Previous Page Next Page 
అశ్వభారతం పేజి 14


    అరగంటకి ఆటోలో అబిడ్స్ లో దిగారు ఇద్దరు. మౌనంగా ట్రాఫిక్ లో కల్సిపోయారు. తాజ్ మహల్ హోటల్ దగ్గర దిగిన చోటు నుంచి డిస్టెన్స్ మెంటల్ గా కేలిక్యులేట్ చేసుకుంటున్నాడు భరత్.

    దక్కన్ ఆప్టికల్ కి కొంచెం దూరంలో వుండగానే భరత్ ఆ షాపును గుర్తించాడు. శుక్రాచార్య చెప్పేలోపే అఖ్ఖర్లేదన్నట్లుగా తల వూపాడు.

    చౌరస్తా దగ్గరయ్యేసరికి ఒక రోడ్డు ఎడమవేపుకి చీలి కోఠివేపు వెళ్తుంది. కుడివేపుకు చీలిన రోడ్డు చొరస్తా బర్నింగ్ తీసుకొని అన్నపూర్ణా హోటల్ వేపు వెళ్తుంది.

    ఆ రెండు రోడ్లు చీలిన మధ్యలోనే డెత్ స్పాట్. శుక్రాచార్య ట్రాఫిక్ ని తప్పించుకొనేందుకన్నట్లు ట్రాఫిక్ సిబ్బంది వున్న స్థలం వేపు నడిచాడు.

    అప్పటికే భరత్ కాస్త అటూఇటూగా డెత్ స్పాట్ ని గుర్తించాడు. భరత్ ని ఆగమని సంజ్ఞచేసి శుక్రాచార్య నెమ్మదిగా వెళ్ళి డెత్ స్పాట్ లో నిలబడి కళ్ళజోడు తుడుచుకున్నాడు. వెంటనే అర్ధం చేసుకున్నాడు భరత్.

    శుక్రాచార్య, భరత్ లు మామూలుగా షాపింగ్ కి వచ్చిన వాళ్ళేగాని మరికొద్ది రోజుల్లో పెద్ద సంచలనం సృష్టించబోతున్నట్లుగా అక్కడున్న ఎవరూ గ్రహించే అవకాశం లేదు. శుక్రాచార్య డక్కన్ ఆఫ్టికల్స్ ముందు నిలబడ్డాడు.

    భరత్ నలువేపులా చూసాడు.

    రోడ్డెంత వెడల్పుంది....? ఒకేసారి ఎన్ని వెహికల్స్ వెళ్ళగలవు? ఒక నిముషములో ఆ రోడ్డుపై వెళ్ళే కార్లు, ఆటోలు, రిక్షాలు, సిటీ బసెస్, పాదాచారులు కాస్త అటూ ఇటూ కేలిక్యులేట్ చేసుకున్నాడు, అప్పుడు టైం ఉదయం 11 గంటలు.

    ఒంటిగంట దగ్గరవుతుండగా, ఎండ మూలానగాని, ఆఫీసులకెళ్ళే సిబ్బంది అప్పటికి సెటిల్ అయినందువల్లగాని ట్రాఫిక్ కాస్త తగ్గుతుంది.

    పదకొండు గంటలకు లెక్కించిన ట్రాఫిక్ లోంచి 30 శాతం తగ్గించాడు. అప్పుడు ఒంటిగంటకు ఆ రోడ్ లో వెళ్ళే ట్రాఫిక్ వివరాలు సూచాయగా తెల్సాయి భరత్ కి. అనంత్ ట్రైనింగ్ లో భరత్ చాలా విషయాల్లో సుశిక్షితుడయ్యాడు.

    గుర్రం వేగం, దూరం, అలాగే వెహికల్స్ వేగం, దూరంలాంటిని క్షణాల్లో లెక్కెట్టగల స్థాయికి చేరుకున్నాడు భరత్.

    ఓసారి శుక్రాచార్యకు ఓ చిత్రమైన కోర్కె కల్గింది. భరత్ (ఐక్యూ ఇంటిలిజెంట్ కో ఎఫిషియన్సీ-తెలివితేటల్ని లెక్కించే పద్ధతి ఎంతుందో తెల్సుకొందామనిపించింది.

    ఆ టైమ్ లోనే జపనీస్ వాళ్ళు ప్రపంచ వ్యాప్తంగా నిర్వహించిన పోటీకి భరత్ ని పంపించారు. ఆ టెస్ట్ లో భరత్ కి వచ్చిన మార్క్సు చూసి శుక్రాచార్యే ఆశ్చర్యపోయాడు.

    సాధారణంగా ఇండియన్స్ కు వుండే ఐ క్యూ కంటే చాలా ఎక్కువ భరత్ కి వున్నట్లు ప్రూవ్ అయింది.

    కేవలం భరత్ తెలివితేటల స్థాయిని తెల్సుకునేందుకు ఇరవై వేలు ఖర్చుపెట్టాడు శుక్రాచార్య.

    భరత్ ఐ క్యూ తెల్సినరోజు శుక్రాచార్య సంతోషానికి హద్దులేదు.

    తనకు దొరికింది వజ్రాయుధమని ఆరోజే నిర్ణయించుకున్నాడు.

    ఏ విషయం చెప్పినా శ్రద్ధగా వినటం-వింటుండగానే అది సమస్య అయితే దానికి పరిష్కారం- పధకం అయితే పటిష్టంగా ఎలా వేయాలనేది - ఇబ్బంది అయితే ఎలా అధిగమించాలనేది క్షణాల్లో ఆలోచించగల స్థాయి భరత్ ది.

    అయితే ఇన్ని తెలివితేటలున్నవారు ఎక్సెంట్రీక్ గా మారే ప్రమాదం వుందని కూడా శుక్రాచార్యకు తెలియనిది కాదు.

    అందుకే భరత్ కి మెంటల్ బ్యాలన్స్ కూడా అలవర్చేందుకు యోగాలో ఎక్స్ పర్ట్ అయిన శంకర్ రెడ్డిని తోడుంచుటం జరిగింది.

    శుక్రాచార్య భరత్ అక్కడి నుండి కదిలి అబిడ్స్ పోలీస్ స్టేషన్ వేపు బయలుదేరారు. చుట్టుపక్కల జాగ్రత్తగా పరిశీలిస్తూ- మార్గాన్ని కొలుస్తున్నాడు భరత్.

    అబిడ్స్ సెంటర్ కి, స్టేషన్ కి మధ్య ఉన్న రోడ్, దాని వెడల్పు ఆ రోడ్ లోని ట్రాఫిక్ ని జాగ్రత్తగా అంచనా వేసుకుంటూనే శుక్రాచార్యకు తెలియకుండా తను మరో పథకానికి ప్లాన్ వేస్తున్నాడు భరత్.

    కేవలం తను చెప్పిన పనే చేస్తున్నాడు భరత్ అని శుక్రాచార్య ఆలోచన.

    స్టేషన్ దగ్గరవుతుండగ ఓరగా చూసాడు భరత్ దానివేపు.

    క్షణాల్లో తన పథకానికి సమగ్రరూపం ఇచ్చుకున్నాడు మెంటల్ గానే.

    భరత్ ఆ క్షణంలో ఏం ఆలోచిస్తున్నాడో తెల్సుకునే ప్రయత్నములో ఉన్న శుక్రాచార్య భరత్ ఆలోచనలకు పదడుగుల దూరంలోనే ఉన్నాడు.

    సరిగ్గా స్టేషన్ ముందుకొచ్చారు.

    "1.5 కిలోమీటర్స్" అన్నాడు భరత్.

    హైదరాబాద్ రావటం అదే తొలిసారి. అబిడ్స్ నుండి స్టేషన్ కి నడిచి వచ్చాడు. తనతోపాటు అంత కరక్టుగా ఆ డిస్టెన్స్ ఎలా లెక్క కట్టగలిగాడనేది శుక్రాచార్యకు అంతుబట్టలేదు.

    "వెళ్దాం అంకుల్.... వెంటనే శశాంకతో అపాయింట్ మెంట్ ఫిక్స్ చేయండి...." అంటూ వెనుదిరిగాడు భరత్.


                                                                    *    *    *


    అనురాగ్ గోవా నుంచి సరాసరి హైద్రాబాద్ వాయుదూత్ లో వచ్చాడు. వెంటనే గాంధీ హాస్పిటల్ కెళ్ళి ఆషా గురించి వాకబు చేసాడు. ఆషా హఠాత్తుగా బొంబాయి వెళ్ళిందనే చెప్పారేగాని ఎప్పుడొస్తుందో చెప్పలేకపోయారు. మరిన్ని వివరాలు కావాలంటే త్రివేణిని అడగమని సలహా ఇవ్వటంతో ఇంకా డ్యూటీకి రాని త్రివేణీకోసం ఎదురుచూస్తూ కూర్చున్నాడు.

    కరక్టుగా 9.30 అవుతుండగా స్ట్రెక్చర్ మీద ఓ పేషెంట్ ని పడుకోబెట్టి తీసుకొస్తున్నారు ఇద్దరు కాంపౌండర్స్. కాంపౌండర్స్ ఆ స్ట్రక్చర్ ని పట్టుకున్న విధానం నిర్లక్ష్యంగా ఉండటంతో వెంటనే కెమేరా సెట్ చేసుకున్నాడు. అనురాగ్ చూస్తుండగానే వారి నిర్లక్ష్యం వలన స్ట్రక్చరు వెళ్ళి సైడ్ వాల్ కి గుద్దుకోవటం, అంతక్రితమే ఆపరేషన్ చేయబడ్డ పేషెంట్ కిందపడిపోవటం_ ప్రాక్షన్ ఆఫ్ సెకండ్ లో దాన్ని అనురాగ్ క్లిక్ చేయడం జరిగింది.

    అది గమనించిన కాంపౌండర్స్ ఆ రీల్ ఇచ్చేయమని గొడవకు దిగారు అనురాగ్ తో, అనురాగ్ మీ నిర్లక్ష్యాన్ని ప్రజలకు చూపిస్తానని ఆ నెగిటివ్ ఇవ్వకుండా ఎలా ఎల్తానని కాంపౌండర్స్ వాగ్వివాదానికి దిగారు.

    మామూలుగా మొదలైన వారి సంఘర్షణ చూస్తుండగానే తీవ్రరూపం దాల్చింది.

    అప్పుడే వచ్చింది త్రివేణి. గతంలో ఓసారి అనురాగ్ ని చూసి ఉన్న త్రివేణి అతన్ని వెంటనే గుర్తించింది.

    త్రివేణి అంటే సహనానికి మారుపేరని, మంచి హౌస్ సర్జన్ నని హాస్పిటల్ స్టాప్ లో ఓ స్పెషల్ రెస్పెక్టుంది.

    త్రివేణి ఆ గొడవను సర్దుబాటు చేసి అనురాగ్ ని పక్కకు తీసుకెళ్ళింది.

    "మీరా ఫోటో పేపర్స్ కిస్తే వాళ్ళ ఉద్యోగాలు పోతాయని వారి భయం....అంది అనురాగ్ ని కూర్చోమన్నట్లు సైగచేస్తూ త్రివేణి.

    అనురాగ్ కూర్చుంటూ అన్నాడు "ప్రజల సొమ్ముతింటూ ఇంత నిర్లక్ష్యంగానా వ్యవహరించేది?" ఆవేశంగా అడిగాడు అనురాగ్.

    "ఎక్కడ నిర్లక్ష్యం లేదు....? అధికారపార్టీ తినేది ప్రజలసొమ్ము కాదా? ప్రభుత్వాధికారులు తినేది ఆ సొమ్మే కదా.... బాధ్యతాయుతమైన పదవుల్లో ఉన్న అధికారులు ఎంతమంది సిన్సియర్ గా డ్యూటీ చేస్తున్నారు?" సూటిగా అడిగింది త్రివేణి.

    త్రివేణిని గతంలో రెండుమూడుసార్లు కల్సినా అంతగా మాట్లాడే అవకాశం రాలేదు అనురాగ్ కి.

    ఎంతో ప్రశాంతంగా నిండుగా, అమాయకంగా కనిపించే ఈమెలో ఎన్ని ఆలోచనలు....?!

    "సర్లేండి దాన్ని వదిలేద్దాం. ఆషా...."

    అనురాగ్ మాటల్ని మధ్యలోనే త్రుంచేస్తూ అంది. "చూసారా మనిషి ఎంత ఎస్కేపిస్టో? క్షణం క్రితం వరకు ప్రజలపట్ల, పేషెంట్ల పట్ల ఆవేశపడ్డ మీకు నేను కాస్త వాదనకు దిగగానే దాన్ని వదిలేసి మీ ఆషా గురించి అడిగారు_ ఆ నాకెందుకులే ఈ గోల అన్నట్లు."

    పదునైన కత్తితో శరీరాన్ని చీల్చినట్లున్నాయి ఆమె మాటలు. సిగ్గుతో తలవంచుకున్నాడు అనురాగ్.

    "సారీ"

    "సారీ కాదు, ఆ ఫోటోలు పేపర్స్ కి ఇవ్వండి. కాని ఆ ఫోటోల్లో ఆ కాంపౌండర్స్ ముఖాలు కనపడకుండా చేయండి. ఫోటోలు ఇవ్వటం గవర్నమెంట్ హాస్పటల్ లో పరిస్థితులు బాగుపడ్డానికి_రెండోపని ఎందరో చేస్తుండగా ఆ ఇద్దరే ఉద్యోగాలు పోగొట్టుకోవటం అన్యాయంలో న్యాయం కనుక...."

    సంభ్రమంగా చూసాడు అనురాగ్ త్రివేణి వేపు.

    ఓ నిముషం మౌనం తర్వాత త్రివేణి అంది కాస్త విచారంగా. "ఆషా బొంబాయి వెళ్ళింది, వాళ్ళ నాన్నగార్ని ఎవరో చంపేసారట. ఆ వార్త విని నేనే అప్ సెట్ అయ్యాను మరి ఆషా ఎలా ఉందో...."

    "అది నాకు రాత్రే తెలిసింది. గోవా నుంచి హడావుడిగా వచ్చాను ఆషా కోసం...."

    త్రివేణి ఆశ్చర్యపోయింది.

    "బొంబాయిలో జరిగిన హత్య గోవాలో ఉన్న మీకెలా తెలిసింది?"

    అప్పుడు చెప్పాడు అనురాగ్. ఓ వ్యక్తి రావటం_తనను వాకబు చేయటం_మొదలైన వివరాలన్ని.

    "ఆ వ్యక్తి మాత్రం హత్య చేయలేదనిపిస్తోంది. నాకు గిల్టీగా ఉంది. నేనేదో తమాషాకి తీసిన రాయల్ కింగ్ ఫోటో ఇద్దరి ప్రాణాలు తీసింది."

    అప్పుడు ఆశ్చర్యపోవటం త్రివేణి వంతయింది. "దివ్యతేజ చనిపోయారా, బ్రతికున్నారా ఎవరికి తెలుసు....? సడన్ గా అంది త్రివేణి. 

 Previous Page Next Page