Previous Page Next Page 
కరుణశ్రీ సాహిత్యం - 3 పేజి 24

                                 


                                  ప్రభువు - పతితురాలు

           

    అది సాయంసమయము. బతెల్ హాము నగర వీథిలో ఒక స్త్రీ నడచి వచ్చుచుండెను. కొందరు మనుష్యులు ఆమెపై రాళ్లు విసరుచు తరుముకొని వచ్చుచుండిరి. ఆ స్త్రీ వదనము వాడిపోయి యుండెను. వెంట్రుకలు చెదరిపోయెను. కట్టుబట్టలు చీలికలయ్యెను.
    అంతకంతకు ఆ మనుష్యులు ఆమెను రాళ్ళతోను కఱ్ఱలతోను బాధింపదొడగిరి. "కొట్టుడు, తన్నుడు, నరకుడు, చంపుడు, ఇది దుర్మార్గురాలు. పతితురాలు, వంచకురాలు, కులట. దీనిని మన పట్టణములో ఉండనీయరాదు. కొట్టుడు, తన్నుడు, నరకుడు, చంపుడు" అని వారు పొలికేకలు వేయుచుండిరి.
    అంతలో ఏసుక్రీస్తు అక్కడికి వచ్చెను. ఆయన కనులలో కరుణ చిందిపోవుచుండెను. ముఖములో శాంతి ప్రకాశించుచుండెను. ఆ మహానుభావుని చూడగానే ఆ స్త్రీ "ప్రభూ! రక్షింపుము! వీరు నన్ను హింసించుచున్నారు" అని ఆయన పాదపద్మములపై వ్రాలెను.
    క్రీస్తుప్రభవు చేతులెత్తి ఆ మనుష్యులను వారించుచు "అయ్యలారా! ఆగుడు. కఱ్ఱలు క్రిందికి దింపుడు. రాళ్లు దూరముగా పారవేయుడు. మీరు ఈమెను ఎందుకు బాధించుచున్నారు?" అని అడిగెను.
    అందుకు వారు "ప్రభూ! ఇది దుష్టురాలు. మోసకత్తె. కులట. ఇది ఎన్నడును ఒక్క మంచిపని కూడ చేయలేదు. దీనిని ముక్కలు ముక్కలుగా తెగ నరికినను పాపములేదు" అని నొక్కి పల్కిరి.
    క్రీస్తు ప్రభువు వారిని కనుగొని "అయ్యలారా! శాంతింపుడు. ఈమె దుర్మార్గురాలే. అన్నియు తప్పులే చేసినమాట నిజమే. కాని మీలో ఎన్నడును ఏ పాపమును చేయనివారే ఈమెపై రాయి విసరవలెను. రండు. మీలో పాపము చేయనివారెవరో ముందుకు వచ్చి ఈమెను దండింపుడు" అని పలికెను.
    ఎవరికి వారు తానేదో ఒక తప్పు చేసియుందునని అనుకొని మిన్నకుండిరి. ఎవరును ముందుకు రారైరి.
    క్రీస్తుదేవుడు వారినిచూచి "నాయనలారా! మానవులలో తప్పుచేయనివారు ఎవరు ఉన్నారు? మనము తప్పులు చేయుట సహజము. తప్పుచేసిన వారిని శిక్షించునది దేవుడు కాని మనముకాదు. తోడి మానవులను ప్రేమించుటయే మన విధి. ప్రేమయే భగవంతుడు, భగవంతుడే ప్రేమ" అని పలికెను.
    ఆయన పలుకులు వినగానే వారందరు సిగ్గుతో తలలు వంచుకొని వెళ్లిపోయిరి. క్రీస్తుభగవానుడు పతితురాలికి అభయమిచ్చి ఓదార్చెను.

                                        *  *  *  *

 Previous Page Next Page