ్చానేమోనని!
నేను స్వామిని ఆరాధిస్తున్నాను. నాకు తెలుసు. కాని ఈ ఆరాధనలో తాత్పర్యం నాకు తెలియదు. నాకు నిర్మల చిత్తం అలవడుతోందని నేను నమ్ముతున్నాను. ఈశ్వరుడ్ని ఏకాగ్రతతో ధ్యానించగలుగుతున్నాను. నాకోపం, హీనబుద్ధి, అభిజాత్యభావం అంతరించిపోతున్నాయి. అంతరంగం ఉన్మిషిత మవుతోంది. అవును, నేనప్పుడప్పుడూ ఏడుస్తున్నాను. కాని యిది దుఃఖాన్ని కడిగివేసే ఏడుపు.
"సాధించాలన్న నా పట్టుదలనూ, సర్వశక్తిమంతురాలనాన్న నా అహంభావాన్నీ తుడిచివేసుకుని, నేను హృదయపూర్వకంగా స్వామి శిష్యురాలినై పోయాను. కాని స్వామిలో నానాటికీ అధికమవుతూన్న కలవరపాటు నాకు ఆందోళన కలిగిస్తోంది. ఆయనలో పూర్వపు ప్రశాంతత, చిరునవ్వు, తేజస్సు లేవు. ఆ రాత్రి నాకు సాధనను అంత మహత్తరంగా బోధించిన ఆ మహనీయుడు తీవ్ర మనోవేదనకు లోనైనట్లు పొడగట్టాడు. పూర్వంలాగా ఆయన ఉపన్యాసం ప్రవాహవేగంతో గడవటంలేదు. నేను ముందువరుసలో కూర్చుని ఆయన ఉపన్యాససారాన్ని గ్రోలుతూ వుంటాను. నావైపు చూడకుండా వుండటానికి ఆయన ప్రయత్నిస్తున్నట్టూ, ఆ ప్రయత్నమంతా పటాపంచలై పోయి చూపులు నావైపే అనుభంగికంగా మరలుతున్నట్టూ నాకు స్పురించసాగింది. రోజూ ఆయన పాదాలను తాకి నమస్కరిస్తున్నాను. నా స్పర్శ తగిలినప్పుడల్లా, ఆయన విద్యుద్ఘాతం తగిలినట్లు స్థంభించిపోవటం నాకు అవగతమవుతోంది. ఓహో! నేనెంత పాపిని! అతిదృఢమైన ప్రకృతిస్థితులలో కూడా దుర్భలత ప్రవేశపెడుతున్నాను. నా రాకతో అసలు మఠంలోని వాతావరణమే మార్పు చెందినట్లయింది. భక్తులలో మార్పు వస్తోంది. వారిలో ఏదో అనుమానదృక్కులు చెలరేగుతున్నాయి. శిష్యులు స్థిరచిత్తంతో పని చేయటం మానేశారు. అందరూ నావంక వింతగా చూస్తున్నారు. ఇంత అలజడికి కారణం నేనేనా? మఠానికి వెళ్ళటం మానేస్తే? చాలాసార్లు సాయంత్రంవరకూ యీరోజు ఏమయినా వెళ్ళకూడదనుకుని బింకంగా కూర్చునేదాన్ని. కాని సంజవేళ అవుతూండగా నా బింకం సడలిపోయేది. హృదయానికి అటువైపు కళ్ళెంవేసి ఏదో అజ్ఞాతశక్తి లాగేది. పాదాలు అటువైపు నడిచేవి."
"ఈరోజు రాత్రి అంతా వెళ్ళిపోయాక నేను స్వామిని సమీపించాను. శిష్యులు లోపల వున్నారు. బహుశా పొంచి చూస్తున్నారేమో! ఆశ్చర్యంలేదు.
స్వామి తమ ఆకర్ణాంత నేత్రాలతో నావంక చూస్తున్నారు. ఏముంది ఆ చూపుల్లో? జాలా? ప్రేమా? కరుణా? కాల్పనికమా?
ఏమడగాలని ఆయన్ని సమీపించానో తెలీదు. ఎదురుగా బొమ్మలా నిలబడ్డాను.
"జగతీ! నిన్ను మనసారా వేడుకుంటున్నాను. నువ్వు, యిహమీదట యిక్కడికి రాకు. నాకు కనిపించకు."
నాకు దుఃఖం పొంగిపొర్లింది. నా పాపాన్ని ఎవరో ఎత్తి చూపినట్టయింది. "స్వామీ! నేనేమి అపరాధం చేశాను? ఎందుకు నన్ను వెళ్ళిపొమ్మంటున్నారు?" అని ప్రశ్నించాను రుద్ధకంఠంతో.
ఆయన నావంక జాలిగా చూశారు. "నీవేమి చెయ్యలేదు. అపరాధం నేనే చేశాను" అన్నారు ఆర్ద్రస్వరంతో.
"ఏమిటి స్వామీ మీరంటున్నది?"
"అవును జగతీ! శృంగేరి పీఠాధిపతులవద్ద ఉపదేశం పొంది, సన్యాసాశ్రమం స్వీకరించిన పిదప అనేక ప్రదేశాలు సంచరించాను. అనేకమంది వ్యక్తులతో మెలిగాను. ఎంతమంది స్త్రీలు, నీకంటేకూడా యౌవనవంతులు నాతో ఎంతో సన్నిహితంగా మెలిగారు. అయినా నా మనస్సు ఎన్నడూ చలించలేదు. అసలు బాల్యంనుంచీకూడా నేను అతికఠినమైన నియమాలతో పెరిగి, శిల లాంటి మనస్సునూ, ఎవరూ ఛేదించలేని నిగ్రహశక్తినీ అలవర్చుకున్నాను. నా నిగ్రహశక్తి అవధులులేనిది. దాన్నిచూసి నేను గర్వపడేవాడ్ని. ఇంద్రియాలనూ, ఐహికవాంఛలనూ అవలీలగా జయించిన తపస్వినని తృప్తివుండేది.
"నా మనస్సుని ఎలా అభ్యాసం చేశానంటే స్వప్నంలోకూడా నేనెవర్నీ కాక్షించి ఎరుగను. అసలు పరాన్ని గురించి తప్ప యిహాన్ని గురించి నాకు స్వప్నాలే వచ్చి ఎరుగవు.
"అప్పటివరకూ అస్ఖలిత బ్రహ్మచారిని."
"కాని నీవు ప్రవేశించావు. నేను క్రిందికి జారిపోవటం మొదలుపెట్టాను. నాలో మునుపెన్నడూ లేని మనోవికారం ప్రారంభమయింది. ప్రకృతిశక్తులు నన్ను లోబర్చుకోసాగాయి.
"ఎన్నోసార్లు, ఎన్నిసార్లు నువ్వు స్వప్నంలో సాక్షాత్కరించావో, నిద్రలో "జగతీ! జగతీ!" అని కేకలు పెట్టానట. శిష్యులు చెప్పారు. స్వప్నావస్థలో ఎన్నిరంగులలో, ఎన్ని ఆకృతులతో, ఎన్నిరూప విశేషాలతో గోచరించావు. నగ్నమూర్తివై నర్తించావుకూడా. జగతీ! ఆఖరికి స్వప్నంలో నిన్ను రమించాను. నేనిహ అస్ఖలిత బ్రహ్మచారిని కాను."
"స్వామీ!" నా కాళ్ళక్రింద భూమి కంపించింది. రెండుచేతులతో చెవులు మూసుకున్నాను.
"అవును. అందుకే చెబుతున్నాను. ఇన్నాళ్ళూ అబేధ్యమనుకున్న నా యింద్రియ నిగ్రహశక్తి పటాపంచలయింది. నేను ఉన్మత్తుడ్ని అవుతున్నాను. ప్రకృతిశక్తి కాలిక్రింద నిర్ధాక్షిణ్యంగా నలిగిపోతున్నాను. నాకు మనశ్శాంతిలేదు. నా కఠోరవ్రతం భంగపడుతున్నది. నలుగురిముందు లోకవంచకుడిగా నిలబడే రోజు రాబోతున్నది. అందుకే జగతీ, అందుకే నిన్ను వేడుకుంటున్నాను. నన్ను కరుణించి, నా దృష్టికి అందని దూరతీరాలకు వెళ్ళిపో. తిరిగి ఎప్పుడూ కనిపించకు. వెళ్ళిపో జగతీ! వెళ్ళిపో" ఆయన కంఠంలో గాద్గదికత, నేత్రాలలోంచి అశ్రువులు స్రవిస్తున్నాయి. అంత దీనమూర్తిని ఎప్పుడూ చూడలేదు.
నేను చాలించిపోయాను. కళ్ళు తిరుగుతున్నాయి. గొంతు తడారిపోయింది. ఎక్కడికో గాలిలో తేలిపోతున్నట్లు అనిపించింది. "మిమ్మల్ని యింత దుర్భరవేదనకు గురిచేసిన యీ పాపిని క్షమించండి స్వామీ!" అని గొణిగాను. వొంగి ఆయన పాదాలను కళ్ళకద్దుకుని తడబడుతూన్న అడుగులతో బయటకు నడిచాను.
భగవాన్! నేనిప్పుడేం చెయ్యను? అసలీ ఊరు రాకపోయినా బాగుండేది. ఎక్కడనో దెయ్యంలా తిరుగుతూ, మామూలు జీవితం జీవిస్తూ వుండేదాన్ని. ఇప్పుడు నా భవిష్యత్తు ఏమిటి? నాకు తోడు ఎవరు? ఈ కొత్తజీవితానికి అలవాటుపడి, మిగతా రోజులన్నీ ఎలా గడుపను? నాకు దారి ఎవరు చూపిస్తారు?
ఆలోచనలతో అలసిపోతున్నాను. నాకు పిచ్చెక్కుతుందేమోనని భయంగా వుంది.
* * *
మరునాడు ఆమె స్నానానికి వెళ్ళినప్పుడు మృత్యుంజయరావు ఇది చదివాడు. ఆ సాయంత్రం ఆఫీసునుండి పెందళకడనే గదికి వచ్చాడు.
జగతి కాలుగాలిన పిల్లిలా అటూ యిటూ తిరుగుతోంది. యేడ్చి ఏడ్చి వున్నట్లు చెంపలనిండా కన్నీటిచారికలు, కళ్ళు ఎర్రబడి, ముఖం వాడిపోయి వుంది. తనలో తను ఏదో గొణుక్కుంటోంది.
అతను మంచంమీద కూర్చుని ఆమెవంక జాలిగా చూస్తున్నాడు. ఆమె ఈ ఊరికి వచ్చిన తరువాత ఎన్నిమార్పులు సంభవించాయి! ఆమె అంటే అతనికి అవ్యాజానురాగంవుంది. ప్రగాఢమైన భక్తి వుంది. ఆమెను పలకరించాలనుకున్నాడు. 'అక్కా! ఎందుకే అలా దుఃఖపడతావు? నీ కన్నీరు నన్ను తుడవనీ. నా వొడిలో సేదతీరి విశ్రాంతి తీసుకో. నీ తల నన్ను నిమరనీ, అక్కా! ఏడవకు. ఇక్కడినుంచి ఎక్కడికీ పోకు. నన్ను నీకు రక్షణ యివ్వనీ' అని ఎన్నెన్నో చెప్పి ఊరడించాలనుకున్నాడు. చేతకాలేదు. చూస్తూ, బాధపడుతూ ఊరుకున్నాడు.
క్రమంగా చీకటిపడింది. నక్షత్రాలు ఆకాశంలో మినుకుమన్నాయి. అయినా జగతి వెర్రిదానిలా తిరగటం మానలేదు. బయటకు వెళ్ళే ప్రయత్నమే చెయ్యలేదు.
ఉన్నట్లుండి మృత్యుంజయరావుకు ఆ స్వామివార్ని చూద్దామని బుద్ధిపుట్టింది. ఇన్నాళ్ళూ అతనెప్పుడూ మఠంలో ప్రవేశించలేదు. స్వామిని సందర్శించలేదు. ఆయన ఎలా వున్నాడో, ఏం చేస్తున్నాడో చూద్దామని పించింది.
లేచి "అలా బయటకు వెళ్ళివస్తానక్కా!" అన్నాడు.
ఆమెకు వినబడినట్లులేదు.
నెమ్మదిగా బయటకు వచ్చి, తలుపులు దగ్గరగా మూసి, గేటుదాటి మఠంవైపు నడవసాగాడు.
అతనక్కడకు చేరుకునేసరికి జనం ఎవరూ కనిపించకపోవటం చూసి విస్మయం చెందాడు. చెప్పులు బయట విడిచి లోపలకు వెళ్లాడు. మందిరమంతా కళావిహీనంగా వుంది. ఒకటో రెండో దీపాలుతప్ప మిగతావన్నీ ఆర్పివేసి వున్నాయి. స్వామి ప్రతిష్ఠించిన విగ్రహాలదగ్గర అర్చకుడులేడు. మత నిర్వహణకు సంబంధించిన ఒక వృద్దాంగన, మూలెక్కడో చాపమీద కూర్చుని తావళం తిప్పుతోంది.
మృత్యుంజయరావు ఆమె దగ్గరకు వెళ్ళాడు. "స్వామివారు ఏమయినారో చెప్పగలరా?" అనడిగాడు బిగ్గరగా.