Previous Page Next Page 
రక్షరేకు పేజి 21


                                       10
    సరళ వేరుగా సర్వెంట్ క్వార్టర్స్ లో ఉన్నా, నాగమ్మ వెంకణ్ని తమతో వుండనియ్యలేదు.
    "యెధవసచ్చినోడా! నీలాటి తిరుగుబోతోళ్ళతో నా కూతురు ఉంటానికి వీల్లేదు" అని తరిమికొట్టింది.
    చేసేది లేక వెంకడు జైహింద్ బాబునే ఆశ్రయించాడు, జైహింద్ బాబు వెంకణ్ని తమతో వుండమన్నాడు. అన్నమ్మ అందుకు ఒప్పుకోక "ఏంటి జయన్నా! ఎక్కడలేనోళ్ళనీ ఇంట్లో జేరిస్తే మనకెట్టాకుదురుద్దీ? ఏదో, ఆడిదారి ఆడిని చూసుకోమను....." అంది.
    మనలో మనమే ఒకరికొకరం లేకపోతే ఎలా అమ్మా?" అన్నాడు జైహింద్ బాబు.
    అన్నమ్మకెంత కష్టంగా ఉన్నా, జైహింద్ బాబును గట్టిగా వారించలేదు.
    "ఉఁ! రేపు మనకేదైనా వస్తే ఈడు ఆదుకుంటాడు, ఈడి  బతుక్కు ఠికాణలేదుకాని...." అంది విసుక్కుంటూ.
    తనమాటలు తన తల్లి ఎంతపొరపాటుగా అర్థం చేసుకుందో గమనించిన జైహింద్ బాబు నవ్వుకుని "అమ్మా! ఈ వెంకడు మనకు ముందు ముందు ఏదో ఆదుకుంటాడనే ఆశతో మనఇంట్లో ఉండమనలేదు. మనం వెంకణ్ని ఆదుకున్నట్లే. అవసరానికి మనకూ, మరొకరు ఆదుకుంటారన్నాను" అన్నాడు.
    "ఆఁ! ఆదుకుంటారు! మననుమించి యెర్రోళ్ళెవరూ ఉండరు!"
    "అలా అనకమ్మా! ఈ లోకంలో ఉంటున్నది మనుష్యులే, రాక్షసులు కాదు"
    ఇదంతా వింటోన్న వెంకడు కల్పించుకుని "ఊర్కే మీ యింటిమీద పడి తింటం నాకు గిట్టదు జయన్నా! ఏదైనా పని సూపించు - ఎంత కష్టమైనా సేస్తాను" అన్నాడు.
    వెంకడు అంత జాలిగా మాట్లాడడంతో అన్నమ్మ తల్లిగుండె కరిగి ఇంకేమీ మాట్లాడలేకపోయింది.
    "పీనాసి చచ్చింది! మొగుడంత సంపాదిస్తున్నాడు. వీడికింత కూడెట్టలేదు గావాల!" అని నాగమ్మమీద మెటికలు విరిచింది.
    చంద్రికి కూడా తల్లితో పోట్లాడే శక్తిలేదు. అయితే అది జరుగుతున్నది చూస్తూ ఊరుకోలేకపోయింది. తండ్రి తోటలోకి వెళ్ళింది.
    "అయ్యా! అన్నని ఇంట్లోంచి వెళ్ళగొడితే ఎలా బతుకుతాడేంటి?" అంది తండ్రితో.
    రాజయ్యకు చంద్రి ఆరోప్రాణం. బంగారుబొమ్మలా వుండే చంద్రిని కంటి వెలుగులా చూసుకుంటాడు.
    ఆడట్టాంటి కాని పనులుచేస్తే, ఏం సెయ్యాలే! కుదురుగా ఉండకూడదూ!"
    "కానిపనులేం చెయ్యలేదయ్యా! ఆసరళమ్మ ముఖం చూస్తే తెలియటంలా ఎంత మంచిదో?"
    "ఏటోనే! మీ అమ్మ నోటితో ఎవడు గెలవగలడు?"
    "నువ్వట్లా అంటే ఎలాగయ్యా! అన్న మాత్రం నీ బిడ్డకాడూ? నేనే అట్లా దిక్కులేని పక్షినయితే నువ్వు భరిస్తావా?"
    ఆ మాట వింటూనే వణికిపోయాడు రాజయ్య. చటుక్కున చంద్రిని గుండెల దగ్గరగా తీసుకుని "అంత మాటనబోకు తల్లీ! నా బంగారు తల్లి దిక్కులేనిదెట్టా అవుతాదే!" అన్నాడు.
    ఈ అవకాశం అందిపుచ్చుకుని చంద్రి తండ్రి భుజాలమీద ఆప్యాయంగా చేతులు వేసి "మరి, అట్లానే, అన్నని కూడా దిక్కులేని పక్షిని చెయ్యకు. నువ్వు ఆదుకోకపోతే అన్నకింకెవరున్నారు?"
    "మీ అమ్మ బ్రతకనిస్తుందంటే?"
    "అమ్మకు తెలియనియ్యకు. ఇక్కడే తోటలోనే గుడిసె వేసెయ్యి. నీ తోటపనిలో సాయంచేస్తాడు. నీకూ సుఖంగా ఉంటుంది - అన్నకీ గడుస్తుంది. నీ చేతికింద కూలి మనిషిని మాన్పించెయ్యి..."
    "ఆడికి తోటపనేం తెలుస్తాదే?"
    "ఇదేం బ్రహ్మ విద్యా? నువ్వు కూడా ఉండి నేర్పిస్తే అన్న ఎంతలో నేర్చుకుంటాడు?"
    ఈ ఆలోచన రాజయ్యకి నచ్చింది. నిజమే! వెంకడిలాంటివాడు తన చేతికిందవుంటే తనకే సుఖం - ఈ ఆలోచన ఇదివరకే రావలసింది.
    రాజయ్య, వెంకడు, జైహింద్ బాబు కలసి, తోటలో ఒకమూల వెంకడికోసం గుడిసెకట్టారు. కొంచెంరోజుల్లోనే వెంకడు తోటపనులన్నీ నేర్చుకున్నాడు. కలుపు మొక్కలు పీకటం, మొక్కలకి పురుగుపడితే మందులు చల్లటం...... ఎరువులు వేయటం...... రెండురోజులకొకసారి కూరగాయలుకోసి తోపుడు బండి మీదవేసుకుని అమ్ముకురావటం..... ఇలాంటి పనులన్నీ సొట్టకాలుతోనే చాలావరకు చెయ్యగలుగుతున్నాడు. రాజయ్యకి చాలా సుఖంగా వుంది.
    వెంకడు ఉండడంతోటలో గుడిసెలో ఉంటున్నా, తిండిమాత్రం జైహింద్ బాబు ఇంట్లోనే తింటున్నాడు.
    "అయ్యా! నాకు జీతమియ్యి" అన్నాడు వెంకడు తండ్రితో.
    రాజయ్య "ఎందుకురా?" అన్నాడు.
    "నేను అన్నమ్మత్త ఇంట్లో తింటున్నా. నా జీతం ఆడియ్యకపోతే. నేనీ ఊళ్ళోనే ఉండను. మా దేశం పోతా!"
    "రాజయ్య నిజంగా హడలిపోయాడు. ఇప్పుడు కొడుకు అనే అభిమానం మాత్రమే కాక, వెంకడి అవసరం కూడా చాలా ఉంది రాజయ్యకి. యాభైరూపాయలు తీసి వెంకడికిచ్చాడు.
    వెంకడు పరమానందంతో ఆ డబ్బు అన్నమ్మ చేతిలో పెట్టాడు. అన్నమ్మ తెల్లబోతూ "ఏంటిరా, ఇది?" అంది.
    "నా జీతం అత్తా! అయ్యని జీతమడిగాను. ఇచ్చేసినాడు. ఈడపడి తింటున్నా! ఇంత మాత్రం ఇయ్యొద్దాత్తా!" అన్నాడు.
    అన్నమ్మ సహజంగా మంచిది. మెత్తనిమనసు. "నువ్వు కొంచెం అట్టిపెట్టుకోరా! అంతా నాకియ్యటం దేనికి" అంది.
    "నాకేం కావాలత్తా! నా మంచికీ, చెడ్డకీ మీరు లేరూ?" అమాయకంగా నవ్వాడు వెంకడు.
    వెంకడు కూడా తన బిడ్డల్లో ఒకడుగానే అనిపించింది అన్నమ్మకి.
    అన్నమ్మ పోరుపడలేక రత్నమ్మకి ఒక సంబంధం కుదిర్చాడు జైహింద్ బాబు. తీరా ముహూర్తం వేళకి పెళ్ళి కొడుకుదగ్గిర బంధువులెవరో చచ్చిపోయారు. అది ఆపశకునంగా తోచింది పెళ్ళివారికి. శకునాల్లో ఎవరికీ తక్కువ లేదు. అంచేత ఆ పెళ్ళివారు ఈ సంబంధం మాకొద్దు అనేశారు. రత్నమ్మ లేనివాళ్ళపిల్ల అయినా, చాలా అందంగా ఉంటుంది. పెద్దిళ్ళలో పనికి కుదిరి అశుచి, శుభ్రత కొంతవరకు నేర్చుకుంది. రత్నమ్మను చూడగానే పెళ్ళిచేసుకోవాలని ఎంతో ఆశపడ్డాడు పెళ్ళికొడుకు. అయినా శకునానికి భయపడిపోయాడు.

 Previous Page Next Page