"ఎప్పుడు వస్తారు?"
"రేపే."
మృత్యుంజయరావు యిహ వెళ్ళటానికి లేచి, "అన్నట్లు మా అక్కని గురించి యింటరెస్టింగ్ పర్సనాలిటీగా మిమ్మల్ని డిస్ క్రయిజ్ చేసింది ఎవరు?" అని అడిగాడు.
"శేఖరంగారు! ఆయనెప్పుడో చూశాడట."
శేఖరానికి తన అక్కని గురించి మరో స్త్రీతో ప్రస్తావించవలసిన అవసరం ఏమొచ్చింది? అయినా యీ విషయాన్ని గురించి వాళ్ళెప్పుడు మాట్లాడుకున్నారు? వాళ్ళకి తీరిక ఎక్కడ చిక్కింది? వాళ్ళు తరచూ కలుసుకుంటూ వుంటారా?"
అతని మస్తిష్కం అలా పనిచేసింది.
* * *
మరునాడు మాలతి జగతిని చూడటానికి వచ్చేసరికి ఆమె అరుగుమీద కూర్చుని, యింటి యజమానురాలి తమ్ముడైన పిచ్చివాడితో మాట్లాడుతోంది.
"ఈమధ్య దేముడు కనపట్టం మానేశాడు" అంటున్నాడు పిచ్చివాడు.
"ఆఖరిసారి కనిపించి ఎన్నాళ్ళయింది?" అని అడుగుతోంది జగతి.
"అదేలే. నేను పుట్టకముందు."
"పుట్టకముందు నేనెవ్వరో?" అనుకుంది జగతి.
"అసలు నేనే దేవుడ్ని" అన్నాడు.
జగతికి నవ్వు వచ్చింది.
"ఏం, కాదా?"
"ఛఛ, అంతమాట నేనన్నానా?"
ఇంతలో మృత్యుంజయరావు గది గుమ్మందగ్గర నిలబడి పిచ్చివాడికి కనిపించాడు. అతన్ని జగతికి చూపుతూ పిచ్చివాడు "ఈ మేష్టారు మా యింట్లో క్రొత్తగా ప్రవేశించారు. మీరు చూళ్ళేదా?" అన్నాడు.
"అలాగా?"
ఆ సమయంలో మాలతి వచ్చింది. మృత్యుంజయరావు రెండడుగులు ముందుకువేసి... "రండి" అని ఆహ్వానించాడు.
అరుగుమీద కూర్చుని తలారా స్నానంచేసి భువనమోహనంగా కనబడుతూన్న యువతికేసి తదేకంగా చూసింది మాలతి. ఎంతసేపు చూసినా ఆమెకు తృప్తి తీరలేదు. కన్నార్పకుండా, ముగ్ధురాలై చూస్తోంది.
"లోపలకు రండి" అంటూ లేచి నిలబడింది జగతి.
"అప్పుడేనా? యింకా చూడనివ్వండి" అంది చొరవగా మాలతి.
"ఏమిటి?"
"మీ అందాన్ని"
"అంత అందంగా వున్నానా?"
"పుస్తకాల్లోనూ, వర్ణనల్లోనూ, కథల్లోనూ చూస్తుంటాను. యింత సౌందర్యాన్ని కళ్ళారా చూడటం యిదే మొదటిసారి. ఆడదాన్ని నన్నే కాల్చేస్తోంది మీ సౌందర్యం. మొగవాళ్ళు ఏమౌతారో తెలీదు. ఏం చెయ్యమంటారు చెప్పండి. మిమ్మల్ని తినెయ్యనా? నేనే మీలో వశించనా?"
జగతి స్నేహపూర్వకంగా మాలతివంక చూసింది. "స్త్రీలలో యింతటి నిష్కల్మష హృదయాన్ని చూడటం నాకూ యివాళే మొదటిసారి" అంది మృదుకంఠంతో.
"ఆడవాళ్లు ప్రేమించుకుంటే నాకు సిగ్గు" అంటూ పిచ్చివాడు అక్కడ్నుంచి లోపలకు జారుకున్నాడు.
"లోపల కూర్చుందాం రండి" అని జగతి లోపలకు నడిచింది. మాలతి ఆమెవెంట లోపలకు వెళ్ళింది. అక్కతమ్ములిద్దరూ ఒకగదిలో యిబ్బంది పడుతున్నారని యీమధ్య చిలకమ్మగారు జాలితలచి ఆ గదికి ఆనుకునివున్న మరో చిన్నగదికూడా పదిరూపాయలు అద్దెపెంచి యిచ్చింది. ఆ గది పడుకోటానికి పనికిరాకపోయినా సామాన్లు పెట్టుకునేందుకూ, వంట చేసుకునేందుకూ పనికివస్తుంది. మొత్తంమీద యిద్దరూ ఎలాగో సర్దుకుంటున్నారు.
గదిలో కుర్చీ ఒకటే. అందుకని స్త్రీలిడ్డరూ మంచంమీద ఒకరినొకరు ఆనుకుని కూర్చున్నారు. మృత్యుంజయరావు కుర్చీలో ఆసీనుడయాడు.
జగతి యిప్పుడు మాలతికేసి పరీక్షగా చూసింది. నిండైన విగ్రహం, సాధారణమైన కట్టూ, బొట్టూ, ఆమె నిరాడంబరత, సహజమైన లాలిత్యం ఆమెను అమితంగా ఆకర్షించాయి.
"నన్ను చూడటానికి ఎవరో వస్తున్నారని జయ చెబితే నన్ను చూడాలనే అభాగ్యురాలెవరా అనుకుని నివ్వెరపోయాను. మనసు విప్పి ఎవరితోనైనా మాట్లాడి కొన్ని సంవత్సరాలు గడిచింది. సంవత్సరాలేమిటి? అసలు పుట్టాక ఎవరితోనైనా మనసారా మాట్లాడానా అని నా అనుమానం. ఇవాళ ఒక మంచి స్నేహితురాలు దొరికిందనిపిస్తోంది" ఆమె కంఠం గాద్గదికమై వొణికింది.
మాలతి ఆమెవంక తన్మయదృష్టితో చూసింది. ఆమె మృదువైన చేతివ్రేళ్ళు తనచేతిలోకి తీసుకుని ప్రేమగా రాస్తోంది.
"నన్ను గురించి యిదివరకెప్పుడూ యింత తీక్షణంగా ఆలోచించుకోలేదు. ఈమధ్యనే ఆలోచిస్తున్నాను. తలిచినకొద్దీ నాకు నేను భయంకరమై, శత్రువునై కనిపిస్తున్నాను. మీలా నేను వుండగలిగితే ఎంత ధన్యురాల్ని అనిపిస్తోంది" అంది జగతి.
"ఏముంది నాలో?"
"మనస్థయిర్యం కనిపిస్తోంది. నిర్మలత్వం కనిపిస్తోంది. నిండుతనం, అనురాగం కన్పిస్తున్నాయి."
"మనం సంఘర్షణలో వున్నప్పుడు ఎదుటి మనిషిలో రవ్వంత విశేషం కూడా విశ్వరూపం దాల్చి దర్శనమిస్తుంది" అంది మాలతి.
"ఆ రవ్వంత చాలు మానవత్వాన్ని నిలబెట్టేందుకు."
మృత్యుంజయరావు ఆశ్చర్యంగా వింటున్నాడు. ఇక్కడకు వచ్చిన కొద్దిరోజుల్లో అక్క ఎంత చిత్రంగా మారిపోయింది? ఇదంతా స్వాములారి మహత్యం అందామా అనుకున్నాడు. ఆయన్నింతవరకూ అతను చూడలేదు. చూద్దామన్న కుతూహలంకూడా కలగలేదు. మొదట్లో ఆమెమాటలు ముళ్ళు గ్రుచ్చుకున్నట్టుగా, శపిస్తున్నట్లుగా వుండేవి. ఒక్కోసారి పిశాచంలా కనిపించేది. ఇప్పుడు గాంభీర్యం అలవర్చుకుంది. తనని ఎగతాళి చేయటం పూర్తిగా మానేసింది.
"అబ్బ! వద్దండీ. మీరలా మాట్లాడవద్దు. అలా మాట్లాడితే జీవితమంటే భయం పుడుతుంది. సాదాగా జీవించాలని నా అభిమతం" అంది మాలతి వారిస్తూ.
"అలాగే జీవించు తల్లీ!" అంది జగతి ఆశీర్వదిస్తున్నట్లు.
"మనసు విప్పి ఏదో చెబుతానన్నారు చెప్పండి... వినాలని నాకు ఆతృతగా వుంది" అనడిగింది మాలతి ఆమెకళ్ళలో కాంతిని పరిశీలిస్తూ.
మృత్యుంజయరావు భయపడ్డాడు. అక్క అసలే ఆవేశంలో వుంది. అందులో రహస్యాలు దాచటం ఆమెకు అలవాటులేదు. ఆమె నిజంగా మనసువిప్పి చెప్పటం ప్రారంభిస్తే, ఆ ప్రవాహంలో ఏమేమి కొట్టుకొస్తాయో, సంభాషణ ఎంతదూరం పోతుందో ఊహించటం కష్టం. అట్లా జరగటంవల్ల నష్టం వుండనీ, వుండకపోనీ సంభాషణ ఆ విధంగా పరిణమించటం అతనికి యిష్టం లేదు.
"ఇప్పుడు మీరిద్దరూ కథలు చెప్పుకుంటూ కూర్చుంటే అవతల ఆఫీసు టైం అయిపోతుంది. ఇప్పటికే ఆలస్యమైంది. తెలుసాండి?" అన్నాడు.
మాలతి అతనిమాటల్ని నిర్లక్ష్యంగా కొట్టిపారవేస్తూ, "పాడు ఆఫీసు పోనిద్దురూ. ఆ మాటకొస్తే నేనివాళ ఆఫీసుకు రానేరాను. మీరు వెళ్ళండి. నేనిక్కడే కూర్చుంటాను" అన్నది.
మృత్యుంజయరావు యిహ బెంగపడ్డాడు. 'ఊరుకున్నవాడిని ఊరుకోకుండా యీమెనిక్కడికి ఎందుకు వచ్చే ఏర్పాటు జేశాను చెప్మా!' అని విచారించసాగాడు.
కాని జగతి అతనికి రక్షణ కలుగజేసింది. ఇవాళ స్వామివారి దగ్గరకు ఉదయంకూడా వెళ్ళాలి. 'ధ్యానము-జీవనము' అనే అంశాన్ని గురించి చెబుతానన్నారు. మనం తరచు కలుస్తూ వుంటాంగా. ఒకనాడు చెబితే తరిగే విషయమా యిది? ఒక్కసారిగా నేను అర్థంకావటంకూడా మంచిదికాదు. క్రమంగా కావటమే మంచిది"
మాలతి నిండుగా నవ్వింది. "మీరు చమత్కారులు కూడా" అంది.
ఇంతలో హఠాత్తుగా అక్కడికి పిచ్చివాడు వచ్చి నిల్చున్నాడు. "మీ యింట్లో ఏదో భాగం అద్దెకు వుందిట యిస్తారా?" అని అడిగాడు.
"పెళ్ళయిన వారికైతే యిస్తాం, బ్రహ్మచారులకు యివ్వం" అని సమాధానం చెప్పింది జగతి.
"అలాగా? మా ఆవిడ్ని పెళ్ళిచేసుకుని వచ్చి యిల్లు తీసుకుంటాను. అప్పటిదాకా ఎవరికీ యివ్వకండేం" అని చరచరమని వెళ్ళిపోయాడు.
"ఎవరితను?" అని ప్రశ్నించింది మాలతి.
"మా యింటి యజమానురాలి తమ్ముడు. పిచ్చివాడు."
"ట్రీట్ మెంట్ యిప్పించలేదా?"
"ఇప్పించకేం? విశాఖపట్నంలో రెండేళ్ళు వుంచారట. కొంచెంకూడా గుణం కనిపించలేదు. అదీగాక ముసలితండ్రి కొడుకుని వొదలి వుండలేనని తెచ్చుకున్నాట్ట" అని చెప్పింది జగతి.
"పాపం."
"ఈమధ్య యితను నాకు కొంచెం కొంచెం స్నేహితుడు అవుతున్నాడు. ఒకరకంగా నేనుకూడా పిచ్చిదాన్నేగా. అందుకని ఒకరినొకరు అర్ధం చేసుకుంటున్నాం."
"పొండి. బలే మాట్లాడతారు" అంటూ లేచి నిలబడింది మాలతి.
"మళ్ళీ కనిపిస్తారుగా."
"తప్పకుండా."
ముగ్గురూ వసారామెట్లు దిగి గేటు దగ్గరకు వచ్చారు.
"ఎలా పోదాము? మీరు రిక్షా ఎక్కుతారా?" అనడిగాడు మృత్యుంజయరావు. పిల్లలు స్కూళ్ళకుపోయే వేళయింది. పగటిపూట- ఆమె చూస్తుండగా వారెవరైనా కొంటెమాట అంటే... ఎందుకొచ్చిన రభస?
"ఈ కాస్త దూరానికీ రిక్షా ఎందుకండీ? నడిచిపోదాం పదండి." అని మాలతి, జగతికి నమస్కారంచేసి సెలవు తీసుకుని అతనితో బయల్దేరింది.
ఒక పదిగజాలైనా వెళ్ళారో లేదో, ఎదురుగా పిల్లలగుంపు ఒకటి వస్తూ కనిపించింది. అతని గుండె గబగబ కొట్టుకోసాగింది. వాళ్ళేదో మాట విసిర్తే... మనసు గాయపడటం, యీ అనుభూతులనాశించటం.
పిల్లలగుంపుకు వ్యతిరేకంగా వున్న గోడవైపు చేయిపెట్టి చూపిస్తూ ఆమెదృష్టిని మరల్చాడు.
"మన నాటకం వాల్ పోస్టర్ చూశారా? ఇంకావుంది... మనవాళ్ళు సామాన్యులా? ఊళ్ళోని గోడలన్నిటికి అంటించారులెండి. ప్రాపగండా బాగా చేశారు... అన్నట్లు తురంగరావు స్నేహితుడు ముకుందరావు వున్నాడే... అతని స్పీచ్ విన్నారా? ఇంకో విషయమండోయ్! తురంగరావుకూడా సన్మానం చేయించుకుంటున్నాడు. దగ్గర్లో ఏదో పల్లెటూళ్ళో స్కూల్ వుందిట. ఆ స్కూల్ వాళ్ళు చేస్తున్నారట. సన్మానపత్రం అతనే రాసుకుంటున్నట్లు వినికిడి..."