'అయితే మాలతిగారితో సంప్రదించవలసిన అవసరం ఏమొచ్చింది?' అని అడుగుదామనుకున్నాడు. అదీ అడగలేదు.
కాసేపు కూర్చుని తురంగరావు "నాకు పనివుంది" అని చెప్పి వెళ్ళిపోయాడు.
మాలతి నవ్వుతూ అన్నది. "విమర్శనా గ్రంథం రాయాలంటే చాలా తేలికట. మా నాన్నగారు చెబుతూ వుంటారు. ఆ అంశానికి సంబంధించిన పుస్తకాలు ఓ పది దగ్గర పెట్టుకుంటే చాలుట. అందులో ఓ పేరా, యిందులో ఓ పేరా యిలా గ్రంథం పూర్తిచేయవచ్చు."
మళ్ళీ ఆమే "మా నాన్నగారంటే యీయనకు కోపం. నాటక దర్శకత్వం సరిగ్గా సాగనివ్వలేదని. ఒకసారి మా నాన్నగారు ఈయన్తో 'మీ తండ్రిగురించి తెలుసుగాని, నీగురించి నాకేం తెలియదు' అని సెటైర్ విసరటం నా చెవులపడింది" అంది.
మృత్యుంజయరావు నవ్వి ఊరుకున్నాడు.
కొంచెం ఆగి మాలతి "అవునుగాని, సోమయాజులుగారు మీ గురించి రిపోర్టు యిచ్చారు. మీరు చాలా చెడ్డవారట. చాలామంది ఆడపిల్లలు ఫ్రెండ్స్ వున్నారటగా" అంది.
అతనికేం చెయ్యాలో తోచక ముసిముసిగా నవ్వి ఊరుకున్నాడు.
"తురంగరావుగారు కూడా చెప్పారులెండి. మీరు ఆయన్తో నా చెయ్యి పట్టుకున్నారని అన్నారట. ఎందుకు పట్టుకోనిచ్చావని కోప్పడుతున్నారాయన."
అతను అదిరిపడి ఆమెముఖంలోకి చూశాడు. సీరియస్ గా అంటూందా, నవ్వులాటకి అంటూందా తెలుసుకోవటానికి ప్రయత్నించాడు. ఆమెముఖంలో ఎక్కడా కోపచిహ్నాలు కనిపించలేదు. సన్నని చిరునవ్వు పెదిమలమీద మెదుల్తోంది. అతనివంకే గుచ్చిగుచ్చి చూస్తోంది.
"ఏమిటి? తురంగరావు అన్నాడా యీ మాట?"
"అవునండీ."
అతను కుర్చీలో ముందుకు వొంగాడు. "మీరు నమ్మారా?"
"ఎందుకు నమ్మకూడదూ?" మాలతి కొంటెగా చూస్తోంది.
"అయితే అంతేనన్నమాట నన్ను అర్ధం చేసుకుంది?" అతనలా అనటమే సమయోచితంగా తోచింది. లోలోపల తురంగరావుని శాపనార్ధాలు పెట్టుకుంటున్నాడు. చీలుస్తున్నాడు. ఛండాడుతున్నాడు.
మాలతి అతనివంక సానుభూతితో తిలకించింది. "ఎందుకండీ అలా కంగారుపడతారు? మనుషుల మనస్తత్వాలూ, ప్రవర్తనలూ నాకామాత్రం తెలియవనుకున్నారా? ఈరోజున తురంగరావు పనిగట్టుకుని వచ్చి అవాకులూ, చవాకులూ పేలినంతమాత్రాన ఎలా నమ్ముతాను?"
అతను సేదతేరి, నిశ్చింతగా నిట్టూర్పు విడిచాడు. 'హమ్మయ్య! ఓగండం గడిచింది.'
ఈ తర్వాత అతను ఉపన్యాసంలాంటిది యిచ్చాడు. మాట్లాడుతున్నంతసేపూ ముఖాన్ని విచారంగా పెట్టాడు. ఈ సంఘాన్నీ, ప్రజల్నీ, ప్రపంచాన్నీ తెగ విమర్శించాడు. పాడు సమాజం... ఒక స్త్రీ, పురుషుడూ కలిసివుంటే ఓర్చలేదన్నాడు. వదంతులు పుట్టిస్తుందన్నాడు. తన నిష్కల్మష హృదయాని చాటుకోవటానికి ప్రయత్నించాడు.
కాని మాట్లాడుతున్నంతసేపూ మనసులో సంఘర్షణననుభవిస్తూనే వున్నాడు. అబ్బే, యిలా మాట్లాడకూడదు నేను' అనుకుంటున్నాడు.
మరింక ఎలా మాట్లాడాలి?
"అసలు నాకు మొదట ఏమీ అభిప్రాయం లేదండీ మీమీద. చీటికీ మాటికీ వచ్చి 'నిజం చెప్పు. మీ యిద్దరికీ ఏమయినా వుందా?' అని వేధించటం ద్వారా యీ తులువలు కల్పించారు. ఎడతెగకుండా వాళ్ళలా వేధించుకు తినేసరికి నేను మీగురించి ఆలోచించటం మొదలుపెట్టాను. రానురానూ ఆలోచించటం ఎక్కువైంది. చివరకు ఆలోచించకుండా వుండలేకపోయాను. మీరేమీ ఆలోచించటంలేదా మాలతీ?"
ఎంత సూచనప్రాయంగా, మెత్తగా, భావస్థారకంగా వుంది యిలా మాట్లాడితే?
కాని తను మాట్లాడలేదు. మాట్లాడలేకపోయాడు.
ఓ మంచి అవకాశాన్ని, దేముడు కరుణించిన తరుణాన్ని పాడుచేసుకున్నాడు, పోగొట్టుకున్నాడు.
కాని ఓరకంగా మనసులో అనుకున్నట్లుగా మాట్లాడకపోవటమే మంచిదయింది.
'ఎందుకని? ఎందుకని అంటావురా జయా?'
"నేనేమీ ఆలోచించటంలేదు" అని ఆమె అంటే?" మీరలా ఆలోచిస్తున్నందుకు నేను చాలా విచారిస్తున్నాను" అని ఆమె అంటే? "మీరు చాలా మంచివారనుకున్నాను. మీ మొగబుద్ధి పోనిచ్చారుకాదు" అని ఆమె అంటే? 'నీవొంకర ముక్కూ నువ్వూనూ. ఏముంది నీగురించి ఆలోచించటానికి నా బొంద" అని ఆమె అంటే?
అతను వూహించలేకపోయాడు. వంటిమీద తేళ్ళూ, జెర్రులూ పాకినట్లయింది.
"మంచిపని చేశాను" అని సంతోషించాడు.
అతని ఉపన్యాసం విని మాలతి ఏ వ్యాఖ్యానమూ చేయలేదు. చిన్నగా నవ్వి ఊరుకుంది.
కాసేపటికి ఆమె "మీ అక్కగార్ని మళ్ళీ ఎప్పుడూ చూపించలేదేం? నన్ను రమ్మంటే నేను వస్తాను. లేకపోతే ఒకసారి ఆమెను మా యింటికి తీసుకురాకూడదూ?" అంది.
అతనికి వారిద్దరూ తిరిగి కలుసుకోవటం యిష్టంలేదు. మాలతి ఆమెను గ్రుచ్చి గ్రుచ్చి ప్రశ్నలు వేస్తోంది. జగతి దాపరికంలేని మనిషి కావటంవల్ల అన్నీ బయటపెట్టేస్తుంది. అది అతనికి రుచించదు.
"ఆమెకు యీమధ్య తీరిక వుండటంలేదు. వీలుచూసుకుని ఒకసారి తీసుకువస్తానులెండి" అన్నాడు. మాలతి మళ్ళీ ఆ ప్రసక్తి ఎత్తలేదు.
* * *
ఆ రాత్రి మాలతి యింటినుండి తిరిగివస్తూంటే అతనికి దారిలో శేఖరం ఎదురయ్యాడు. స్ట్రీట్ లైటు వెల్గులో సిగరెట్టు కాల్చుకుంటూ వస్తూ కనిపించాడు. క్షణంలో అతని వీరత్వం ఎగిరిపోయింది. తను ఎక్కడ్నుంచి వస్తున్నదీ పసిగట్టాడా? తనని దగ్గరకు పిలుస్తాడా? తిడతాడా? అతని గుండె గబగబ కొట్టుకుంటోంది. కాని శేఖరం అతన్ని చూసీ చూడనట్లు త్వరగా నడుచుకుంటూ వెళ్ళిపోయాడు.
* * *
కొన్నాళ్ళకు తురంగరావు నిజంగానే తన గ్రంథాన్ని ఆవిష్కరించటానికి సభ ఏర్పాటు చేశాడు. మొదట్లో సభ్యులలో ఎవరూ ఈ ఆవిష్కరణ మహోత్సవానికి అంగీకరించలేదు. కాని అతను దెబ్బలాడి, అనేక పాయింట్లు లేవదీసి, విడిపోతానని బెదిరించి, మొత్తంమీద అందరూ ఒప్పుకునేటట్లు చేశాడు. వైకుంఠాన్ని బాగా ఉబ్బేసి, ఆసరాగా వుండేటట్లు చేసుకున్నాడు. ఆవిష్కరింప చెయ్యటానికి మొదట మంత్రులకోసం ప్రయత్నాలు జరిపాడు. కుదరలేదు. కలెక్టరుగారికోసం కృషిచేశాడు. వీలుపడలేదు. చివరకు కాలేజీ ప్రిన్సిపాలుగార్ని అభ్యర్ధించి అంగీకరింపజేశాడు.
ఆహ్వానపత్రాలు అచ్చయ్యాయి. అందులో రచయితకు సన్మానం అనే అంశం చూసి సభ్యులు విస్తుపోయి, ముక్కుమీద వేలేసుకున్నారు. "మాతో సంప్రదించకుండా సన్మానమని ఎలా అచ్చువేశాడు?" అని తారాజువ్వల్లాగా లేచారు.
పరిస్థితి ఇలా వస్తుందని తెలిసే వాళ్ళను శాంతింపచేసే బాధ్యత వైకుంఠం మీద పెట్టి తురంగరావు చల్లగా తప్పుకున్నాడు. వైకుంఠం పొట్టిగా, గుమ్మటంలా వుంటాడు. తను హాస్యప్రియుడని అనుకుంటూ వుంటాడు. అంతేకాదు, ఎవరిమాటలు వాళ్ళకు చెప్పటంలోనూ, ఎక్కడికక్కడ సర్దిచెప్పటంలోనూ ఉద్ధండుడు. చిన్నప్పుడు తురంగరావూ, అతనూ సహచరులు. వివాహితులు. తురంగరావుకు పిల్లలు పుట్టారు. ఇతనికి కలగలేదు. ఈమధ్య యిద్దరూ కలసి ఎమ్.ఏ.కి ఉత్కళ యూనివర్సిటీలో కడదామని కలిసి చదవటం మొదలుపెట్టారు. "గలివర్స్ ట్రావెల్స్" చదువుతున్నారు. "అది గలివర్ కాదు, గులివర్" అన్నాడుట తురంగరావు అతన్ని ఏడిపించటానికి. అతను నమ్మి నలుగురిలోనూ "ఈమధ్య గులివర్ ట్రావెల్ చదువుతున్నాను" అనటం సాగించాడుట. అంతా ఒకటే నవ్వులు. "నేనే అలా చెప్పాను ఏడిపించటానికి, అయినా బి.ఏ. ప్యాసయిన వాడికి గలివర్ ని ఎలా ప్రొనౌన్స్ చెయ్యాలో విచక్షణాజ్ఞానం ఏడవద్దూ?" అని తురంగరావు పేరు పేరునా పిలిచి చెప్పాడు.
ఇలాంటివి జరగటంవల్ల వైకుంఠానికి తురంగరావంటే గుర్రుగా వుండేది. కాని అవసరానికి తురంగరావు అతన్ని దగ్గరకు చేరదీసి, బుజ్జగించి "నలుగురూ మన స్నేహాన్ని పాడుచేయాలని చూస్తున్నారు. ఇహమీదట మనం ఒకరిగురించి ఒకరు చెడుగా మాట్లాడుకోవద్దు" అని దువ్వాడట. ఇతను దువ్వించుకున్నాడు. క్రమంగా తురంగరావంటే వైకుంఠానికి గురుభావం కూడా ఏర్పడింది.
అతను తురంగరావును మరీ వెనకేసుకురాకుండా "పోనీ పాపం! అతను కక్కుర్తిపడ్డాడు. సభ్యుల్ని సంప్రదించకుండా అచ్చువేయించటం మంచిపని కాదనుకోండి. కాని బయటకు చెబితే ఒప్పుకోమని భయం చేతకదా అలా తాపత్రయపడింది! ఏది ఏమయినా తురంగరావు మనవాడు, మన ఎసోసియేషన్ వ్యవహారాలలో కష్టపడి పనిచేసినవాడు. ఇప్పుడతని మీద దాడిచేసి, సన్మానం జరగకుండా చూస్తే పాపం, అభాసుపాలు అవుతాడు. ఇంకో విషయం, డబ్బూ డబ్బూ సమితినుండి ఏమీ ఖర్చుపెట్టక్కర్లేదు. పేరు సమితిది. ఖర్చు అతనిది" అని మెల్లిగా నచ్చచెప్పాడు.
నలుగురూ సంప్రదించుకుని తృప్తిపడి సరే అన్నారు.
ఆవిష్కరణ రోజు వచ్చింది. ఆనాడు తురంగరావు పడ్డ కష్టం వర్ణనాతీతం. సభకు మూడు నాలుగువందలమంది అయినా వస్తారని డెబ్బయిఅయిదు రూపాయలు అద్దె యిచ్చి పెద్దహాలు తీసుకుంటే పట్టుమని పాతికమంది ప్రజలైనా రాలేదు. తురంగరావు తతంగమంతా సరిగ్గా జరుగుతుందో లేదో అని స్టేజిమీదనుంచి లోపలకూ, లోపలనుంచి స్టేజిమీదకూ తిరుగుతూ చెడ్డ హైరాన పడిపోతున్నాడు. "ఇప్పుడు రచయితగారికి సన్మానం జరుగుతుంది" అని అధ్యక్షుడు ఎనౌన్స్ చేశాడు. తురంగరావుకు చెమటలు పట్టాయి. "ఇప్పుడే వస్తాను" అని క్షమాపణలు చెప్పుకుని తెరవెనక్కు వెళ్ళాడు. "పూలదండ లేవయ్యా మహానుభావా? పూలదండలు లేకుండా సన్మానమెలాగ?" అని వైకుంఠంమీద విరుచుకుపడ్డాడు. "నాలుగు గంటలకే తీసుకురమ్మన్నానోయ్. ఇప్పుడు ఆరుదాటినా వాడింకా తగులడలేదు" అని సంజాయిషి యిచ్చుకుంటున్నాడు. "ఫోన్ చెయ్యి. టాక్సీమీద రమ్మను. అర్జంటు" తురంగరావు వగరుస్తున్నాడు. "ఉష్, జాగ్రత్త, మాటలు మైకులో వినబడతాయి" అని వైకుంఠం రహస్యంగా హెచ్చరించాడు. వీళ్ళు ఎంతసేపటికీ బయట పడకపోయేసరికి ఏలూరునుంచి వక్తగా వచ్చిన ముకుందరావు ఏమిటేమిటంటూ లోపలకు వచ్చాడు. విషయం తెలుసుకుని తల బాదుకుంటున్నాడు. ఇంతలో ఆపద్భాధవుడిలా పూలవాడు ప్రత్యక్షమయ్యాడు. వాడికి నాలుగు అక్షింతలు వేసి కార్యక్రమం జాగ్రత్తగా కొనసాగించండి" అని పురమాయించి, స్టేజిమీదకు వెళ్ళి ఠీవిగా కూర్చున్నాడు తురంగరావు. ఫోటోగ్రాఫర్ కెమెరా సర్దుకుంటున్నాడు. ఏ యే సందర్భాలలో స్నాప్స్ తియ్యాలో తురంగరావు ముందుగానే బోధపర్చి వుంచాడు. వైకుంఠం లోపలనుండి పూలదండ తీసుకుని అట్టహాసంగా వచ్చాడు. అతని కంఠంలో అలంకరించాడు. పట్టుపీతాంబరాలు మీద కప్పాడు. 'తిలకం దిద్దలేదేం?' అన్నట్లు తురంగరావు కళ్ళెర్రజేసి సౌంజ్ఞ చేస్తూ చూపాడు. వైకుంఠం నాలిక కొరుక్కుని గబగబ లోపలకు వెళ్లి తిలకంసీసా పట్టుకొచ్చి, అతని నుదుటన దిద్దాడు. వైకుంఠం తీసుకొచ్చిన అతని యింటివారి పాపలు హారతి పట్టారు. కెమెరామేన్ స్నాప్స్ కొట్టేస్తున్నాడు. సన్మానం పూర్తయింది.