ఇంకా వెనక్కి పొతే -- హైదారాబాద్ పరిసరాల్లో అనాది మానవులు నివసించిన గుహలు ఉన్నాయి.
తెలంగాణా ప్రాంతంలో డైనోసార్లు తిరిగిన జాడలు కూడా వున్నాయి.
గచ్చిబౌలి లో దొరికిన ఆస్తిపంజరం పక్కన కూడా అతనికి ఇష్టమైన వంటకాలు చేసి పెట్టబడి వున్నాయి.
అంటే -- ఆప్పటి వాళ్ళకు, ఈజిప్టియన్ ల లాగా , మనిషి మళ్ళీ బతికి వస్తాడనే నమ్మకం ఉండే వుండాలి.
చనిపోయి తిరిగి బతికే మనిషి కొన్నేళ్ళ పాటు పక్షి రూపంలో ఉంటాడనీ, ఆ పక్షి తన సమాధిని వెదుక్కోవలసిన కష్టం లేకుండా మెన్ హర్ లాంటి రాళ్ళను పాతి పెట్టేవాళ్ళని అంటారు .
భద్రాచలం ప్రాంతం ఇటు తెలంగాణాకు సరిహద్దు. అటు దండకారణ్యనికి దగ్గర.
ఆ లెక్కన ఇక్కడ కూడా మహాకాయులు ఉండేవాళ్ళా?
వాళ్ళే రాక్షసులా?
ఆ రాక్షసులు తిరిగి బతకడం అన్నది అప్పటి ప్రజల నమ్మకాన్ని బట్టి చూస్తె ..........
తల విదిలించి , ఆలోచనలలో నుంచి బయటపడ్డాడు రాజు.
చుట్టూ చేరిన జనం అల్లకల్లోలంగా "రాక్షసుడిని" గురించే మాట్లాడుకుంటున్నారు.
గోపాల్ కూతుర్ని కూడా రాక్షసుడు ఎత్తుకు వెళ్ళాడట!
చందన్ పొలానికి వెళ్ళి వస్తుంటే అతని ట్రాక్టర్ దొర్లించాడు రాక్షసుడు. చందన్ జాడ లేదు !
పుకార్లు ఒకసారి పుడితే , ఇంక అవి పిల్లల్ని పెట్టక మనవుగదా.
పుకార్లు విజ్రుంభించాయి.
భారతంలో బకాసురుడు -- ఏక చక్రపురవాసుల కధలోలాగా , కీకారణ్యంలో వుండే చింత పెంట గూడెం వాళ్ళు రాక్షసుడితో ఒక ఒప్పందానికి వచ్చారుట. రాక్షసుడు తమ పల్లె మీద పడి విచక్షణ లేకుండా దొరికిన వాళ్ళని దొరికినట్లు చంపకుండా, రోజుకి ఒక మనిషినీ, ఒక గొడ్డునీ పల్లె వాళ్ళు పంపేటట్లు, అందుకు బదులుగా రాక్షసుడు వాళ్ళకి ప్రొటెక్షన్ ఇవ్వడమే కాకుండా వాళ్ళ భూములన్నీ అరకతో తానొక్కడే బరబరా దున్ని పెట్టెటట్లూనూ - అగ్రిమెంటు !
సామియేలు లేడూ -- అతని పొలాన్ని రాక్షసుడు రెండు చేతుల్లో రెండు అరకలు పట్టుకుని ఆటలో అరటి పండు లాగా అటు ఇటు పరిగెడుతూ అర నిమిషంలో ఆరెకరాలు దున్నేశాట్ట!!
చింతపెట్ట పక్కన ఉండే డుండి పల్లె వాళ్లతో రాక్షసుడికి ఇవాళ మీటింగు వుందిట. రోజుకి ఇద్దరు మనుషుల్నీ, రెండు గొడ్లనీ అయితే అగ్రిమెంటు కి ఒప్పుకుంటానంటున్నాడు రాక్షసుడు.
రాక్షసుడంటే అప్పుడే జనంలో కొందరికి గ్లామరూ, హీరో షిప్పూ కూడా కలగడం గమనించాడు రాజు.
"బతికితే ఆ రాచ్చసుదిలాగా రెండ్రోజులు బతికినా చాలు -- కలకాలం ఈ మడిసి జనమ ఎందుకూ ?" అన్నాడొకడు ఆరాధనగా.
ఇంతలో ఇంకో పుకారు షికారు చేస్తూ వచ్చింది.
ఆ రెండు పల్లెలతో అగ్రిమెంటు చేసుకుంటున్నది మొదట్లో రాక్షసుడు కాడుట--వీడు రెండో రాక్షసుడుట!
ఈ రెండో రాక్షసుడు మొదటి వాడికి అన్న అనీ , తమ్ముడనీ , కజిన్ బ్రదర నీ, చెల్లెలి మొగుడనీ, వేలు విడిచిన మేనమామ అనీ, షడ్డకుడని.........
ఓ ......అనంతంగా ఊహాగానాలు !
చిర్రెత్తూకొచ్చింది రాజుకి.
ఏది ఏమైనా కూడా , తన చెల్లెలు యువ కోసం వెదకాలి తను.
కానీ -- ఎక్కడని వేదకుతాడూ?
అసలు వెదకడం ఎక్కడ మొదలేడతాడూ?
ఏ వివరాలూ పూర్తిగా చెప్పకుండానే , యువ మాయమైపోవడానికి మెయిన్ రీజను అయిన ఈ నందూ కోమాలోకి వెళ్ళిపోయాడు ఇంకెలా!
"ఇంక ఇప్పుడు ఒకటే మార్గం మిగిలింది " అన్నాడు 'రాజపురోహిత్' అయిన తులసీరావు, రాజు దగ్గరికి వస్తూ.
"ఏమిటి ?" అన్నాడు రాజు ఆత్రంగా.
"ఉదృతంగా గ్రహశాంతులు చేయించడం -- జపతపాలు చేయించడమూనూ!" అన్నాడు తులసీరావు.
అయన పట్ల అభిమానమూ , అయన మౌధ్యం పట్ల ఆగ్రహమూ రెండూ ఒక్కసారిగా ముంచుకొచ్చాయి రాజుకి.
"ఏమిటి మీరంటున్నది?
ఇంత సీరియస్ సిట్యూయేషన్ లో మానవ ప్రయత్నాన్ని నమ్ముకోకుండా గ్రహశాంతులూ జపతపాలూ చేయిస్తారా? ఎంతటి చాదస్తం!" అన్నాడు రాజు పదునుగా.
"మనం నమ్ముకోవాల్సింది మన మానవమాత్రుల ప్రయత్నాలని కాదు నాయనా! అన్నిటినీ నడిపించే ఆ దేవుడిని, మన రాతని శాసించే గ్రహాలనీ ! ఆ ! మానవ ప్రయత్నం పూర్తిగా అక్కర్లేదనను! మన ప్రయత్నం యెంత వరకూ అంటే, జాతక రీత్యా ఏం జరగబోతుందో చూడాలి. గ్రహశాంతులు చేయించడం ద్వారా ప్రమాదాన్ని తగ్గించుకోగలమేమో చూడాలి నాయనా! నేను ఎంత కష్ట పడకపోతే నిన్ను ఆ ప్రమాదం లోనుంచి బయటపడేశానంటావ్- నేను చేసిన జపతపాలన్నీ వృధా అయిపోయాయంటావా? చెప్పు " అన్నాడు.
నవ్వూ, ఏడుపూ కలిసి వచ్చాయి రాజుకి. తను తప్పకుండా చనిపోతానని చెప్పింది ఈయనే -- ఇప్పుడేమో , తను బతికి బయటపడటం అయన చేసిన జపతపం మహిమ అంటాడు.
మనిషి మంచివాడే!
తరతరాలుగా తమ మంచిని కోరిన కుటుంబానికి చెందినవాడే!
అయినా తరాల క్రిందటి చాదస్తపు భావాలు ఈ సూపర్ టెక్నాలజీ యుగంలో ఎంతవరకూ పనికి వస్తాయో?
జరగాల్సినవి అన్నీ జరిగిపోయాక వాటిని తాము తమకు తోచినట్లుగా అన్వయించి చెప్పడమే ఈ జాతకాల తతంగమా?
కానీ ఈ గోలలో తన మాట వినేవాళ్ళేవరూ?
ఏదీ ఎట్లా వున్నా యువ కోసం వెదకడం తన తక్షణ కర్తవ్యమ్!
ఇంకో గుంపు రావడం కనబడింది.
"హరేరామ .....హరేరామ .....రామ రామ హరే హరే...." అని భక్తీ పారవశ్యంతో అంటున్నారు వాళ్ళు. వాళ్ళ ముందు ఒక కోతి నడుస్తోంది. దానికి ఒక పట్టుబట్ట కట్టారు .....దాని నుదుట పెద్ద బొట్టు.
"ఆహా! సాక్షాత్తూ ఆ హనుమంతుల వారే!" అన్నాడు తులసీవారు తన్మయంగా చేతులు జోడిస్తూ.
అందరిలో ఒక్కసారిగా భక్తీ ప్రవత్తులు ఉప్పొంగిపోయాయి.
"అందరూ పదండి రామాలయానికి " అన్నాడు తులసీరావు.