Previous Page Next Page 
అగ్నిప్రవేశం పేజి 18

 

        "మమ్మీ ఏది బేబి?"
   
    "గుడికెళ్ళింది. ఇప్పుడే వచ్చేస్తుంది" ఆమెకెలా చెప్పాలో అతనికి తెలీలేదు.
   
    "నువ్వు బయట హాల్లో కూర్చో. నేనుంటాను డాడీ దగ్గర."
   
    సాహితి అర్ధంకానట్లు చూసింది. "ఎందుకు?"
   
    "ప్రాణం పోయిందమ్మా! ఆయన మనకిక లేరు."
   
    ఒక విషాద వీచిక. దుఃఖంతో రెండుగా చీలిన ఆర్తనాదం. వెదురుబొంగు గుండెమంటల్లో అంతర్ధగ్ధమైన ప్రేమ..... నీరంధ్ర వర్షాన్నాశ్రయించి రుద్ద భాష్పాకులితమైన నయనాలు..... ప్రళయ కాల వాతూలహత శాఖ మనోతృణ పత్రం..... ఆ పాప అలాగే నిలబడి వుంది.
   
    నిర్మల లోపలకు వచ్చింది. అప్పటికే ఆమెకు వార్త తెలిసిపోయిందని ఆమె ముఖమే చెపుతోంది. భర్త పక్కనే కూలబడి రోదిస్తూంది. చేతిలో ప్రసాదం జారి పడిపోయింది. "స్పెషల్ పూజ చేయించి తెచ్చాను తినండి. ప్లీజ్ తినరూ...." అంటోంది పిచ్చిగా.
   
    సాహితికి ఆమెను చూస్తుంటే భయం వేస్తోంది.
   
    "మమ్మీ!" అంటూ వెళ్ళి వళ్ళో పడుకుని బావురుమంది. అంతలో పరమహంస లోపలకు వచ్చాడు. రెండు నిముషాలు కళ్ళు మూసుకుని మౌనంగా నిలబడ్డాడు.
   
    "సాహితీ, లేమ్మా" ఆమెను లేపి మంచంమీద కూర్చోపెట్టాడు. "నిర్మలా! పదండి దేవుడి గదిలో కూర్చుందురుగాని అక్కడే మనసుకి ప్రశాంతత లభిస్తుంది" ఆమె రెండు భుజాలమీద చేతులు వేసి లేపాడు. భుజంచుట్టూ చేయివేసి నడిపించుకు వెళుతున్నాడు. ఆమె పైట జారివున్నా గమనించలేనంత దుఃఖంలో మునిగి వుంది. ఓ చెయ్యి ఆమె చుట్టూ ఓదార్పుగా వేసి పొదివి పట్టుకుని తీసుకువెళుతున్నాడతను. ఆమె స్థనాలు అతని చేతి అంచుమీద నుంచి జారుతున్నాయి. దాన్నెవరూ గమనించలేదు. అతని పెదవులు భగవన్నామస్మరణ చేస్తున్నాయి. మిత్రుడి మరణం అతడిని బాగా కృంగదీసిందని అతని మొహమే చెపుతోంది. దాన్ని ప్రార్ధన ద్వారా అధిగమించటానికి ప్రయత్నిస్తున్నాడు అతడు.

    సాహితి గుండెల్లో ఏదో ఎక్కడో గుచ్చుకుంటున్న బాధ. ఈ బాధ కేవలం తండ్రి మరణం వల్ల మాత్రమే వచ్చింది కాదు.
   
    వినయచంద్ర శరీరాన్ని హాల్లో చాపమీద పడుకోబెట్టారు. సింహాచలం ఆయన తల దగ్గర దీపం వెలిగించి పెట్టాడు. ఆ వెలుగు ఆయన మొహంమీద పడి వికృతంగా కదులుతోంది. ఒక పక్క అగరవత్తుల ధూపమూ, శవం పైన చల్లిన కర్పూరమూ కలిసి గదిలో వ్యాపిస్తున్న బాధావీచికలని తరమడానికి చేస్తున్న కృషి ఫలించడం లేదు. ఆ పరిమళంలో కూడా మృత్యువాసన అలుముకుంటోంది.
   
    వీటన్నిటికి అతీతంగా నిర్మల దేవుడి గదిలో కూర్చుంది. ఆమె చూపులు నిస్తేజంగా దైవ విగ్రహాలమీదే నిలిచి వున్నాయి. పరమహంస ఆమెకు ఎదురుగా కూర్చుని ధ్యానం చేస్తున్నాడు. హాల్లో దృశ్యం కంటే ఈ గదిలో దృశ్యమే అందరినీ ఆకర్షిస్తోంది. ఎవరెవరో వస్తున్నారు. నిలబడి మాట్లాడుకుంటున్నారు. భర్త మరణిస్తే ఏడవకుండా భక్తిలో మునిగిన ఆమెను చూస్తుంటే చూసే వారికి అపురూపమైన గౌరవం కలుగుతోంది.
   
    సాహితి ఒక్కతే తండ్రి శవం దగ్గర కూర్చుంది. మౌనంగా ఆయన ముఖంలోకి చూస్తోంది. ఆమె ఆలోచనలకు బ్రేక్ వేస్తూ బంధువులు దగ్గరగా వచ్చారు. ఆమె నక్కడ నుంచి లేపారు. కాంటెస్సా కారులో తప్ప తిరగని వినయచంద్రని పాడెమీద కట్టేశారు. నిర్మలను బలవంతంగా బయటకు తీసుకువచ్చారు. ముఖాన అందరూ కుంకుమ దిద్దుతున్నారు. అంతా అయ్యాక పాడె లేచింది.
   
    ఎప్పుడూ ఒంటరిగా తిరిగే వినయచంద్ర వెంట బంధుబలగమంతా కదిలింది. వాళ్ళు దూరమవుతున్న కొద్దీ నిర్లిప్తంగా చూస్తూ నిలబడిపోయింది సాహితి.
   
                                  4
   
    పదిరోజులు గడిచిపోయాయి. వినయచంద్ర బ్రతికి వున్నంతకాలం బంధువుల నెవ్వరినీ చేరనివ్వలేదు. దూరంగా ఉంచి అతడి కసి అంతా తీర్చుకున్నాడు. కాని చేయాల్సిన కర్మకాండల గురించి అందరూ విచ్చేశారు. ఏర్పాట్లన్నీ చురుగ్గా సాగుతున్నాయి. సాహితికి అవన్నీ చూస్తోంటే ఒళ్ళు మండిపోతోంది.
   
    మమ్మిని ఎన్ని రకాలుగా బాధపెట్టినా అడ్డురావడానికి సాహసించలేని ఈ పిరికివాళ్ళంతా ఈ రోజు ఆయన పోయాడని, ఆమె బొట్టు చెరిపి గాజులు విరగ్గొట్టి, పూలు తుంపి ఆనందించడానికి వచ్చారు.
   
    "స్త్రీకి బొట్టూ, గాజులూ, పూలూ అలంకారాలు అవి పుట్టినప్పటి నుంచి వున్నవే. కాని భర్త పోగానే అతడు కట్టిన మంగళసూత్రాలతో పాటు వీటిని తీసిపారేసి, అందహీనురాలిని చేసి, సంతృప్తి చెందుతారు."
   
    టీచర్ ఓ సందర్భంలో అన్న మాటలివి.
   
    సాహితికి ఒక్క పెద్ద మావయ్య దగ్గరే కాస్త చనువు. వెళ్ళి ఆయన దగ్గర ఈ వాదన మొదలుపెట్టింది. అవన్నీ చెయ్యకుండా ఆపమంది. ఆయనకు ఏం తోచలేదు. వెళ్ళి పరమహంసకి చెప్పాడు.
   
    "సాహితీ!" పరమహంస ఆమె తలమీద చెయ్యివేసి ఆప్యాయంగా నిమురుతూ బుజ్జగింపుగా అన్నాడు. "ఏమిటమ్మా ఈ ఆవేశం? ఏటికి ఎదురీదడం తప్పమ్మా! మన పూర్వీకులు ఎంతో ఆలోచించి, చర్చించి ఏర్పరచిన నిబంధనలమ్మా యివి. మన ధర్మశాస్త్రాలు, పురాణాలు ప్రపంచంలోనే ప్రామాణిక గ్రంథాలు.....భగవంతుడు అమ్మ నొసటన ఎలా రాశాడో అదే జరుగుతోంది. ఇదంతా పూర్వజన్మ సుకృతం.....ఇవన్నీ తీసెయ్యడం అంటే ఆమె ఆనందాన్ని సుఖాన్ని తుడిచిపెట్టడం అని పొరబడకు. ఆమెకు ఎప్పటికీ సుఖపెట్టేందుకు మనం వున్నాం ఆవేశం తగ్గించుకుని నీ గదిలోకి వెళ్ళు, ఇవన్నీ చూడకు సరేనా?"
   
    "అదికాదు అంకుల్...." ఏదో చెప్పబోయింది సాహితి.
   
    "సాహితీ! వాళ్ళు చేస్తున్న దాంట్లో తప్పులేదు. మన ఆచారాలను, సాంప్రదాయాలను కాదనేంత గొప్పదాన్ని కాదు నేను. ఎక్కువగా మాట్లాడకు, నన్ను బాధపెట్టకు" నిర్మల మాటలకు సాహితి ఆవేశం అణగారి పోయింది.
   
                             *    *    *
   
    పదవ తరగతి పరీక్ష ఫలితాలు వచ్చాయి. సాహితి ఫస్టుక్లాసులో పాసయింది. అది ముందుగానే ఊహించిన ఫలితం కాబట్టి ఆమెకు ఎగ్జయిటింగ్ గా అనిపించలేదు. ఆ ఆనందాన్ని పంచుకోవడానికి కూడా ఎవరూ లేరు. నిర్మల యింకా మామూలు మనిషి కాలేదు. రోజుకి పదిహేను గంటలు పూజలోనే ఉంటుంది. ఆ భక్తే ఆమెకు ఆనందం అయినప్పుడు కాదని ఎందుకనాలి....? అనేది పరమహంస వాదన. నిజమేననిపించింది. సాహితికి కూడా.
   
    "సాహితీ!" ఆమె తలెత్తి చూసింది. పరమహంస.....ఆయన తన గదిలోకి రావడం ఇదే మొదటిసారి.
   
    "కంగ్రాచ్యులేషన్స్, నాకు చాలా సంతోషంగా వుందమ్మా"

    "థాంక్యూ అంకుల్!" సిగ్గుగా లేచి నిలబడింది.
   
    "కూర్చోమ్మా!" ఆమె రెండు భుజాలమీదా చెయ్యివేసి బలవంతంగా కూర్చోబెట్టాడు- ఎదురు సోఫాలో తను కూర్చున్నాడు.
   
    "ఫస్టుక్లాసులో పాసయినదానిని ఇలా గదిలో ఒంటరిగా కూర్చున్నావేం? వెళ్ళమ్మా! నీ స్నేహితులందర్నీ పిలువు. సాయంత్రం ఇంట్లో పార్టీ ఇద్దాం. లేదా హోటల్లో అరేంజ్ చెయ్యమంటే చేయిస్తాను. ఈ రోజు అందరూ సరదాగా గడపాలి."
   
    "వద్దు అంకుల్! నాకు అంత దగ్గర స్నేహితులెవరూ లేరు."
   
    "అయితే సరే, ఈ రోజు మనం పార్టీ చేసుకుందాం....అమ్మనీ, నిన్నూ నేను బయటకు తీసుకెళతాను."
   
    "అమ్మనా?" ఆశ్చర్యంగా అడిగింది సాహితి.
   
    "అవును. ఎన్నాళ్ళు ఆమెను ఇంట్లో బందీగా ఉంచుతాం? మెల్లిగా మామూలు మనిషిని చెయ్యాలి. ఇది మంచి అవకాశం."
   
    "కానీ డాడీ ఉన్నప్పుడు కూడా మేము ఎన్నడూ పార్టీలకని వెళ్ళలేదు అంకుల్! మమ్మీకి అవన్నీ ఇష్టం వుండదు."
   
    "నేను చెపితే వస్తుందిలే. ప్రయత్నం చెయ్యడంలో తప్పులేదుగా- సాయంత్రం ఏడు గంటలకల్లా సిద్దంగా వుండు. నేను నిర్మలతో కూడా మాట్లాడి వెళతాను" ఆయన వెళ్ళిపోయాడు.
   
    సాహితి మనసు ఆయన పట్ల కృతజ్ఞతతో నిండిపోయింది. ఆ రోజు బాగా గుర్తుందామెకు. ఆ రోజు.... తండ్రి చనిపోయాక కర్మకాండలన్నీ ముగిసిన రోజు బంధువులంతా సమావేశమయ్యారు. నిర్మల, సాహితీల బాధ్యత ఎవరు తీసుకోవాలన్న సమస్య. వ్యాపారం దగ్గరుండి నడిపించుకోగలిగితే ఫర్వాలేదు గానీ లేకపోతే అమ్మితే అంతగా డబ్బురాదు. పరిస్థితి అలా వుంది. నిర్మల బంధువులంతా పల్లెటూళ్ళలో సెటిలయినవాళ్ళు.....వ్యాపార దక్షత లేనివాళ్ళు. ఆస్థి వుంది కదాని చేరదీస్తే అదిపోయి బాధ్యత మీద పడుతుందేమోనని వాళ్ళ భయం.
   
    "పోతే పోయింది. ఇల్లుకూడా అమ్మేసి నాతో వచ్చేయండి" అన్నాడు నిర్మల పెద్దన్నయ్య. "సాహితిని బాగా చదివించాలనుకుంటున్నాను. ఇక్కడే వుంటాను అన్నయ్యా" అంది నిర్మల.
   
    "దానికేం, హాస్టల్లో పెట్టి చదివిద్దాం" అన్నారాయన.

 Previous Page Next Page