Previous Page Next Page 
గ్రాండ్ మాస్టర్ పేజి 22


    ఇక్కడ దేశ ఉపప్రధాని కొడుకు ఓ పథకం ఆలోచిస్తున్న సమయంలో...

 

    సత్యం మాస్టారి యింటిలో అడుగుపెట్టాడు శమంత్.

 

    స్మశానంలాంటి స్తబ్ధత. కూలిన ఓ పొదరింటి వాతావరణం. బ్రతికున్న శవాల్లా కనిపించారంతా.

 

    మాస్టార్ని ప్రశ్నించడానికి చాలా ధైర్యాన్ని కూడగట్టుకోవాల్సి వచ్చింది.

 

    "ఈ స్థితిలో మిమ్మల్ని డిస్టర్బ్ చేయాల్సిరావడం బాధాకరమయినా తప్పదు..." నెమ్మదిగా అడిగాడు శమంత్ "ఇది రొటీన్ ప్రశ్న కావచ్చు. కాని అందులో మీకూ తెలీని ఓ జవాబు నాకు ఉపయోగపడే అవకాశముంది... మీరు ఎవరినయినా అనుమానిస్తున్నారా?"

 

    చిగురుటాకులా కంపించారు సత్యం మాస్టారు "ఎవరినయినా అనుమానించడానికి అసలు దానికి ఈ యిల్లు, యూనివర్సిటీతప్ప మరో వ్యాపకం వుంటేగా. నాకు తెలిసీ మాకు అన్యాయం చేసింది ఆ విధిమాత్రమే?"

 

    చాలా అడగాలనివున్నా అడగలేకపోయాడు శమంత్.

 

    "మీ అమ్మాయికి స్నేహితులెవరయినా వున్నారా? అంటే బాగా పరిచయస్థులు."

 

    ఆ వృద్ధుడి కళ్ళనుండి నీళ్ళు జలజలా రాలేయి. "ఏ అచ్చటాముచ్చటా తీర్చుకోవాలనే తపనలేకుండా మాకోసం అంకితమైపోవాలనుకున్న ఆడపిల్లది. క్లాసైపోయాక యిక్కడ యింటిదగ్గర ట్యూషన్సు చెప్పడం, అలా సంపాదించింది కుటుంబంకోసం ఖర్చుచేసి యీ సంసారాన్ని నెట్టుకురావడమే తెలిసిన దానికి స్నేహితులు కూడానా బాబూ."

 

    "పోస్టుమార్టం రిపోర్టుని బట్టి యిది హత్యగా తోచడంలేదు. ఒకవేళ ఆత్మహత్య అయితే దానికి ఏదో బలమయిన కారణం వుండాలి."

 

    "అది మాకు తోచని విషయమే. అసలు..." ఉద్విగ్నంగా కదిలిపోయారాయన. "పిచ్చితల్లి! ఎందుకిలాంటి సాహసంచేసిందో మాకు అర్థంకావడంలేదయ్యా. కాని..." క్షణం ఆగేరాయన.

 

    "పెద్దచెల్లి దీప్తితోమాత్రం ఆ రాత్రి అదోలా మాటాడిందని తెలిసింది."

 

    దీప్తి చెప్పింది శమంత్ చాలా ఫోర్స్ చేసాక.

 

    దీప్తిని బయటికి తీసుకెళ్ళి రహస్యంగా అడిగాడు. "మీ నాన్నగారికి తెలియక పోవచ్చు. కాని మీ అక్కయ్య ఎవర్నయినా ప్రేమించడం..."  

 

    "లేదు" ఖండితంగా చెప్పింది. "అలాంటివేమన్నావుంటే కనీసం నా ఒక్కదానికయినా తెలుసుండేది."

 

    పోస్టుమార్టంలో రాజ్యం కన్యకాదని తెలిసిన విషయం మననం చేసుకుంటూ ఆలోచించాడు.

 

    అతి కీలకమైన ఓ లింకు మిస్సవుతూంది.

 

    పూర్వం యూనివర్సిటీ విద్యార్థినుల ఆత్మహత్యల్ని సమవ్యయపరుచుకుంటూంటే అస్పష్టంగా మహేంద్ర పాత్ర కనిపిస్తుంది యిక్కడ కూడా. ఇక్కడితో ఆగిపోవడం శమంత్ అభిమతం కాదు.

 

    ఆగిపోడు. ఏదో ఓ ముఖ్యమైన 'క్లూ' చిక్కబోతూందని సిక్త్ సెన్స్ చెబుతుంటే యింటికి బయలుదేరాడు.

 

    శమంత్ నమ్మకం తప్పుకాలేదు.


                                                           *  *  *


    "ఇది ఈదేశం చేసుకున్న దౌర్భాగ్యం" శ్రీహర్షని చూస్తూ అన్నాడు శమంత్ "ఇక్కడ గూండాలు వీధుల్లో విశృంఖల విహారం చేస్తూ రాజకీయనాయకుల అండతో చట్టంనుండి కాపాడబడతారు. న్యాయబద్ధంగా ఎదగడానికి నీతి, చదువు, జ్ఞానం అవసరం. కాబట్టి వారితో పనిలేని రాజకీయాల్లో అడుగుపెట్టి ప్రజానాయకులవుతారు. కేపిటలిస్టులు డబ్బుతో ప్రాపకాన్ని విస్తరింపజేసుకుంటూ వాళ్ళ పబ్బాన్ని గడపటానికి శాసనాల్ని తయారుచేస్తుంటారు. కులరాజకీయాలు, ప్రాంతీయ తత్వాలు, మతపరమైన విద్వేషాలు రెచ్చగొడుతూ ప్రజల్ని ఆ సమస్యల్లోకి నెత్తి పురోగతి గురించి ఆలోచించే అవకాశం లేకుండా చేస్తారు. ఇక్కడ స్మగ్లర్సు చట్టాల్ని రూపొందిస్తుంటే రాజకీయనాయకులయిన గూండాలు చదువుకున్న ఐయ్యేయస్ ల్ని, ఐపియస్ ల్ని శాసిస్తూ శాసనాలుగా ప్రజాసభలో ఆమోదింపచేస్తుంటారు. బోఫోర్స్ అన్నది యీదేశంలో రెగ్యులర్ ఫార్స్. దేశ ప్రధాని బావమరిదిని సంతృప్తిపరచడానికి రెండువేల కోట్ల రూపాయల విమానాలు 'కొనుగోలుకి ఆదేశాలు' జారీ చేస్తాడు. అవి నాణ్యత లోపించినవి కావడంతో ఎడాపెడా నేలమీద కూలి ప్రజలు గగ్గోలు పెడుతుంటే తను హయ్యో పాపం అంటూ మొసలికన్నీళ్ళు కారుస్తారు. అతడి రంగేమిటి అన్నది ప్రభుత్వం మారేదాకా తెలీదు. అలా మొత్తం దేశాన్ని ఎన్నిలక్షల కోట్ల వంచనతో స్విస్ బ్యాంకుల్లో అతడు డిపాజిట్స్ పెంచుకున్నాడన్నది ఆ కొత్త ప్రభుత్వం స్కూప్స్ తో గాని అంతుబట్టదు.

 

    ఇది తన మెడకు చుట్టుకుంటుందని భావించిన మాజీ ప్రధాని వెంటనే రామజన్మ భూమిలో మసీదు పడగొట్టించి రామాలయం నిర్మించాలని యిటు హిందువులను రెచ్చగొడతాడు. పరోక్షంగా మైనారిటీకి అన్యాయం జరుగుతుందని అటు మరో మార్గాన్ని బలపరుస్తారు. స్విస్ బాంకు డిపాజిట్ల సంగతి మరిచిన ప్రజలు మనిషికన్నా మతంగొప్పదన్న విచిత్రమైన నమ్మకంతో కొట్టుకు చస్తుంటారు.

 

    అలాగే దేశ ఉపప్రధాని అయ్యాడు సుదర్శన్ రావు. అంతకుపూర్వం ముఖ్యమంత్రిగా ఈ రాష్ట్రాన్ని ఎంత కొల్లగొట్టినాగాని యిప్పుడు జాతీయస్థాయిలో మొత్తం జాతిని దోపిడీ చేద్దామని ఆ స్థాయి కెదిగారు. అలా అని రాష్ట్రస్థాయిలో తన ప్రఖ్యాతి తగ్గడం సహించలేక అతన్ని యిక్కడ ముఖ్యమంత్రిగా నియమించాడు. ఒరిజినల్ గా రాజ్యసభ మెంబరైన ముఖ్యమంత్రి ఆరునెలల్లోగా మళ్ళీ ఎక్కడైనా ఎసెంబ్లీ సీటు గెలుచుకోవాలి... అలా గెలిచే అవకాశం లేదనిపించడంతో రిగ్గింగ్ లాంటిది అద్భుతంగా సాగించి ఆ ప్రోసెస్ లో పాతికమంది ప్రాణాలు తీసాడు. ఆనక అలా హత్యలు చేసింది పాలస్తీనా కమెండోస్ అంటే అవునేమో పాపం అని సరిపుచ్చుకునేట్టు చేసాడు. నిరక్షరాస్యత మూర్ఖత్వం చిత్తశుద్ధిలేని మూక... అదే సుదర్శన్ రావుల్ని రక్షిస్తున్నది. వాళ్ళకి అండగా నిలచే సవ్యసాచిలాంటి సూడో కేపిటలిస్టుల్ని కాపాడుతున్నది కూడా... యూసీ మిస్టర్ సుబ్బారావ్...'

 

    "శ్రీహర్ష..." కరెక్ట్ చేశాడు శ్రీహర్ష.

 

    "మీ పేరు సుబ్బారావు కదూ..."

 

    ఆరోజు అబద్ధం చెప్పాను.

 

    "ఎందుకు"

 

    "అది నాహాబీ కాబట్టి."

 

    "నమ్మలేకపోతున్నాను."

 

    నేను క్రిమినల్ నని చెప్పినా నమ్మరేమో కదూ!

 

    "నో" దృఢంగా అన్నాడు "సాక్షాత్తూ ఆ న్యాయదేవత నా ముందుకొచ్చి చెప్పినా నమ్మలేను."

 

    "ఈ దేశంలో మేధావులు కూడా కొన్ని విషయాల్లో పొరపాటుపడుతుంటారేమో కదూ..." బడలికగా సోఫాలో ఒత్తిగిల్లుతూ అన్నాడు శ్రీహర్ష.

 

    "ఎందుకలా అనిపించింది."

 Previous Page Next Page