వృద్దాంగన కళ్ళు తెరిచింది. "స్వామివారు మాధవపురంలోని వారి ఆశ్రమానికి ఈ ఉదయం వెళ్లిపోయారుగా!" అంది వొణికే కంఠంతో.
అతను చకితుడై "అంత హఠాత్తుగా వెళ్ళిపోవడానికి కారణం తెలుసా?" అని ప్రశ్నించాడు.
వృద్దాంగన అతనివైపు నిదానించి చూసి "రాత్రినుండి వారి ఆరోగ్యం సరిగ్గాలేదు. అర్ధరాత్రి నిద్రలో చాలాసార్లు కేకలుపెట్టారు. తెల్లవార్లూ కలవరిస్తూనే వున్నారు. ఉదయం లేచేసరికి చాలా బడలికగా, వడిలిపోయి వున్నారు. 'నాకేం స్వస్థతగాలేదు. ఇక్కడ్నుంచి తక్షణం వెళ్ళిపోవాలి' అన్నారు. భక్తులంతా కంగారుపడి అప్పుడే వెళ్ళిపోవద్దని ఎంతో ప్రార్ధించారు. వారు వినలేదు. "ఆశ్రమంనుండి నాకు పిలుపు వచ్చింది. వెళ్ళాలి" అని పట్టుబట్టారు. వారినాపటం ఎవరితరమూ కాకపోయింది. అంతే- అప్పటికప్పుడు అన్నీ సర్దుకుని శిష్యులతో వెళ్ళిపోయారు. ఆయనకేం కష్టం వచ్చిందో! మహానుభావుడు" అని కళ్ళు తుడుచుకుంది.
మృత్యుంజయరావుకు అర్ధమైంది. ఆవిడకి నమస్కారం చేసి బయటకువచ్చి గబగబా యింటిదారి పట్టాడు.
అతను గదికి వచ్చేసరికి జగతి కుర్చీలో కూర్చుని రెండుచేతుల్లో తలపెట్టుకుని దీర్ఘంగా యోచిస్తోంది. అడుగుల చప్పుడు విని ముఖం త్రిప్పి చూసింది.
చెప్పనా వద్దా అని తటపటాయిస్తున్నాడు అతను. రెండు నిముషాలు మధనపడ్డాడు. చివరికి చెప్పటానికే నిశ్చయించుకుని దగ్గరచేరాడు.
గొంతు సవరించుకుని "అలా పనిమీద మఠందాకా వెళ్ళివచ్చానక్కా! స్వాములారు యీ ఉదయం హఠాత్తుగా మఠం ఖాళీచేసి వెళ్ళిపోయారుట. అక్కడ జనం చెప్పుకుంటున్నారు" అన్నాడు భయపడుతూ.
ఆమె దెబ్బతిన్నట్లు బెదిరి అతనికేసి విహ్వలదృష్టితో చూస్తోంది. ఆమె ముఖం తైలంలేని దీపంలా వెలవెలాపోతోంది. హేమంతకాలంలో కలువలు లేని కాసారంలా నివ్వెరపోతోంది.
* * *
అప్పట్నుంచీ జగతి యోగినిలా అయిపోయింది. ఏమీ మాట్లాడదు. సరిగ్గా తినదు. మృత్యుంజయరావు దగ్గరచేరి బ్రతిమాలగా నాలుగుమెతుకులు తింటుంది. వెళ్ళి పడుకుంటుంది. అర్థరాత్రి పూట తలుపులు తీసుకుని వసారాలోకి వెళ్ళి అరుగుమీద నిలబడి పిచ్చిదానిలా శూన్యంలోకి తిలకిస్తూ వుంటుంది.
మృత్యుంజయరావు మాలతిని తీసుకువద్దామనుకున్నాడు. కని యింకేం కొత్త ఉపద్రవం ముంచుకొస్తుందో! భయపడి వూరుకున్నాడు.
చిలకమ్మగారు తన ఉల్లాసకరమైన ధోరణిలో ఆమె మనసును రంజింప చేయటానికి ప్రయత్నించి విఫలురాలై మిన్నకుంది.
ఒకరోజు మృత్యుంజయరావు ఆఫీసునుండి యింటికి వచ్చేసరికి జగతి లేదు. బల్లమీద కాగితం పెట్టివుంది.
"ఎలా వచ్చానో, అలా వెళ్ళిపోతున్నాను. నన్నుగురించి వెతక్కు- జగతి" అతని కాళ్ళక్రింద భూమి కదిలింది. తలపట్టుకుని కుర్చీలో కూలబడ్డాడు.
12
తర్వాత చాలారోజులు మృత్యుంజయరావు జీవితం ఒడుదుడుకులు లేకుండా గడిచిపోయింది. ఒడుదుడుకులు లేకుండా అంటే ప్రశాంతంగా గడిచిందనికాదు, సాదాగా గడిచింది, మందకొడిగా గడిచింది. నిస్సారంగా గడిచింది. అసలతని జీవితం సారవంతంగా ఎప్పుడూలేదు. కాని జగతి రాకతో ఓ ఒరవడి ఏర్పడినట్లయింది. సార్థకత లభించినట్లయింది. ఓ వెల్తి తీరినట్లు అనిపించింది. ఇప్పుడా నూతన అనుభూతులు అన్నీ అంతరించి ఎప్పటి జడపదార్థంగా మిగిలాడు. అయితే ఈ జడపదార్థానికి గుండెవుంది. కాని అక్కరకు రాని గుండె. ఎన్నో రాత్రులు అతను దుప్పటి కప్పుకుని పడుకుని "భగవంతుడా! నన్నెందుకు పుట్టించావు?" అని ప్రశ్న వేసేవాడు. తనలో తను కుమిలి, కుళ్ళి క్షీణించేవాడు. అతనికి ఒక్కొక్కసారి చచ్చిపోవాలనిపించేది. కాని చావంటే భయం. తనంటే తనకు భయం. వల్లమాలిన అసహ్యం. తననితాను భరించలేకపోయేవాడు. జగతిని వెతికే ప్రయత్నమేమీ చెయ్యలేదు. మాలతి అడిగింది ఒకరోజు ఆమెనిగురించి. వెళ్ళిపోయిందని చెప్పాడు. ఎక్కడికని ఆమె అడుగుతుందేమోనని హడలిపోయాడు. కాని ఆమె అడగలేదు. నిట్టూర్పు విడిచి, నిష్ఠుర స్వరంతో "మీరు చెడ్డవారు, ఆమెను మళ్ళీ కలుసుకుందామని ఎంతో ఉబలాటపడ్డాను. పడనిచ్చారు కాదు" అంది.
ఈ మధ్య మాలతినికూడా ఎక్కువ కలుసుకోవటంలేదు. ఎప్పుడు వెళ్ళినా పశుపతిగారు యింట్లో వుంటున్నారు. తనని గురించి ఆయన ఏమని తలచినా, తను చీటికీ మాటికీ వస్తున్నందుకు ఆయన విసుక్కుంటున్నాడేమోనని అతని భయం. అదీగాక మాలతి తల్లి సత్యవతమ్మగారు హై బ్లడ్ ప్రెషర్ తో బాధ పడుతోంది. దానికితోడు కూతురి వివాహంగురించి ఆమె బెంగ పెట్టుకుంది. పోయినప్పుడల్లా అదో పెద్ద ప్రసక్తి అయిపోయింది.
ఒకరోజు అర్ధరాత్రి అతను కలతనిద్రలో పీడకలలు కంటుండగా యింటివారి భాగంనుండి పెద్దపెట్టున కేకలు వినిపించాయి. "కొంప మునిగి పోయింది నాయనోయ్" చిలకమ్మగారి కంఠం అది. అతను తృళ్ళిపడి లేచి ఆదరాబాదరాగా తలుపులు తెరుచుకుని పరిగెత్తాడు. హాల్లో మంచంమీద శ్రీకంఠంగారు కళ్ళుతెరుచుకుని చలనంలేకుండా పడుకుని వున్నారు. చిలకమ్మగారు గట్టిగా ఏడుస్తూ "డాక్టర్ని పిల్చుకురండి బాబూ!" అని అరుస్తోంది. అతను కంగారుపడుతూ డాక్టర్ని పిల్చుకురావాలని పరిగెత్తటానికి సిద్ధపడుతున్నాడు. కాని యింతలోనే ఆవిడకేకలు విని లోపలకు పరుగెత్తుకు వచ్చినవారిలో ఒకాయన శ్రీకంఠంగారి చెయ్యిచూసి, "ప్రాణం లేదండీ" అని పెదవి విరిచాడు. నలుగురూ కలిసి మృతకళేబరాన్ని క్రిందికి దింపారు.
ఇహ చిలకమ్మగారు ఏడ్చింది. ఎంత అందంగా ఏడ్చిందని! ఆవిడ జుట్టు ముడి ఊడిపోయి దీర్ఘమైన శిరోజాలు ముఖంమీద విచ్చుకున్నాయి. భర్త వక్షస్థలం మీద తల ఆన్చి, ఏవేవో మాటలు అంటూ దుఃఖిస్తోంది. "నాన్నా! ఎన్ని ఆశలు కల్పించావురా? ఒక్కటీ తీర్చకుండా అప్పుడే నూరేళ్ళూ నిండినట్లు వెళ్ళిపోయావురా. శ్రీ! నువ్వు లేకుండా యీ భూమ్మీద ఎలా మసలుకోను! బాబూ! ఒక్కసారి కళ్ళు తెరిచి నావంక చూడవూ! నేనూ! నీ ప్రియతమని."
నడివయసులో వున్న స్త్రీ అట్లా, ఏడుస్తూంటే అతనికి ఏవగింపు కలగకపోగా ముగ్ధుడయి చూస్తున్నాడు. పడకటింట్లోని సంబోధనలన్నీ ఆమె చేస్తోంది. వాళ్లు ఎంత శృంగారజీవులో అనుకుని చలించాడు. అతనికి వారిపట్ల భక్తిభావం జనించింది.
భుజంమీద చెయ్యిపడితే తలత్రిప్పి చూశాడు. పిచ్చివాడు, "ఈ యింట్లోకి కొత్తగా వచ్చిన మేస్టారు కదూ" అని అడిగాడు.
మృత్యుంజయరావు అవునన్నట్లు తల ఊపాడు.
"ఎందుకలా ఏడుస్తున్నారూ? ఎవరయినా చచ్చారేమిటి?"
"మీ బావగారు పోయారు."
"పాపం! నన్నెప్పుడూ వెళ్ళగొడుతూ వుండేవాడు" అని అతను అరుగుమీద మూల చేరి బీడీ అంటించాడు.
ఊళ్ళోని బంధువులంతా వచ్చి ఎవరు చేయవలసిన సాయం వాళ్ళు చేస్తున్నారు. హఠాత్తుగా తనుకూడా ఏదయినా సాయపడి తన ఉనికిని స్మరణీయం చేయాలని మృత్యుంజయరావుకు స్ఫురించింది. కాలుగాలిన పిల్లిలా వాళ్ళందరి మధ్యనుంచీ అటూయిటూ తిరిగాడు. ఎవరన్నా ఏ పని అయినా చెబుతారేమోనని చూశాడు. ఎవరూ పిలవడంలేదు. ఆఖరికి ఒక ముసలాయన దగ్గరకు వెళ్ళి, "ఏమండీ, నేను యీ యింట్లో అద్దెకుంటున్నాను. ఏమయినా సాయం కావలిస్తే అడగండి. మొహమాటపడకండి" అన్నాడు. ఆ ముసలాయన ఒక నిముషం అతనివంక ఎగాదిగా చూసి, "ఏమీలేదు. రేపట్నుంచీ కర్మకాండ అంతా జరగవల్సి వుంటుంది. ఇల్లంతా బంధువులుంటారు. సరిపోదు. మీరు ఏమీ అనుకోక ఖాళీ చేస్తే..." అన్నాడు. మృత్యుంజయరావు గతుక్కుమన్నాడు. "సరే సరే" అని యివతలకు వచ్చాడు. అప్పట్నుంచీ అతని మనసు మనసులో లేదు.
తెల్లవారి, శవానికి స్నానం వగైరాలు, అంత్యక్రియలు అన్నీ యధావిధిగా నిర్వర్తించబడుతున్నాయి. చిలకమ్మగారి మేనల్లుడు- పిచ్చివాడి కొడుకు గబగబా తల్లిదగ్గరకొచ్చి "అమ్మా! నాకు స్కూల్ టైమయింది. అన్నంపెట్టు" అని గోల చేస్తున్నాడు. ఆవిడ ఎవరూ వినలేదుకదా అని అటూయిటూ చూసి వాడినోరు మూసి, బరబర అవతలకు లాక్కువెళ్ళి, "తప్పు నాన్నా! మామయ్యగారు పోయారు. మనమంతా కష్టంలో వున్నాం. కొన్నాళ్ళదాకా బడికి పోకూడదు. అందరి ఎదుటా అలా మాట్లాడకూడదు" అని నచ్చచెప్ప సాగింది.
దహన కార్యక్రమానికి మృత్యుంజయరావుకూడా స్మశానందాకా పోయివచ్చాడు. శవాన్ని తగలబెడుతూంటే అతని వళ్ళు జలదరించింది. "నన్నూ యిలాగే కాలుస్తారు. నా శవంచుట్టూ కనీసం కొంతమంది మనుషులు పోగవుతారు" అనుకున్నాడు.
ముసలాయన మరునాడు ఉదయమే వచ్చి గదులు ఖాళీ చెయ్యమని గొడవ చేయసాగాడు. చూడబోతే కర్మకాండ వ్యవహారానికి అంతా ఆయనే ఆధ్వర్యం వహించేటట్లుగా వుంది. ఎలాగా అని తటపటాయిస్తున్నాడు మృత్యుంజయరావు. ఇంతలోనే యీ విషయం దుఃఖంలోవున్న చిలకమ్మగారికి తెలిసింది. "వద్దు. పాపం అతన్ని ఖాళీ చేయమనకండి. లంకంతకొంప వుండగా ఆ కాస్తగదీ ఏమడ్డమొచ్చింది? కాకపోతే అతని అక్కగారు వచ్చినప్పుడు తీసుకున్న గది అతనికవసరంలేదు కాబట్టి తీసుకుందాం" అని కబురుచేసింది. ముసలాయన సరే సరే అని తల ఊఫై మెల్లగా జారుకున్నాడు.
ఆ సాయంత్రం మృత్యుంజయరావుకు టెలిగ్రాం వచ్చింది. "అమ్మకి జబ్బుగా వుంది. బయల్దేరు" పినతండ్రి యిచ్చాడు.
తల్లిని తలుచుకొనగానే అతనికళ్ళలో నీళ్ళు తిరిగాయి. 'అమ్మకి జబ్బుగా వుంది. అమ్మకూడా చచ్చిపోతుందేమో, అనుకున్నాడు. తల్లిని చూడటానికి అతని హృదయం ఆరాటపడింది. విచిత్రమైన స్పర్శ అతనివంటిని తాకినట్లయింది. కొన్నాళ్ళపాటు ఆఫీసుకు సెలవుపెట్టి స్వగ్రామానికి బయల్దేరాడు. వెళ్ళేముందు గదిలోని సామానంతా అలమారాల్లో సర్దుకుని, తను వచ్చేవరకూ గదిని యధేచ్చగా వాడుకొమ్మని యింట్లో మసులుతూన్న బంధువులకి చెప్పి తాళంచెవి యిచ్చాడు.
ఏలేశ్వరంలో తను కొన్నాళ్ళు గడిపిన ఆ ఇంటిలో ప్రవేశిస్తూంటే, అతని కాళ్ళు తడబడ్డాయి. పినతండ్రులు, పెదతండ్రులు, వారి భార్యలు, వారి పిల్లలు అతనివంక అనాసక్తంగా, వికృతంగా చూశారు. ఆ చూపుల్ని తప్పించుకుంటూ, వాళ్ళు అడిగే వ్యంగ్యంతోకూడిన ప్రశ్నలకు సమాధానం చెబుతూ అతను తల్లి వుంటున్న శిథిలగృహంలోకి ప్రవేశించాడు.
అక్కడి వాతావరణాన్నీ, పరిస్థితినీ చూసేసరికి అతని నేత్రాంచలాలలో నీళ్లు నిలిచాయి. పశువులపాక అయినా అంతకంటే శుభ్రంగా, అమరికగా వుంటుంది. ఎండకు అడ్డులేదు, వానకు అదుపులేదు. చలికి అవధిలేదు. ఆ బూజుతో జీరాడుతున్న కొంపలో, దుర్గంధ భూయిష్టమైవున్న ప్రదేశంలో, ఓ కుక్కిమంచంమీద కృశాంగియై పడుకుని వుంది శ్రీదేవి- అతని తల్లి.