బి.బి.సి. న్యూస్ రాగానే ఢిల్లీనుంచి కన్యాకుమారిదాకా వివిధ భాషల విలేఖరులూ, రాజకీయ నాయకులూ, కొంతమంది అధికారులూ అక్కడికి రావటం ప్రారంభించారు. 'బుద్ధిలేనిపాలెం' ప్రజలని వెనక్కి తోసేసి, తామా స్థానాన్ని ఆక్రమించారు. అప్పటికే అతడిని ఆ నియోజకవర్గపు అభ్యర్ధిగా నిలబెట్టడంకోసం వివిధ పార్టీలు మంతనాలు ప్రారంభించాయి. అయితే అతడు దానికి ఒప్పుకోలేదు. తనే ఒక పార్టీ స్థాపిస్తానన్న ఉద్దేశాన్ని వెలిబుచ్చాడు.
"ఆర్ధిక సంస్కరణలపట్లా, సామాజిక మార్పులపట్లా నాకు కొన్ని నిర్దుష్టమైన అభిప్రాయాలున్నాయి. వాటి ఆధారంగా కొత్త పార్టీ పెడతాను."
"కొన్ని ఉదాహరణలు చెప్పగలరా?"
"ప్రజాస్వామ్యంలో 51 శాతం ప్రజల్ని ఆకట్టుకుంటే చాలు -49 శాతం ప్రజల్ని అన్యాయంపాలు చేసినాసరే-"
"అంటే?"
"ఉదాహరణకి నేను అధికారంలోకి వస్తే ఆడవాళ్ళందరికీ రైళ్ళల్లో బస్సుల్లో ఉచితరవాణా సౌకర్యం, ఆఫీసుల్లో అమ్మే చీరెలమీద ఏభై శాతం సబ్సిడీ, ఉద్యోగినులకు నూరుశాతం ఇన్ కంటాక్స్ రాయితీ, వారానికోరోజు ఉచిత సినిమా, ప్రసూతి ఖర్చులన్నీ ప్రభుత్వమే భరించడం, ప్రతి పెళ్ళికీ ఆడపిల్ల తరుఫున వరునికి 50,000 తక్కువ కాకుండా కట్నం ఇవ్వడం."
అప్పటివరకూ సీరియస్ గా వింటున్న వాళ్ళంతా విస్తుపోయి.... "మీకేమైనా మతిపోయిందా? ఇవన్నీ అమలు జరపాలంటే ఎన్ని కోట్లు ఖర్చవుతుందో తెలుసా?" అనడిగాడు.
"ఓట్లు కావాలంటే కోట్లు ఖర్చుపెట్టాలి."
"అన్ని కోట్లు ఎక్కడినుంచి తీసుకొస్తారు?"
"చెప్పానుగా 51 శాతం ఓటర్లని ఆకర్షించటానికి 49 శాతం ఓటర్లని బలిపశువుల్ని చేస్తాను."
"ఇది అన్యాయం."
"అధికారం నిలుపుకోటానికి ఏం చేసినా అది అన్యాయం కాదని మన నాయకులు నిరూపిస్తున్నారు కదా! 'రెండు రూపాయలకి కిలో బియ్యానికి' అయ్యే ఖర్చు మధ్య తరగతి ప్రజానీకం పన్నుల రూపంలో భరించడం లేదా? ప్రొఫెషనల్ కోర్సుల్లో స్త్రీలకి రిజర్వేషన్లు పెట్టడం ఏ విధంగా న్యాయబద్ధం? ఒక తండ్రికి ఒక కూతురు, కొడుకు వుంటే కూతురికి ఏభై, కొడుక్కి డెబ్బై మార్కులు వచ్చినా కూడా ప్రొఫెషనల్ కోర్సులో రిజర్వేషను కింద కొడుకు నోరుకొట్టి, ఆ అమ్మాయిని చదివించమనడం ఏ విధంగా సమంజసం?"
"మరి మీరు సూచించేదేమిటి?"
"నా ప్రభుత్వం ఎవరికైనా ఒక రాయితీ ఇస్తే, తిరిగి అంతే బాధ్యతను వారినుంచి ఆశిస్తుంది. కుటుంబ నియంత్రణ ఆపరేషన్ చేయించుకున్నా వాళ్ళకి ఒక్క రూపాయికి జీవితాంతం ఒక్క కిలోబియ్యం ఇవ్వటానికి నాకభ్యంతరం లేదు. రిజర్వేషన్ కోటాలో డాక్టరైన వాళ్ళందరూ తప్పనిసరిగా ఐదేళ్ళు గ్రామాల్లో పనిచేయాలి. ఇలాంటి ఆలోచనలు నాకు చాలా వున్నాయి. ఉదాహరణకి ఒక అభ్యర్థి - రెండు నియోజక వర్గాలనుంచి ఎన్నికయి, ఒకదాన్ని వదులుకుంటే- దానికయ్యే ఎన్నికల ఖర్చంతా ప్రభుత్వం కాదు- అతడు పెట్టుకోవాలి! అసెంబ్లీకి ఎన్నికయిన వాళ్ళు పార్లమెంటులో నెగ్గితే, ఆ నియోజకవర్గంలో మళ్ళీ ఆ స్థానం కోసం ఎన్నికలు జరుగుతాయి గదా! ఆ ఖర్చంతా ఆ అభ్యర్ధే ప్రభుత్వానికి ఇవ్వాలి. ఇలాంటి సంస్కరణలు ఎన్నో అమలు జరపాలనుకుంటున్నాను...." అతడు చెప్పటం ముగించాడు.
* * *
అడవిలో ఒక మూల పుట్టిన చిన్న మంట అనతికాలంలోనే దావానలమైనట్టు- బృహస్పతి తాలూకు వార్తలు చుట్టుప్రక్కల క్రమక్రమంగా వ్యాపిస్తున్నాయి.
ఆ రాత్రి అతడు స్నేహితుడితో ఈ విష్యం చర్చించాడు "నాకు ఇదంతా అంత సంతృప్తిగా లేదు బ్రదర్!"
రావు ఆశ్చర్యంగా.... "అదేమిటీ? మనపని మూడు పువ్వులు ఆరుకాయల్లా వుందనుకున్నానే! ఈ వారంరోజుల్లో దాదాపు లక్ష రూపాయలు భక్తులనుంచి కానుకలూ, కట్నాల రూపేణా సంపాదించాను" అన్నాడు.
"నీ సంగతి సరే! నేను చెపుతున్నది నా గురించి. ఈ సంచలనం సరిపోదు. దేశవ్యాప్తంగా ఈ వార్త పెద్ద విస్పోటనంలా రావాలి. ఆ మత్తులో నుంచి జనం బయట పడకముందే ఎన్నికలు జరగాలి" అన్నాడు బృహస్పతి.
"ఏమో గురూ! నా పనిమాత్రం హాయిగావుంది" అన్నాడు రావు వళ్ళు విరుచుకుంటూ.
వాళ్ళలా మాట్లాడుకుంటుండగా అక్కడొక కారువచ్చి ఆగింది. పైనున్న లైట్ చూసి గవర్నర్ అనుకున్నారు- కానీ వచ్చింది డిప్యూటీ కమీషనర్ ఆఫ్ పోలీస్. ముందు సీట్ లోంచి దిగుతున్న శ్రీహర్షని చూడగానే బృహస్పతి మొహం విప్పారింది. "నీ వరకూ వచ్చిందా న్యూస్?" అంటూ సాదరంగా ఆహ్వానించాడు.
"నేను విలేఖరినన్న విషయం మర్చిపోయావా ఏమిటి?" భుజం మీద చేయివేస్తూ అన్నాడు శ్రీహర్ష.
ఈలోగా డిప్యూటీ కమీషనర్ కారు దిగాడు. బాబాకి నమస్కారం చేస్తూ దగ్గరికెళ్ళి వినమ్రంగా మఠం వేసుకుని ఎదురుగా కూర్చున్నాడు. శ్రీహర్ష ఆయన్ని వారిద్దరికీ పరిచయం చేసాడు.
"చెప్పండి ఏమిటి మీ సమస్య?" అనడిగాడు రావు.
"నాకు ఉన్నన్ని సమస్యలు ఈ ప్రపంచంలో ఏ వ్యక్తికీ ఉండవు స్వామీ! కష్టాల వలయంలో చిక్కుకు పోయాను. ఆత్మహత్యే శరణం అనుకుంటున్న సమయంలో మీ గురించి విన్నాను! ఈ కష్టాల కడలిలో నుంచి నన్ను రక్షించడం కోసం దైవమే మిమ్మల్ని పంపించాడని భావిస్తున్నాను."
డిప్యూటీ కమీషనర్ అంతటివాడు అలా బేలగా మాట్లాడుతున్నాడంటే అంత పెద్ద కష్టాల్నించి అతన్ని ఏ స్థయిర్యంతో బయటకు తీసుకురావాలా అని ఒకరి మొహాలొకరు చూసుకున్నారు రావు, బృహస్పతి. ఈ లోగా డిప్యూటీ చెప్పడం ప్రారంభించారు.
"నన్ను కాదని నాకన్నా జూనియర్ కి ప్రమోషన్ ఇచ్చారు. కుజదోషం వల్లే ఇది జరిగిందని చెప్తే హోమం చేయించాను. ఫలితం దక్కలేదు. నా అల్లుడి చెల్లెలి మొగుడు వేరే దానితో కాపరం పెట్టాడు. ఆ చెల్లెలు మా అల్లుడి ఇంట్లోనే ఉంటుంది. నా కూతురికీ, దానికీ మధ్య పచ్చగడ్డి వేస్తే భగ్గుమంటుంది.'వైతీశ్వరన్ కోయిల్'కి వెళ్ళి నాడీ జ్యోతిష్యం చెప్పిస్తే ఆ ఉంచుకున్న దానిమీద వాడికి రెండు నెలల్లో విరక్తి పుడుతుందని తాటాకులు చూసి చెప్పారు. రెండేళ్ళు గడిచాయి. ఆ ఉంచుకున్న దానికి ఇద్దరు పిల్లలు పుట్టారు. వాడికి మాత్రం విరక్తి పుట్టలేదు. నా కూతురికి 'ఎంసెట్' పేపర్లు ముందురోజే దొంగతనంగా సంపాదించి యిచ్చినా మూడువేల రాంక్ వచ్చింది. నా కొడుకు నామాట అసలు వినడు. అమెరికా వెళ్ళి లక్షలు సంపాదించాలని ఆశ. చదువు మాత్రం అంతంత మాత్రం! ఇవన్నీ చూసి నాకు దగ్గు, ఆయాసం- మా ఆవిడకి బీపీ, షుగరూ పట్టుకున్నాయి. అన్ని సమస్యలకీ ఒక్క పరిష్కారం చెపుతారని మీ సన్నిధికి వచ్చాను."
ఓంఫట్ బాబా పక్కన కూచుని వింటూన్న బృహస్పతి, ఆయనవైపు కన్నార్పకుండా ఒక క్షణం చూసాడు. ఆ చూపులో సానుభూతీ, కోపం మిళితమై వున్నాయి. బాబా మాత్రం అభయం ఇస్తున్నట్లు నవ్వి "అన్ని సమస్యలకీ ఒకటే పరిష్కారం. మీరు వంగండి...." అన్నాడు. డిప్యూటీ తల వంచగానే, నెత్తిమీద బలంగా ఒకటి కొట్టి "మీరు వెళ్ళిరండి అన్ని సమస్యలూ త్వరలోనే పరిష్కారమౌతాయి" అన్నాడు.
డిప్యూటీ నూతనోత్సాహంతో లేచి నిలబడి "ఇప్పుడే నాకు వేయి ఏనుగుల బలం వచ్చినట్టుంది స్వామీ! నా సమస్యలన్నీ తీరిపోతాయని నమ్మకం కుదిరింది. రిటైర్ అవగానే వచ్చి మీ దగ్గరే స్థిరపడిపోతాను" వినమ్రంగా చేతులు జోడించాడు. చేతి ఉంగరం తీసి భక్తితో హుండీలో వేయబోతుంటే బృహస్పతి అడ్డుపడి "వద్దు సర్! పారితోషికం తీసుకుంటే ఫలితం దక్కదని స్వామివారి ఉవాచ" అంటూ తిరిగి ఇచ్చేసాడు.
వచ్చిన పారితోషికం పోగొట్టినందుకు రావు బృహస్పతి వైపు కోపంగా చూసాడు. దాన్ని పట్టించుకోకుండా డి.సి.పి.తో "మీరు ఒక సహాయం చేయగలరా?" అని అడిగాడు బృహస్పతి.
"తప్పకుండా!"
"మీ డిపార్ట్ మెంట్ లో సరళరేఖ అని ఇన్ స్పెక్టర్ వుంది. ఆరు నెలల క్రితం జాయినయింది. ఆమెని ఇక్కడికి ట్రాన్స్ ఫర్ చేయగలరా? భక్తుల రద్దీ కూడా ఎక్కువవుతోంది కదా!"
"నాకున్న పరపతి అంతా ఉపయోగించి రేపు సాయంత్రానికల్లా ఆమె ఇక్కడ ఉండేటట్లు చేస్తాను...." సాష్టాంగ ప్రణామం చేసి వెళ్ళిపోయాడు డి.సి.పి.
అంతా చూస్తున్న శ్రీహర్ష నవ్వాపుకోలేకపోయాడు.
అతడు ఆ తర్వాత బృహస్పతితో చాలా విషయాలు చర్చించాడు. "అసలు నీకు ఈ ఆలోచన ఎలా వచ్చింది?"
"మనం ఎప్పుడూ డాకూ మంగళ్ సింగ్ గురించి చర్చించుకుంటూ ఉంటాం కదా! అందుకని అప్పటికప్పుడు నోటికి వచ్చింది చెప్పాను...."
"కానీ ప్రజలు అంత తొందరగా నమ్ముతారంటావా?"
"కొంత శాతం నమ్మరు.... కానీ ఎక్కువ శాతం నమ్ముతారు. నమ్మేవారితో సమస్యలేదు. నమ్మనివారి కోసమే నేను కొన్ని తార్కికమైన సంస్కరణలు గురించీ, పాలసీ గురించీ మాట్లాడుతున్నాను. సాయిబాబా పద్ధతి ఇది! బూడిదనీ, బంగారాన్నీ సృష్టించి మూర్ఖులని ఆకట్టుకోవడం, ఆస్పత్రులూ, జలాశయాలూ కట్టించి మానవతా వాదుల్ని మెప్పించడం.... 'మొత్తం మీద మంచి చెయ్యటం...."
శ్రీహర్ష ఆశ్చర్యంగా చూస్తూ వుండిపోయాడు. బృహస్పతి కొనసాగించాడు. "కేవలం దేవుడితో మాట్లాడి వచ్చానంటే ప్రజలు ఓట్లు వెయ్యరు. నిర్దిష్టమైన ప్రణాళిక ఏమిటో వాళ్ళకి చెప్పాలి. అందుకోసమే అంత వివరంగా నా భవిష్యత్ ప్రణాలికల గురించి రాజకీయ పరంగా చెపుతున్నాను."
శ్రీహర్ష నవ్వాడు.
"ఎందుకు నవ్వుతున్నావ్?" అడిగాడు బృహస్పతి.
"ప్రాంతీయ పార్టీ నాయకులకి లేని రాజకీయ స్పృహ నీకు ఉన్నందుకు. దేశంలో ఇన్ని ప్రాంతీయ పార్టీలు వున్నాయి కదా! లోకల్ సమస్యలని వదిలేస్తే, మరి జాతీయ స్థాయి పాలసీ లేమిటి? ఏ ఛోటా నాయకుడూ చెప్పడేం? అన్ని పార్టీలూ కలిసి పోవడమే ఏకైక ఆశయం అయినప్పుడు, ఇంక ఇన్ని పార్టీలు దేనికి? దీనికి నువ్వు ఏమంటావ్?"
"ఇప్పుడిప్పుడే నాకూ ఆ స్పృహ కలుగుతోంది. జాతీయ స్థాయిలో ముఖ్యమైన విధానాలు మూడే వుంటాయి.ఆర్ధిక విధానం, సెక్యులరిజం పట్ల ఆ పార్టీ దృక్పథం విదేశాంగ విధానం, చివరిది అంత ముఖ్యం కాదు కాబట్టి మొదటి రెండు అంశాల ఆధారంగా రెండు పార్టీలు వుంటే చాలు. ప్రాంతీయ పార్టీలన్నీ వాటి అనుబంధ సంస్థలుగా వుండేలా రాజ్యాంగం నిర్మించుకోవాలి. జాతీయస్థాయిలో స్వతంత్ర అభ్యర్ధుల ప్రతిపత్తిపైన పునరాలోచన జరగాలి. అంతవరకూ ఎందుకు....? కులాల సమస్యపైన అధికారంలోకి వచ్చిన పార్టీలు కూడా, మత సమస్యపై అధికారంలోకి వచ్చిన పార్టీని విమర్శిస్తున్నాయి. సెక్యులరిజానికి శత్రువుగా అభివర్ణిస్తున్నాయి. ఇంకెంత కాలం మనం ఇటువంటి కప్పదాటు వ్యవహారాల్నిచూస్తూ ఊరుకోగలం?"
"నువ్వు ఆశించేంత భావవిప్లవం, రాజకీయ చైతన్యం వస్తుందంటావా....?"
"విప్లవంలా రాకపోవచ్చు. ఎవరికీ నష్టం లేకుండా కింద స్థాయినుంచి రావాలి!"
"అంటే?"
"రాష్ట్ర నీటిపారుదల శాఖలో పనిచేసే ప్రభుత్వోద్యోగి విరిగిన కుర్చీలో, తిరగని ఫాన్ కింద కూర్చుని పనిచేస్తాడు. వ్యవసాయాభివృద్ధి బ్యాంక్ లో పనిచేసే ప్రభుత్వోద్యోగి ఏ.సి. రూములో కూర్చుంటాడు. ఇద్దరికీ ఒకటే స్థాయి అయినా ఈ అసమానత ఎందుకో? ఇంత చిన్న విషయం ఆలోచించడమే భావవిప్లవం."